Pages

Thursday, April 24, 2014

తెలంగాణా సభలో బయట పడిన రాహుల్‌ అవగాహనా రాహిత్యం

    మొన్న తెలంగాణాలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. వారిని ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ, చివరికి తెలంగాణాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయని, వాటిపై 'మేడిన్‌ తెలంగాణా' అని ఉంటే చాలు వాటిని జనం కొనేస్తారని, ఆ స్థాయికి తెలంగాణా యువత తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారని, ఇంకా ఏవేవో చిత్ర విచిత్రమైన సందేశాలు ఇచ్చి పారేశారు. కాని, ఇక్కడ రాహుల్‌ మరచిపోయిన విషయం ఒకటుంది. ఒక దేశంలో తయారైన వస్తువులకు ఆ దేశం పేరునే ముద్రిస్తారు. ఉదాహరణకు జపాన్‌లో తయారైన వస్తువులకు మేడిన్‌ జపాన్‌ అది ఉంటుంది. చైనాలో తయారైన వస్తువులకు మేడిన్‌ చైనా అని దేశం పేరు ముద్రిస్తారు. ఆ వస్తువులు చైనాలో బీజింగ్‌లో తయారైందా, లేదా షాంగైలో తయారైందా ముద్రించరు. అలాగే భారతదేశంలో ఏ ప్రాంతంలో తయారైనా వస్తువుపైన అయినా గాని మేడిన్‌ ఇండియా అని మాత్రమే ముద్రిస్తారు. అంతేగాని మేడిన్‌ తెలంగాణా, మేడిన్‌ ఆంధ్రా అని వేయరు. ఒకవేళ కాంగ్రెస్‌ మరలా అధికారంలోకి వస్తే, తెలంగాణా ప్రజల సెంటిమెంట్‌ మేరకు ప్రత్యేక తెలంగాణా దేశాన్ని ప్రకటిస్తారేమో చూడాలి. అపుడు రాహుల్‌ చెప్పినట్లు మేడిన్‌ తెలంగాణా అని అక్కడ తయారైన వస్తువులపై వేసుకోవచ్చు.  ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా భారతదేశంలాంటి ఒక పెద్ద దేశానికి రాహుల్‌ ఎలా ప్రధాన మంత్రి అవుదామని ప్రయత్నిస్తున్నాడో ఆశ్చర్యం కలుగుతుంది. భారత ప్రజలు అమాయకులే కావచ్చు గాని, మరీ రాహుల్‌ లాంటి వ్యక్తిని ప్రధానిగా చూడాలని ఆశిస్తున్నారని నేను భావించడం లేదు.

Tuesday, April 8, 2014

అవతార్‌ సినిమాకి రామాయణం ఏ విధంగా ప్రేరణ కలిగించింది? ఒక విశ్లేషణ

    'టైటానిక్‌' సినిమా దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన 'అవతార్‌' సినిమా 2009 లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు సినిమాలకు కూడా ఇంగ్లీష్‌ పేర్లు పెడుతుండగా ఒక హాలీవుడ్‌ చిత్రానికి భారతీయ భాషలో అందునా సంస్క ృత నామం 'అవతార్‌'ని పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అవతార్‌ సినిమాకు భారతీయ పురాణమైన 'రామాయణం' ప్రేరణ అని ప్రకటించాడు. దానితో రామాయణ కథనే అవతార్‌గా రూపొందించారని, భారతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాని సినిమా విడుదల అయ్యాక అందులో రామాయణ కథ లేకపోవడంతో భారతీయులు కొంత నిరాశ చెందారనే చెప్పాలి. రామాయణాన్ని యధాతథంగా తెరకెక్కించక పోయినా, ఆ కథలో ఉండే కొన్ని అంశాల్ని ఈ సినిమా కథలో దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా వాడుకున్నాడనే చెప్పాలి. ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆయా అంశాల గురించి ఒక చిన్న విశ్లేషణని నాకు తోచినంత వరకు మీతో పంచుకుంటున్నాను.

