Pages

Saturday, December 18, 2010

హిందువులు తీవ్రవాదులయితే రాహుల్ వ్యాఖ్యానించడానికి కూడా భయపడతాడు....

భారతదేశంలో హిందూ తీవ్రవాదం ఎక్కువగా ఉందని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కల్లోలాన్ని రేపుతున్నాయి. వికీలీక్స్‌ బయట పెట్టిన రహస్య పత్రాల్లో భాగంగా అమెరికా దౌత్యవేత్తతో భారత దేశ అంతర్గత పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు భారత దేశ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా భావించవచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు భారతదేశానికి ఏదో కావాలనుకుంటున్న రాహుల్‌ యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీర కాంగ్రెస్‌ విధేయులు ఇటువంటి వ్యాఖ్యలు తేలికగా తీసి పడేయొచ్చు లేదా తమదైన వక్ర భాష్యం చెప్పవచ్చు. కాని నిజాన్ని ఎవరూ దాచలేరు కదా. రాహుల్‌ మీద నాకు మొదటి నండి ఒక సదభిప్రాయం ఉండేది. ఒక నూతన తరం ప్రతినిధిగా భారతదేశం ఇప్పుడున్న సమస్యల నుండి బయటపడేయడానికి ఇటువంటి వారు తమ శక్తి యుక్తులను ఉపయోగిస్తారనే భావంతో నేను ఉండేవాడిని. కాని రాహుల్‌ కూడా సగటు కాంగ్రెస్‌ మార్కు రాజకీయ వాదేనన్న విషయం ఈ వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయింది.

    భారతదేశ చరిత్ర తెలిసిన వాళ్ళెవరయినా ఈ దేశం ఇప్పటివరకు ఎవ్వరిమీదా దాడి చేయడం గాని, ఇతర మతాలతో సామరస్యంగా లేకపోవడం గాని చేయలేదనే నిజాన్ని గ్రహించే ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అనేక పెద్దమతాలు భారతదేశంలో పుట్టాయి. బౌద్ధం, జైనం, సిక్కుమతం, ఇంకా హిందూ మతంలోనే అనేక శాఖలు ఈ గడ్డపై పుట్టాయి. ఎప్పుడూ ఏ మతంతోను భారతదేశ సంస్కృతి ఘర్షణ పడినట్లుగా చరిత్రలో లేదు. దానికి బదులుగా అన్ని మతాలను తనకు అనుగుణంగా మార్చుకుని, లేదా వాటికి తగ్గట్లుగా తనని తాను సంస్కరించుకుని, భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. సరిహద్దులకు ఆవల నుండి వచ్చిన అనేక ఇతర మతాల వారిని కూడా అంటే కిరస్తానీయులను, ముస్లింలను కూడా తనతో పాటు కలుపుకుని ముందుకు వెళుతుంది విశిష్టమైన భారతజాతి. మీరు ప్రపంచంలో మిగతా దేశాలను గమనించండి. ఎక్కడైనా ఒక మతం ప్రబలంగా ఉంది అంటే దానర్థం ఇతర మతస్థులు ఆయా దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనం తెలుసుకోవచ్చు. క్రిసెండమ్‌ (అంటే క్రిష్టియన్‌ మతం ఉన్న దేశాలు) ముస్లింలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ఇస్లామిక్‌ దేశాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అక్కడ ఇస్లాం తప్ప మరో మతానికి ఎట్టిపరిస్థితిలోను, ఆఖరికి కలలో కూడా చోటు ఉండదు. కనీసం ఎవరి మతం గురించి వారు ప్రచారం చేసుకోవడానికి కూడా అక్కడ ఆంక్షలుంటాయి. ఆ దేశాలలో పనిచేసే హిందువులు తాము అక్కడికి తీసుకెళ్ళే పంచాంగం క్యాలండర్లలో కూడా హిందు దేవుళ్ళ బొమ్మలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే అటువంటి క్యాలెండర్లని ఎయిర్‌పోర్టులోనే చింపి చెత్తలో పడేస్తారట. మతం విషయంలో అక్కడ కఠినంగా ఉంటారు. కాని భారతదేశం యొక్క విషయాన్ని తీసుకోండి. ఇక్కడ అటువంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేము. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు పైకి కలిసి సహజీవనం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. మనం కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాం. కాని వాస్తవ పరిస్థితి వేరు. మైనారిటీ మతాలకు చెందిన ప్రజలు మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంటారు. వారి సంస్కృతిని విమర్శిస్తూనో, ద్వేషిస్తూనో కాలం గడుపుతారు. విగ్రహారాధన చేస్తే పాపం అంటుతుంది అంటాడు ఒకడు. ఆడవాళ్ళందరూ బొట్టు బిళ్లలు ధరించవద్దు అంటాడు మరొకడు. పుష్కరాలలో, హిందూ పండుగలు చేసుకొనే చోట, వారి పుణ్య క్షేత్రాలలో పాంప్లెట్స్‌ పంచుతూ కనబడతాడు ఇంకొకడు. అసలివన్నీ ఎందుకు? ఏకంగా బాంబులేసి చంపేస్తే వారే (హిందువులే) దారిలోకొస్తారు అని నమ్ముతాడు మరో మతం వాడు. కాని ఎప్పుడూ ఎవర్నీ నిందితులుగా ఇక్కడ చూపించలేదే. ఏ కోర్టు వారికి శిక్ష వేసిన పాపాన పోలేదే. పార్లమెంట్‌ మీద దాడి చేసిన వాళ్ళని, తాజ్‌ హోటల్‌లో మారణహోమం సాగించిన వారిని మీనం మేషం లెక్కిస్తూ, మూడు పూటలా శుభ్రంగా మేపుతున్నాం కదా. ఇంకా సిగ్గు లేని రాజకీయ నాయకులే అటువంటి వారిని వెనకేసుకుని మాట్లాడడం మనం పబ్లిక్‌గా చూస్తూ ఉంటాం. ఇంత జరిగినా కూడా ఈ దేశంలో హిందూ తీవ్రవాదం ఉందనడం సిగ్గుచేటు. అవి రాహుల్‌ గాంధీ వంటి వ్యక్తికి తగని మాటలు.

    ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నారు. కాని మౌనంగా మాత్రం లేరు. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతి, మరే దేశంలోనూ లేని ఉన్నతమైన జ్ఞాన సంపద ఉన్న తమ జాతికి పట్టిన దుర్గతిని గురించి వారు ఖచ్చితంగా విచారిస్తూ ఉంటారు. మరో సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ఈ దేశం ఖచ్చితంగా దూసుకువెళుతుంది. అది ఎప్పుడు జరుగుతుందనేది, ఎవరు నాయకత్వం వహిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. నేను ఇక్కడ హిందూ తీవ్రవాదాన్ని సమర్థించడం లేదు అలాగని వ్యతిరేకించడం లేదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కాని అది ఖండనీయమే. కాని ఎదుటి వారు హింసకు దిగినప్పుడు మనం హింసకు దిగకుండా శాంత వచనాలు వల్లిస్తే ఎంత హాని జరిగిందో ఇప్పటి వరకు అందరూ ప్రత్యక్షంగా చూసారు. హింసకు హింస పరిష్కారం కాకపోవచ్చు కాని వేరే దారి లేకపోతే మాత్రం హింసే శరణ్యమవుతుంది.

Monday, December 13, 2010

కులాల కుమ్ములాటలు ఎప్పటికీ మనకి తప్పవా?

ఎప్పుడూ ఆనందంగా, విచారాన్ని దరిచేరనివ్వకుండే ఉండే నేను ఈ రోజు చాలా బాధగా ఉన్నాను. ఎద లోతుల్లో ఏదో తెలియని భావం నన్ను ఉత్సాహంగా ఉండనివ్వడం లేదు. ఎందుకని నాలో ఈ మార్పు? ఎంత వత్తిడినైనా, ఎంతటి బాధనైనా సునాయాసనంగా ఎదుర్కోవచ్చునని వీలు దొరికినప్పుడల్లా 'స్ట్రెస్‌ మేనేజిమెంట్‌'పై ఉపన్యాసాలిచ్చే నేను ఇంత ముభావంగా ఎందుకున్నాను? నాకు తెలుసు - దాని కారణం ఏమిటో... నాలుగు రోజుల క్రితం జరిగిన ఆ దురదృష్టకర సంఘటన ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.

    ఎప్పటిలాగే కాలేజ్‌కి వెళ్ళిన నన్ను మా ఆఫీస్‌ మేడమ్‌ హడావుడిగా ఒక క్లాస్‌ కేన్సిల్‌ చేయడానికి పర్మిషన్‌ అడిగారు. కారణమేమిటంటే ఆ రోజు స్కాలర్‌షిప్స్‌ కోసం పిల్లలందర్నీ వెరిఫికేషన్‌ చేయాలని, వాళ్ళిచ్చిన వివరాలతో అన్నీ సరిపోయాయో లేదో కనుక్కోవాలని చెప్పారు. నేను కూడా పెద్దగా ఆలోచించకుండా ఒ.కే. అనేసాను. కొద్దిసేపటిలోనే వెరిఫికేషన్‌ మొదలయ్యింది. నేను కూడా చూద్దామని క్లాస్‌లోకి వెళ్ళాను. ముందుగా ఒక విద్యార్థిని పేరు పిలిచారు. ఆ అమ్మాయి లేచి నిలబడింది. నీ పూర్తి పేరు... చెప్పింది.... నీ తండ్రి పేరు... చెప్పింది. మీదే కులం..... సమాధానం లేదు. మౌనంగా నుంచుని మా వైపే చూస్తూ ఉంది. నేను కేస్ట్‌ సర్టిఫికేట్‌ తీసుకుని చూసాను. నాకు పరిస్థితి అర్థం అయింది. ఆ అమ్మాయిని కూర్చోమన్నాను. మరో అమ్మాయి పేరు పిలిచారు మా మేడం. పైన చెప్పిన పరిస్థితే మళ్ళీ రిపీట్‌ అయింది. ఈ సారి ఆ పాప కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. క్లాసులో గుసగుసలు, వెనుక బెంచిలో నుంచి చిన్నగా నవ్వులు. ఒక్క సారిగా నా మనసు బాధతో మెలిపెట్టింది. ఏమిటిది? మనం ఎక్కడున్నాం? ఆటవికుల సమాజంలోనా లేక మధ్య యుగాలనాటి కులాలతో భ్రష్టు పట్టిన భారతదేశంలోనా? కులాల ఆధారంగా ఆ రోజుల్లో మనుష్యుల్ని శారీరకంగా, మానసికంగా హింసించే వారని విన్నాం, చరిత్ర పుస్తకాల్లో చదివాం. కాని ఈ రోజున జరుగుతున్నదేమిటి? ప్రభుత్వమే సమాజాన్ని కులాల పరంగా విడదియ్యమని, వారి కులాన్ని ఎమ్‌.ఆర్‌.ఓ. దగ్గర ధృవీకరించమని ఆ సర్టిఫికెట్ల ఆధారంగా డబ్బులు పంచుతామని అంటోంది. ఇది ఎంత వరకు న్యాయం? డబ్బు లేని వాళ్ళు ఏ కులంలో అయినా ఉండవచ్చు. అటువంటి వాళ్ళకి సహాయం చెయ్యవచ్చు కదా? ఏ పాపం, పుణ్యం తెలియని పసి మనసుల్ని కులాల పేరుతో కలుషితం చేయడం ఎందుకు? కాలేజ్‌లో పిల్లల్ని ఎంతో దగ్గర నుండి గమనించాను. వాళ్ళంతా ఎంతో నిష్కల్మషంగా స్నేహితులవుతున్నారు. వాళ్ళలో ఎక్కడా కుల ప్రస్థావన లేదు. ఒకళ్ళ కేరియర్‌లో భోజనం మరొకరు ఆనందంగా పంచుకుని భోజనం చేస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా మంచి కూర చెయ్యకపోతే పక్కనున్న అమ్మాయి తన కేరియర్‌లో నుంచి కూర తీసి ఆ పాపకి పెట్టడం నేను చూసాను. ఒంట్లో బాగోక పోతే మేడమ్‌కి తెలియకుండా నోట్స్‌ రాసిపెట్టిన పిల్లల్ని చూసాను. ఇంకెక్కడుంది వివక్ష? ఇంకెక్కడుంది కులాల పేరుతో హింస? ఇప్పుడు పెద్దవాళ్ళమయిన మనమే బుద్దిలేకుండా చిన్నపిల్లల మధ్య కులాల పేరుతో చిచ్చు పెడుతున్నామేమో అనిపించింది.

    వెంటనే ఆ దుర్మార్గమైన కార్యక్రమానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసాను. ఆ రాత్రికి సరిగా నిద్ర పట్టలేదు. ఏదో కలత నిద్ర... అందులో ఒక భయంకరమైన పీడ కల... ఒక అందమైన ప్రదేశం. అక్కడ తెల్లని రంగుతో మెరిసిపోతున్న అందమైన పక్షులు.... ఇంతలో అక్కడో ఫ్యాక్టరీ లాంటిది... ఎవరో వచ్చి నిర్దాక్షిణ్యంగా ఆ పక్షుల రెక్కలు విరిచి ఆ యంత్రాలలోకి తోస్తున్నారు... వాటి రెక్కల నుండి వస్తున్న రక్తంతో అందమైన వాటి తెల్లటి రంగు ఎర్రగా మారుతోంది.... అవి విదారకంగా అరుస్తున్నాయి.... ఒక్కసారిగా మెలకువ వచ్చేసింది.... ఈ సమాజంలో అందరూ కలిసి ఎంత తప్పు చేస్తున్నామో... రాజకీయ నాయకులు వారి ఓట్ల కోసం ఈ సమాజాన్ని ఎంతలా కలుషితం చేస్తున్నారో... కుల సంఘాల పేరు చెప్పి వాటి నాయకులు సమాజంలో ఎలా చిచ్చు పెడుతున్నారో తలుచుకుంటూ... నా హృదయం ద్రవించిపోయింది. కనీసం రాబోయే తరాల్లో నయినా ఈ కుల రాక్షసి పూర్తిగా అంతమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకు మించి మనమేం చేయగలం....

Sunday, November 28, 2010

మనసును చెమర్చిన జ్ఞాపకాలు - సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మ్యూజియం



కార్తీక మాస విహార యాత్రల సందడి మొదలయ్యింది. మా కాలేజ్‌లో విద్యార్థినులు ప్రతి రోజు విహారయాత్ర కోసం నన్ను అడుగుతూ ఉంటే, రాజమండ్రి వెళదామని ప్రపోజ్‌ చేసాను. అలా అన్నానే గాని ఎక్కడికి వెళ్ళాలో నాకూ పూర్తిగా ఆలోచన లేదు. వాటర్‌ వరల్డ్‌కు తీసుకువెళితే బాగుంటుందని సన్నిహితులు సలహా యిచ్చారు. కాని వినోదంతో బాటుగా పిల్లలకు విజ్ఞానం కూడా లభించే విధంగా టూర్‌ ప్లాన్‌ చేద్దామని అనిపించింది. నిన్న ఉదయం మొత్తం నాలుగు బస్సుల్లో అందరం కలిసి విహార యాత్రకు బయలుదేరాము. ధవళేశ్వరం బ్యారేజ్‌ మీద కొద్ది సేపు బస్సులు ఆపుచేయించి, గోదావరి అందాలని చూస్తూ, చల్లగా వీచే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అందరూ మైమరచిపోయారు. అప్పుడు గుర్తుకు వచ్చింది. అవతలి గట్టు మీదకు చేరగానే అక్కడ సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మ్యూజియం ఉందని. ఎప్పటి నుంచో నేనూ ఒకసారి వెళదామని అనుకుంటున్నాను గాని వెళ్ళడం కుదరలేదు. వెంటనే బస్సు డ్రైవర్లను పిలిచి తరువాత మనం ఆగవలసిన చోటు మ్యూజియం అని చెప్పేసాను. అలా అన్నానే గాని, అక్కడి గొప్పతనం ఏమిటో, ఎలా ఉంటుందో నాకే తెలియదు. ఇక పిల్లలకి ఏమి చెబుతాను. మొత్తానికి ఉదయం 11: 30 ని.లకు అక్కడకు చేరుకున్నాం.

    ధవళేశ్వరం బ్యారేజ్‌ మీద నుండి ఊళ్ళోకి వచ్చే బ్రిడ్జి ప్రక్కన గోదావరి గట్టున ఉన్నది ఈ కాటన్‌ మ్యూజియం. మ్యూజియంకి వెళ్ళే దారిలో అటూ ఇటూ పచ్చని చెట్లతో మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. లోపలికి వెళ్లడానికి మనిషికి 2 రూపాయిలు టిక్కెట్‌. పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. చక్కటి గార్డెన్‌ కూడా ఉంది. మధ్యలో ఠీవీగా నుంచుని ఉంది రెండు వందల సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలబడిన చక్కటి భవనం. ఆ భవనంలోకి వెళుతుంటే మనసు అప్రయత్నంగా ఉద్విగ్నతకు లోనయింది. ఈ రోజు గోదావరి జిల్లాలు ఇంత సుసంపన్నంగా ఉండడానికి కారణమైన ఒక మహావ్యక్తి నివసించిన భవనం అదే అని తెలిసి ఒక పవిత్ర భావానికి లోనయ్యాను. మ్యూజియం లోపల గత కాలపు చరిత్రను చక్కగా చెప్పే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాటన్‌ జీవిత విశేషాలు, ఆయన వాడిన పరికరాలు, గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట నిర్మాణ విశేషాలు, గోదావరి డెల్టా వివరాలు, ఆనకట్ట నమూనా, ఆక్విడెక్టుల వివరాలు ఇలా ప్రతి గదిలోను ఎన్నో విశేషాలు కొలువై ఉన్నాయి.

    1830వ సం||రంలో గోదావరి జిల్లాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయట. తినడానికి తిండి లేక, పశువులకు గ్రాసం దొరక్క గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయట. ఆనాటి లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు రెండు లక్షల మంది మృత్యువాత పడ్డారు. వేరే దారిలేక పుట్టిన పసికందుల్ని పిల్లల్ని సంతలో అమ్ముకునే వారట. అటువంటి దుర్బర పరిస్థితుల్లో ఇక్కడికి దేవుడి రూపంలో వచ్చాడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌. కేవలం 15 సం||ల వయసులోనే బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఒక సామాన్య ఉద్యోగిగా వచ్చి, ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని, ఇక్కడి ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో నీటి పారుదల రంగంపై పరిశోధనలు చేసి, గోదావరి నదిపై ఆనకట్ట కట్టి నీటిని నిలువ ఉంచి, కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని బ్రిటిష్‌ గవర్నమెంట్‌కు నివేదిక పంపించాడట. వారు దానికి అనుమతి నివ్వడంతో కాటన్‌ రంగంలో దిగారు. అప్పటిలో అంటే 150 సం||ల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం మీద తిరుగుతూ, దొరికిన పళ్ళనే తింటూ, గోదావరి తీరంపై అనేక పరిశోధనలు చేసారు. ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం తిరుగుతూ పాపి కొండల నుండి ధవళేశ్వరం వరకూ తిరిగి, అనేక కష్టనష్టాలను, బాధలను తట్టుకుంటూ చివరికి ధవళేశ్వరం ప్రాంతాన్ని ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. పాపికొండల ప్రాంతంలో గోదావరి ఉరవడి ఎక్కువగా ఉండటం, ఆ రోజుల్లో రెండు కొండల మధ్య ఆనకట్ట నిర్మాణానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మాణం కావించారు. పని మొదలు పెట్టిన మూడు సంవత్సరాలు వ్యవధిలోనే ఆనకట్ట నిర్మాణం పూర్తి కావించడం కాటన్‌ ఉక్కు సంకల్పానికి నిదర్శనం.

    ఈనాటి మన వాళ్లు అంటే భారతీయులం అని చెప్పుకునే వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన దేశస్థుడు కాకపోయినా, ఇక్కడి వాళ్ళ పట్ల అభిమానంతో రేయనక, పగలనక శ్రమించి, పూర్తి కమిట్‌మెంట్‌తో ఫలితాన్ని సాధించి అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటి రాజకీయ నాయకుల్లో, ఇంజనీర్లలో, కాంట్రాక్టర్లలో (అందరూ పేరుకు భారతీయులే, దేశభక్తులే) ఎంత మందిలో అటువంటి కమిట్‌మెంట్‌ ఉంటుంది. ఈ రోజు వేసిన రోడ్డు, రేపు వర్షం కురవగానే పెచ్చులూడిపోతుంది. అటువంటిది 150 సం||లుగా కొద్దిపాటి మరమ్మత్తులతో ఆనకట్ట పనిచేస్తుందంటే ఆయన నిర్మాణ చాతుర్యానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇప్పటి రాజకీయ నాయకులు ప్రాజక్టును సంవత్సరాల కొద్దీ సాగదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే కాలువలు తవ్వేస్తున్నారు. కనీసం వాలు కూడా చూస్తున్నారో లేదో అనుమానమే. అటువంటిది ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం మీద, కాలి నడకనా, సరైన రోడ్లు కూడా లేని సమయంలో డెల్టా అంతా పర్యటించడం మాటలు కాదు. నీటి వాలు కనిపెట్టి ఆ రోజు తవ్విన కాలువలు ఈ రోజుకూ డెల్టాకు అన్నం పెడుతున్నాయి. ఇచ్చిన పనిని ఏదో ఒక రకంగా తూతూ మంత్రంగా దులిపేసే నేటి మన ఇంజనీర్‌ ఆఫీసర్లకి, ఆనాటి కాటన్‌ దొరకి ఎంత తేడాయో కదా.

    కేవలం జీతం కోసం మాత్రమే పని చేసుంటే సవాలక్ష ఇంజనీర్లలో ఒకరిగా కాటన్‌ మిగిలిపోయేవాడు. కాని గుండెల నిండా కమిట్‌మెంట్‌, ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేయడం వల్లనే కాటన్‌ ఒక మహామనీషి కాగలిగాడు. అందరికీ ఆదర్శం కాగలిగాడు. ఆయన నివసించిన ప్రదేశాన్ని కూడా ఈ రోజుకీ మనం గౌరవిస్తున్నామంటే అది ఆయన కృషి వల్ల మాత్రమే. ఇలా మా విద్యార్థినులకి కాటన్‌ గొప్పతనాన్ని చెబుతూ, మనసులో చెమర్చిన కృతజ్ఞతా భావం కన్నులలో నీటి రూపంలో తిరుగుతూండగా, దానికి ఆనకట్ట కట్టమని కాటన్‌ను స్మరించుకుంటూ, తిరిగి బస్సులలో బయలుదేరి రాజమండ్రి పయనమయ్యాము.

Tuesday, November 23, 2010

అమెరికా అధ్యక్షుని అనవసరమైన భయాలు

    ‘రాజు వెడలె రవి తేజములలరగ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశ యాత్ర ఆర్భాటంగా పూర్తయింది.  భారత ప్రజల అభిమానాన్ని సంపాదించడానికో లేదా ఇక్కడున్న పెట్టుబడులు, మార్కెట్లను ఆకర్షించడానికో లేదా మనస్ఫూర్తిగానో భారత ప్రజల పట్ల ఒబామా చాలా అభిమానాన్ని ఒలకపోసారు. ఆయన ప్రసంగంలో భారత దేశం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ఎన్నో మంచి భావనలు వ్యక్తమయ్యాయి. మరో పదేళ్ళలో భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తుందని, ఆర్థిక వ్యవస్థ విషయంలో చైనాను, అమెరికాలను మించిపోతుందని ఆయన ప్రశంసించారు. కాని ఆయన భయాలు చాలా వరకు అర్థరహితమైనవి. ఇక్కడి వాస్తవాలని గమనిస్తే ఆయన అలా అని ఉండకపోవచ్చు. లేదా నిజం తెలిసినా కావాలని అబద్ధమైనా చెప్పుండాలి.

    ఒబామా చెప్పిన విషయాలన్నీ నిజం కావాలంటే మనం చాలా కష్టపడాలి. ఇంకా మారాల్సింది కూడా చాలా ఉంది. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చెప్పుకుందాం.

1. వర్క్‌ కల్చర్‌: మన దేశంలో ఎక్కువ శాతం మందికి లేనిది ఇదే. పని చేయాలంటే బద్దకం. ఏదో వంక పెట్టి తప్పించుకోవాలని చూసేవాళ్ళే ఎక్కువ. దీనికితోడు పెళ్ళిళ్ళు, చావులు, పండుగలు, పేరంటాలు అంటూ ప్రతీ సారి ఏదో ఒక సాకు చెప్పి పనికి ఎగనామం పెడతారు. మన వాళ్ళకి డబ్బుతో పెద్దగా పనిలేదు. ఉన్నదానితోనే తృప్తిగా బ్రతికేస్తారు. అందుకే పని మానేసిన రోజున జీతం పోతుందని తెలిసినా, లెక్కచేయరు. గట్టిగా వర్షం వచ్చినా, ఎండకాసినా ఆ రోజుకు పనికి ఎగనామమే.

2. పని మీద శ్రద్ద: ఎవరు ఎన్ని చెప్పినా మనవాళ్ళకి పని మీద శ్రద్ద ఉండదు. ప్రపంచంలో అందరికంటే ఎంతో తెలివైన వాళ్ళయినప్పటికీ, పనిని ఇంకా బాగా చెయ్యగలిగినప్పటికీ, మనం చెయ్యం. ఏదైన ఒక పనిని పూర్తి ఖచ్చితత్వంతో చేస్తే, దానినే పెర్‌ఫెక్షన్‌ అంటారు. ఏదో దులుపుకు వెళ్ళిపోదామనే ధ్యాసే తప్ప మనకి చేస్తున్న పనిలో నిజాయితీ ఉండదు. ఏదైనా ఒక చిన్న వస్తువు తయారు చేసే విషయమే తీసుకోండి. అమెరికా, జపాన్‌ దేశాల్లో తయారైన వస్తువులకి, ఇండియా, చైనాల్లో తయారైన వస్తువులకి నాణ్యత విషయంలో చాలా తేడా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎవరైనా విదేశాల నుంచి వచ్చి కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ స్థాపించినప్పటికీ, అందులో తయారయ్యే వస్తువులు మాత్రం నాణ్యతగా ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే.

3. నిజాయితీ: పని చేసేటపుడు నిజాయితీగా ఉంటేనే పైన చెప్పిన పెర్‌ఫెక్షన్‌ సాధ్యమవుతుంది. ఒక జర్మనీ లేదా జపాన్‌ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎలా ఉంటాడో ‘డిస్కవరీ’ ఛానల్‌లో గమనిస్తే అర్థం అవుతుంది. కార్లు కంపెనీల్లో పనిచేసే వాళ్ళతో ఇంటర్వ్యూ చూపించినపుడు ఇది నా దేశంలో తయారయిందని ప్రపంచమంతా తెలియాలి అని చెప్పడం నేను గమనించాను. తయారైన కారు లేదా రాకెట్‌ను పని పూర్తయిన తరువాత ప్రేమతో తాకడం కూడా చూసాను. చేసే పనిని వారు అంత నిజాయితీగా ప్రేమిస్తారు. మనం నేర్చుకోవాల్సింది అదే.

4. దేశభక్తి: దేశభక్తి డైలాగులు చెప్పడం గాని, గేయాలు రాయడంలోగాని మనకు మనమే సాటి. కాని ఆచరణలోకి వచ్చేసరికి దేశభక్తి అనేదే ఎక్కడా కనిపించదు. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం. అంటే సాటి భారతీయుడిని ప్రేమించడం. కాని అలా ఎవరైనా చేస్తున్నారా? రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు లంచాలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ద పరిపాలనలో ఉండదు. లంచం తీసుకుని సాటి దేశస్థుడిని అవమానిస్తున్నామనే కనీస జ్ఞానం కూడా వారికి ఉండదు. వీళ్లకి లంచాలు ఇవ్వడం కోసం, ఉన్న క్వాలిటీని చంపేసి నిధులన్నీ కాంట్రాక్టర్లు స్వాహా చేసేస్తారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి వేసిన రోడ్లు, డ్రైనేజి, ప్రాజెక్టులు వంటివి కనీసం సంవత్సరం కూడా ఉండవు. రోడ్లు పెచ్చులూడిపోయి, కంకర బయటకి వచ్చి, దుమ్ము లేచిపోతూ ఉంటాయి. డ్రైనేజిలో నీరు సరిగ్గా పారదు. అరే, ఇది మన దేశం.... మన కన్నా చిన్న దేశాలు కూడా రోడ్లు చాలా అందంగా వేసుకుంటాయి....  మనల్ని చూసి అందరూ నవ్వుతారనే సిగ్గు కూడా ఎవరికీ ఉండదు.

5. ప్లానింగ్‌: మనకి ప్లానింగ్‌, సమన్వయం అనేది ఏ కోశానా ఉండదు. అది మునిసిపాలిటీ రోడ్ల విషయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముందు రోడ్‌ వేసేస్తారు. తరువాత డ్రైన్‌ కోసం ఆ రోడ్‌ తవ్వేస్తారు. మళ్ళీ రోడ్‌ వేస్తారు. తరువాత టెలిఫోన్‌ తీగల కోసం మళ్ళీ తవ్వేస్తారు. కొన్నాళ్ళకి వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు తవ్వేస్తారు. ఇలా అందరూ తవ్వేసిన తరువాత శుభ్రంగా రోడ్‌ పోసి, ఈ సారి గ్యాస్‌పైప్‌లైన్‌ కోసం మళ్ళీ తవ్వేస్తారు. ఒక్క రోడ్‌ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా భవిష్యత్తు గురించి, అప్పుడు కలగబోయే అవసరాల గురించి ఎవరూ ఆలోచించరు. అప్పటికి ఆ పని అయిపోతేచాలు. బ్రిటిష్‌ వారు వంద, నూట యాభై సంవత్సరాల క్రితమే రోడ్స్‌, రైల్వే లైన్‌ వేసినపుడు అటూ ఇటూ కూడా భవిష్యత్‌ అవసరాల కోసం మరో రెండు లేన్లు వేసుకోవడానికి వీలుగా భూ సేకరణ చేసేసి ఉంచారు. అటువంటి దూరాలోచన మనకి ఎప్పుడు వస్తుందో... ఇప్పుడున్న ‘దురాలోచన’ల్లోంచి ఎప్పుడు మనం బయటపడతామో...

చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇంత కన్నా ఎక్కువ తిట్టుకున్నా తిట్టే నాకు, చదివే మీకు బోర్‌ కొడుతుంది. వీటిలో కనీసం కొన్నింటినైనా రాబోయే తరంలో కొందరైనా మార్చుకుని, ఇండియా అంటే సోమరిపోతుల దేశం కాదని, నిజంగానే కష్టించి పనిచేసే నిజాయితీ కలిగిన దేశం అని ప్రపంచంలో అందరూ మెచ్చుకొనేలా చేయగలగడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అది మన దగ్గర నుండే మొదలవ్వాలి. ‘చీకటిని తిడుతూ కూర్చునే కన్నా చిరు దీపం వెలిగించాలి’ అది ఎవరో అని ఎదురు చూసే కన్నా మనమే ముందు ఆ దీపాన్ని వెలిగిస్తే మరికొంత మందికి చక్కటి దారి చూపించగలిగిన వారం అవుతాము.   అపుడు ఒక్క అమెరికా మాత్రమే కాదు, మిగతా అందరు దేశాల అధ్యక్షలు వారి స్వార్థం కోసం కాకుండా, నిజంగానే మన దేశాన్ని చూసి, మన శక్తిని చూసి భయపడే రోజు, గౌరవించే రోజు వస్తుంది.

Sunday, November 14, 2010

ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన 'స్కైలైన్‌ (విధ్వంసం)'

హాలీవుడ్‌ సినిమాలంటే ప్రత్యేకించి స్పెషల్‌ ఎఫెక్టుల కోసమే థియేటర్‌కు వెళ్ళి మరీ సినిమా చూస్తుంటారు. వాల్‌ పోస్టర్స్‌ చూసి దారుణంగా మోసపోయిన సినిమా 'స్కెలైన్‌'. హాలీవుడ్‌లో సినిమాలను ఇంత దారుణంగా, దరిద్రంగా తీస్తారా అనిపించింది. ఎప్పుడు థియేటర్‌ నుండి బయటకు పారిపోయి వచ్చేద్దామా అనిపించింది. దాన్ని రిలీజ్‌ చేసింది కూడా రిలయన్స్‌ బిగ్‌ పిక్చర్‌. కేవలం స్పెషల్‌ ఎఫెక్టుల్ని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా మొత్తాన్ని కేవలం ఐదుగురు ఆర్టిస్టులతో తీసారు. అదీ ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో. ట్రైలర్స్‌లో, వాల్‌పోస్టర్స్‌లో చూపించే కాస్త ఎఫెక్ట్స్‌ ఏవైతే ఉన్నాయో వాటినే సినిమా మొత్తం కొన్ని పదుల సార్లు రిపీట్‌ చేసారు. లాస్‌ఏంజిల్స్‌ నగరంగాని, అలియన్స్‌తో ఫైట్‌ చేయడానికి వచ్చిన ఫ్లైట్లుగాని అన్నీ కంప్యూటర్‌ మీద చేసినవే.

స్టోరీ లైన్‌: చెప్పడానికి ఏమీ లేదు.

స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ఒకే ఎఫెక్ట్‌ని పదిసార్లు రిపీట్‌ చేసారు

డైరెక్షన్‌: తీసునోడికే తెలిసుండదు.

చూసినోళ్ళ పరిస్థితి: వెళ్ళేపుడు జండూ బామ్‌ కొనుక్కోవడమే.

నాలాగా ఇంకెవ్వరూ బాధ పడకూడదని, డబ్బులు పాడుచేసుకోకూడదని ఈ చిన్న రివ్యూ పెట్టారు. దీన్ని టైప్‌ చేయడానికి నేను తీసుకున్న టైమ్‌ కూడా వృధా..

Tuesday, November 2, 2010

సెల్‌ ఫోన్లు - సొల్లు కబుర్లు

పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళి సీట్లో కూర్చున్నా.. చాలా ఇంపార్టెంట్‌ వర్క్ ఉంది... పనిలో దూకడానికి రెడీ అయ్యాను. సెల్‌ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని ఫోనెత్తాను...
‘నూనె డబ్బా రేటు ఎలా ఉందండి?’ అవతలి నుండి హడావుడిగా ప్రశ్న
‘ఇంతకీ మీరెవరండి?’ అడిగాను నేను.
‘మీ షాపు ఇంకా తియ్యలేదు కదా. ఎప్పుడు తీస్తారు?’
‘మీరెవరండి. నాకు నూనె షాపు లేదండి’
‘అదేమిటండీ? మీ నెంబరు ఈ బోర్డ్ మీద ఉంది. అది చూసే ఫోన్‌ చేస్తున్నాను’ అవతలి వ్యక్తి జవాబు.
నాకు మండిపోయింది. నెమ్మదిగా విషయం అర్థం అయింది. షాప్‌ బోర్డ్ మా ప్రెస్‌లో తయారై ఉంటుంది. దాని మీద మా ఆపరేటర్‌ నా సెల్‌ నెంబర్‌ వేసుంటాడు. మొదట్లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ కోసం నా మొబైల్‌ నెంబరు ప్రింట్‌ చేసే వాళ్ళం. కాని, ఇలాంటి తలకాయపోట్లు ఎక్కువై పోయాక వెంటనే ల్యాండ్‌ లైన్‌ నెంబర్‌ మాత్రమే ప్రకటనల్లో ఉంచుతున్నాను. ఆపరేటర్‌ని పిలిచి ఇంకెప్పుడూ నా సెల్‌ నెంబర్‌ ఎక్కడా ప్రింట్‌ చేయొద్దని చెప్పాను.

ఇంకో రకం హింస ఉంటుంది. ఒక కుర్రాడు వచ్చాడు. ‘సార్‌, మా వెడ్డింగ్‌ కార్డ్స్‌ ప్రింట్‌ అయ్యాయా’ అని అడిగాడు. ఒక్క నిముషం అని చెప్పి, గుమాస్తాని పిలవడం కోసం బజర్‌ నొక్కాను. ఈ లోపలే ఆ కుర్రాడు సెల్‌ తీసి మాట్లాడుతూ ఉంటాడు. ‘డాడీ, వెడ్డింగ్‌ కార్డ్స్ ఇంకా ప్రింట్‌ అవ్వలేదట.. ఒక్క నిముషం ఆగమంటున్నారు. ఉండనా... వచ్చేయనా... ఏమి చెయ్యమంటావు?’ అని. ‘నేను అవ్వలేదని చెప్పానా’ అని అడిగాను ఆ కుర్రాడిని. ముందు ఆ సెల్‌ఫోన్‌ కట్‌ చెయ్యి, తరువాత మాట్లాడదాం అని చెప్పాను. కట్‌ చేసిన తరువాత అతని వివరణ... ‘అంటే మీరు ఒక్క నిముషం అన్నారు కదా... అందుకని అవ్వలేదని అనుకుని ఫోన్‌ చేసానండి... ఒకవేళ అయిపోతే ఇచ్చేయండి. పట్టుకుపోతాను’ అన్నాడు. ‘ఈ మాత్రం దానికి ఫోన్‌ చెయ్యడం ఎందుకయ్యా. అనవసరంగా ఫోన్‌ వాడకండి అని సున్నితంగా మందలించాను.

ఇక కుటుంబ సభ్యుల మధ్య, లేకపోతే గుమాస్తాల మధ్య ఫోన్‌లకయితే లెక్కే ఉండదు. ఎవరికయినా దూరంగా ఉన్నారనుకుని ఫోన్‌ చేస్తే వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నాగాని, లేదా పక్క గదిలో ఉన్నాగాని వెంటనే ఫోన్‌ ఎత్తేస్తారు. లేదా మాట్లాడుతూ నా దగ్గరకు వస్తారు. ఇదేమిటయ్యా, పక్క రూమ్‌లో ఉన్నపుడు వెంటనే నా దగ్గరకు రావచ్చు కదా. ఫోన్‌ ఎత్తడం దేనికి అని అడిగితే, ‘ఏదయనా అర్జంట్‌ పని ఉందేమో నని ఫోన్‌ ఎత్తాను సార్‌’ అంటారు. ఎన్ని సార్లు మందలించండి. అదే తంతు.

ఇంట్లో అడవాళ్ళకిచ్చిన సెల్‌ ఫోన్‌లకయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ స్నేహితులతోనో, పుట్టింటి వాళ్ళతోనో మాట్లాడుతూనే ఉంటారు. కూరమాడిపోయినా పర్లేదు, పిల్లి పాలు తాగేసినా లెక్కలేదు, పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోరు. ఏమన్నా అంటే... అమ్మో అనే ధైర్యం కూడానా... మనలాంటి వాళ్లకి...

రోడ్‌పై వెళుతుంటే ఎక్కడ ఎవర్ని చూసినా నడుస్తూ, డ్రైవింగ్‌ చేస్తూ, పక్కన ఆగి ఇలా ఎటు చూసినా ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. సెల్‌ ఫోన్స్ వల్ల ఎన్ని ఏక్సిడెంట్స్‌ అవుతున్నాయో ఎవరైనా సర్వే చేస్తే బాగుండును.

సెల్‌ఫోన్ల వాడకం ఎక్కువయిన తరువాత మనుషుల నోటికీ, చేతికీ కంట్రోల్ లేకుండాపోయిందేమో అనిపిస్తుంది. ఎవరితోనయినా ఏదయిన మాట్లాడాలనిపిస్తే వెంటనే ముందూ, వెనకా ఆలోచించకుండా సెల్ తీసి నంబర్ నొక్కేయడం. అవతలి వాళ్ళు ఏ పనిలో వున్నారో కూడా ఆలోచించకుండా నోటికి వచ్చింది వాగెయ్యడం, ఆనక ఎందుకలా అన్నానని బాధపడడం... ఇలాంటి వాళ్ళని బోలెడు మందిని చూసాను ఈ మధ్యన. కొంచెం ఆలోచించుకుని సెల్ మాట్లాడితే ఎన్నో అనర్ధాల నుంచి తప్పించుకోవచ్చు. 

సెల్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే రేడియేషన్‌ వల్ల అనారోగ్యం వస్తుందని, తొందరగా పోతారని చెప్పినా ఎవరికీ చెవికి / బుర్రకి ఎక్కడం లేదనుకుంటాను. అంతగా ఎక్కువ సేపు మాట్లాడడానికి ఏమి ఉంటుందో అర్థం కాదు. నిజంగా అవసరమైతే మహా అయితే ఒక నిముషమో, రెండు నిముషాలో మాట్లాడొచ్చుగాని, మరీ ఇంతలా.... జీవితంలో సగభాగం సెల్‌ఫోన్‌కే అంకితం చేసేస్తున్నారనిపిస్తుంది... ఈ జనాన్ని చూస్తుంటే... దేవుడా నువ్వే రక్షించాలి... ఈ దేశాన్ని... ఈ సెల్‌ ఫోన్ల నుండి.... ఈ సొల్లు కబుర్ల నుండి....

Monday, October 25, 2010

పేరు మార్పు: ఇకపై 'రాజీవ్‌ హైదరాబాద్‌' ఇంకా 'సోనియా సికిందరాబాద్‌'

తెలుగు వారి లలిత కళా తోరణం కాస్తా 'రాజీవ్‌ తెలుగు లలిత కళాతోరణం' అయిపోయింది. 'మన వాళ్ళు వట్టి వెధవాయిలోయ్‌' అన్నట్లుగా మన తెలుగు రాష్ట్రంలో ప్రతీదీ 'రాజీవ్‌', ఇందిర, సోనియాల మయమైపోయింది, అయిపోతుంది, అవ్వబోతున్నది. ఇంకెలాగో దీన్ని మనం కాపాడుకోలేము కాబట్టి, నా ప్రధాన డిమాండ్‌ ఏమిటంటే... హైదరాబాద్‌ నగరాన్ని 'రాజీవ్‌ హైదరాబాద్‌' గా మార్చాలని, సికిందరాబాద్‌ నగరం పేరును 'సోనియా సికిందరాబాద్‌' గా మారిస్తే బాగుంటుందని.... రెండూ జంట నగరాలు కాబట్టి, రాజీవ్‌, సోనియాల పేర్లు చక్కగా నప్పుతాయనుకుంటున్నాను. ఇక హుసేన్‌ సాగర్‌ పేరు కూడా 'ఇందిరా సాగర్‌' గా, ఛార్మినార్‌ను 'రాహుల్‌ మీనార్‌'గా మార్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. తెలుగు వాళ్ళకి అసలు ఆత్మాభిమానం లేదని ఎవరైనా అన్నా సరే గాని, తెలుగు వాళ్ళలో అసలు గొప్పవాళ్ళెవరూ లేరని అందరూ ఈసడించినాగాని, పక్కనున్న తమిళ తంబిలను చూసైనా గాని ఏ మాత్రం సిగ్గుపడకుండా మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టయినా సరే, తెలుగు వాళ్ళందరం ఒక్క మాటపై నిలబడి 'అమ్మ భజన' చేద్దాం... అప్పటి వరకు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. గత మెంతొ ఘన కీర్తి కలవోడా....

Friday, October 15, 2010

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తినిపించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది?

పిల్లలకి దసరా సెలవులు వచ్చేసాయి. ఆటలు, పాటలు, కేరింతలు, తుళ్ళింతలు... అమ్మమ్మ ఇంటికి ప్రయాణాలు.... కొత్త స్నేహితులు, పాత బందువుల పలకరింతలు... నిజానికి శెలవులొచ్చాయంటే పిల్లలకంటే ఎక్కువ ఆనంద పడే వాళ్ళు ఎవరుంటారు? చిన్నతనంలో శెలవుల్లో చేసిన అల్లరి, కోతికొమ్మచ్చి ఆటలు ఎవరైనా మరచిపోగలమా? కొత్త కొత్త పిండివంటలు, కొత్త బట్టలు, కొత్త బొమ్మలతో, ఆత్తయ్యలు, మావయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, తాతమ్మలు, తాతయ్యలతో ఎంత సందడిగా ఉంటుంది? ఇంతటి అపురూపమైన ఆనందాలు పిల్లలకు దక్కకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది ఇప్పటి స్కూళ్ల పరిస్థితి చూస్తుంటే...

అసలు విషయానికి వస్తే మా పెద్దమ్మాయి సత్య రెండవ తరగతి చదువుతుంది. దసరా శెలవులిచ్చారు. తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మగారింట్లో దింపేసి వచ్చాను. నాలుగురోజులు అక్కడ సరదాగా గడిపేరు. నిన్ననే అక్కడి నుండి తీసుకువచ్చాను. తీసుకు వచ్చినప్పటి నుండి దాని గదిలోకి దూరిపోయి మరలా కనబడలేదు. నేనూ పని వత్తిడిలో పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అది కనబడక, దాని అల్లరి చెవిలో వినబడక ఇల్లంతా బోసిపోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళి చూద్దును కదా.... చుట్టూ చిందరవందరగా పుస్తకాలతో, పెన్ను, పెన్సిళ్ళతో ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ అల్లరి చేస్తూ ఉండే లక్ష్మీదేవిలా ఉండే మా సత్య అపర సరస్వతి అవతారంలా కనిపించింది. ముఖం పీక్కుపోయి ఉంది. చాలా సీరియస్‌గా ఏదో రాసేసుకుంటా ఉంది. నాకు తండ్రి మనసు ఆగలేదు. ఆడుకోకుండా ఇప్పుడు కూడా వర్క్‌ ఏమిటి నాన్నా. ఇంకా శెలవులు ఉన్నాయికదా. రేపు రాసుకుందువుగానిలే అన్నాను. వెంటనే సత్య నా వైపు ఓ సీరియస్‌ లుక్‌ ఇచ్చి, మరలా రాసుకోవడం మొదలుపెట్టింది. కాసేపు ఉన్నాకా, బేల ముఖం పెట్టి, ''నాన్నా... నాకు చాలా హోమ్‌వర్క్‌ ఉంది. చాలా చాలా ఎక్కువ. అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను కదా... అందుకే పూర్తి కాలేదు'' అంది. ''ఎంత ఉంది నాన్నా, నన్ను చూడనివ్వు'' అని దాని స్కూల్‌ డైరీ తీసుకుని చూసాను. గుండె ఆగినంత పనయ్యింది.



''ఇంగ్లీష్‌: ఎ నుండి జడ్‌ వరకు అక్షరాలు, ప్రతి అక్షరానికి ఒక్కొక్క పదం చొప్పున అన్ని లెటర్స్‌కి రాయాలి.

తెలుగు: అ నుండి ఱ వరకు అన్ని అక్షరాలు, క నుండి ఱ వరకు అన్ని గుణింతాలు, క నుండి ఱ వరకు అన్ని వత్తులు.

హిందీ: అ నుండి జ్ఞ వరకు అన్ని అక్షరాలు, క నుండి జ్ఞ వరకు అన్ని గుణింతాలు,

మేథ్స్‌: 1 నుండి 1000 వరకు అన్ని అంకెలు, 1 నుండి 20 వరకు అన్ని టేబుల్స్‌

సైన్స్‌ & సోషల్‌: 3,4,5 లెసన్స్‌ నుండి అన్ని క్వశ్చన్స్‌ & ఆన్సర్స్‌ మరియు ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌

జి.కె.: ఇప్పటి వరకు చెప్పిన అన్ని క్వశ్చన్స్‌ ''

ఇవన్నీ నోట్స్‌ రాసి చూపించాలట. దాని హోమ్‌వర్క్‌ ఏమిటో చూసిన తరువాత నాకిక నోటిమాట రాలేదు. ''నాన్నా, నాకు చెయ్యి నొప్పిగా ఉంది. రాయలేకపోతున్నాను'' అంది. జాలిగా నాకు చెయ్యి చూపించింది. ప్రొద్దుట నుండి ఏకథాటిగా రాయడం వల్ల దాని లేత అరచెయ్యి ఎర్రగా కందిపోయి ఉంది. నాకయితే ఒళ్ళు మండిపోయింది. టీచర్‌ని తిడదామని ఫోన్‌ చేసాను. ఆ అమ్మాయి ఫోన్‌ కట్టేసి ఉంది. సరే నేను చూసుకుంటాను అని చెప్పి కొంత హెAమ్‌ వర్క్‌ నేను సొంతంగా ఇచ్చి, అది మాత్రమే చెయ్యమని చెప్పి మా అమ్మాయిని ఊరుకోబెట్టాను. ఈ మాత్రం దానికి శెలవులివ్వడం ఎందుకో? పండుగ పేరు చెప్పి బండెడు హెAమ్‌వర్క్‌లిచ్చి పిల్లల ఆనందాన్ని కాలరాయడమెందుకో?

ఇంత దారుణమైన హోమ్‌ వర్క్‌ నా చిన్నతనంలో ఎప్పుడూ నేను చేసినట్టు గుర్తులేదు. నేనూ ఒక కాలేజ్‌ సెక్రటరీ / కరస్పాండెంట్‌ అయినప్పటికీ మా ప్రిన్సిపాల్‌కి, లెక్చరర్స్‌కి ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాను. పిల్లల్ని అనవసర హింసకు గురిచేయకండి. వారిలో సహజసిద్దంగా ఉండే నేర్చుకోవాలని అనే తపనని చిదిమేయకండి. మానసికంగా / శారీరకంగా ఒత్తిడికి గురిచేస్తే ఫలితాలు పాజిటివ్‌గా రావడం మాట అటుంచి నెగిటివ్‌గా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ స్వేచ్చగా నేర్చుకోవాలి. స్వేచ్చగా ఆలోచించగలగాలి. ఎప్పుడూ పుస్తకాల్లో ఉండే విషయాల్నే బట్టీ పట్టి వాటిని మాత్రమే నేర్చుకుంటూ ఉంటే మనిషి ఆలోచన ఇక అక్కడితో ఆగిపోతుంది. మన పూర్వీకులు కూడా అలాగే చేసి ఉంటే, ఒక నిప్పు కనిపెట్టడం, ఒక చక్రం కనిపెట్టడం, ఒక న్యూటన్‌ గమన సూత్రం, ఒక ఐన్‌స్టీన్‌ రిలేటివ్‌ థియరీ వంటివి మనకు అందకుండా పోయేవి. కొత్తగా కనిపెట్టబడేవి ఇంతకు ముందు పుస్తకాల్లో లేనివే కదా. అంటే పుస్తకాలు చదవాలి. తరువాత ఆలోచించాలి. పుస్తక పరిథుల్ని దాటగలగాలి. అప్పుడే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు సాధ్యమవుతాయి. అలా కాకుండా అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టాలని ప్రయత్నిస్తే, జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. ఇదే విషయాన్ని రేపు ఆ స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడుదామని సిద్దమయ్యాను.

Tuesday, October 12, 2010

అమ్మాయిలంటే అంత లోకువా?

కాలేజీకెళుతుంటే  కాలరెత్తి కన్నుకొడతాడే ఒకడు....
పౌడర్లు, అత్తర్లు పూసుకుని రాసుకెళతాడే ఒకడు....
సిటీ బస్‌లో పోతే భుజాలే తాకుతుంటరే
సినేమా చూస్తుంటే చేతులు పాముతుంటరే.
అయ్యో రామ మా అక్క మొగుడు ఒంటరిగుంటె వెర్రెక్కుతాడే
ఎదురింట్లోన బాబాయిగాడు ఏదో వంకతో తాకుతాడు
వయసులు వరసలు తెలియని సరసులు సన్నాసులు
వీధుల్లోకెళుతుంటే ఏక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో...
టైపింగూ సెంటర్లో వేలు పెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ...
టైలరింగ్‌ షాపోడు టేపుతో కొలతలంటడే..
గాజుల వ్యాపారి తేరగా నిమురుతుంటడే...

నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలోనిది ఈ పాట. ఈ పాటలోని ప్రతి పదంలో నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అనేక కష్టాల్ని చక్కగా వారిచేతనే చెప్పించాడు రచయిత / దర్శకుడు. అదేమి విచిత్రమో తెలియదు కాని, ఆడపిల్లలు రోడ్‌ మీద నడిచి వెళుతుంటే ఎప్పుడూ చూడని వింతజంతువుని చూసినట్లు ఫీలయిపోతారు మగవారు. ఇక అక్కడి నుండి వారు వేసే వెర్రి మొర్రి వేషాలకు అంతే ఉండదు. జుట్టు దువ్వుకునే వాడొకడు, బట్టలు సరిచేసుకునే వాడు ఒకడు, ముఖం అందంగా ఉందా లేదా అని తడుముకొనే వాడు మరొకడు. అబ్బాయికి చెలగాటం అమ్మాయికి ఇబ్బంది అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. ‘అందగత్తెలను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేల, కొందరు పిచ్చిన పడనేలా’ అన్నట్లు కొందరు మగవారు ఇలాంటి పాట్లు, ఫీట్లు చేస్తూ ఉంటే, వారినెలా ఏడిపించి ఆనందించాలా అని ఆలోచిస్తూంటారు కొంతమంది శాడిస్టులు. లవ్‌ లెటర్‌ ఇద్దామా, రాసుకు పూసుకు తిరుగుదామా, బ్లేడ్‌ పట్టుకు కోద్దామా, గొడ్డలితో నరుకుదామా లాంటి వన్నమాట. మరో విషయం. ఆడపిల్లల్ని రాసుకుంటూ వెళుతూ మగవాళ్ళు పొందే ఆనందానికి ఒక పేరుంది. దాని పేరు ‘శునకానందం’. దీనికాపేరు ఎందుకొచ్చిందో మీకు తెలుసా? శునకాలు... అదేనండి... కుక్కలు తమ యజమాని కనిపించగానే వెంటనే తోకాడిరచుకుంటూ వచ్చి కాళ్ళకి అడ్డంపడిపోతూ, ఒళ్ళంతా రాసుకుని, పూసుకుని తిరిగేస్తూ ఉంటాయి కదండి. అదన్నమాట. అలాగ ఆడపిల్లలు కనబడగానే ...... కార్చుకుంటూ, వాళ్లని తినేసేలా చూస్తూ, వీలువెంబడి తగులుకుంటూ వెళ్ళే వాళ్ళ ఆనందాన్ని శునకానందం అంటారన్నమాట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంచెం అఫీషియల్‌గా లైన్‌ వేసే వాళ్ళు మరికొందరు. పై పాటలో చెప్పినట్లు రకరకాల పేర్లతో ఏదో పని ఉందనే వంకతో అమ్మాయిల్ని తాకుతూ ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఫ్యాన్సీ షాపుల్లోను, బట్టలషాపుల్లోను, టైలరింగ్‌ షాపుల్లో చూడవచ్చు. విద్యాసంస్థల్లో కూడా ఇటువంటి మాయరోగం చాలా మందిలో గమనించవచ్చు. చదువుకుంటున్న / గతంలో చదివిన ఆడపిల్లల్ని ఎవరినైనా కదిపి చూడండి. ఖచ్చితంగా వాళ్ళ చదువు పూర్తయ్యేలోగా కనీసం ఒకరిద్దరు చిత్తకార్తె శునకాల్ని చూసే ఉంటారు. వీరు పైకి చాలా పెద్దమనుషుల్లా ఉంటారు. అలాగే లోకాన్ని నమ్మిస్తారు. కాని పుస్తకాలు, పెన్నులు ఇచ్చే నెపంతో చేతులు తాకడం, రకరకాల మాటలతో మనసును గాయపరచడం, రకరకాల కారణాలతో ఒళ్ళంతా తడమటం, బల్లమీద వంగి ఏదైనా రాస్తుంటే, వెనక నుంచి ‘ఏదైనా’ కనబడుతుందని తొంగి చూడడం వంటివి ప్రతి అడపిల్ల జీవితంలో ఒకసారైనా జరిగుంటాయి. ఇవి గాక సిటీ బస్సుల్లోను, జనం ఎక్కువగా ఉన్నపుడు రైళ్లలోను ఎక్కితే ఇక ఆ చిట్టితల్లికి నరకం చూపించేందుకు పదుల సంఖ్యలో మానవ మృగాలు సిద్దంగా ఉంటారు. పనిచేసే చోట్ల, కార్యాలయాల్లో కూడా ఈ వికృత చేష్టలు ప్రతి క్షణం కనబడుతూనే ఉంటాయి.

అమ్మాయిలు చేసుకున్న పాపమేమిటో తెలియదు గాని, పేపర్లలో, మ్యాగజైన్లలో, టి.వి.ల్లో, వాల్‌పోస్టర్లలో, హోర్డింగుల్లో, సినిమాల్లో ఇలా ఎక్కడ చూసినా ఆడపిల్లలు సగం సగం బట్టలేసుకుని అవి కొనండి, ఇవి తినండి, ఇది చూడండి, అది వినండి అంటూ చిత్ర విచిత్ర విన్యాసాలతో బొమ్మలుంటాయి. అదేం చిత్రమో అర్థం కాదు. అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి వారి ఫోటో వేసి పబ్లిసిటీ చేయడంలో తప్పులేదు. కాని, అలా సగం సగం బట్టలు వేసి, వారి అభిమానాన్ని అలా నడి బజార్లో నిలబెట్టాల్సిన అవసరం ఉందంటారా? సినిమాల్లో పాటలు చూడండి. మంచు ప్రాంతాల్లో పాటలుంటాయి. చుట్టూ ఎటు చూసినా మంచు కురుస్తూంటూంది. హీరోకేమో పైనుంచి కింద దాకా సూటు, బూటు, కళ్ళకి జోడు. మరి హీరోయిన్‌ సంగతి... పాపం ఆ అమ్మాయి మాత్రం అంత చలిలో కూడా జానా బెత్తెడు బట్టలేసుకుని గంతులేస్తుంది. లేదా వర్షం పాటలో బట్టలన్నీ తడిసిపోయేలా డ్యాన్స్‌ చేస్తుంది. ఎంత డబ్బు తీసుకుంటే మాత్రం... ఆ అమ్మాయికి అభిమానం ఉండదా... మనకు మల్లే సిగ్గు వేయదా అని ఎవరైనా ఆలోచిస్తారా? ఈలలు, కేకలు, థియేటర్‌ దద్దరిల్లిపోతుంది. అందులో మహిళా ప్రేక్షకులు కూడా ఉండొచ్చు. చెప్పలేం.

ఇవన్నీ చదువులేని వారో, మంచి చెడు తెలియని వారో చేస్తున్నారంటే వారిని మార్చడానికి ప్రయత్నించవచ్చు. కాని, చదువుకున్న సంస్కార హీనుల్లో కూడా ఈ నీచత్వం బయటపడుతుంది. అదీ ఎక్కువ మోతాదుల్లో. ఆన్‌లైన్లో చాటింగ్‌ చేసేపుడు గమనించండి. ఎదురుగా ఆడపిల్ల ప్రొఫైల్‌ కనబడగానే స్నేహం పేరు చెప్పి వెంటనే లైన్‌ కలపడం, తరువాత అసభ్యకర పదాలతో వారిని ఏడిపిస్తూ ఆనందించడం. ఈ మద్యన ఒక సర్వేలో తేలిందేమిటంటే... ఆన్‌లైన్‌లో చాట్‌ చేసేటపుడు తమకు పరిచయం లేని ఆడపిల్లలు చాటింగ్‌ మొదలుపెడితే ఒక నిముషంలో లోపలే వారిని అసభ్యకర మాటలతో రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తారట అబ్బాయిలు. ఇదంతా ఒక ఎత్తు. ఈ మధ్య వచ్చిన సెల్‌ఫోన్‌ కెమెరాలు, పెన్‌ కెమెరాలతో అమ్మాయిలకి ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఏ షాపింగ్‌ మాల్‌లో, ఏ హోటల్‌లో, ఏ బాత్‌రూమ్‌లో కెమెరాలు ఉంటాయో, ఎక్కడ తమ వ్యక్తిగత జీవితం నెట్‌ పాలవుతుందోనని ప్రతీ క్షణం అమ్మాయిలు నరక యాతన పడుతున్నారు.

అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆడపిల్లలంటే వారు ప్రాణం లేని బొమ్మలు కారు. ఏడిపించుకు తినడానికి, బ్లేడ్‌పెట్టి కోయడానికి దేవుడిచ్చిన ప్రాణులు కాదు అమ్మాయిలంటే.. వారికీ ఒక మనసుంటుంది. మనకు మల్లే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. కాని ఖచ్చితంగా అమ్మాయిలు మగవారంత నీచంగా వారు ఆలోచించరు. మగవారికున్న ఫాంటసీలు ఉండవు. అది మాత్రం నిజం. మనకున్న బరితెగించే తత్వం వారి కుండదు. ఆడపిల్లలు సున్నిత మనస్కులు. నిజం చెప్పాలంటే ఆడపిల్లల్ని పువ్వులతో పోల్చవచ్చు. ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘పుష్ప విలాప కావ్యం’లో చెప్పినట్లు పువ్వులు మొక్కకి ఉన్నంత సేపు ఎంతో అందంగా, ఆనందంగా ఉంటాయి. పువ్వుల్ని చూసి ఆనందించాలే తప్ప, వాటిని కోసి, నునులేత రేకల్ని తెంపేసి, వాటిని నలిపి వాసన చూడాలనే ఆలోచన సరైనది కాదు. అమ్మాయిలకి ఇవ్వాల్సిన గౌరవం  ఇవ్వకపోయినా పర్వాలేదు గాని వారిని అగౌరపరచకుండా ఉంటే చాలు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించనక్కర్లేదు. మన సపోర్ట్‌ వారికి అక్కర్లేదు. కనీసం వారి దారికి అడ్డం రాకుండా ఉంటే చాలు. వారే తమ దారిని తామే వేసుకోగలరు. భువన శిఖరాలను అందుకోగలరు.

Tuesday, September 14, 2010

మనిషి... ప్రకృతి... వ్యాపారం

మనిషికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ మాటకొస్తే, మనిషితోబాటు ప్రతీ జీవి ప్రకృతి ఒడిలోనే పుడుతుంది, పెరుగుతుంది... చివరికి నశిస్తుంది. ప్రాణిని అడుగడుగునా కాపాడుతూ కంటికి రెప్పలా చూసుకునేది ప్రకృతి మాత్రమే. అందుకే మన పూర్వీకులు ప్రకృతిని ఆరాధించి,  మాతృ స్తానాన్ని కల్పించారు. ప్రకృతిని తల్లిలా భావిస్తే, అది మనల్ని బిడ్డల్లాగా సాకుతుంది, మన అవసరాలని తీరుస్తుంది.

కాని, ఇటీవలి కాలంలో ప్రకృతిని వ్యాపార ధృక్పధంతో నాశనం చెయ్యడం ఎక్కువయిపోయింది. మనిషి తరతరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా తన అవసరాల కోసం ప్రకృతిని కొల్లగొడుతూనే వున్నాడు. ప్రకృతి సహిస్తూనే ఉంది. కాని ఇటీవలి కాలంలో ప్రకృతిని వ్యాపారం పేరుచెప్పి కొల్లగొట్టడం ఎక్కువయింది. 18వ శతాబ్దిలో పారిశ్రామిక విప్లవం మొదలయినప్పటి నుండి ఈ ప్రకృతి వినాశనం పెద్ద ఎత్తున జరుగుతుంది. మన అవసరాల కోసం ప్రకృతిని వాడుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కాని అవసరం వున్నా లేకపోయినా అదేపనిగా ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఇదివరకు బజారుకి వెళ్ళేటప్పుడు చేతిలో తప్పనిసరిగా ఒక చేతిసంచి వుండేది. కాని ఇప్పుడో... చేతులూపుకుంటూ మార్కెట్‌కి వెళ్ళి కావలసినవి అన్నీ కొనుక్కుని, దుకాణదారుడిచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ చేతపుచ్చుకుని రావడం అలవాటు చేసుకున్నాము. దీనివలన ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయి, పర్యావరణపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం ఒక్కసారి సరుకు తెచ్చుకుని ఆ ప్లాస్టిక్ సంచిని బయట పడెయ్యడం వలన అవి భూమిలో త్వరగా కరగక, డ్రైనేజీలకి అడ్డుపడడం వల్ల, అవి భూమిలో వున్నచోట చెట్లు పెరగక అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మనం తిని పారేసే చిరుతిండి రేపర్ దగ్గర నుండి, ఒక సారి వాడి పారేసే థంసప్ సీసా దగ్గర నుండి, షాంపూ ప్యాకెట్ కవర్, ప్లాస్టిక్ బొమ్మలు, ఇలా ప్రతీదీ ప్రకృతి మీద భారాన్ని పెంచేదే. ఒకే సారి ఎక్కువగా కొనుక్కుని వాడుకునే రోజులు పోయి ఇప్పుడు ఇన్నీ చిన్న చిన్న పరిమాణాల్లో వాడుకోవడాబ్నికి వీలుగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వుదాహరణకి ఇదివరకు షాంపూ కొనాలంటే ఒకేసారి  ఒక పెద్ద బాటిల్ కొనేవాళ్ళం. కాని ఇప్పుడు మాత్రం అన్నీ రూపాయి ప్యాకెట్లే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఒక రూపాయి ప్యాకెట్ కొనుక్కుని అప్పటి అవసరం తీరిన తరువాత ఆ ఖాళీ సంచి బయట పడెయ్యడమే. బిస్కట్లు, చాక్లెట్లు, ఆట బొమ్మలు, చిరుతిళ్ళు ఇలా ప్రతీదీ ప్లాస్టిక్ మయం అయిపోయాయి. అందరూ యధాలాపంగా వీటిని వాడి పారేసే వారే గాని దీనివల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుంది, అసలు ఇంత ప్లాస్టిక్ వుత్పత్తి చెయ్యాలంటే ఎంత మేరకు గనుల్ని తవ్వాల్సి వస్తుంది, ఎన్ని భూగర్భ జలవనరులు కలుషితం అయిపోతున్నాయి, వీటిని వాడి పారేసిన తరువాత ఎక్కడికి వెళుతున్నాయి, మరలా వీటివల్ల ఎంత నష్టం వాటిల్లుతుంది అని ఆలోచించేవాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే. పారిశ్రామికీకరణ వెర్రి తలలు వేస్తుంది అనడానికి ఇది ఒక వుదాహరణ మాత్రమే. భూమి మీద మనిషి పుట్టిన ఇన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఇంతటి వినాశనాన్ని ప్రకృతి ఎప్పుడూ ఎరగదు. అన్నిటికన్నా బాధాకరమయిన విషయం ఏమిటంటే ఇవన్నీ మనం వ్యాపారం అనే ముసుగులో చేస్తున్నాము. పారిశ్రామికీకరణ అంటే అదేదో గొప్ప అని తలచి మనమున్న చెట్టుని మనమే నరుక్కుంటున్నాము.

చిన్నప్పుడు చందమామ లో ఒక కధ చదివాను. అదిప్పటికీ గుర్తు. ఒక వూళ్ళో ఇద్దరు స్నేహితులుంటారు. ఇద్దరికీ ఏదయినా వ్యాపారం చెయ్యాలని బుద్ది పుడుతుంది. ఒక రోజు వారి భార్యలు చెరికో ముంతలో మజ్జిగ కలిపి వారికి ఇచ్చి పట్నంలో జరిగే సంతలో అమ్మి డబ్బు సంపాదించమని పంపిస్తారు. వారిద్దరూ పట్నానికి నడిచి వెళుటూండగా వారిలో ఒకరికి దాహం వేస్తుంది. వాడు తన స్నేహితుడితో "ఒరేయ్, నాకు చాలా దాహంగా వుంది. నేను నా మజ్జిగ తాగలేను కదా... మనం వ్యాపారం కోసం వెళుతున్నాం కాబట్టి నాతోనే బోణి చెయ్యి. ఇంద, ఈ పావలా తీసుకుని నాకు కొంచెం మజ్జిగ పొయ్యి" అని అడిగాడట. ఆ స్నేహితుడు ఆ డబ్బుని తీసుకుని మజ్జిగ పోసాడట. కాస్సేపటికి రెండో స్నేహితుడికి దాహం వేసిందట.  వాడు మొదటి స్నేహితుడికి తనదగ్గరున్నా పావలా ఇచ్చి దాహం తీర్చుకున్నాడట. కొంతసేపటికి మళ్ళీ మొదటి స్నేహితుడికి దాహంవేసి పావలా ఇచ్చి దాహం తీర్చుకున్నాడట. ఇలా పట్నం చేరే లోపుగా ఇద్దరికీ చాలాసార్లు దాహం వేయ్యడం ఒకరికొకరు పావలా ఇచ్చి మజ్జిగ తాగడం జరిగింది. ఒక పావలాయే ఇద్దరి మధ్యా చేతులు మారింది. కాని ఇద్దరి దగ్గరా మజ్జిగ ఖాళి అయిపోయింది. ఇద్దరూ వ్యాపారం చేసారు. కాని డబ్బులు కనబడలేదు. మజ్జిగా కనబడలేదు. ఈ కధని సరదా కోసం రాసినా, ఇప్పుడు ప్రకృతి వనరుల్ని వ్యాపారం కోసం నాశనం చేస్తున్న తీరు చూస్తే ఈ కధే గుర్తుకు వస్తుంది. అందరమూ వ్యాపారమే చేస్తున్నాము. వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలు కోట్ల కొద్దీ డబ్బుని టర్నోవర్ చేస్తున్నాయి. డబ్బు చేతులు మారుతోంది. అవసరం లేని చెత్తతో మనం వుండే ఈ భూగోళాన్ని నింపేస్తున్నాము. ప్రకృతి వనరులన్నీ హరించుకు పోతున్నాయి. కొన్నాళ్ళకి ఈ కధలోలాగా మనదగ్గర ఈ మట్టి కుండలు, రంగు కాగితాలు (కరెన్సీ నోట్లు) మిగులుతాయి. తరువాతి తరాల వారికి అందించడానికి ఏమీ మిగలదు. కనీసం మనం బ్రతకడానికి తిండిగాని, దాహం తీర్చుకోవడానికి గుక్కెడు మంచి నీళ్ళు మిగలకుండా పోతాయి.

నిజమయిన అభివృద్ది, వ్యాపారం అంటే ప్రకృతిని నాశనం చెయ్యడం కాదు, దాన్ని పరిరక్షించడం. మనం ఇప్పుడు ఎంత విలాసవంతంగా విచక్షణ రహితంగా బ్రతుకుతున్నాం అనిగాక, ఈ ప్రకృతిని మన భావి తరాలవారికి ఎంత భద్రం అందించగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. మనకి తిండి పెట్టే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, శ్రమించి పనిచేసే రైతన్నకి విలువలేకుండా చేసి, అందరూ ఇంజినీర్లు కావాలని గంగ వెర్రులెత్తడం చూస్తూంటే చాలా బాధేస్తుంది. అందరూ పల్లకీ ఎక్కేవారయితే, దాన్ని మోసే బోయీలెవరన్నట్లుగా అందరూ ఇంజినీర్లయిపోయి కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఇంక మనకి తిండి పెట్టేదెవరంట? చివరికీ అందరూ తిండికి లేక చావాల్సి వస్తుంది. ప్రాచీన గ్రీకు దేశం లో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే పరిస్తితి వుత్పన్నమయిందంట. అక్కడ చదువుకున్నవారికి, మేధావులకి సమాజంలో గొప్ప స్తానం లభించేదట. వేదికలెక్కి వుపన్యాసాలిచ్చేవారిని అందరూ గౌరవించేవారట. క్రమేణా ఆ దేశంలో అందరూ మేధావులయిపోయారు. అందరూ వుపన్యాసాలిచ్చేవాళ్ళే. పనిచేసేవాళ్ళూ, పంట పండించే వాళ్ళూ కనబడలేదు. చివరికి అందరూ ఆకలతో అలమటించి అంతటి గొప్ప గ్రీకు నాగరికత కూడా నామరూపాల్లేకుండా పోయిందట. ఇది ఎంతవరకూ నిజమయినప్పటికీ ప్రస్తుతమున్న సమాజ పరిస్తితిని, ఆర్ధిక వ్యవస్తని చూస్తూంటే ఆ రోజు మనకి ఎంతో దూరంలో లేదనిపిస్తుంది.

Sunday, August 29, 2010

స్వాములు, బాబాలు, మంత్రాలు, మహత్తులు...

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది స్వామీజీలు, బాబాలు, బహుశా భారత దేశంలోనే వున్నారనుకుంటాను. నిజమయిన ఆధ్యాత్మిక విద్యనందించె గురువుల సంగతి అటుంచితే, నకిలీ బాబాలు, సాధువులు ఈ దేశంలో అడుగడుగునా కనిపిస్తారు. అమాయక ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోని, వాళ్ళకి నాలుగు మాయ మాటలు చెప్పి వారి విలువయిన కాలన్ని ధనాన్ని కొల్లగొడుతూంటారు. పైగా ఇదేదో చీకటిమాటున సాగిపోయే వ్యవహారంగా కాక, నిర్లజ్జగా పట్టపగలే దోపిడీ చేసేస్తుంటారు. పత్రికల్లో, పేపర్లలో ప్రకటనలిచ్చి, పుస్తకాలు ప్రింట్ చేసి మరీ అమాయక ప్రజల్ని తమవద్దకి ఆకర్షించుకుంటారు.గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్లుగా ప్రజలు కూడా అటువంటివారిని నమ్మేస్తూ వుంటారు. మండుటెండలో నిజంగా కష్టపడేవారికి ఒక పదిరూపాయిలు ఇవ్వడానికి వెనకా ముందూ ఆలోచించే బడా బాబులు కూడా స్వామీజీ గారి దగ్గరికో, బాబా గారి దగ్గరకో వెళ్ళేసరికి నిలువుదోపిడీ సమర్పించుకుంటారు.

సర్వసంగ పరిత్యాగులుగా చెప్పుకునే ఇటువంటి స్వాములు ఉండే ""ఆశ్రమాలు"" చూస్తే ఎవరికయినా కళ్ళు తిరగడం ఖాయం. ఇంద్రభవనాల్ని తలపించే భవనాలు, ఖరీదయిన కార్లు, సెంట్రల్ ఎయిర్ కండిషండ్ రూములు, ఇవిగాక దాస దాసీజనం.... అబ్బో.... ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్ర వైభోగాల్ని గుర్తుకుతెస్తాయి. ఈ బాబాలకి, స్వామీజీల దర్శనం దొరకాలంటే సామాన్యులకు సాధయమయ్యే పని కాదు. వారితో మాట్లాడాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న విషయం. వేలు, లక్షలు గుమ్మరిస్తే గాని "ఏకాంత సేవకి" ఇంటర్యూలకి అనుమతి లభించదు. మన వూరు వచ్చినపుడు వారికి పాదపూజ చెయ్యాలంటే ఒక రేటు, మంత్రోపదేశం పొందాలంటే ఒక రేటు, వారి "లీలలు" చూసి తరించాలంటే ఒక రేటు, ఇలా మెనూ కార్డ్ వుంటుంది. ఎవరయినా మన కోసం వచ్చినపుడు ఒక పది నిముషాలు ఆలస్యం అయితే చాలు ఎదుటి మనిషి ఒక్క నిముషం ఆలోచించకుండా మనల్ని మనసులో తిట్టుకుంటాడు. లేదా వీడికి పొగరెక్కువయిందని పదిమందికీ ప్రచారం చేస్తాడు. అదే స్వామీజీ గారి దగ్గరికెళ్ళి ఎంతసేపయినా వెయిట్ చేస్తారు. అది ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా లెక్కేమీ లేదు. ఎంత ఎక్కువసేపు వెయిట్ చెయించగలితే అంత పెద్ద స్వామీజీ అయిన్నట్టు లెక్కన్న మాట.

ఈ నకిలీ గురువులు ఏవో మాయ మాటలు చెప్పి జనాల్ని దోచుకుంటే పర్వాలేదు. ఏకంగా దేవుడి అవతారంగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనే భగవంతుడి అవతారం అని నిస్సిగ్గుగా, ఎటువంటి జంకూ లేకుండా బరితెగిస్తున్నారు. అమాయక జనం కూడా అలాంటివారిని ఆదరిస్తున్నారు. ఎవరో అన్నీ వదిలేసిన వారు అలా చెపితే కొంత అర్ధం చేసుకోవచ్చు. కాని పెళ్ళయి, పిల్లలున్నవాళ్ళు కూడా దేవుడి అవతారం అని చెప్పుకుంటే ఏమనలి? తననేమో అయ్యగారిగాను, తన భార్యనేమో అమ్మవారిగానూ ప్రచారం చేసుకుంటున్నారు. వారి మీద ఎన్ని ఆరోపణలొచ్చినా, ఎంత మంది జీవితలు నాశనం అయిపోయినా వారసలు మనలాంటి మామూలు మనుషులని తెలిసినా, మత్తు మందులు వాడిస్తున్నారని పబ్లిక్‌గా చెప్పినా ప్రభుత్వలు కూడ ఏమీ చెయ్యలేని పరిస్తితి. ఇందాకే "భక్తి టి.వి"లో చూసాను. ఎవరో ఒక స్వామీజీకి, ఆయన భార్యకి వివాహ మహోత్సవం చేస్తున్నారు. నిజంగా మనుషులకి అనుకునేరు. అక్కడే తప్పులో కాలేసారు. అవి వారి విగ్రహాలు. మనం రాములవారికి, సీతమ్మవారికి భద్రాచలంలో పెళ్ళి చేస్తాం చూసారా... అలాగన్నమాట. చూడగానే ఒళ్ళు మండిపోయింది. మరీ ఇంత దారుణమా... శుభ్రంగా బతివున్నవారికి ఫోటోలకి దండెయ్యడమేమిటి? వారి విగ్రహాలకి పెళ్ళి చెయ్యడమేమీటి, మరో బాబా గారి చెప్పులు పట్టుకొచ్చి, కుర్చీలో పెట్టి, వుయ్యాలలో ఫోటో పెట్టి పూజలు చెయ్యడమేమిటి? ఈ దారుణాలకి అంతే లేదా? ఇవన్నీ చూస్తుంటే మనం వున్నది కంప్యూటర్ యుగంలోనా, లేక పురాతన యుగంలోనా అన్న సందేహం వస్తుంది.

ఇవన్నీ ఒకెత్తయితే, ఈ మోసగాళ్ళు ప్రచారం చేసుకునే మహిమలు, మహత్యాలు ఒకెత్తు. ఏమీ లేని దానికి ఎలా బయటికి వస్తాయో తెలీదు. పుస్తకాల రూపంలోను, నోటి మాటల రూపంలోనూ ప్రచారమయిపోతూ వుంటాయి. ఫలానా స్వామీజీ సూర్యుడిని పట్టుకుని నోట్లో పెట్టుకున్నారంటా అందుకే గ్రహణం వచ్చిందంట. లేకపోతే చంద్రుడిలో వుండే బొమ్మ మన బాబాగారిదంట... అంటూ రకరకాలుగా సాగుతుంది ప్రచారం.

ఈ జాడ్యం ఒక్క హిందూ మతానికే పరిమితం కాలేదు. మిగతా మతాల్లో కూడా జనాల్ని మోసం చెయ్యడం యధేచ్చగా కొనసాగుతుంది. మీ దేవుడిని వదిలేసి మా మతంలోకి మారండి.. మీకు పూర్తి స్వస్తత కలిగిస్తాం.. మీకు పట్టిన దెయ్యాల్ని (?) వదిలిస్తాం. మీకొచ్చిన జబ్బుల్ని పోగొడతాం... మీ పాపాలన్నీ గాలికెగిరిపోయి, మీరు మళ్ళీ ఎన్ని పాపాలయినా చెయ్యొచ్చు అంటూ హడావుడి చేస్తారు. నిజంగా వీళ్ళు చెప్పిన మాటలు విన్నవాళ్ళకి కష్టాలు గట్టెక్కుతాయో లెదో గాని, సో కాల్డ్ భక్తులు సమర్పించుకునే డబ్బులతో "దైవ సేవకులు" మాత్రం చక్కగా ఏ.సీ. కార్లలో, ఖరీదయిన భవనాల్లో ఖుషీ చేస్తూంటారు.

వీటన్నిటినీ నమ్మే వారు ఎలా నమ్ముతారో అర్ధం కావడం లేదు. ఎదురుగా వున్నది మనలాంటి మనిషే కదా. అతనికీ మనకి మల్లే రక్త మాంసాలు వుంటాయి. మనలాగే దాహం వేస్తుంది. ఆకలి వేస్తుంది. ఒకప్పుడు పుట్టాడు. అందరిలాగే ఒకనాటికి మరణిస్తాడు... అంతా మనకి తెలుసు... అంతా నిజమే. కాని ఎందుకు నమ్ముతున్నారు. నమ్మడం అటుంచితే పిచ్చిగా ఆరాధిస్తున్నారు. ఎదుటి మనిషి మనకేదన్నా సహాయం చేస్తే "మీరు దేవుడిలాంటి వారండి బాబూ" అని గౌరవిస్తాము. అంతే గాని రోజూ పువ్వులు పెట్టి పూజించంకదా.. ఇదీ అలాంటిదే. మనకన్నా కొన్ని మంచి విషయాలు తెలిసినవారిని, గురుస్తానంలో వున్నవారిని గౌరవించవచ్చు. వారిని అభిమానించవచ్చు. కాని అదే పనిగా పిచ్చిలో పడకూడదు. మన గౌరవాన్ని, అభిమానాన్ని వాళ్ళ కాళ్ళదగ్గర పెట్టి మనం జీవచ్చవంగా బ్రతక్కూడదు. నిజమయిన జ్ఞానం కావాలంటే వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, బైబిలుంది, ఖురాన్ ఉంది. వాటిని మనస్ఫూర్తిగా చదవండి.. చదివిన దాన్ని ఆచరణలో పెట్టండి... తోటి మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించండి. జ్ఞానం అదే వస్తుంది... మోక్షం అదే వస్తుంది...

Thursday, July 29, 2010

కొంచెం వెరైటీగా ఉండాలని ఉందా? ఇవి ట్రై చెయ్యండి

ఎప్పుడూ ఒకే రకమయిన లైఫ్‌లో బ్రతికి, అలిసిపోయి, విసిగిపోయిన వారికి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇది రాస్తున్నాను..

1. మనుషులంతా ప్రాధమికంగా జంతువులే కాబట్టి ఏమి చేసినా ఎలా చేసినా తప్పులేదని ఈ మధ్యన ఒకాయన సెలవిచ్చారు. కాబట్టి, ఒక పనిచేస్తే సరి.. జంతువులన్నీ నాలుగు కాళ్ళమీద నడుస్తున్నాయి కాబట్టి, మనిషి కూడా ఒక రకమయిన జంతువే కాబట్టి, మనుషులు కూడా నాలుగు కాళ్ళ మీద నడిస్తే సరి. ఒక్క సారి ఊహించుకోండి.... అందరూ నాలుగు కాళ్ళ మీద నడిస్తే ఎలా వుంటుందో... ఇదేమిటి పైనున్న వాటిని చేతులంటారనికదా మీ అనుమానం.... లేదండి.. పూర్వం ఒకప్పుడు అవి కాళ్ళే... తరువాత మన సౌలభ్యం కోసం చేతులని పేరు పెట్టుకున్నాం... అంతే....

2. ఎప్పుడూ చేత్తోనే కంప్యూటర్ కీ బోర్డ్ మీద టైప్ చేస్తారెందుకు? అప్పుడప్పుడు వెరైటీగా కాలితో కూడా ప్రాక్టిస్ చెయ్యొచ్చుకదా.. కాలికి కూడా వేళ్ళు వున్నాయి కదా...

3. బైక్‌ని ఎప్పుడూ రోడ్ మీద మాత్రమే ఎందుకు నడపాలి? ఫుట్‌పాత్ మీద ఎక్కించి నడపొచ్చు కదా.. అలాగే రోడ్‌కీ ఎడమవైపునే ఎందుకు వెళ్ళాలి? కుడి వైపున వెళితే ఏమవుతుంది? అది ఇదీ కుడా రోడ్డే కదా... ఎవరయినా గుద్దితే వాళ్ళమీద లాజిక్ ప్రయోగిద్దాం. ఏదయినా రోడ్డే కదా... ఎవరు ఎటువైపు వెళితే ఏంటి? నేను వెరైటీ గా ఉంటాను కాబట్టి ఇలా వెళతాను అని చెప్పొచ్చు, ఎదుటి వాడి నోరు మూయించొచ్చు.

4. కూరగాయలు, బియ్యం, మాంసం అన్నీ వండుకు తినడం ఎందుకు దండగ? మనుషులు కూడా జంతువుల్లాంటి వాళ్ళే కాబట్టి వాటినలాగే, పచ్చిగా, పిచ్చిగా తినేస్తే నష్టమేంటంటా? అహ నష్టమేంటంటా అని?

5. పుస్తకాలని ముందు నుంచి వెనకకి చదువడమెందుకు? వెనకవైపు నుంచి ముందుకు చదవచ్చు కదా.. ఎందుకంటే ఏదయినా చదవడమే... అవే పేజీలు, అవే అక్షరాలు... అదే విషయం...  అలా చదివితే అడిగేదెవడంట....

బాబోయ్... ఇప్పటికే చాలా చెప్పేసాను... ఇంక నాకు ఓపిక లేదు.. ఇంకా వెరైటీ ఆలోచనలుంటే మీరు కూడా రాయవచ్చండోయ్... అప్పుడు అందరూ కలిసి మరింత వెరైటీగా వుండొచ్చు కదా... మీరేమంటారు.. ఈ సంస్కృతి, సంప్రదాయాలు, పాత చింతకాయ పచ్చళ్ళు వల్ల ఉపయోగం ఏమిటి? ఇన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులంతా పిచ్చోళ్ళు కాబట్టి, వాళ్ళకి మతిలేదు కాబట్టి ఇలాంటి అర్ధం పర్ధం లేనివన్నీ పెట్టారు. మనం తెలివయినవాళ్ళం కాబట్టి, "ఆధునిక యుగంలో" వున్నాం కాబట్టి... ప్రశ్నించాలి కాబట్టి మనకి దొరికిన ప్రతీదాన్నీ తలా తోకా లేకుండా ఖండించి, వాదించి అవతల పారేద్దాం...

(గమనిక: పైవన్నీ నేనెప్పుడూ ట్రై చెయ్యలేదు... "వెరైటీ", "ఆధునికత" కోరుకునే వారికోసం ఈ పోస్ట్. పైవన్నీ ఎవరయిన ప్రయత్నించి, దానివల్ల ఏమయినా ఇబ్బంది పడితే నాకు సంబంధం లేదు... నన్నడగవద్దని మనవి)

Sunday, July 25, 2010

పిల్లల్ని ప్రేమించాలి గాని, కామించకూడదు

గత రెండు రోజులుగా రామూ గారికి, తాడేపల్లి గారికి జరుగుతున్న మాటల యుద్దాన్ని చూస్తున్నాను. ఇద్దరికీ మద్దతుగా మిగిలిన బ్లాగర్లు ఎగదోస్తున్న వత్తుల్నీ చూస్తున్నాను.ఏదేమయినప్పటికీ ఈ విషయంలో నేను రాము గారిని నూటికి నూరుశాతం సమర్ధిస్తున్నాను. ఆయన అభిప్రాయ పడుతున్నట్టుగా ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే సిద్దాంతమే న్యాయమయినది. ఈ విషయంలో మరో సందేహానికి తావులేదు. బహుభార్యాత్వం, బహు భర్తృత్వ సిద్దాంతాలని తోసి రాజని ఏక పత్ని వ్రతం ఎందుకు అమల్లోకి వచ్చిందో చరిత్ర చదివిన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా Sociology, Anthropology విద్యార్ధులకి బాగా తెలుస్తుంది. ఎవరిని బడితే వారితో శృంగారం జరపడమనేది జంతు సమాజాల్లో చెల్లుబాటవుతుందేమో కాని మానవ సమాజంలో చెల్లుబాటు కాదు.

పిల్లల్కి విద్యాబుద్దులు నేర్పి, వారిని మంచి మార్గంలో పెట్టవలసిన గురువే, బుద్ది లేకుండా, గడ్డి తిని, తాడేపల్లివారి మాటలు పుచ్చుకుని పిల్లలతో సరస సల్లాపాల్లోకి దింపితే, అందరూ కలిసి తంతారు. అది గ్రహించాలి. అదీ కాకపోయినా, తమ వద్దకు విద్యాబుద్దులు నేర్వడానికి వచ్చిన విద్యార్ధినుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే, తమ వద్ద పనిచెయ్యడానికి వచ్చిన ఆడవాళ్ళని లొంగదీసుకోవాలని చూస్తే మక్కెలిరగదంతారు. (కొంచెం అంపార్లమెంటరీ భాష వాడుతున్నాను. క్షమించాలి. తప్పదు మరి). పిల్లల్ని సొంత కూతురిగా భావించగలిగిన వాడే వారిని సరయిన దారిలో పెట్టగలరు. అంతే గాని కామ వికారాల్ని కలిగివున్న వాడు వాళ్ళకేమి విద్యాబుద్దులు నేర్పించగలుగుతాడు? అది చదువయినా కానివ్వండి... ఆటలయినా కానివ్వండి... కంప్యూటర్స్ కానివ్వండి.. మరింకేదయినా కానివ్వండి..

పెళ్ళనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చలేకపోతే, మరొకరిని చూసుకుంటాను అంటే, అసలా బాధ్యతలోకే ప్రవేశించకూడదు. మరో ఆడపిల్ల జీవితాన్ని పాడు చెయ్యకూడదు. రాము గారు చెప్పినట్లు అచ్చోసిన ఆంబోతుగా వుంటే మేలు. అప్పుడిక ఎవరికీ ఎటువంటి అడ్డంకులు వుండవు. ఎవరికీ అభ్యంతరాలుండవు. చివరికి ఎయిడ్స్ వస్తే పట్టించుకోవడానికి దిక్కు లేక దికుమాలిన చావు చస్తారు. ఎందుకంటే ఇన్ని రోగాలొచ్చిన తరువాత పట్టించుకోవడానికి ఎవ్వరూ వుండరు కనుక. మనం ఒకరి పట్ల బాధ్యతగా వుంటే, మరొకరు మన పట్ల అదే బాధ్యత వహిస్తారు. ఎవ్వరితో నాకేమిపని అనుకుంటే ఎవ్వరికీ కాకుండా పోతారు.

సమాజం అనేది ఒక వ్యవస్త. ఇది అందరికీ ఆమోదయోగ్యమయిన సుత్రాలతో పనిచేస్తుంది. సమాజానికి అందులో ప్రతి వ్యక్తీ సమానమే. ఏ ఒక్కరూ సమాజ రీతికి వ్యతిరేకంగా నడవజాలరు. ఒక వేళ సమాజ సూత్రాలు ఎక్కువ మందికి నచ్చకపోతే, వారిని ఇబ్బందికరంగా వుండి వుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మనగలిగి వుండేవి కావు. కొన్ని వేల సంవత్సరాలుగా మానవ సమాజం ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పుడు మనం చూస్తున్న స్తితికి వచ్చింది. బుద్దిగా తలొంచుకు పోవడానికి, రాము గారిలాగా రాముడు మంచి బాలుడే కానక్కర్లేదు. కాస్త ఇంగిత జ్ఞానం వున్నవాడు, సంస్కారం వున్నవారెవ్వయినా చాలు. సమాజాన్ని మనమేమీ వుద్దరించనక్కర్లేదు. వున్నదాన్ని మన కలుషిత ఆలోచనలతో, అర్ధంలేని వితండ వాదంతో పాడు చెయ్యకుంటే చాలు. 

Saturday, July 24, 2010

ప్రపంచంలో తెలుగు వాడంత గొప్ప వాడు లేడు..

నిజమేనండి... మీరు నమ్మి తీరాల్సిందే. ఇప్పటి వరకు తెలుగు వారికి వున్న గొప్పదనాలకి తోడు ఎవరిచేతనయినా తన్నించుకోవాలన్నా, కుమ్మించుకోవాలన్నా, మెడ పెట్టి గెంటించుకోవాలన్నా తెలుగు వారే అందరికీ ఆదర్శం. తెలుగు వారి గొప్పదనం గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుంది. ఒక సారి దూరదర్శన్ లో అనుకుంటా, చాలాకాలం క్రితం సంగతి.. జంధ్యాల గారు ముచ్చటిస్తూ... తెలుగువారు ఎప్పుడూ కూడా తాము చెప్పిందే రైటు అంటారట. అది నిజంకాకపోయినా నిజమయ్యేంత వరకు వాదిస్తారట. ఎవరికి వారు తామే రైటు అనుకుంటారట కూడా. అందుకే మన తెలుగు భాషలో ప్రతీ అక్షరానికి నెత్తిమీద "రైట్" మార్క్ వుంటుందట. మీరే చూడండి... క, గ, ర, మ, న ప్రతీ అక్షరానికీ నెత్తి మీద ఒక "రైట్" మార్క్ వుంటుంది.

తెలుగువాడికి వున్న మరో అలవాటు.. ఎలాంటి పరిస్తితిలో అయినా ఇమిడి పోతాడట.. అంటే "అందితే జుట్టు, అందక పోతే: కాళ్ళు" అన్న మాట. అందుకే మన తెలుగు అక్షరాల్లో మరే భాషలోనూ లేని విధంగా ఒక అక్షరం మీద ఒకటి ఎక్కి కూర్చుంటాయి. ఒక పెద్ద అక్షరం కింద మరో చిన్న అక్షరం దూరిపోతుంది. అంటే అవకాశం  దొరికితే ఒకరి మీద పెత్తనం చేస్తాం... అది కుదరక పోతే ఒకరి కాళ్ళ దగ్గర పడి వుండడానికి కూడా వెనకాడమన్న మాట.... అంతా ఎందుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి డిల్లీ లో పెద్దల దగ్గర వీర విధేయులుగ వున్నది తెలుగువారే అన్నది అందరికీ తెలిసిందే. అందరికన్నా ఎక్కువ ఎం.పీ.లని పపంది మనమే అయినా గాని రాష్ట్రానికి ఒక్క మంచి ప్రాజెక్టునీ దక్కించుకోలేము. మన మాట నెగ్గించుకోలేము. ఆ భయం ఎందుకో అర్ధం కాదు. అది మంచితనమో, చేతగానితనమో మనకి అర్ధం కాదు.

తెలుగువారికున్న మరో లక్షణం... "ఆత్మ నింద, పర స్తుతి" అట. అంటే మనల్ని మనం తిట్టు కోవడంలో, మరొకళ్ళని పొగడడంలోనూ ఎప్పుడూ ముందుంటాం. అలాగే ఎవరయిన మనల్ని గురించి తిడుతూ ఉంటే అదేమిటని అడగం. బదులుగా ఆహా మహ బాగా తిడుతున్నాడురా బాబు అని మహదానందంగా వింటాం. అదే తెలుగు వాడికున్న గొప్పదనం

"ఆంధ్రులు ఆరంభ శూరులు " అన్న సామెత ఎలాగో వుండనే వుంది. ఏ పనయినా మొదలెట్టేప్పుడు వుండే ఉత్సాహం ఆ పని పూర్తి చేసేప్పుడు వుండదు. ఎప్పుడు ఏ పనిని మొదలుపెడతామో ఎందుకు ఆ పని మధ్యలో ఆపేసి మరో పనిలోకి వెళ్ళిపోతామో మనకే తెలీదు. ఒక ముఖ్య మంత్రి వుండగా నీటి ప్రాజెక్టులు, రకరకాల పధకాలు మొదలెట్టేస్తాము. మరో ముఖ్యమంత్రి వచ్చేసరికి కాళ్ళు లాగి మూల పెట్టేస్తారు.

ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఎప్పుడూ తెలుగులో పలకరించుకోరట. చాలాసార్లు అది నిజమే అనిపించింది నా అనుభవంలో. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే పలకరించుకుంటారు. ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే హిందీ లోనే పలకరించుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం "Hai, How are you? What are you doing" అని పరాయి భాషలో కులుకు ఒకలబోస్తారు. ఇంటికెవరయినా చుట్టాలొస్తే, మా పాపని పిలిచి "What's your name?" అని అడుగుతారు. నాకు వళ్ళు మండి పోతుంది. కాని తప్పదు కదా.. వచ్చింది Relatives ఆయే.

మరో ముఖ్య విషయం ఏమిటంటే భారతీయ భాషలన్నింటిలోనూ ఎక్కువ పరాయి భాషా పదాలు దొర్లే భాష తెలుగు మాత్రమే. నేను విన్నది నిజమో కాదో తెలుసుకోవడానికి మా సిటీ కేబుల్ లో రోజుకొక చానల్ చొప్పున అన్ని భాషల చానల్స్ చూసాను. ఎన్ని ఇంగ్లీష్ పదాలు దొర్లుతాయో అని. ఆ గంట లోనూ మొత్తం మీద 4 లేక 5 పదాలు మాత్రమే కనిపించాయి... కాదు.. కాదు వినిపించాయి. అదే తెలుగులో చూడండి... తెలుగు ఎక్కడుందో భూతద్దంతో వెతుక్కోవాలి. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లు వుంటుంది పరిస్తితి.. అదండి సంగతి... ఇలాంటి ఇంకా చాలా వున్నాయి... తరువాతి టపాల్లో ముచ్చటించుకుందాము.... అందాకా....

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతమెంతొ ఘన కీర్తి కలవోడా....

Monday, July 12, 2010

ఫ్రెషర్స్ డే ఫంక్షన్‌లో మా చిట్టితల్లుల సందడులు...

మిగతా ఫోటోలు... పిల్లల ఆటలు.. పాటలు...

జూలై 8, గురువారం మా చిట్టితల్లుల ఆటపాటలతో గమిని ఫంక్షన్ ప్లాజా దద్దరిల్లింది. చక్కటి ఆహ్లాదకరమయిన వాతావరణంలో, రాష్ట్ర జర్నలిష్టుల సంఘం అధ్యక్షులు శ్రీ దూసనపూడి సోమసుందర్ ముఖ్య అతిధిగా హాజరయిన ఈ కార్యక్రమం పూర్తిగా విద్యార్ధినుల ఆధ్వర్యంలోనే జరగడం విశేషం. అంటే యాంకరింగ్, ప్రోగ్రాం సీక్వెన్స్, ఇలా ప్రతీదీ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఈ ఏర్పాటు చేసాము.

మా విద్యార్ధినిలు సనాతన భారతీయ విలువలను అర్ధం చేసుకుంటూనే, అత్యాధునిక టెక్నాలజీతో స్నేహం చేస్తారు. ప్రపంచంలోని ఏ లేటెస్ట్ టెక్నాలజీ గురించయినా చెప్పగల సమర్ధత వారి సొంతం. మా కాలేజ్ లో అత్యాధునిక L.C.D Projectors, Modern Science Labs, Fully Automatic Attendance System, Automatic SMS to Parents, Computerised period & Class maintenance వంటివి మచ్చుకి కొన్ని మాత్రమే.

ఒక మంచి ఆశయంతో, నిజాయితీగా పనిచేస్తే అందరి ఆదరణా లభిస్తుందని మా విషయంలో రుజువయింది. కార్పోరేట్ విద్యా సంస్తల్లో పిల్లలు పడుతున్న ఆవేదనని అర్ధం చేసుకుని, తల్లిదండ్రుల ఆకాంక్షలకి అనుగుణంగా, తాడేపల్లిగూడెం పట్టణంలో సకల సౌకర్యాలతో ప్రారంభించబడిన మా కాలేజీలో ఈ సంవత్సరం ఎవరూ ఊహించని విధంగా చక్కటి అడ్మిషన్లు జరిగాయి. ర్యాంకులు, మార్కులు సాధించడం కోసం పిల్లల్ని బలిపశువుల్ని చేయనవసరం లేకుండా, చక్కటి ప్రశాంత వాతావరణం కల్పించి, వారికి తగిన స్వేచ్చనిచ్చి, బట్టి పద్దతిలో కాకుండా వారికి అర్ధమయ్యే విధంగా విద్యాబోధన చేస్తే వున్నత ఫలితాలు సాధించవచ్చని నిరూపించాము.

మీ అందరి ఆశీస్సులు, సూచనలు, ప్రోత్సాహంతో మరింత ముందుకి వెళ్ళగలమని తెలియజేస్తూ... 
మీ జగదీష్ రెడ్డి, 
సెక్రటరి & కరస్పాండెంట్, శ్రీ వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్.

Monday, July 5, 2010

అసలు మనం మనుషులమేనా?

చిన్న పిల్లలతో అర్ధనగ్నంగా పిచ్చి గంతులు వేయించడం, చూడడానికి ఎబ్బెట్టు కలిగించేలా రకరకాల వింత బట్టలు వేయడం మధ్యన టీ.వీ.ల్లో పెద్ద ఫ్యాషనయిపోయింది. పైగా ఈ పైత్యానికి రియాలిటీ షోలని, ఆట అని పేర్లొకటి. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించి టీ.వీ.ల్లో ప్రసారమయ్యే ఇటువంటి షోల వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి హక్కులని కాలరాసినట్టవుతుందని భావిస్తూ, అటువంతి షోలని నిషేదించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పింది. అయినా, ఇవేమీ తలకెక్కని సదరు షో నిర్వాహకులు, టీ.వీ. సంస్థల వాళ్ళు ఎటువంటి స్పందనా కనబరచక, పైగా చట్టంలో వున్న లొసుగుల్ని ఆసరాగా చేసుకుని, మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని మరీ, నిర్లజ్జగా తమ కార్యక్రమాల్ని కొనసాగించుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రుల మద్దతు కూడా పూర్తిగా వుంది అనే విషయం తెలుస్తూంది.

ఈ నేపధ్యంలో ఈ రియాలిటీ షోల కోసం పిల్లలు ఎంత హింస అనుభవిస్తారో, ఎంతగా నలిగిపోతారో తెలుసుకుంటే కడుపు తరుక్కుపోతుంది, గుండె రగిలిపోతుంది. ఈ షోలకి సిద్దంచేసే పిల్లల్ని రోజుకి  కనీసం 16 నుంచి 20 గంటల పాటు "ప్రాక్టీస్" చేయిస్తారట. ఇక్కడ మనం మాట్లాడుకునేది నిండా పదేళ్ళు కూడా దాటని చిన్న పిల్లల గురించి అని మరచిపోవద్దు. అంత చిన్న పిల్ల చేత అన్నేసి గంటల పాటు ప్రాక్టిస్ చేయిస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారో, ఎంత నరకం అనుభవిస్తారో మనకి ఊహలకి కూడా అందదు. పెద్దవాళ్ళమయిన మనమే రోజుకి ఏదయినా పది పన్నెండు గంటలకి మించి కష్టపడలేము కదా.. అటువంటిది అంత చిన్న పిల్లలు అంత కష్టాన్ని ఎలా భరిస్తారో అందరూ  ఆలోచించాలి.

అసభ్యత ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప షోగా నిర్వాహకులు భావిస్తారేమో తెలియదు. పిల్లలకి వేసే దుస్తులు ఎంత చండాలంగా వుంటాయంటే, పెద్ద వాళ్ళు కూడా వేసుకోవడానికి సిగ్గుపడేలా వుంటాయి. పాటల విషయానికి వస్తే అన్నీ ముదురు పాటలు, వయసుకు మించిన హావ భావాలతో పరమ దరిద్రంగా వుంటాయి. చిన్న పిల్లల్ని చూసినా, వారి మాటలు విన్నా ఎంతటి వెధవకయినా మనసు కరుగుతుంది. మనిషిలో వున్న పసి మనసు తొంగిచూస్తుంది. వారి ముద్దు ముద్దు మాటలు వింటూ పరవశించాలనిపిస్తుంది. ఆ పసితనపు ఒడిలో ఆడుకోవాలనిపిస్తుంది. కాని ఈ రాక్షసులకి వారిలో ఒక బూతు పాటలకి డ్యాన్స్ వేసే "నటీమణి"  కనిపిస్తుంది. సినిమాల్లోని కామాన్ని ప్రకోపింపచేసే వారి భంగిమలు గుర్తొస్తాయి. చిన్నారు చేసే ఆ చిన్ని కుప్పిగంతుల్ని సినిమా వాళ్ళతో పోల్చి ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా తిప్పుకోవాలి అంటూ పనికి మాలిన చెత్త కామెంట్లొకటి. మళ్ళీ వాళ్ళళ్ళొ వాళ్ళకి పోటీ పెట్టి ఎలిమినేషన్ చేస్తామని చెప్పి, వాళ్ళు ఏడుస్తుంటే ముఖాలని క్లోజప్ లో పెట్టి వారి కన్నీటిబొట్టుని కూడా ప్రసారం చేసి,  అందరి జాలిని, సానుభూతిని పొందడం. చూస్తూనే వళ్ళు జలదరిస్తుంది. ద్వందార్ధపు సాహిత్యం వుండే పాటలకి, చండాలంగా వుండే డ్రెస్సులు వేసి చిన్నారుల చేత వేయించే కుప్పిగంతుల్ని సంస్కారం వున్నవారెవరూ డ్యాన్స్  అనరు, పైత్యపు వికారం అంటారు. ఇటువంటి షోలు చూసి ఆనందించే వారిని సైకాలజీలో "పీడోఫీలియన్స్" అంటారు. అంటే చిన్నపిల్లల పట్ల లైంగిక వాంచ కలిగిన మానసిక రోగులన్నమాట.

ఫ్లడ్ లైట్ల వెలుగులో చిన్నారు జీవితాలు ఎలా మసిబారుతున్నాయో, పిచ్చి పిచ్చి చేష్టలకి చిన్నారుల మనసులు ఎంత కలుషితం  అవుతున్నాయో అటు తల్లిదండ్రులకి, టి.వీ. షో నిర్వాహకులకి పట్టడం లేదు. నాకు తెలియక అడుగుతున్నాను... పిల్లలకి పేరు ప్రఖ్యాతులు రావాలని తల్లిదండ్రులు ఆశ పడడం తప్పు  లేదు. కాని పిల్లల చేత రికార్డింగ్ డ్యన్సులు వేయించాలనుకోవడం ముమ్మాటికీ తప్పే. ఇక్కడ మరో సంగటి చెప్పాలి. రికార్డింగ్ డ్యాన్సులు వేసే వారు వేరే గతి లేక బజారులో బట్ట విప్పుకుని గంతులేస్తారు. అటువంటి వారిమీద పోలీస్ కేసు పెడతారు. టీ.వీ.ల్లో రహస్య కెమేరాలు పెట్టి ఫ్లాష్ న్యూస్ ప్రసారం చేస్తారు. కాని అదే టీ.వీ. చానళ్ళు చిన్నపిల్లల రికార్డింగ్ డ్యాన్సుల్ని స్పెషల్ షోలకిందా చూపిస్తారు. టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంతగా దిగజారక్కర్లేదనుకుంటాను.
ఇవన్నీ చూస్తూ కూడా, చేష్టలుడిగి చూస్తున్న ఈ సమాజం, ఈ ప్రభుత్వం, ఈ న్యాయ వ్యవస్త, అసలున్నట్లా? లేనట్లా? అసలు మనం వున్నది మానవ సమాజంలోనా, లేదా ఆటవికులు, రాక్షసులు, జంతువులూ వుండే ఆటవిక సమాజంలోనా? అసలు మనం మనుషులమేనా? రాక్షసులమా?

Tuesday, June 15, 2010

భారతీయుల మీద జరిగిన కుట్రకి సాక్ష్యమిదిగో...

భారత దేశ విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావడానికి ఆద్యుడు లార్డ్ మెకాలే. ఇప్పటికీ సాంప్రదాయవాదులు ఆయన విద్యావిధానాన్ని దుమ్మెత్తి పోస్తూనే వుంటారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ దగ్గర నుండి వచ్చిన ఈ మెయిల్ చూసి నేను షాక్ కీ గురయ్యాను. అది నిజమో కాదో నాకు తెలియదు కాని, అందులో వ్యక్తపరచబడిన భావాలు మాత్రం ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాను. దాని తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాను. చదవండి..

లార్డ్ మెకాలే 1835, ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటుకి రాసిన  వుత్తరం.

"నేను భారత దేశం నలుమూలలా పర్యటించాను. కాని దేశం మొత్తం మీద ఎక్కడా ఒక బిచ్చగాడు కాని, ఒక దొంగ కాని కనిపించలేదు. ఇంతటి సంపన్నమయిన దేశాన్ని, ఇంతటి నీతిమంతులయిన ప్రజులున్న దేశాన్ని, ఇంతటి సమర్ధులయిన ప్రజలున్న దేశాన్ని మనమెప్పటికయినా జయించగలమని నేను అనుకోవడం లేదు. కాని ఈ దేశానికి వెన్నెముక అయిన ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అత్యంత  పురాతనమయిన విద్యావ్యవస్తని నాశనం చేయడం ద్వారా, వారి సాంప్రదాయ విద్య స్తానంలో మన ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టడం ద్వారా, భారతీయులకి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా చేసి, వారి ఔన్నత్యాన్ని కోల్పోయేలా చేసి, కేవలం విదేశీయులు మాత్రమే గొప్పవారు, అందులోనూ అంగ్లేయులు ఇంకా గొప్పవారు అనిపించేలా చెయ్యగలిగితే మనం అనుకున్నది సాధించవచ్చు. (భారత దేశాన్ని ఆక్రమించవచ్చు)


పైన వున్న వుత్తరం నిజమయినా కాకపోయినా, ఇప్పుడున్న పరిస్తితి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మన బ్లాగర్లలో కొంత మంది భారత దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని పనిగట్టుకుని తిడుతూ, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటివారందరికీ ఒక మనవి. ఎవరినయినా ద్వేషించేముందు, దూషించే ముందు ఒక్కసారి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో చెప్పింది, ఎవరో రాసింది మాత్రమే సరయినదనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి. మనల్ని మనం అవమాన పరచుకోకూడదు. ఎవరి గొప్పదనం వాళ్ళకుంటుంది, ఎవరి లోపాలి వాళ్ళకుంటాయి. అంతే గాని ఇతరులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని, అదేదో పెద్ద గొప్ప విషయంలా చూపడం మానుకోవాలి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, భారత దేశ సంస్కృతి అధమ పక్షం 10,000 సంవత్సరాల నాటిది. అంత పూర్వకాలం నుండి అవిచ్చిన్నంగా కొనసాగుతున్న సంస్కృతి, నాగరికత ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. భారతీయ సంస్కృతితో పరిడవిల్లిన ఈజిప్ట్, పర్షియన్, మాయన్ వంటి నాగరికతలు చరిత్రలో కలిసిపోయాయి. అదీ ఎటువంటి ఆధారాల్లేకుండా... కేవలం వాళ్ళు వాడిన కుండ పెంకులు, సమాధులని తవ్వి తీసి చరిత్ర రాస్తున్నారు. కాని అన్ని ఆధారాలతోను, సుసంపన్నమయిన సంస్కృత భాషలో అప్పటి చరిత్ర గురించి ఆధారాలు లభిస్తుంటే, ఇది నిజం కాదు అని తిరస్కరించడం పర దేశ సంస్కృతి దాసోహమనడం వల్లనే వచ్చింది. ఇంతటి అరుదయిన సంస్కృతిని పొగడనకర్లేదు, కనీసం మిగిలిన వాళ్ళతో కలిసి తిట్టకుండా వుంటే చాలు.

Tuesday, June 1, 2010

సృష్టిలో అందమయినది ఎవరు? ఆడా? మగా?

ఇదేమి ప్రశ్న? నిస్సందేహంగా ఆడవాళ్ళెగా అని మీ సమాధానం చెప్పవచ్చు. మన కవులందరూ, మగ వాళ్ళే కాబట్టి ఆడవారి అందాన్ని తెగ వర్ణించి పడేసారు. ఏ కధ తీసుకున్నా, ఏ కావ్యం చదివినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి సాహిత్య సమస్తం స్త్రీ సౌందర్య వర్ణనం. అందుకే మనకి ఈ అభిప్రాయం స్తిరపడిపోయి వుండవచ్చు. ఇక కవయిత్రులెవరూ, రచయిత్రులూ మగవారి అందాన్ని గురించి వర్ణించినట్టుగా ఎక్కడా నేను చదివినట్టు గుర్తు లేదు. అంత మాత్రం చేత మగవారు అందంగా లేకుండా పోతారా? ఈ మధ్యన కొంత ట్రెండ్ మారి మగవారికి కూడా ఫేస్ క్రీములు, సౌందర్య సాధనాలు వచ్చినవి గాని, ఇప్పటి వరకు సౌందర్యం అంటే అది స్త్రీలకే పరిమితమయిన విషయంగా అందరూ భావిస్తున్నారు.

కాని ప్రకృతిని పరిశీలిస్తే అసలైన  అందాన్ని మగవారికే ఇచ్చాడు ఆ దేవుడు. ఏమిటి మీరు నమ్మట్లేదా? అయితే ఇది చదవండి. పక్షులన్నిటిలోకీ అందమయినది నెమలి. నెమలి పించం విప్పి నాట్యమాడుతూ వుంటే ఆ సౌందర్యానికీ, అందానికి పరవశులు కాని వారెవరూ వుండరు. కాని విషయమేమిటంటే, మగ నెమలికే ఆ పించం వుంటుంది. ఆడ నెమలిని ఆకర్షించడానికే ఈ ఏర్పాటు. ఆడ నెమలి చాలా మామూలుగా కొంచెం పెద్ద కోడి లాగా వుంటుంది. పించం లేకుండా..

కోకిల ఎంత అద్బుతంగా పాడుతుంది? వసంత వేళలో కోయిల గానం లేకుండా ప్రకృతికి శోభ రాదు. అటువంటి అందమయిన స్వరం కూడా మగ కోయిలదే. పాపం ఆడ కోయిల అసలు కూయలేదట. కోడి పుంజుని చూడాండి. అందమయిన తురాయితో ఎంత ఠీవీగా నడుస్తుంది. వెనక చక్కని తోక, నెత్తిమీద తురాయితో చాలా అందంగా వుంటుంది. కాని ఆడ కోడి మాత్రం ఎటువంటి హంగులు లేకుండా మామూలుగా వుంటుంది.

జంతువుల్లో చూడండి. మృగ రాజయిన సింహం నెత్తి మీద జూలుతో పెద్ద పెద్ద మీసాలతో ఎంత అందంగా వుంటుంది... అదే సివంగిని చూడాంది. జూలు లేకుండా చాలా సాదాగా వుంటుంది. "జూ"లో మగ సింహాన్ని చూసి ఆనందిస్తారే తప్ప, ఆడ సింహం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఏనుగు చూడండి పెద్ద దంతాలో వుంటుంది. ఆ దంత సిరి మగ ఏనుగుకే సొంతం. ఆడ ఏనుగుకి మామూలుగా చిన్న చిన్న దంతాలుంటాయి.

అలాగే మనుషులలో కూడా మగవారికే చక్కటి మీసకట్టు, అందమయిన గెడ్డం వుంటాయి. పై వుదాహరణల వల్ల ఏతా వాతా తేలిందేమిటంటే మగవారు మాత్రమే సహజసిద్దంగా అందంగా వుంటారు అని. అందుకే ఆడవారికి లేని సౌందర్యం తెచ్చిపెట్టుకోవడానికి రకరకాల సౌందర్య సాధనాలు వాడుతారు అని. అయితే ఆడవారి పట్ల మగవారికి వుండే సహజ బలహీనత వల్ల వారి అందాన్ని అదే పనిగా పొగుడుతూ వుండి వుండవచ్చు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు మీరేమంటారు? ఎవరి అందం గొప్పదంటారు? ఆడవారిదా? మగవారిదా?

Monday, May 17, 2010

చిన్నారి చిట్టి కూతుళ్ళంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే...

కూతుళ్ళు మాత్రమే వున్నవాళ్ళు చాలా అదృష్టవంతులు.. నమ్మకం లేదా... వీరిని చూడండి... బిల్ క్లింటన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), జార్జ్ బుష్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), ఒబామా (అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ అధినేత), డా. ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్), డా. అంజి రెడ్డి (డాక్టర్ రెడ్డి ల్యాబ్స్), వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి,  ఎస్పీ జగదీష్ రెడ్డి. (అంటే నేనే, నాక్కూడా ఇద్దరు కూతుళ్ళు). ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది కరెక్టేనా?    
 

చిన్నారి చిట్టి కూతుళ్ళని సృజియించువేళ
కడు శ్రద్ధ వహించె ఆ సృష్టికర్త
లోకమెల్ల గాలించె విలువయిన నిధుల కోసం
తను ఇవ్వబోవు అపురూప వరముల కొరకు.

దేవ కన్యల చిరునవ్వులని వారికిచ్చె
అందమయిన నీహారికల వెతికితెచ్చె
ముచ్చటయిన నక్షత్ర ధూలిని
మెరిసే, మైమెరిపించే ఆ కనులలో పెట్టె...

ఆయన బహు మధురమయిన వాటితో
వారిని నింపె, చక్కని చక్కెరతో, నవరస ఫలములతో
సూర్య కాంతిని వారి నవ్వులలో ఇమిడ్చె
ఆహా అతడే చమత్కారి..

చిరునవ్వు ఉదయించె ఆయన మోముపైన
ముద్దులొలుకు బంగారు తల్లిని తయారుచేసినపుడు
ఏలననగా ఆయనకు తెలుసు... ప్రతీ అమ్మకీ, నాన్నకి
ప్రేమని, ఆనందాన్ని ఇవ్వబోతున్నానని..  


పై పద్యం నా స్వేచ్చానువాదం... దానికి ఇంగ్లిష్ మాతృక... ఎప్పుడో చిన్నపుడు రాసుకున్నది..

When God created daughters
He took very special care
To find the precious treasures
that would make them sweet and fair...
 
He gave them smiles of angels,
then explored the midnight skies
And took a bit of stardust
to make bright and twinkling eyes...
 
He fashioned them from sugar
and a little bit of spice,
He gave them sunny laughter
and everything that is nice...
 
He smiled when He made daughters,
because He knew He had
Created love and happiness
for every mom and dad.

Friday, May 14, 2010

గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు?

ఒక సందర్భంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారికి వచ్చిన అనుమానం. నిజమే గత చరిత్రని పరిశిలించి చూస్తే భారత దేశం ఎప్పుడూ తనంత తానుగా ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు. ఎప్పుడూ ఇతర దేశాల నుండి ధనం కోసం, బంగారం కోసం, మత వ్యాప్తి కోసం చేసే యుద్ధాల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడమే సరిపోయింది. ఇక్కడ ప్రబలంగా వున్న వైదిక జీవిత విధానంలో యుద్ధాలకి చోటే లేదు. (దీన్నే తరువాతి కాలంలో హిందూ మతమని మన మీదెక్కి తొక్కిన వాళ్ళు అంటే మనమూ చంకలు గుద్దుకుంటూ దానికి తందాన అంటున్నాము). నిజం చెప్పాలంటే ప్రపంచంలోని రెండు ప్రధాన మతాలయిన క్రైస్తవ, ఇస్లాం మతాలు తమ మత వ్యాప్తి కోసం మధ్య యుగాల్లో రక్తాన్ని ఏరులై పారించాయి. క్రైస్తవ మత యుద్ధాన్ని "క్రూసేడ్" అని, ముస్లిములు మతవ్యాప్తి కోసం చేసే యుద్ధాన్ని "జీహాద్" అని అంటారు. కాని మన సంస్కృతిలో మతానికన్నా మనిషికే ప్రాధాన్యత ఎక్కువ. ఇతర మతాల్లో, ఒకవ్యక్తి తాను అనుసరించే మతాన్ని మిగావారు అనుసరించకపోతే, వారు సొంత కొడుకయినా, కూతురయినా, భార్య అయినా, ఆఖరికి ప్రాణ స్నేహితుడయినా సరే, కత్తికి బలిపెట్టామని వారి "పవిత్ర గ్రంధాల్లో" రాసి వుంటుంది. కాని మతాన్ని బలవంతంగా ఇతరులపై రుద్దమని ఏ హిందూ సిద్ధాంతమూ చెప్పలేదు.

వేదాల్లో వున్న శ్లోకాల్ని ఒకసారి పరిశిలిస్తే మనవారు ప్రపంచ శాంతికి, సాటి మనిషి వున్నతి కోసం ఎంత పరితపించారో మనకి అర్ధ్మ అవుతుంది. "సర్వేత్ర సుఖినస్సంతు" అంటే మానవులందరూ సుఖంగా వుండాలి, "సర్వేసంతు నిరామయా" అందరూ ఆరోగ్యంగా జీవించాలి, "సర్వే భద్రాణి పశ్యంతు" అంటే అందరూ భద్రంగా వుండాలి అని అర్ధం. ఇటువంటి ఉదాత్త భావనలని ప్రపంచంలో ఏ మతమయినా చెప్పగలిగిందా? భగవద్గీతలో "విజ్ఞుడయిన వాడు ఒక ఏనుగులోనూ, పక్కనే వున్న కుక్క లోనూ, కుక్కని తినే చండాలునిలోనూ, సద్బ్రహ్మణుడిలోనూ పరమాత్మని దర్శిస్తాడు" అని చెప్పబడినది. అంతటి సమదర్శిత్వ భావన ఎప్పటికయినా మరో గ్రంధంలో చూడగలమా? మనం మనుషులమే కాకుండా, ప్రతీ ప్రాణిని తమతో సమానంగా భావించమని చెప్పే వున్నతమయిన సంస్కృతి గురించి, దేవుడు సృష్టించిన జంతువులన్నీ తమ ఆహారం కోసమే అని వాదించే వారికి ఏమని చెపితే తెలుస్తుంది? భూమి తల్లిగా భావించి, నదిని అమ్మగా ప్రేమించి, గాలిని దేవుడిగా ఆరాధించే వారి గురించి, పైవన్నీ వ్యాపార వస్తువులుగా భావించి, ప్రకృతిలో వున్న ప్రతీదీ అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి అని భావించే వారికి ఎలా చెపితే అర్ధం అవుతుంది? కూర్చున్న కొమ్మను నరుక్కోవడమూ, ప్రకృతిని నాశనం చేయ్యడం ఇదేగా మనం నాగరికులం అనుకునే వాళ్ళు చేసేది? తాగే మంచి నీళ్ళని కూడా కొనుక్కుని బ్రతకాల్సి వస్తుందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి వుంటుందా?

అసలు విషయానికి వస్తే హిందూ మతంలో వుండేది సర్దుబాటుతత్వం. వేద కాలం నుండి దాని మౌలిక సిద్ధాంతంలో వుండే వైవిధ్యంవల్ల ఎదురయిన ప్రతీ సవాలునీ సమర్ధవంతంగా ఎదుర్కొని ఈ నాటి స్తితికి చేరింది. ఈ మతంలో (నిజానికి హిందుత్వాన్ని మతం అంటే నేను ఒప్పుకోను, అది ఒక జీవిత విధానం) వున్న ఈ గుణం వల్ల ప్రాచీన యుగంలో బౌద్ధ, జైన మతాలు పుట్టినా, తరువాతి కాలంలో క్రైస్తవ, ముస్లిం మతాలు దాడి చేసినా సజీవంగా వుండగలిగింది. అయితే ఇంత మంచి విధానాన్ని ఎవరూ పనిగట్టుకుని (అంటే అబధాలు చెప్పి, భయపెట్టి, యుద్ధాలు చేసి) మతమార్పిడులు చేయ్యకపోవడం వలన మిగిలిన ప్రాంతాల్లో అది వ్యాప్తి చెందలేకపోయి వుండవచ్చు. అలాగని హిందువులు చేతగానివాళ్ళు కారు, సహనం కొంచెం ఎక్కువ. అయితే ఎంతటి సహనానికయినా ఒక హద్దు వుంటుంది. పిల్లి మామూలుగా చాలా మంచిది. ఎవరయిన వస్తుంటే అది పక్కకి తప్పించుకు పారిపోతుంది. కాని అదే పిల్లిని ఒకగదిలో తాళం పెట్టి కొట్టడానికి ప్రయత్నించారనుకోండి ఎదురు తిరుగుతుంది, ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తుంది. ముఖమంతా రక్కి పారేస్తుంది. హిందూ మతంలో వుగ్రవాదం అంటూ ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా, అది తాత్కాలికం మాత్రమే.

అందుచేత భారతదేశం గత 5000 సంవత్సరాలలోనే కాదు, మరో 10000 సంవత్సరాల తరువాతయినా సరే మరే దేశం మీదకీ యుద్దానికి వెళ్ళదు.

Tuesday, May 11, 2010

విశ్వ వర్ణన - కొన్ని సందేహాలు... సమాధానాలు.

విశ్వ వర్ణన - ఆధునిక పరిశొధనలకి, విష్ణు సహస్ర నామానికి పోలిక గురించి నాకు అనేకమంది అభినందనలు తెలిపారు. వారందరికీ నా కృతజ్ఞతలు. కొద్దిమంది స్నేహితులు కొన్ని సందేహాలు కూడా అడిగారు. వాటిలో మొదటిది: విష్ణు సహస్ర నామంలో వర్ణించినట్టుగా విష్ణువు ప్రత్యేకంగా వుండడా? ఆయనకి ఒక రూపం అంటూ లేదా? అని. నిజమే విష్ణువు కి రూపం లేదు. ఆయన విశ్వ స్వరూపుడు. ఈ లోకంలోని ఏ రూపం తీసుకున్నా అది ఆయన రూపమే. ఏ పేరు పలికినా అది ఆయన నామమే. మన కంటికి కనబడని ఆ మహా శక్తికి ఒక రూపం అంటూ లేదు. మనం ఎలా ఊహించుకుంటే అలాగే దర్శనమివ్వగల మహాశక్తి రూపం. మన ఊహలకి అందని అనంత శక్తి స్వరూపం. ఆ మహా శక్తికే మనం విష్ణువు అని పేరు పెట్టుకున్నాము.

సహస్ర నామంలో వాసుదేవ అనే పదానికి అర్ధం ఇదే. "వాసనాత్ వాసుదేవస్య వాసితం భువన త్రయం.. సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే" అని వుంటుంది. ఎంత అద్భుతమయిన వర్ణన. మూడు లోకాల్లో వుండేది ఆయన రూపమే. ఏ లోకాన్ని తీసుకున్నా ఆయన రూపమే. అన్ని లోకాలూ ఆయన నివాస స్తానాలే. అలాగే అన్ని లోకాలు, సర్వ ప్రాణులు ఆయన అందే నివసిస్తూ వున్నాయి అని దీనర్ధం. ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలో వున్న ప్రతీ అణువూ ఈ విశ్వంలోని అణువులతో తయారయిందే. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. అలాగే ప్రతీ అణువులోనీ ఆ మహాశక్తి ప్రకటితమవుతుంది. ఏ మతానికి చెందిన వారయినా, ఏ కులానికి చెందిన వారయినా, అది ఏ ప్రాణి అయిన, ఏ మొక్కయినా, ఏ చెట్టయినా వాటన్నిటిలో వుండేది ఆ మహా విష్ణు స్వరూపమే. ఇక ఇందులో సందేహాలకు తావు లేదు. ఇలా ప్రతి దానిలోనూ, ఆఖరికి వీచే గాలిలోను, ప్రవహించే నీటిలోనూ, మండే అగ్నిలోనూ, నివసించే భూమిలోనూ ఆ పరమాత్మని చూడగలిగారు కాబట్టే, భరత భూమి ఆధ్యాత్మిక భూమి అయింది. అదే ఇప్పటి వ్యాపార నాగరికతలాగా నదులన్నిటినీ కలుషితం చేసేసి, పచ్చటి చెట్లని కొట్టివేసి, కొండల్ని పిండిచేసి, పీల్ఛే గాలిని కూడా విషంతో నింపేసి, మన చావుని మనమే కొనితెచ్చుకునేవాళ్ళుగా మన పూర్వీకులు వుండుంటే ఇప్పుడు మనం వుండే వాళ్ళం కాదనుకుంటాను. అది వేరే సంగతి.

ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో దేవుని గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఎక్కువ మంది చెప్పేది ఒకటే. దేవుడు ఒక పరలోకంలో (అదెక్కడుందో ఎవ్వరూ చెప్పరు. చెపుదామన్నా వాళ్ళకీ తెలియదు) ఒక బంగారు సింహాసనంపై కూర్చుని వుంటాడు. ఆయన మనిషి రూపం ధరించి వుంటాడు. తెల్లని గెడ్డంతో, బంగారు కిరీటం పెట్టుకుని వుంటాడు. ఇవీ వాళ్ళు చెప్పే వర్ణన. కానీ వైదిక సారస్వతంలో దేవునికి ప్రత్యేకించి రూపం లేదు. ఆ మహాశక్తిని మనం కళ్ళతో చూడాలేము. మనకున్న పంచేంద్రియాల జ్ణానం సరిపోదు. అంతకుమించిన బౌద్దిక జ్ఞానం కావాలి. అది తపస్సు లేదా ధ్యానం ద్వారా మాత్రమే సిద్దిస్తుంది.

ఇక్కడ మరో ప్రశ్న ఉదయిస్తుంది. అలాగయితే దేవుడి చిత్రపటాలు, ఈ విగ్రహాలు ఏమిటి? దేవుడు విశ్వరూపంలో వుండేట్టయితే, ఈ అందమయిన బొమ్మలెందుకు? ఇది రెండవ ప్రశ్న. అదీ నిజమే. ఇది గతంలో సంగతి. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. మహర్షులు దర్శించిన దానిని సామాన్య ప్రజలకు తెలియజేయాలి. మార్గం ఏమిటి? ఈ విశ్వం గురించి, ధ్యానం వారు దర్శించిన వున్నత తెజోమయ లోకాల గురించి సామాన్య ప్రజలకి చెప్పేదెలా? అది కూడా అందరికీ అర్ధమయ్యేలా చెప్పేదేలా? ఆ లోకం ఇలా వుంటుంది అని చెప్పేందుకు వాళ్ళ దగ్గర ఫోటోలు లేవు.. హబుల్ టెలెస్కోప్ అంతకన్నా లేదు. మరేమిటి మార్గం? అదికూడా చదువు రాని వాల్లకి కూడా అర్ధం కావాలి. మనకు తెలిసిన మనకు అర్ధమయ్యే పద్దతిలోనే ఆ వర్ణన సాగాలి. అలా పుట్టిందే ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహ రూపం. నిజానికి ఇప్పుడు మనం చూస్తున్న దేవుళ్ళ రూపాల వెనుక చాలా పెద్ద కధే వుంది. అది యోగులకి, జిజ్ఞాసా పరులకి సులభంగానే తెలుస్తుంది. మనం ఇతర దేశాల వాళ్ళు చెప్పింది విని విని, మన దేశ జ్ఞానాన్ని మనమే చేతులారా పాడు చేసుకుని, వాళ్ళకి మానసికంగా బానిసల్లాగా బ్రతుకుతున్నాము. ఇవన్నీ చెప్పాలంటే అదో పెద్ద గ్రంధం అవుతుంది. అది చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. మరో టపాలో దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

Saturday, May 1, 2010

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక


మనం నివసించే ఈ విశ్వం, సౌరమండలం, భూమి ఇవన్ని అనేక అద్భుతాలకి నిలయాలు. మనిషి మేధస్సు ఎంత పురోగతిని సాధించినా తెలుసుకోవలసిన విశ్వ రహస్యలు ఎన్నో మిగిలే వుంటాయి. ఈ అద్భుత ప్రపంచం గురించి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హబుల్ టెలెస్కోప్ ని ప్రయోగించి రోదసిలో జరిగే అనేక అంతుచిక్కని నక్షత్రమండలాలని, వాటిలో జరిగే ప్రక్రియల్ని కనుగొంటున్నారు. కాని మనకి తెలియని, మనం మరిచిపోయిన మరొక విషయం ఏమిటంటే, మహా తపో శక్తి సంపన్నులయిన మన మహర్షులు, యోగులు సకల చరాచర సృష్టికి మూల స్తానమయిన మహాశక్తి కేంద్రాన్ని దర్శించారు. అది కూడా ఎటువంటి టెలెస్కోపులు, పరికరాలు లేకుండానే. దీనికి సజీవ సాక్ష్యం శ్రీ విష్ణు సహస్ర నామం.

మనం వుంటున్న సౌర కుటుంబం, పాలపుంత (Milkyway Galaxy) చుట్టు 200 మిలియన్ల సంవత్సరాలకి ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఈ పాలపుంత మధ్య భాగం అనేక కోట్ల నక్షత్రాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. అది ఎంత అద్భుతమయిన వెలుగంటే, మనం ఒక సూర్యుడి వైపే పూర్తిగా చూడలేము. అటువంటిది కొన్ని కోట్ల సూర్య సమానమయిన కాంతిని మన నేత్రాలు చూడలేవు. ఆ నక్షత్రాలు కూడా ఒక దానికొకటి బాగా దగ్గరగా వుంటాయట. మన వున్న ఈ సౌర కుటుంబం పాల పుంతకి ఒక పక్కగా వుండడం వల్ల మనకు దాని కేంద్ర భాగాన్ని చూసే అవకాశం లేదు. అందువల్లనే భూమి మీద వున్న వారికి రాత్రి వేళ అక్కడొ నక్షత్రం ఇక్కడో నక్షత్రం కనిపిస్తూ వుంటాయి. కాని పాలపుంత మధ్య భాగంలో మాత్రం ఏ సమయంలోనయినా ఒకేలా అత్యంత ప్రకాశవంతంగా వుంటుంది. సకల విశ్వానికీ మూలాధారమయిన శక్తి అక్కడి నుండే ప్రవహిస్తు వుంటుంది. అన్ని జీవరాశులలో ప్రవహించే ఈ శక్తికే మన వారు "విష్ణు" అని, "నారాయణ" అని నామకరణం చేసారు. అటువంటి విష్ణువు వుండేది పాల సముద్రం అంటారు. విష్ణు సహస్ర నామంలో "క్షీరో ధన్వత్ ప్రదేశే" అన్న మాటకి అక్కడ పాలు వుంటాయని కాదు. ఆ లోకం అత్యంత ప్రకాశవంతంగా ఎటుచూసినా పాల వంటి స్వచ్చమయిన కాంతులు వెదజల్ల బడుతూ వుంటుంది అని అర్ధం. "విశ్వం విష్ణు " అనే పదానికి అర్ధం ఈ విశ్వమతా విష్ణు స్వరూపమే అని. ఈ ప్రపంచం మొత్తం, ఆయనలోనిదే. విష్ణువుకి నాలుగు చేతులు వుంటాయని "చతుర్భుజహ" అనే నామం చెబుతుంది. విశ్వంలో వుండే ఎక్కువ శాతం స్పైరల్ గెలాక్సీలకి నాలుగు భుజాలుంటాయి. ఈ క్రింది ఫోటొ గమనించండి. అదే విష్ణువు యొక్క స్వారూపం. "భుజగ శయనం" అనే మాటకి అర్ధం విష్ణువు పాము మీద పడుకుంటాడని కాదు. పాలపుంత మధ్యలో జరిగే అనేక చర్యల్లో భాగంగా అత్యంత వేడి, పొగలు, మనవూహకి కూడా అందనంత వేగంగా, పాము బుసలు కొట్టిన మాదిరిగా పైకి ప్రవహిస్తూ వుంటాయి. అందుకే విష్ణువు పవళించే ఆది శేషుడికి పదివేల తలలుగా పోల్చారు మన మహర్షులు.

భూమి మీద వుండే ప్రాణులన్నీ విష్ణువు యొక్క నాభి నుంచి పుట్టిన కమలం నుండి పుట్టిన బ్రహ్మ ద్వార సృష్టించబడ్డాయని అంటారు. ఆయనకి అందుకే "పద్మనాభుడు" అనే పేరు పెట్టారు. నిజానికి ఈ పద్మం అనేది విశ్వం యొక్క మధ్య భాగంలో అనేక చర్యల ఫలితంగా ఏర్పడ్డ మేఘాలు మొదలయినవి ఆ నాభి ప్రాంతం నుండి కొన్ని కోట్ల కిలో మీటర్ల ఎత్తుకి ప్రయానించి అక్కడ చల్లబడి పువ్వు ఆకారంలో ఏర్పడి, అక్కడ జరిగే మరిన్ని చర్యలద్వారా క్లిష్టమయిన కార్బన్ గొలుసుకట్టు ఏర్పడి, వాటి యొక్క ఒక అజ్ఞాత విధానంలో ప్రాణం అనేది పుట్టి, అది ఈ విశ్వమంతా చేయబడుతుందని భావించవచ్చా? బహూశా అదే బ్రహ్మ స్వరూపమయి వుండవచ్చు. సృష్టించేది బ్రహ్మ అయినా గాని, ప్రాణులకి నిరంతరం శక్తి సరఫరా అయ్యేది మాత్రం విష్ణు లోకం నుంచే అనేది మనం అర్ధం చేసుకొవచ్చు అనుకుంటాను.
అదే కాకుండా విష్ణు సహస్ర నామంలో మరొక చోట "సహస్ర మూర్థా విశ్వాత్మా, సహస్రాక్ష సహస్ర పాత్" అని వుంటుంది. అంటే విష్ణువు యొక్క వైభవాన్ని వర్ణించడానికి మాటలు రాక ఆయన్ని దర్శించిన మహర్షులు "కొన్ని వేల చేతులు, కొన్ని వేల ఆకారాలు, కొన్ని వేల పాదాలు కనిపించినట్లుగా వర్ణించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు విష్ణు సహస్ర నామంలో వున్నాయి. బహుశా అవన్ని చదివి, మానసికంగా దర్శించగలగడం ఈ జన్మకి సాధ్యమవుతుందో లేదో తెలియడం లేదు.

నాకు ఎప్పటి నుంచో మనసులో వున్న ఈ భావాలన్ని మీతో పంచుకునేలా చేసినది శ్రీ సత్యనారాయణ శర్మ గారి గేలాక్టిక్ సెంటర్ - విష్ణు నాభి - కొన్ని సంకేతాలు . అందుకు ముందుగా శర్మగారికి నా హృదయపూర్వక కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను.

Saturday, April 24, 2010

టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా "వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్ధిని" (విజయవంతమయిన ఒక ప్రయోగం)

ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో మా "వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్" విద్యార్ధిని రమ్యస్మృతి తాడేపల్లిగూడెం పట్టణంలో మొదటి ర్యాంక్ సాధించింది. 470 మార్కులకుగాను 459 మార్కులు సాధించింది. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విధంగా ర్యాంక్ సాధించినందుకు పలువురు అభినందించారు. కేవలం ర్యాంకుల సాధన మాత్రమే లక్ష్యంగా కాకుండా ప్రతీ విద్యార్ధిని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయంగా మా కాలేజ్ ని స్థాపించడం జరిగింది. నేను గత పోస్టులలొ ప్రస్తావించిన విధంగా పిల్లల మీద ఎటువంటి వత్తిడి తీసుకురాకుండా వారు స్వేచ్చగా చదువుకోవడానికి అవసరమయిన పరిస్తితులను కల్పించి, వారి మానసిక వికాసానికి తోడ్పడే విధంగా మాత్రమే ఈ విద్య వుండాలని భావించి, ఈ అంశాన్ని మా కాలేజ్‌లో ప్రాక్టికల్‌గా చేసి చూపించాను. అలాగని క్రమశిక్షణ విషయంలో కూడా ఎక్కడా రాజీ లేని ధోరణితో ముందుకు సాగిపోయాము. ఎవ్వరినీ బట్టీ పట్టడానికి ప్రోత్సహించలేదు. పిల్లలు సంపూర్ణంగా ఒక లెసన్‌ని అర్ధం చేసుకున్నాక మాత్రమే మరొక లెసన్‌లోకి వెళ్ళమని మా లెక్చరర్స్‌కి సూచించాను. దానివల్ల ఉత్తీర్ణతా శాతం ఎక్కువగ వుండడమే కాకుండా 50% మంది విద్యార్ధినులకి A గ్రేడ్ మార్కులు వచ్చాయి. నేను ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే. చదువుకోసం పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు అని. వారికి చెప్పేలా చెపితే ఖచ్చితంగా బాగా చదువుతారనేది మా కాలేజి ద్వారా రుజువయింది.

ఈ విజయ సాధనలో నాకు తోడుగా వుండి, కాలేజీ బాధ్యతలని మనస్ఫూర్తిగా నిర్వర్తించిన నా సోదరి శ్రీమతి కృష్ణ చైతన్యకి, మా అంకుల్ శ్రీ గమిని సుబ్బారావు గారికి, నేను కాలేజ్ పెడుతున్నాని ప్రకటించినప్పుడు తమ అభినందనలు తెలిపిన బ్లాగ్మితృలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

Tuesday, April 20, 2010

పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదా?

ఈ మధ్యన సుప్రీం కోర్ట్ ఒక సినీ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తీర్పు వెలువరిస్తూ పెళ్ళికి ముందు యువతీ యువకులు కలిసి సహజీవనం చేయడం తప్పు కాదు నేటి సమాజంలో అదొక తప్పని పరిస్తితి అన్నట్లుగా ఒక వ్యాఖ్య చేసింది. పైగా దాన్ని సమర్ధిస్తూ మన పురాణాలలోని కృష్ణుడు, రాధ కలిసి సహజీవనం చేసేవారు అన్నట్లుగా వుదహరించిది. సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సంప్రదాయ వాదులంతా ఇదేమి పోగాలం దాపురించిందని నోరు నొక్కుకుంటే, మన దేశంకూడా "ఎక్కడికో పోతుందంటూ" మరికొంతమంది మురిసిపోయారు.

ప్రపంచంలోని ఎన్నో సమాజాల్లో సెక్స్ అనే విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచారు. అది సమాజంచేత దాచిపెట్టబడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. లైంగికత అనేది మరుగున పెట్టబడినదే గాని నిషేదించబడలేదు. అలా నిషేదించబడినట్లయితే రాయడానికి నేను వుండను, చదవడానికి మీరు వుండరు. అది అందరికీ తెలిసిన విషయమే. పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అనే విషయాన్ని సమర్ధించే వాళ్ళు చెప్పే మాటేమిటంటే, జంతువులకి లేని కట్టుబాట్లు, నిషేధాలు మనుషులం మనకెందుకు అని? పైగా మనిషికి సహజసిద్దంగా వుండే ఆకలి, నిద్ర, మైధునం వంటి వాటిని జంతువులు తీర్చుకుంటున్న విధంగానే మనుషులు తీర్చుకుంటే తప్పేమిటి అని. ఇలా అనేవాళ్ళు తమ వాదనకి అనేక వుదాహరణలు చూపిస్తారు. వాళ్ళ మానసిక అపరిపక్వతని బయట పెట్టుకుంటారు.

మానవ సమాజానికి, జంతు సమాజానికి ఎంతో వ్యత్యాసముంది. మానవ నాగరికత ఈనాటిది కాదు. అది ఎన్నో లక్షల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఎన్నో ప్రయోగాల తరువాత ఏర్పడ్డాయి. నేను చెప్పేది మూడ నమ్మకాల గురించి కాదు, సమాజ మౌలిక లక్షణల గురించి మాత్రమే. మానవ సమాజం, నాగరికత కొన్ని వేల, లక్షల సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా సాగిపోవాలంటే, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పయనించాలంటే సామాజానికి కొన్ని కట్టుబాట్లు అవసరం అని ఏనాడో మన పెద్దలు గ్రహించారు. అందుకే ఇన్ని రకాల కట్టుబాట్లు మనపై విధించారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, చదువు నేర్పే గురువుని గౌరవించాలని, మనతో బాటు పుట్టిన వాళ్ళని తోబుట్టువులంటారని, వాళ్ళతో ప్రేమగా మసలుకోవాలని, ఇంకా ఇతర బంధుత్వాలు ఒకరికి ఒకరు ఏమవుతారో, ఎవరెవరి మధ్యన లైంగిక సంబంధాలు ఆమోదయోగ్యమో, ఎవరి మధ్యన అవి నిషిద్దమో ఇటువంటివన్నీ ఎంతో క్లియర్‌గా నిర్వచించారు. ఇది సమాజ రీతి.

ఇక అసలు విషయానికి వస్తే, మనం మానవులం కాబట్టి, జంతువులవలే ప్రవర్తించలేము. అది అందరికీ తెలిసిన విషయమే. మనకు ఆకలేస్తే ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి కావలసిన పదార్ధాలని తినగలమా? పక్కింటి చెట్టు కాయ దొంగతనంగా కోసి చూడండి. ఏమి జరుగుతుందో.. అదే జంతువయితే పోనిలే ఊరుకోవచ్చు. అదే మనిషయితే పట్టుకుని తన్నుతారు. అదే విషయం కామానికి కుడా వర్తిస్తుంది. సహజంగా మనిషికి స్వార్ధం ఎక్కువ. ఏదయినా వస్తువు తనది అనుకున్నప్పుడు ఇక ఎవ్వరూ ఆ వస్తువుని ఆశపడకూడాదనుకుంటాడు. నా ఇల్లు, నా టి.వి., నా బట్టలు ఇలా సాగిపోతుంది ఆలోచన. ఇదే సూత్రం భార్య భర్తలకి కూడా వర్తిస్తుంది. తన భార్య వంక పరాయి మగాడు చూడకూడదనుకుంటాడు భర్త. అలాగే తన భర్త పరాయి స్త్రీ వంక కన్నెత్తి చూసినా, పన్నెత్తి పలకరించినా పెద్ద రాద్ధాంతం చేసేస్తుంది భార్య. ఒక వస్తువుని కొంటే దాని మీద సర్వ హక్కులూ మీకు సొంతమవుతాయి. దానికి ఆధారంగా షాప్ వారిచ్చిన బిల్లు మీ దగ్గర వుంటుంది. ఒక తల్లికి పుట్టడం వల్ల ఆ తల్లికి బిడ్డపై సర్వ హక్కులూ సంక్రమిస్తాయి. కాని ఒక యువతికి, ఒక యువకుడికి ఒకరిపై ఒకరికి హక్కులు ఎలా సంక్రమిస్తాయి? దానికేదయినా పద్దతి వుండాలి కదా? అందుకే వివాహం అనే ఒక పద్దతి ప్రవేశపెట్టబడింది. ఎవరికి ఎవరు సొంతమవుతారనే విషయాన్ని సమాజంలో వుండే అందరికీ తెలియచెప్పడానికి వుద్దేశించినదే వివాహం. దాదాపు ప్రపంచంలోని అన్ని సమాజాల్లో, నాగరికతల్లో వివాహం అనే వ్యవస్త ఆమోదం పొందింది.