    'అవతార్‌' సినిమా కథకు వస్తే, భూమికి ఎంతో దూరంలో ఉన్న 'పండోరా' అనే గ్రహం మీద ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టడానికి భూమి మీద నుండి కొందరు మనుషులు బయలుదేరి వెళ్ళి, అక్కడ నివాసం ఉండే 'నావి' అనే జాతి ప్రాణుల్ని నాశనం చేయడానికి ప్రయత్నించి, విఫలమై తిరిగి భూమికి వచ్చేయడం అనేది ప్రధాన కధాంశం.

    ఈ సినిమాలో కథానాయకుడు అంగ వైకల్యం ఉన్నవాడు. నడవలేడు. కాని, బ్రెయిన్‌ మేపింగ్‌ అనే ప్రక్రియ ద్వారా పండోరా గ్రహం మీద ఉన్న నావి జాతి ప్రాణాల్లాంటి శరీరాల్లోకి కథానాయకుని ఆత్మని పంపిస్తారు.  ఈ విధానం మన పురాణాల్లోని మహా విష్ణువు అవతార సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. ఒక సారి ఆ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అతనికి అంగవైకల్యం ఉండదు. అందరిలాగానే నడవగలుగుతాడు, ఎగరగలుగుతాడు. ఇక్కడ వైకల్యం అంటే మనసుకి కాదు, శరీరానికి మాత్రమే అని చూపించాడు దర్శకుడు. మన కర్మకు తగినట్టుగా ఇపుడున్న ఈ శరీరం శాశ్వతం కాదు. కర్మఫలం పూర్తి కాగానే, దానికి తగ్గ మరో శరీరం మనకు ఇవ్వబడుతుంది. భూమిమీద ఉండే మానవులతో పాటు ప్రతి జీవి కూడా భగవంతుని అవతారమే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడు సర్వాంతర్యామి. కాని అతని ఆత్మ ఏదైతే ఉందో అదే భూమిమీద జీవిగా ఉద్భవిస్తుంది. ఈ లోకంలో తన పని పూర్తి కాగానే తిరిగి తన నివాసానికి, స్వస్థితికి చేరిపోతుంది. కాని భూమి మీద ఉన్నంత కాలం, ఇదే దేహం నిజమని భావిస్తూ, రకరకాల పనులు (కర్మలు) చేస్తూ ఉంటాము. అవి పూర్తయిపోగానే, అవతారం చాలిస్తాము. ఇదే భావనని, అవతార్‌ సినిమాలో దర్శకుడు తన ప్రతిభ ద్వారా స్పేస్‌ షిప్‌లోని కథానాయకుడి ఆత్మని నావి జాతి శరీరంలో ప్రవేశపెట్టడంగా చూపించాడు. అందుకే ఈ సినిమాకి అవతార్‌ అని పేరు పెట్టాడు. రామాయణంలో రాముడిని కూడా మహా విష్ణువు అవతారంగానే మనం భావిస్తాము. అందుకే ఈ పేరు సార్థకమైంది.

    ఇక సినిమాలో ప్రధాన విషయానికొస్తే, 'నావి' జాతి ప్రాణులు ప్రకృతికి దగ్గరగా జీవించే వారు. వారికి పెద్ద తోక కూడా ఉంది. వారి పాత్ర చిత్రణ రామాయణంలో కనిపించే వానర జాతికి దగ్గరగా ఉంటుంది. వానరులు అంటే సంస్క ృతంలో నరులేనా? అని అర్థం. లేదా నరులు కాని వారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నావి జాతి వారు తమ తోక సహాయంతో ప్రకృతికి అనుసంధానమవుతారు (కనెక్ట్‌ అవుతారు). అక్కడ ఉండే చెట్టు, చేమలు, జంతువులు, మన పురాణాల్లోని గరుడ పక్షుల్ని పోలి ఉండే పక్షులతో కూడా తమ తోకతోనే సంభాషిస్తారు. తమ మనసులో ఏ భావం అనుకుంటారో మిగతా ప్రాణులు కూడా ఆ విధంగానే స్పందిస్తాయి.