బాధ్యతల పరంగా కూడా వివాహం ఎంతో విలువయినది. జంతు సమాజంలో తల్లికి మాత్రమే బాధ్యత వుంటుంది. తనకు పుట్టిన పిల్లల్ని సాకడంలో పూర్తి బాధ్యత తల్లే వహిస్తుంది. కొన్ని రకాల జంతువుల్లో ఆడవి తమతో జత కట్టిన మగ వాతికి కూడా కొంత బాధ్యతని పంచుతాయి. అంటే ఇక్కడ కూడా జతకట్టిన ఆడ, మగ వాటి మధ్యే పిల్లల పెంపకం బాధ్యతని తీసుకుంటున్నాయి. ఇదే బాధ్యతల వర్తింపు మానవ సమాజంలో అత్యంత క్లిష్టంగా వుంటుంది. ఒక బిడ్డని పెంచాలంటే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధికపరంగా గాని, ఆరోగ్యపరంగా గాని. ఇటువంటి పరిస్తితులలో ఒక యువతి తనకి పెళ్ళి కాకుండానే బిడ్డకి జన్మనిస్తే, పురుషుడు మనస్ఫూర్తిగా ఆ బిడ్డ బాధ్యతని తీసుకుంటాడా? ఆ అమ్మాయి అటువంటి పరిస్తితిలో వుండగా, ఖచ్చితంగా మరొక అమ్మాయితో సహజీవనం మొదలుపెడతాడు. ఎందుకంటే అది అతని దృష్టిలో తప్పు కాదు కాబట్టి. అదేమని అడగడానికి ఈ అమ్మాయికి కూడా హక్కు వుండదు. పెళ్ళి కాకుండానే తల్లయిన వాళ్ళు పాశ్చ్యాత్య దేశాల్లో కోకొల్లలుగా వున్నారు. వారి సమాజంలో అది తప్పు కాకపోయినా తల్లి దండ్రుల ప్రేమని పూర్తిగా పొందలేని పిల్లలు సమాజానికి ఇబ్బందులు తెచ్చిపెట్టడం, సంఘ విద్రోహ శక్తులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాము. పెళ్ళి కాకుండానే పిల్లలు పుడితే అన్ని రకాలయిన ఇబ్బందుల్ని సమాజం ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ సామాజిక సమస్యలు.

ఆరోగ్యపరంగా చూసినా ఎక్కువమందితో సంపర్కం ఆడవాళ్ళకయినా, మగవాళ్ళకయినా ఎన్నో చిక్కుల్ని, రోగాల్నీ తెచ్చిపెడుతుంది. మామూలుగా పెళ్ళి చేసుకుని ఇప్పుడే పిల్లలు వద్దనుకుని, అబార్షన్ చేయించున్న జంటల్లో చాలా మందికి తరువాత చాలా సమస్యలు రావడం, నిజంగా పిల్లలు కావాలనుకున్నపుడు గర్భధారణలో ఇబ్బందులు ఎదరవడం వంటివి నాకు తెలిసిన ఎంతోమంది తర్వాత బాధ పడడం గమనించాను. ఇదే కాకుండా ఎయిడ్స్ వంటి రోగాలు వుండనే వున్నాయి. అందుకే సెక్స్ విషయంలో ఈ ప్రపంచం చాలా ప్రయోగాలు చేసిందని, అందులోనూ భారతదేశం సామాజికపరంగా ఎన్నో ఒడిదుడుకుల్నిఎదుర్కొన్న తర్వాత మాత్రమే నేడు మనం వున్న సామాజిక ఆచార వ్యవహారాలు రూపుదిద్దుకున్నాయని మనం మర్చిపోకూడదు. ఒకే మనిషితో పెళ్ళి అనే బంధంతో ముడిపెట్టుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనసులో భద్రతా భావం చోటుచేసుకుంటుందని మానసిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఎప్పుడేమి జరుగుతుందో మనకే తెలియనప్పుడు, ఎవరికెవరు ఏమవుతారో ఎవరూ ఊహించలేనపుడు సమాజం మానవ సమాజంగా వుంటుందని ఎవరు మాత్రం ఎలా ఆనందంగా జీవించగలరు?

కొత్తొక వింత, పాతొక రోత అనుకుని తమకు ఎదురయిన ప్రతి విషయాన్ని, ప్రతీ ఆచారాన్నీ వెంటనే ఖండించే దురలవాటు వున్నవారు, పెద్ద పదవుల్లో, హోదాలో వున్నవారు తమ చిన్న బుద్దిని చాటుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నవ్వులపాలవుతారు. సమాజ రీతికి ఎదురీదితే తరువాత సమస్యలు ఎదుర్కొని, ఇబ్బందులు పాలవుతారు. నోటికొచ్చినట్టు ఏదేదో వాగకుండా, ఎదురయ్యే ప్రతీ దాన్నీ తలా తోకా లేకుండా ఖండించకుండా, సంయమనంతో ఆలోచిస్తే ప్రతీ ఆచారానికి వున్న గొప్పదనం బోధపడుతుంది.

యువతీ యువకులు కూడా మానవ జీవితానికి వున్న గొప్పదనాన్ని గ్రహించి, కేవలం ఆకలి, నిద్ర, మైధునాలు మాత్రమే మానవ అవసరాలు కాదని, అవి తీరడం మాత్రమే ముఖ్యం కాదని, మానవ జీవితం యొక్క అర్ధం, పరమార్ధం మరెంతో వుందని, ఎవరి విలువల్ని వారు కాపాడుకుంటు, మనం వుండే సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు గాని చెడు చేస్తూ తోటి వారిని ఇబ్బందుల పాలు చెయ్యడం తగదని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

Wednesday, March 31, 2010

రామతత్వ దర్శనం: సాక్షిలో స్వామి మైత్రేయి గారి సందేశం (యధాతధం)

ఒక వ్యక్తి ఆదర్శవంతమయిన పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, ఇంద్రియాలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలి వంటి విషయాలు రాముని పాత్ర ద్వారా వివరించాడు వాల్మీకి. రామ అంటే "ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి" అని అర్ధం. "రం" అనేది మణిపూర చక్రానికి సంబంధించిన బీజాక్షరం. అలాగే "ర" అంటే సూర్యతత్వం, "మ" అంతే చంద్రతత్వం. ఇవే మనలోని ఇడ, పింగళ నాడులు. రాముడంటే ఆత్మా రాముడే. దశరధునికి, కౌసల్యకి రాముడు జన్మించడమంటే మనలోని "దశ" రధాలనే కర్మేంద్రియల, జ్ఞానేంద్రియాల మధ్య కుశలత ఉండి, ఆత్మను చేరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందని. అన్నదమ్ములు నాలుగు పురుషార్ధలు. వీరిని వరుసగా, ధర్మానికి, శ్రద్ధకు, భక్తికి, శక్తికి ప్రతీకలుగా చెప్పవచ్చు. మనలోని సత్వ రజస్తమో గుణాలే దశరధుని భార్యలు. సీతను స్వచ్చమయిన మనస్సుకు ప్రతీకగా చెప్పవచ్చు. ఆమెకు బంగారు లేడి కావాలనే కోరిక కలగనంత వరకు రాముని చెంతనే ఉంది. లేడి కావాలనే కోరిక కలిగినప్పటి నుండి రామునికి దూరమై అనేక బాధలు పడింది. మనస్సులో కోరికలు, వ్యామోహం, రాగద్వేషాలు ఉన్నంతవరకు ఈ బాధలు ఉంటాయి. అలాగే మనిషి అన్ కాన్షస్‌గా ఉండేటప్పుడు తప్పొప్పుల విచక్షణ పోతుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చెడు వైపునకు వెళ్ళిపోతాయి. రావణుడు తెలివిగలవాడే కాని ఆ తెలివి అహంకారాన్ని పెంచి చెడువైపునకు తీసుకెళ్ళింది. అందుకే పదితలల వ్యక్తిగా చూపిస్తారు.

హృదయాన్ని తెరిచి రాముణ్ణి చూపడమంటే మనిషి శిరస్సుతో గాక హృదయంతో వుండాలని అర్ధం. అప్పుడే వానరుడు హనుమ కాగలడు. రావణుడు అరిషడ్వర్గాలకు ప్రతీక అయితే, హనుమ హృదయానికి ప్రతీక. లంక అంటే మన శరీరం . దానికున్న తొమ్మిది ద్వారాలే నవరంధ్రాలు. ఈ లంక చుట్టూ వున్న సముద్రమే మాయ. ఈ మాయను దాటి అసుర గుణాలయిన రాగద్వేషాలను హరించివేయాలి.

సీత జనకునికి పుడమిలోనే దొరికి, పుడమిలోకే వెళ్ళిపోతుంది. ధ్యానంలో సమాధి స్థితిలో మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికే వెళ్ళిపోతుంది. అయోధ్య అంటే ఏ ఘర్షణ వుండదు. ఏ కోరికలు, రాగద్వేషాలు లేక ప్రశాంతత నెలకొని ఉంటుంది. మనం మైండ్‌ను శుద్ధి చేసుకోక, మంచి హృదయంతో లేనంతవరకు ఆత్మారాముణ్ణి చేరుకోలేం.

Wednesday, March 24, 2010

మానవ సమాజానికి ఒక మహనీయ కానుక... రామాయణం.

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయనం. మనుషులు తమ జంతు ప్రవృత్తిని వీడి ఒక సమాజంగా రూపొందుతున్న కొత్తల్లో మనసులో ఎన్నో సందేహాలు.. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ మంచి అయితే ఎందుకు మంచి? చెడయితే ఎలా చెడు? ఒక మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంకంగా, ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ వుండే రకరకాలయిన మనుషుల్ని ఒక దారిలో నడిపించడం ఎలా అన్న విషయంపై ప్రాచీన భారత దేశంలో జరిగినన్ని ప్రయోగాలు ప్రపంచంలోని మరే సంస్కృతిలోనూ, మరే నాగరికతలో జరిగుండవని నిరాఘాటంగా చెప్పవచ్చు. అటువంటి సంఘర్షణలో నుంచి పుట్టిందే రామాయణం. రామాయణంలో ప్రతీ సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి.

రామాయణంలో ముందుగా చెప్పాల్సి వస్తే చెప్పవలసింది సీతా దేవి గురించే. భర్త పట్ల ఒక స్త్రీకి వుండవలసిన ధర్మాన్ని గురించి సీత నుంచి తెలుసుకోవచ్చును. తెల్లారేసరికి తన భర్త రాజు కావలసిన వాడు అడవులకి వెళుతున్నాను అని చెప్పినాగాని, ఒక్క మాట మారు మాట్లాడలేదు. ఇప్పటి ఆడవాళ్ళలాగా "నువ్వేమి చేతగాని భర్తవని నిందించలేదు. ఒక దేశానికి రాకుమార్తె అయి వుండికూడా పుట్టింటికి వెళ్ళిపోతానని అనలేదు. తన భర్తనే అనుసరించింది. ఆయనతో అరణ్యవాసం చేసింది, అష్ట కష్టాలు పడింది. భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలవాలనేదే సీత ఇచ్చే సందేశం.

లక్ష్మణుడి వంటి సోదరుడిని మనం చరిత్రలో ఎక్కడా చూసి వుండం. చరిత్ర ప్రారంభం నుంచి పరిశిలిస్తే రాజ్యం కోసం సొంత సోదరుల్నే కడతేర్చిన వారిని చూసుంటాము. సొంత తండ్రినే ఆస్తి కోసం కిరాతకంగా హతమార్చినవారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటింది అన్నగారి కోసం రాజభోగాల్ని వదిలి, కూడా వెళ్ళిన లక్ష్మణుడి గురించి మనం ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. మిగతా ఇద్దరు సోదరులు భరతుడు, శతృఘ్నుడు కూడా అన్నగారు లేని రాజ్యం తమకెందుకని సింహాసనంపై పాదుకలు వుంచి పరిపాలన చేశారు. ఇటువంటి అన్నదమ్ముల అనుబంధం ఏ దేశ చరిత్రలోనయినా వుంటుందా?

స్వామి భక్తి అనేది హనుమంతుడి నుంచి నేర్చుకోవచ్చు. కాస్త ఎక్కువ జీతం ఇస్తే చాలు వెంటనే వుద్యోగం మారిపోయే ఈ రోజుల్లో హనుమంతుని గురించి ఆలోచించేవాళ్ళు ఎంత మంది వుంటారు? ఒక సారి తన ప్రభువుగా అంగీకరించిన తరువాత, తనకు రాముడు అప్పజెప్పిన పనిని పూర్తి చెయ్యలేకపోయానే మరలా నా స్వామికి నా ముఖం ఎలా చూపించను? అని ప్రాణ త్యాగానికి సిద్దపడతాడు హనుమ. అంతేగాని బాస్ చూడడంలేదు కాబట్టి ఈ పని పూర్తి చేసేసాను అని అబద్దం చెప్పలేదు. రామ రావణ యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్దమంతా తానే అయి నడిపించాడు హనుమ. అంతటి శక్తిమంతుడయి వుండి కూడా ఎప్పుడూ తనవల్లే ఇదంతా జరుగుతుందని గొప్పలు చెప్పుకోలేదు. తన హృదయంలో కొలువయి వున్న రామ నామంవల్లనే తనకింత బలం వచ్చిందని వినమ్రంగా చెపుతాడు హనుమ. అటువంటి సేవకుడిని మనమెప్పటికయినా మరల చూడగలమా?

ఒక పరాయి స్త్రీని ఆశపడితే ఎంతటి విషమ పరిస్తితులని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదానికి సరయిన వుదాహరణ రావణుడు. రావణుడు నిజానికి ఎంతో విద్వాంసుడు, మహా శివ భక్తుడు. రక రకాల శాస్త్రాల్లో నిష్ణాతుడు. అయినా ఒక స్త్రీని బలాత్కరించబోయి యావత్ దానవ సామ్రాజ్యానికే ముప్పుని కొనితెచ్చుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ రోజు ఏ పేపర్ చూసినా, ఏ టి.వి. పెట్టినా పర స్త్రీ గురించి జరుగుతున్న నేరాలే కనిపిస్తున్నాయి. కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనిషి ఎంత పతనమవుతాడో రావణుడే ఒక హెచ్చరిక.

సీతా దేవి నగల మూట దొరికినప్పుడు రాముడు నీళ్ళు నిండిన కళ్ళతో "లక్ష్మణా, ఇవి మీ వదినగారి నగలేనా చూడవయ్యా" అని అడిగితే, దానికి లక్ష్మణుడు నేను వీటిలో వదినగారి కాలి మట్టెల్ని మాత్రమే గుర్తుపట్టగలను అని చెప్పాడు. అంటే ఎప్పుడూ తన తల్లి లాంటి వదినగారి పాదాల వంక తప్ప పైకి కూడా చూడలేదన్న మాట. అదీ ఒక వదినకీ, మరిదికీ వుండవలసిన గౌరవం.

ఇక రాముడి గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. అది మీకు తెలుసు. తండ్రికి మంచి తనయుడిగా, ఇల్లాలికి మంచి భర్తగా, సోదరులకి మంచి అన్నయ్యగా, సేవకుడికి మంచి యజమానికి, స్నేహితుడికి మంచి స్నేహితుడిగా, శతృవుకి సరయిన ప్రత్యర్ధిగా, ఇలా రాముడి ప్రతీ మాట, ప్రతీ కదలిక, ప్రతి సంఘటన మనకి ఒక సందేశాన్నిస్తూనే వుంటాయి. ఒక స్ఫూర్తిని నింపుతూనే వుంటాయి. రాముడు ఒక మతానికో, ఒక కాలానికో లేదా ఒక సమాజానికో సంబంధించిన వ్యక్తి కాడు. వ్యక్తిగా ఆయన అనుసరించిన మార్గం మానవ సమాజంలో వున్న ప్రతీ వ్యక్తికీ దేశ, కాల, మత, కుల ప్రసక్తి లేకుండా అనుసరణీయం.

రాముడు నిజంగా దేవుడా, కాడా అన్న విషయాన్ని పక్కన పెడితే, అప్పటి వరకూ పుస్తకాలకే పరిమితమయి వున్న అనేక ధర్మ సూత్రాల్ని, న్యాయాల్ని ఆచరణలో చూపించిన మహనీయుడు. అందరికీ నీతులు చెప్పాలని వుంటుంది. అందరికీ తాము ఆదర్శప్రాయుడుగా ఉండాలని వుంటుంది. కాని దాన్ని ఆచరణలో చూపించేది కొందరే. ఎన్ని కష్టాలు ఎదురయినా తాను నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినవాడే చరిత్రలో ధీరోదాత్తుడిగా మిగిలిపోతాడు. కోట్లాది భారతీయులకి స్ఫూర్తిని రగిలించిన గాంధీజికి ఆత్మ బలాన్ని అందించిన వాడు రాముడు. రాముడు నిజంగా వారధి కట్టాడా లేదా అని కొట్టుకు చచ్చే బదులు రాముడి జీవితంలో ఆయన ఆచరించి చూపిన సద్గుణాల్లో కొన్నయినా ఆచరించగలిగితే ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతుంది. అందుకే రామాయణం ఒక మహత్తర కావ్యం అయింది. కొన్ని వేల సంవత్సరాలుగా సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతుంది.

ఈ శ్రీరామ నవమి నాడు ఆ మహనీయుని ఒకసారి మరలా స్మరించుకుందాం. ప్రతీ వ్యక్తీ తనలోని రావణుడిని రూపుమాపగలిగితే, ఒక రాముడిగా అవతరిస్తాడు. తన సమాజానికి అనుసరణీయుడవుతాడు. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో... లోక స్సమస్తా సుఖినోభవంతు....

Monday, January 18, 2010

కొత్త బంగారు లోకం...

కొత్త బంగారు లోకం ఎప్పుడు వస్తుందంటే...

1. ఏ పెన్ డ్రైవ్ పెట్టినా కంప్యూటర్ కి వైరస్ రాకుండా వుండాలి.
2. ఏ ప్రోగ్రాం రన్ చేసినా బగ్స్ రాకుండా వుండాలి. బ్లూ స్క్రీన్స్ అసలు రాకూడదు.
3. ఎప్పుడు నెట్ కి కనెక్ట్ అయినా కనీసం 2 ఎం.బి. స్పీడ్ వుండాలి.
4. ఇన్స్టాల్ చేసిన ఏ ప్రోగ్రాం అయినా ఏక్టివేషన్లు, డబ్బులు కట్టడం వంటివి ఏమి చెయ్యకుండానే పనిచేసేయ్యాలి.
5. ఇప్పుడు మా వీధి చివర ఏమి జరుగుతుందో గూగుల్ ఎర్త్‌లో చూడగలగాలి.
6. ఎలుకలు, మీటలు (కీ బోర్డ్, మౌస్) అవసరం లేని కంప్యూటర్ కావాలి.
7. ఏ కొత్త పార్ట్ కనెక్ట్ చేసినా డ్రైవర్స్ కోసం అస్సలు అడగకుండానే పనిచేసెయ్యాలి.
8. ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా, బ్లాగింగ్ చేసినా నాన్న తిట్టకూడదు..
8. ఇక చివరిగా... నేను బ్లాగులో ఏ చెత్త రాసినా కనీసం వెయ్యిమంది చూడాలి. ఓ వంద కామెంట్లు రావాలి.

దేవుడా.. అటువంటి కొత్తబంగారు లోకంలోకి నన్ను తీసుకువెళ్ళు.

ఇంకా ఇలాంటి కోరికలు మీకుకూడా వుంటే ఇక్కడ చెప్పండి. అందరం కలిసే ప్రార్ధిద్దాము...

Sunday, January 17, 2010

బెస్ట్ బ్లాగ్ పోటీలు 2009... మొదటి 10 బ్లాగుల్లో సరదా కూడా వుంది...

ఆంధ్ర లేఖ.కాం వారు నిర్వహించిన 2009 సంవత్సరపు అత్యుత్తమ బ్లాగ్ పోటిల్లో మొదటి పది బ్లాగుల్లో నా బ్లాగ్ కూడా ఎన్నిక కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. క్లారిటి, విషయం మరియు ఆదరణలని అనుసరించి ఈ ఎన్నిక జరిగింది. దీనికి ముందుగా ఆంధ్ర లేఖ వారికి బ్లాగ్ ముఖంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ఇంతకాలం నేను సరదాగా రాసినా, సీరియస్ విషయాలు రాసినా మీ అందరి ఆదరాభిమానాలతోనే ఇంతటి గౌరవం పొందడం సాధ్యం అయింది. మీ అందరి ఆదరాభిమానాలకీ మరొక్క సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడు ఈ పది బ్లాగుల్లో వుత్తమమయిన వాటి కోసం సందర్శకుల అభిప్రాయం అడుగుతున్నారు. మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే, http://www.andhralekha.com కు వెళ్ళి అడుగు భాగంలో వున్న Opinion Poll కి వెళ్ళి, నాకు vote చెయ్యగలరు.
ధన్యవాదాలతో..
మీ..
ఎస్పీ జగదీష్.