    ప్రకృతితో ఇంత సాన్నిహిత్యం కేవలం రామాయణంలో మాత్రమే కనిపిస్తుంది. సినిమా ఆఖరున నావి  జాతి అంతమయ్యే పరిస్థితి ఏర్పడినపుడు ఆ గ్రహం మీద ఉండే ప్రతి జీవి కూడా యుద్ధానికి సన్నద్దమై, నావి జాతికి అండగా నిలిచి యుద్దం చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన సహకారం రామాయణంలో రాముడికి లభించడం చూడవచ్చు. ప్రపంచంలో మరే జాతి చరిత్రలో కూడా కథానాయకుడికి ప్రకృతి అంతా సహకరించడం చూడలేము. రాముడు అడవికి వెళ్ళిన తరువాత అక్కడ ఉండే అన్ని ప్రాణులు రాముడి ఆశ్రమం సమీపంలో తమ సహజ వైరాన్ని మరచి ఎంతో ప్రేమగా ప్రవర్తించేవట. సీతాపహరణం జరిగినపుడు జటాయువు అనే పక్షి రావణుడితో యుద్దం చేసింది. వారధిని నిర్మించేటపుడు ఉడుత చేసిన సహాయం కూడా ప్రపంచ ప్రసిద్దమైనదే. రామ రావణ యుద్దంలో వానరులు, ఎలుగుబంట్లు కూడా రాముడి తరపున పోరాటం చేసాయి. అంటే రామునికి సహాయం చేయడానికి ప్రకృతి యావత్తు కదలివచ్చింది. ఇది మనకు పైకి చిన్న విషయంలా కనిపించవచ్చు గాని, జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, యోగులు, సత్పురుషులు తమ ఆలోచనలతో, తమ మానసిక బలంతో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలరనే విషయం తెలుస్తుంది.

    మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతి నుండి ఏ విధంగాను అతడు వేరు కాడు, అలా వేరుగా ఉండి అతడు జీవించలేడు కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండడం నేర్చుకోవాలి. అపుడే ప్రకృతి నుండి అతనికి సహకారం లభిస్తుంది. జీవితం సుఖమయమవుతుంది. అంతే గాని, అభివృద్ధి పేరుతోను, వ్యాపారం పేరుతోను ప్రకృతిని తన ఇష్టానుసారంగా కొల్లగొట్టి, మిగిలిన జంతువులన్నింటిని కేవలం తనకు ఆహారం అందించే వస్తువులుగానే భావించి, వాటిని ఆహారంకోసమే పెంచి, చంపడం ప్రకృతి ధర్మానికి విరుద్దమే అవుతుంది. అటువంటి ధర్మం తప్పి ప్రవర్తించే జీవులకి ప్రకృతి నుండి ఎటువంటి సహాయం అందదు సరికదా, అటువంటి వాటిని వదిలించుకోవడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. అందుకే నేడు మనం ఎదుర్కొంటున్న కరువులు, తుఫానులు, సునామీలు,  భూకంపాలు తదితరాలన్నీ మానవ జాతి నిర్మూలనకు ప్రకృతి చేసే ప్రయత్నంలా అనిపిస్తున్నాయి. ఎప్పటికైనా మనం నేర్చుకోవలసిన ఈ అంతర్గత సూత్రాన్ని, ప్రకృతితో మానవుడికి గల అనుబంధాన్ని రామాయణ మహా కావ్యం ఆవిష్కరిస్తుంది. అయితే సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, ఈ విషయాన్ని మన కంటే ముందుగా పాశ్చాత్యులు అర్థం చేసుకుని, దాన్ని సినిమా రూపంలో తిరిగి మనకే చెబుతుంటే కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలని, మన కన్నా ఎక్కువగా ఇతర దేశీయులే బాగా అవగాహన చేసుకుంటున్నారు. వాటి లోతుల్ని, భావాల్ని తరచి చూస్తున్నారు. మనమేమో వాళ్ళు వదిలేసిన ఎండమావుల వెంట పరుగెడుతున్నాం. ప్రకృతి అంటే కేవలం మనం వాడుకుని వదిలేసే ప్రాణం లేని బొమ్మ కాదని, ప్రకృతితో మనం ఎపుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలని మన ధర్మం బోధిస్తుంది. ఈ ధర్మం విశ్వజనీనమైనది. సర్వ మానవాళి ఆచరించదగినది. ధర్మాన్ని రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత: