Pages

Sunday, December 7, 2014

7 రంగుల పువ్వు సోవియట్‌ పుస్తకం తెలుగు అనువాదం సరికొత్తగా మీ కోసం...

    సోవియట్‌ పుస్తకాలతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ వాటి విలువ ఏమిటో బాగా తెలుసు. అందులోను అత్యంత అరుదైన పుస్తకాలను మరలా చదువుతున్నపుడు కలిగే అనుభూతి అపురూపంగా ఉంటుంది. అలాంటి అనుభవమే నాకు కూడా కలిగింది. నాకు సోవియట్‌ పుస్తకాల పట్ల అనురాగం కలిగేలా చేసింది నిస్సందేహంగా మా నాన్న గారే. ఆయన లైబ్రరీలో ఎన్నో సోవియట్‌ పుస్తకాలు ఉండేవి. వాటిలో కొన్ని నాకు ఊహ తెలిసి, చదవడం మొదలుపెట్టే నాటికే మా లైబ్రరీలో లేవు. కారణాలు ఏవైనా కానివ్వండి... అవి లేవు అంతే... అటువంటి వాటిలో నాన్న గారు ఎక్కువగా మాకు చెప్పిన కథ ''ఏడు రంగుల పువ్వు''. అదే ఇంగ్లీష్‌లో '' Rainbow Flower ''. నేను బత్తుల అనిల్‌కు ఫోన్‌ చేయగానే ముందుగా అడిగిన పుస్తకం... ''ఏడు రంగుల పువ్వు''. వెంటనే అనిల్‌ ఆ పుస్తకం పూర్వా పరాలన్నీ చెబుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పుస్తకం తెలుగు అనువాదం ఇప్పుడు ఎవరి దగ్గరా లేదు. ఎక్కడ ఉందో తెలియదు. అత్యంత అరుదైన పుస్తకం. నేను అడిగిన మూడో రోజు అనుకుంటాను ఆ పుస్తకం ఇంగ్లీష్‌ వెర్షన్‌ను నాకు కొరియర్‌ చేసారు. ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. కనీసం ముఖ పరిచయం కూడా లేని అనిల్‌ ఇలా వెంటనే పుస్తకాన్ని పంపడం ఏమిటి? ఈ బహుమతికి బదులుగా ఏమైనా చెయ్యాలనిపించింది. వెంటనే ఫోన్‌ చేసి, పుస్తకం పంపినందుకు కృతజ్ఞతలు తెలియజేసి, బదులుగా నేను చెయ్యగలిగింది ఏమిటి అని అడిగాను. ''ఈ పుస్తకాన్ని తెలుగులోకి మీరే అనువాదం చెయ్యాలి'' సూటిగా చెప్పేసాడు అనిల్‌. కాని నేను ఎంత వరకు చెయ్యగలను. సరే ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఇప్పటి వరకు తెలుగు - ఇంగ్లీష్‌ లేదా ఇంగ్లీష్‌ - తెలుగు అనువాదాలు చాలా చేసి ఉన్నాగాని, అవన్నీ సైన్స్‌కి, లేదా చరిత్రకు సంబంధించినవి మాత్రమే. పిల్లల సాహిత్యం ఎప్పుడూ అనువాదం చెయ్యలేదు. సరే... నెమ్మదిగా మొదలుపెట్టాను. దిగిన కొద్దీ లోతు బాగా అర్థమయ్యింది. కొన్ని చోట్ల ఇక నా వల్ల కాదు అని కూడా అనిపించింది. తేలికగా ఉండే పదాలు వెతికి పట్టుకోవాలి. అవి పిల్లలకు అర్థం అవ్వాలి. అందుకే మా అమ్మాయిలు శ్రీ సత్య, శ్రీ మహి సహాయం తీసుకున్నాను.. 6వ తరగతి, వ తరగతి చదువుతున్నారు. వాళ్ళే చదివి తెలుగులో అర్థం చెబుతూ ఉంటే, వారి మాటల్లో నుండి నాకు కావలసిన పదాల్ని వెతికి పట్టుకుని, వాటిని వ్రాసేవాడిని.  అలా వారం రోజుల పాటు సాగిన యజ్ఞం పూర్తయింది. దాన్ని ఫెయిర్‌ చేసి, నాకున్న పనుల ఒత్తిడిలో నుండి వీలు చూసుకుని, మా ప్రెస్‌లోనే డిజైనింగ్‌ చేయించే సరికి మరో వారం గడిచిపోయింది. అనిల్‌ మాత్రం మధ్యలో ఎక్కడా మర్చిపోకుండా నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. తనకి ఎన్ని అభినందనలు తెలిపినా సరిపోదు. చివరిగా ఇప్పుడు మీరు చూసిన రూపం వచ్చింది. నా ప్రయత్నంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వాటిని నాకు తెలియజేస్తే, సరిదిద్దుతాను. కథనం పరంగా గాని, అక్షర దోషాలుగాని ఏమైనా ఉన్నట్లయితే సరిచేస్తాను. ఈ పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మీ... ఎస్పీ జగదీష్‌ రెడ్డి




Friday, September 5, 2014

నేను - నాన్న - సోవియట్‌ పుస్తకాలు

        సోవియట్‌ పుస్తకాల గురించి గుర్తు చేసుకోవడమంటే బాల్యాన్ని తట్టిలేపడమే. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, అన్నింటినీ మించి, ఎంతో విజ్ఞానం - వినోదం - ఆహ్లాదం. ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు గాని, పాత తరంలో పుస్తకాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా రష్యా సాహిత్యంతో సాన్నిహిత్యం ఉండే తీరుతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రచ్చన్న యుద్దం మొదలైంది. అమెరికా, రష్యాల మధ్య ఆధిపత్య పోరులో భారత్‌ ఎవరివైపు మొగ్గు చూపాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితిలో అప్పటి ప్రధాని నెహ్రూ, రష్యాతో మైత్రి చేసుకున్నాను. నవ భారత్‌ను నిర్మించడానికి వీలుగా రష్యా మనకు పొరుగుదేశంగాను, అప్పట్లో కమ్యూనిజం వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగాను, ఆ దేశంలో స్నేహ బంధం కొనసాగింది. అదిగో... అప్పుడే రష్యన్లు మాయ చేసారు. ఇక్కడి వారిలో తమ భావజాలాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలతో పాటు, బాల సాహిత్యాన్ని కూడా పరిచయం చేసారు. అలా వచ్చినవే తెలుగులో రష్యన్‌ పుస్తకాలు. అవన్నీ అద్భుతమైన రంగుల్లో ముద్రించబడి, సాంకేతికంగా గాని, సాహిత్యపరంగా గాని, అత్యున్నత స్థాయిలో ఉండేవి.

        నాకు ఆరేళ్ల వయసులో అనుకుంటా - మా నాన్న గారు - మొట్టమొదటి రష్యన్‌  పుస్తకాన్ని పరిచయం చేసారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ''మాయ గుర్రం - మేటి గుర్రం''. ఆ బొమ్మలతోనే మంత్ర ముగ్దుణ్ని అయిపోయేను. ఆ బొమ్మలలో ఉన్న కథ కోసం ప్రతీ అక్షరాన్ని కూడబలుక్కునే వాడిని. నాన్న సాయం చేసేవారు. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరమూ నాకు గుర్తే. ఎంతలా ఆ పుస్తకం నచ్చేసిందంటే, ఇప్పటికీ నా పెర్సనల్‌ లైబ్రరీలో ఆ పుస్తకం పదిలంగా ఉంది. నా రెండవ తరగతిలో నేను క్లాస్‌ ఫస్ట్‌ వచ్చినపుడు నాకు వచ్చిన బహుమతి ''ఉన్నారు ఇలాంటి అబ్బాయిలు''. ఎంత అందమైన పుస్తకం అది... నా తమ్ముడికేమో ''వర్థిల్లాలి సబ్బు నీళ్ళు'' వచ్చింది. దాన్ని చూసి అందరం ఏడిపించే వాళ్ళం. వీడెప్పుడూ శుభ్రంగా ఉండడు. అందుకే వీడికి ఇలాంటి పుస్తకం బహుమతిగా వచ్చింది అని. నాన్నారి చిన్నతనంలో కథతో పాటుగా ఎన్ని నీతులు నేర్చుకున్నామని? నొప్పి డాక్టరు కథని ఎన్నిసార్లు చదివామో, ముసలి వర్వారాను అన్నే సార్లు తిట్టుకొనే వాళ్ళం - జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. రంగు రంగుల చేపలతో పాటు అక్వేరియంలో విహరించేవాళ్ళం. ఆకుపచ్చని ద్వీపం, మొసలి కాజేసిన సూర్యుడు, మత్స్య మిత్రుడి మంత్ర మహిమ వంటి ఎన్నో పుస్తకాల్లో మునిగి తేలేవాళ్ళం. వెర్రి వెంగళాయ ఇవానుష్క అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా తన లాగా జార్‌ చక్రవర్తి కూతురు - అందాల భరిణెలాంటి అమ్మాయిని మాయ గుర్రం ఎక్కి వెళ్ళి పెళ్ళాడకపోతామా అని ఆశ.

        కొంచెం పెద్దయ్యాక ''భూమి ఇలా ఉందని ఎలా కనిపెట్టారు'' చదువుతూ, భూ ప్రపంచం చివరి అంచుల దాకా వెళ్ళి వచ్చేసాను. ''టెలిస్కోప్‌ చెప్పిన కథలు''లో అయితే సూర్యుడి దగ్గర నుండి ప్లూటో వరకు ప్రయాణం కొనసాగింది.  ప్రాచీన ప్రపంచ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల చరిత్రను బొమ్మల్లో చూడడం ఎవరు మరిచిపోగలరు? మానవుడే మహాశక్తి సంపన్నుడు'' లో కొన్ని లక్షల సంవత్సరాలుగా మానవుడు ఎలా పరిణామం చెంది, ఇప్పటి స్థితికి చేరుకొన్నాడో అనే విషయాన్ని ఎంత ఆసక్తి కరంగా చదివానో, ''ఖగోళ శాస్త్రం- వినోదం, విజ్ఞానం''లో కాల్పనిక కథల్నీ అంతే ఆసక్తికరంగా గుక్కతిప్పుకోకుండా చదివాను. కాల్పనిక కథలంటే గుర్తుకు వచ్చింది - ఇకతియాండర్‌, గులాబీ మేఘాలు, ప్రతిబింబాలు ఈ పుస్తకాలన్నీ ఎన్ని సార్లు చదివానో ఊహా ప్రపంచంలో విహరించానో, వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యమంతా రష్యన్‌ పుస్తకాలతోనే గడిచిపోయింది  - నిండిపోయింది. ప్రపంచ చరిత్ర నుండి అణు విజ్ఞానం వరకు, చిన్న పిల్లల కథల నుండి సైన్స్‌ ఫిక్షన్‌ వరకు ఇలా ప్రతి అంశం మీదా సోవియట్‌లో ప్రచురితమైన ఇంచుమించు ప్రతి ఒక్క పుస్తకాన్ని చదివాను. అన్నీ అని చెప్పలేను కాని - చాలా వరకు అని చెప్పగలను.

        సోవియట్‌ పుస్తకాల గురించి చెప్పేటపుడు తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసిన వ్యక్తి ఒకరున్నారు - మా నాన్న గారు. ఆయనకు కూడా పుస్తకాలంటే ఎడతెగని అభిమానం - కాదు ఇంకా ఎక్కువే - పిచ్చి అంటారే  - అలాంటిదే. నేను కావాలన్న ప్రతి పుస్తకాన్ని నాకు తెచ్చిచ్చేవారు - ఎందుకు అని అడిగేవారు కాదు. విశాలాంధ్ర బస్‌లో నేను రెగ్యులర్‌ కస్టమర్‌ని. నాన్న గారు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఆయన కోసం ఎదురు చూసేవాళ్లం - ఎంత రాత్రయినా సరే. ఎందుకంటే ఆయనతో పాటుగా ఎన్నో సోవియట్‌ పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు. అవి చూస్తే కాని నిద్రపోయేవాళ్ళం కాదు. ఆయన తెచ్చే పుస్తకాలు ముందు ఎవరు చదువుతారో అని మా అన్నదమ్ముల మధ్య పోటీగా ఉండేది. అవన్నీ చదివి వాటిలో  ఏముందో నాన్నకి చెప్పాలి. అదీ ఒప్పందం. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌లో విశాలాంధ్ర స్టాల్‌ కనబడితే - వెంటనే అక్కడ హాజరు. కొత్తగా వచ్చినవన్నీ ఏరుకొనేవాడిని. ఏనాడూ కూడా నాన్న గారు బిల్‌ ఎంత అయింది అని చూడలేదు. అటువంటి నాన్న దొరకడం నిజంగా నా అదృష్టం. ఇప్పటికీ నేను కొత్త పుస్తకం  కొనగానే ఆయనకు చూపించడం నా అలవాటు. పేపర్లలో సమీక్షలు చదివి, ఈ పుస్తకం ఇంతా తెప్పించలేదా - ఇదింకా చదవలేదా అని నన్ను వెంబడిస్తూనే ఉంటారు.

       మళ్ళీ ఇన్నాళ్ళకు, నాకు తెలిసిన కొన్ని వేల మందిలో మరలా నాన్నగారి లాంటి పుస్తకాల ప్రేమికుణ్ణి చూసాను - బత్తుల అనిల్‌ రూపంలో. బ్లాగులో  దొరికాడు. వెంటనే ఫోన్‌ కలిపాను. కొద్దిసేపు మాట్లాడగానే తెలిసింది - పుస్తకాల పిచ్చి - చివరి దశలో ఉంది. నేను చదువుతున్నాను - తను ప్రేమిస్తున్నాడు - అంతే తేడా. ఎంతో ఆర్తి ఉంటే గాని, ఇటువంటి ప్రయత్నం సాధ్యం కాదు. నేను ఊహించిన దాని కంటే ఎంతో అద్భుతంగా పుస్తకాలని సేకరిస్తున్నాడు - అందరికీ పంచుతున్నాడు. వెంటనే మాట ఇచ్చాను. నా దగ్గర  ఉన్న వాటిలో నుండి కొన్నింటిని స్కాన్‌ చేసిస్తాను అని మాటిచ్చాను. ఆ  మాత్రం మాటకి తను నాకిచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? మా నాన్న గారు ఆయన చిన్నతనంలో పోగొట్టుకున్న ఏడు రంగుల పువ్వు - ఇంగ్లీష్‌ వెర్షన్‌. ఆయన ఆ పుస్తకం గురించి, దానిలో కథ గురించి నాతో ఎన్నో సార్లు చెప్పారు. అంతకు మించి ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడా పుస్తకం తెలుగు వెర్షన్‌ దొరకలేదు. కాని అనిల్‌ గారి ద్వారా ఇంగ్లీష్‌ వెర్షన్‌  దొరికింది. ఆ పుస్తకాన్ని మా  నాన్న గారికి కానుకగా ఇచ్చాను. ఆయన కళ్ళలో ఎంతో ఆనందం. అనిల్‌కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అనిల్‌ ఒకటే అన్నారు -  మీరు నా రుణం తీర్చుకోవాలనుకుంటే ఆ పుస్తకాన్ని తెలుగులో మీరే అనువాదం చేయండి - అని. పెద్దబాధ్యతే.. కాని ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే  పూర్తి చేస్తాను.

        మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి, జ్ఞాపకాల దొంతరల్ని బూజు దులిపి, పుస్తకాలతో నా తీయని చెలిమిని గుర్తు చేసుకొనేలా చేసిన సోదరుడు అనిల్‌కి మరలా హృదయపూర్వక ధన్యవాదాలు. 

అనిల్ బ్లాగ్ ని సందర్శించడం మరచిపోకండి... http://sovietbooksintelugu.blogspot.in

Sunday, May 25, 2014

భారత్‌ గెలిచింది.... ఇది రెండవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే సమయం


    అవును... ఇది నిజమే... భారత్‌ నిజంగానే గెలిచింది. ఇప్పటి వరకు పరాయి సంకర జాతి పాలనలో మగ్గిన భారత్‌ తన ప్రాభవాన్ని పునరుద్దరించుకోవడానికి, పునరుత్తేజితమవడానికి సమాయత్తమయింది. అది ఈ ఎన్నికల్లో నిరూపితమైంది. దాదాపు 500 సంవత్సరాల పాటు పరాయి పాలనలో నానా అగచాట్లు పడి, 67 సం||ల క్రితం స్వతంత్ర దేశంగా అవతరించినప్పటికి, తెచ్చిపెట్టుకున్న బానిసత్వంతో భౌతికంగా, మానసికంగా ఎంతో వేదన అనుభవించాం. ఇక చాలు... వాళ్ళను, వీళ్ళను కాళ్ళు, గడ్డం పట్టుకుని అడగనక్కర్లేదు. మనకు కావలసినదేదో మనం చేసుకోవచ్చు. ఎవరి కోసమో ఎదురు చూడనవసరం లేదు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ, అధికార బదిలీ మాత్రమే జరిగింది. అవే పరాయి చట్టాలు, వలసవాద విధానాలు. అన్ని దేశాల నుండి కాపీ చేసిన విషయాలనే ప్రజల నెత్తిన రుద్దారు తప్ప, ఒకప్పుడు ప్రపంచానికే మార్గ దర్శకత్వం చేసిన దేశంలో, ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చిన సంస్కృతిని నిర్దాక్షిణ్యంగా అణచివేసారు. అలా చేయడాన్నే అభివృద్దికి సూచికగా ప్రజల్ని వంచించారు.  కాని ఏ దేశం కూడా తన మూలాల్ని మరచి అభివృద్దిని పొందజాలదు. విష సంస్కృతిని భుజాల కెత్తుకున్న ఏ నాగరికతా మనజాలదు. ఇది మన దేశంలో ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది.

    ప్రజలకు సుపరిపాలన అందించే విషయంలో హిందూ విధానం ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా చెప్పుకోవాలి. ఇక్కడ అత్యంత ప్రాచీన కాలం నుండి ఎన్నో రాజ్యాలు విలసిల్లాయి, ఎన్నో మతాలు ఆవిర్భవించాయి. కాని ఎప్పుడూ ఇక్కడ విప్లవం సంభవించలేదు. ఏది జరిగినా ఎంతో సామరస్యపూర్వకంగా జరిగింది. రక్త పాతంతో ఎప్పుడూ ఏదీ సంభవించలేదు. ఒక చాణక్యుని సహాయంతో అర్థశాస్త్ర సహకారంతో చంద్రగుప్త మౌర్యుని ఆధ్వర్యంలో సువిశాల మగధ సామ్రాజ్యం స్థాపించబడి, అశోకుని కాలం నాటికి ఉచ్చస్థితికి చేరుకుంది. చరిత్ర కారులు పేర్కొనే స్వర్ణ యుగాలన్నీ కూడా హిందూ రాజుల పరిపాలనలో ఏర్పడినట్లుగా మనం గమనించవచ్చు. విద్యారణ్యుల వారి మార్గదర్శకత్వంలో, హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయ నగర సామ్రాజ్యం తదుపరి శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటికి స్వర్ణయుగాన్ని సంతరించుకుంది. గుప్తుల కాలం నాటి స్వర్ణ యుగం కూడా హిందూ పాలకుల పుణ్యమే. రాజ్యాన్ని పరిపాలించడాన్ని కూడా ఒక యజ్ఞంగా భావించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. 'రాజ్యంతే ధ్రువమ్‌ నరకమ్‌' అని మహాభారతంలో ఇంద్రుడు ధర్మరాజుకు చెబుతాడు. అంటే రాజ్యం చేసిన వాడు నరకానికి వెళతాడని అర్థం. పరిపాలన చేసేపుడు తెలిసి గాని, తెలియక గాని కొంత మందికి ఆనందం చేకూర్చే క్రమంలో, మరికొంత మందికి దుఃఖాన్ని కలుగచేయవచ్చు. తమ కష్టార్జితాన్ని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించేటపుడు ప్రజలు పడే బాధ కూడా ఆ రాజుకే తగులుతుందట. అందుకే పన్నుల్ని వసూలు చేసేటపుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజు తన రాజ్యంలోని ప్రజల్ని కన్నబిడ్డల వలే పరిపాలించాలి అని ధర్మ శాస్త్రం చెబుతున్నది. కాని ఇతర మత గ్రంధాల్లో మాత్రం గెలిచిన రాజ్యంలోని ప్రజలందర్నీ బానిసలుగా చేసుకోవాలని, వారి స్త్రీలతో కోరికలు తీర్చుకోవాలని, వారి నగరాలన్నిటినీ పాడుపెట్టాలని ఎంతో 'పవిత్రంగా' రాసిపెట్టారు. అందుకే వాటిని అనుసరించే వారు తాము ఆక్రమించిన దేశాలన్నిటిని కొల్లగొట్టి, పాడుచేసి, వారి సంస్కృతిని తుడిచిపెట్టి, ప్రజల్ని ఎందుకూ పనికిరాకుండా చేసి, సర్వనాశనం చేస్తున్నారు. ఫలితం మారణహోమం, విధ్వంసం. అదే విద్వేషాన్ని, బానిసత్వాన్ని ప్రజలపై రుద్ది, తమ అనంతరం కూడా బానిస వ్యవస్థ కొనసాగేలా చేసుకున్నారు కాబట్టే నేడు దేశంలో మనం చూస్తున్న అన్ని రంగాల పతనం. ఇటువంటి పతనాన్ని అరికట్టాలంటే, స్వదేశీ సంస్కృతిని, ధర్మాన్ని సంపూర్ణంగా నమ్మిన, ఆచరించిన వారే నాయకులుగా ఉండాలి. 'యధా రాజా తథా ప్రజా' అంటారు. రాజు మంచివాడయితే ప్రజలు మంచివారవుతారు, కాని రాజు ధర్మం తప్పి ప్రవర్తిస్తే, రాజ్యం పరుల పాలవుతుంది. ఇప్పటి వరకు జరిగింది ఇదే. కాని, ప్రజలు ఇప్పటికైనా తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు. మంచి నాయకుడు వారికి దొరికాడు. అందుకే అందలం ఎక్కించారు.

    ఈ విజయం నిస్సందేహంగా నరేంద్ర మోడీ సాధించిన విజయంగా చెప్పుకోవాలి. భారత్‌ నుండి ఒక శక్తివంతమైన, సమర్థవంతమైన నాయకుడు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రధాన మంత్రులుగా పనిచేసినప్పటికీ వారందరూ ఏదో విధంగా ఒక కుటుంబ ప్రభావానికి, కుహానా మేధావుల ఒత్తిడికి, సాంస్కృతిక బానిసత్వానికి తలొగ్గి బాధ్యతలు చేపట్టారు. వారంతట వారు స్వతంత్రించి ఏ నిర్ణయమూ తీసుకోలేని దుస్థితి. భారతీయ సంస్కృతీ వైభవంపై ఏ మాత్రం అవగాహన లేని వారు, దేశ భక్తి శూన్యులు, పరదేశ స్తోత్ర పరాయణులు ఇప్పటి వరకు మన నాయకులయ్యారు.

    కాని, ఇప్పుడు పరిస్థితి మారింది. నిజమైన లౌకిక వాదానికి అర్థం తెలిసిన, ఆచరణలో పెట్టగలిగిన వారు ప్రధాని పదవిని అధిష్టించబోతున్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశాన్ని ప్రేమించగలిగిన నాయకుడుండాలి. అతనికి స్వార్థం ఉండకూడదు. తన హితం కన్నా పరహితమే ముఖ్యమని పోరాడే వాడు అయ్యుండాలి. ముఖ్యంగా ఆ దేశ సంస్కృతి గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ నూటికి నూరుపాళ్ళు ఉన్న వ్యక్తి నరేంద్ర మోడి గారు. ఇటువంటి వ్యక్తి చేతిలో దేశ భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతోంది అన్న విషయంలో ఎటువంటి సందేహం ఉండనక్కర్లేదు. దేశాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుని, దేశ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో హేళన చేసే వారే మేధావులుగా చెలామణి అవుతున్న చోట, నిజమైన దేశ భక్తుడు ప్రధాని పదవిని అధిష్టించబోవడం నిజంగా అద్భుతమే. ఇన్నాళ్ళకి దేశ ప్రజల ఆకాంక్షలకి అనుగుణమైన నాయకుడు దొరికాడు. అది కూడా ఎవరూ ఊహించనంత ప్రజా బలంతో గెలిచాడు. ఇక అతనికి తిరుగేలేదు. భారత అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జైహింద్‌...

Thursday, April 24, 2014

తెలంగాణా సభలో బయట పడిన రాహుల్‌ అవగాహనా రాహిత్యం

    మొన్న తెలంగాణాలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. వారిని ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ, చివరికి తెలంగాణాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయని, వాటిపై 'మేడిన్‌ తెలంగాణా' అని ఉంటే చాలు వాటిని జనం కొనేస్తారని, ఆ స్థాయికి తెలంగాణా యువత తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారని, ఇంకా ఏవేవో చిత్ర విచిత్రమైన సందేశాలు ఇచ్చి పారేశారు. కాని, ఇక్కడ రాహుల్‌ మరచిపోయిన విషయం ఒకటుంది. ఒక దేశంలో తయారైన వస్తువులకు ఆ దేశం పేరునే ముద్రిస్తారు. ఉదాహరణకు జపాన్‌లో తయారైన వస్తువులకు మేడిన్‌ జపాన్‌ అది ఉంటుంది. చైనాలో తయారైన వస్తువులకు మేడిన్‌ చైనా అని దేశం పేరు ముద్రిస్తారు. ఆ వస్తువులు చైనాలో బీజింగ్‌లో తయారైందా, లేదా షాంగైలో తయారైందా ముద్రించరు. అలాగే భారతదేశంలో ఏ ప్రాంతంలో తయారైనా వస్తువుపైన అయినా గాని మేడిన్‌ ఇండియా అని మాత్రమే ముద్రిస్తారు. అంతేగాని మేడిన్‌ తెలంగాణా, మేడిన్‌ ఆంధ్రా అని వేయరు. ఒకవేళ కాంగ్రెస్‌ మరలా అధికారంలోకి వస్తే, తెలంగాణా ప్రజల సెంటిమెంట్‌ మేరకు ప్రత్యేక తెలంగాణా దేశాన్ని ప్రకటిస్తారేమో చూడాలి. అపుడు రాహుల్‌ చెప్పినట్లు మేడిన్‌ తెలంగాణా అని అక్కడ తయారైన వస్తువులపై వేసుకోవచ్చు.  ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా భారతదేశంలాంటి ఒక పెద్ద దేశానికి రాహుల్‌ ఎలా ప్రధాన మంత్రి అవుదామని ప్రయత్నిస్తున్నాడో ఆశ్చర్యం కలుగుతుంది. భారత ప్రజలు అమాయకులే కావచ్చు గాని, మరీ రాహుల్‌ లాంటి వ్యక్తిని ప్రధానిగా చూడాలని ఆశిస్తున్నారని నేను భావించడం లేదు.

Tuesday, April 8, 2014

అవతార్‌ సినిమాకి రామాయణం ఏ విధంగా ప్రేరణ కలిగించింది? ఒక విశ్లేషణ

    'టైటానిక్‌' సినిమా దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన 'అవతార్‌' సినిమా 2009 లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు సినిమాలకు కూడా ఇంగ్లీష్‌ పేర్లు పెడుతుండగా ఒక హాలీవుడ్‌ చిత్రానికి భారతీయ భాషలో అందునా సంస్క ృత నామం 'అవతార్‌'ని పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అవతార్‌ సినిమాకు భారతీయ పురాణమైన 'రామాయణం' ప్రేరణ అని ప్రకటించాడు. దానితో రామాయణ కథనే అవతార్‌గా రూపొందించారని, భారతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాని సినిమా విడుదల అయ్యాక అందులో రామాయణ కథ లేకపోవడంతో భారతీయులు కొంత నిరాశ చెందారనే చెప్పాలి. రామాయణాన్ని యధాతథంగా తెరకెక్కించక పోయినా, ఆ కథలో ఉండే కొన్ని అంశాల్ని ఈ సినిమా కథలో దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా వాడుకున్నాడనే చెప్పాలి. ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆయా అంశాల గురించి ఒక చిన్న విశ్లేషణని నాకు తోచినంత వరకు మీతో పంచుకుంటున్నాను.

    'అవతార్‌' సినిమా కథకు వస్తే, భూమికి ఎంతో దూరంలో ఉన్న 'పండోరా' అనే గ్రహం మీద ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టడానికి భూమి మీద నుండి కొందరు మనుషులు బయలుదేరి వెళ్ళి, అక్కడ నివాసం ఉండే 'నావి' అనే జాతి ప్రాణుల్ని నాశనం చేయడానికి ప్రయత్నించి, విఫలమై తిరిగి భూమికి వచ్చేయడం అనేది ప్రధాన కధాంశం.

    ఈ సినిమాలో కథానాయకుడు అంగ వైకల్యం ఉన్నవాడు. నడవలేడు. కాని, బ్రెయిన్‌ మేపింగ్‌ అనే ప్రక్రియ ద్వారా పండోరా గ్రహం మీద ఉన్న నావి జాతి ప్రాణాల్లాంటి శరీరాల్లోకి కథానాయకుని ఆత్మని పంపిస్తారు.  ఈ విధానం మన పురాణాల్లోని మహా విష్ణువు అవతార సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. ఒక సారి ఆ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అతనికి అంగవైకల్యం ఉండదు. అందరిలాగానే నడవగలుగుతాడు, ఎగరగలుగుతాడు. ఇక్కడ వైకల్యం అంటే మనసుకి కాదు, శరీరానికి మాత్రమే అని చూపించాడు దర్శకుడు. మన కర్మకు తగినట్టుగా ఇపుడున్న ఈ శరీరం శాశ్వతం కాదు. కర్మఫలం పూర్తి కాగానే, దానికి తగ్గ మరో శరీరం మనకు ఇవ్వబడుతుంది. భూమిమీద ఉండే మానవులతో పాటు ప్రతి జీవి కూడా భగవంతుని అవతారమే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడు సర్వాంతర్యామి. కాని అతని ఆత్మ ఏదైతే ఉందో అదే భూమిమీద జీవిగా ఉద్భవిస్తుంది. ఈ లోకంలో తన పని పూర్తి కాగానే తిరిగి తన నివాసానికి, స్వస్థితికి చేరిపోతుంది. కాని భూమి మీద ఉన్నంత కాలం, ఇదే దేహం నిజమని భావిస్తూ, రకరకాల పనులు (కర్మలు) చేస్తూ ఉంటాము. అవి పూర్తయిపోగానే, అవతారం చాలిస్తాము. ఇదే భావనని, అవతార్‌ సినిమాలో దర్శకుడు తన ప్రతిభ ద్వారా స్పేస్‌ షిప్‌లోని కథానాయకుడి ఆత్మని నావి జాతి శరీరంలో ప్రవేశపెట్టడంగా చూపించాడు. అందుకే ఈ సినిమాకి అవతార్‌ అని పేరు పెట్టాడు. రామాయణంలో రాముడిని కూడా మహా విష్ణువు అవతారంగానే మనం భావిస్తాము. అందుకే ఈ పేరు సార్థకమైంది.

    ఇక సినిమాలో ప్రధాన విషయానికొస్తే, 'నావి' జాతి ప్రాణులు ప్రకృతికి దగ్గరగా జీవించే వారు. వారికి పెద్ద తోక కూడా ఉంది. వారి పాత్ర చిత్రణ రామాయణంలో కనిపించే వానర జాతికి దగ్గరగా ఉంటుంది. వానరులు అంటే సంస్క ృతంలో నరులేనా? అని అర్థం. లేదా నరులు కాని వారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నావి జాతి వారు తమ తోక సహాయంతో ప్రకృతికి అనుసంధానమవుతారు (కనెక్ట్‌ అవుతారు). అక్కడ ఉండే చెట్టు, చేమలు, జంతువులు, మన పురాణాల్లోని గరుడ పక్షుల్ని పోలి ఉండే పక్షులతో కూడా తమ తోకతోనే సంభాషిస్తారు. తమ మనసులో ఏ భావం అనుకుంటారో మిగతా ప్రాణులు కూడా ఆ విధంగానే స్పందిస్తాయి.

    ప్రకృతితో ఇంత సాన్నిహిత్యం కేవలం రామాయణంలో మాత్రమే కనిపిస్తుంది. సినిమా ఆఖరున నావి  జాతి అంతమయ్యే పరిస్థితి ఏర్పడినపుడు ఆ గ్రహం మీద ఉండే ప్రతి జీవి కూడా యుద్ధానికి సన్నద్దమై, నావి జాతికి అండగా నిలిచి యుద్దం చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన సహకారం రామాయణంలో రాముడికి లభించడం చూడవచ్చు. ప్రపంచంలో మరే జాతి చరిత్రలో కూడా కథానాయకుడికి ప్రకృతి అంతా సహకరించడం చూడలేము. రాముడు అడవికి వెళ్ళిన తరువాత అక్కడ ఉండే అన్ని ప్రాణులు రాముడి ఆశ్రమం సమీపంలో తమ సహజ వైరాన్ని మరచి ఎంతో ప్రేమగా ప్రవర్తించేవట. సీతాపహరణం జరిగినపుడు జటాయువు అనే పక్షి రావణుడితో యుద్దం చేసింది. వారధిని నిర్మించేటపుడు ఉడుత చేసిన సహాయం కూడా ప్రపంచ ప్రసిద్దమైనదే. రామ రావణ యుద్దంలో వానరులు, ఎలుగుబంట్లు కూడా రాముడి తరపున పోరాటం చేసాయి. అంటే రామునికి సహాయం చేయడానికి ప్రకృతి యావత్తు కదలివచ్చింది. ఇది మనకు పైకి చిన్న విషయంలా కనిపించవచ్చు గాని, జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, యోగులు, సత్పురుషులు తమ ఆలోచనలతో, తమ మానసిక బలంతో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలరనే విషయం తెలుస్తుంది.

    మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతి నుండి ఏ విధంగాను అతడు వేరు కాడు, అలా వేరుగా ఉండి అతడు జీవించలేడు కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండడం నేర్చుకోవాలి. అపుడే ప్రకృతి నుండి అతనికి సహకారం లభిస్తుంది. జీవితం సుఖమయమవుతుంది. అంతే గాని, అభివృద్ధి పేరుతోను, వ్యాపారం పేరుతోను ప్రకృతిని తన ఇష్టానుసారంగా కొల్లగొట్టి, మిగిలిన జంతువులన్నింటిని కేవలం తనకు ఆహారం అందించే వస్తువులుగానే భావించి, వాటిని ఆహారంకోసమే పెంచి, చంపడం ప్రకృతి ధర్మానికి విరుద్దమే అవుతుంది. అటువంటి ధర్మం తప్పి ప్రవర్తించే జీవులకి ప్రకృతి నుండి ఎటువంటి సహాయం అందదు సరికదా, అటువంటి వాటిని వదిలించుకోవడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. అందుకే నేడు మనం ఎదుర్కొంటున్న కరువులు, తుఫానులు, సునామీలు,  భూకంపాలు తదితరాలన్నీ మానవ జాతి నిర్మూలనకు ప్రకృతి చేసే ప్రయత్నంలా అనిపిస్తున్నాయి. ఎప్పటికైనా మనం నేర్చుకోవలసిన ఈ అంతర్గత సూత్రాన్ని, ప్రకృతితో మానవుడికి గల అనుబంధాన్ని రామాయణ మహా కావ్యం ఆవిష్కరిస్తుంది. అయితే సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, ఈ విషయాన్ని మన కంటే ముందుగా పాశ్చాత్యులు అర్థం చేసుకుని, దాన్ని సినిమా రూపంలో తిరిగి మనకే చెబుతుంటే కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలని, మన కన్నా ఎక్కువగా ఇతర దేశీయులే బాగా అవగాహన చేసుకుంటున్నారు. వాటి లోతుల్ని, భావాల్ని తరచి చూస్తున్నారు. మనమేమో వాళ్ళు వదిలేసిన ఎండమావుల వెంట పరుగెడుతున్నాం. ప్రకృతి అంటే కేవలం మనం వాడుకుని వదిలేసే ప్రాణం లేని బొమ్మ కాదని, ప్రకృతితో మనం ఎపుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలని మన ధర్మం బోధిస్తుంది. ఈ ధర్మం విశ్వజనీనమైనది. సర్వ మానవాళి ఆచరించదగినది. ధర్మాన్ని రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత:

Thursday, February 13, 2014

ప్రేమంటే ఏమిటంటే... (కాముకుల పండుగ జరుపుకోవలసిన ఆగత్యం భారతీయులకు లేదు.)

         సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు మారని అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. జీవనం సజావుగా సాగడానికి, జీవన పరంపర ఎడతెగకుండా నడవడానికి కారణం ప్రేమ. ఏ దేశ చరిత్ర చూసినా, ఏ భాషలో కావ్యం పరిశీలించినా ప్రేమ లేకపోతే అది సంపూర్ణం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ వల్లనే ప్రపంచ చరిత్రలు తారుమారయ్యాయి. మొదటి ప్రపంచ యుద్దం మొదలవడానికి ఆస్ట్రియా రాజు ప్రేమ వృత్తాంతమే కారణమని కొందరి అభిప్రాయం. ఆనాటి కాళిదాసు నుండి నేటి దేవదాసు వరకు తమ కథలు, కావ్యాల నిండా ప్రేమ గుబాళింపులు నింపిన వారే. ఆమాట కొస్తే కావ్యాలలో ప్రేమ లేకపోతే ఉప్పు లేని కూరలాగా అవి చప్పగా ఉంటాయి. అందుకే నాటి నుండి నేటి వరకు సినిమాలలో సింహభాగం ప్రేమ చుట్టూ తిరిగే కథలే వస్తున్నాయి, రాబోతున్నాయి కూడా. ఆయా నటీనటులు, సన్నివేశాలు, నేపధ్యాలు మారవచ్చును గాక - మూల కథ మాత్రం ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతర్లీనంగా హృదయాల్ని రంజింపచేస్తూనే ఉంటుంది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆది ప్రేమికులు కూడా. పార్వతి తాను వలచిన శివుని వివాహమాడడానికి ఎన్నో సంవత్సరాలు వేచి చూసింది. ఆఖరికి శివుని త్రినేత్రాగ్నికి భస్మమైన మన్మధుని సాక్షిగా పార్వతీ కళ్యాణం జరిగింది. రాధా మాధవుల ప్రేమ కథ జగమంతా తెలిసిందే. సీతా రాముల అన్యోన్యత, వారి హృదయాల్లోని ప్రేమ తత్వం ఇప్పటికీ ఎప్పటికీ సమాజానికి నమూనాగా ఉంటుంది. వనవాస సమయంలో ఎన్నో కష్టాలు ఉంటాయని తెలిసినా కూడా, రాణి వాసపు సుఖాలు అసలు ఉండవని అర్థమైనా కూడా, కష్ట సమయంలో పతి వెంటే నడిచివెళ్ళిన సీతమ్మ కంటే మంచి ప్రేమికురాలు మనకు ఎక్కడ కనిపిస్తుంది. శకుంతల, దుష్యంతుల ప్రణయ వృత్తాంతమే లేకపోతే, కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలం మనకు దక్కేదే కాదు. రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి ఆయన కూతురు దేవయానికి ప్రేమ ద్వారా ఎర వేసి, ఆ విద్యను సాధించిన కచుని చరిత్ర కూడా మనకు తెలిసిందే. ఇలా మన సాహిత్యం నిండా ప్రేమ సువాసలు వెదజల్లుతూనే ఉంటాయి.

    ఆధునిక కాలంలో ప్రేమ కూడా ఒక వ్యాపార వస్తువైపోయింది. ప్రేమికుల రోజు కూడా త్వరలో వచ్చేస్తోంది. ఎన్నో దిగుమతి చేసుకున్న పండుగలలాగే ఈ రోజు కూడా మంచి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారులందరూ పోటీ పడుతున్నారు. ఎటుచూసినా ప్రేమికుల రోజు వ్యాపార ప్రకటనలు, ప్రత్యేక బహుమతులతో చెలికాని/ చెలికత్తె మనసుదోచుకోవడానికి మేమూ సాయం చేస్తామంటే ప్రకటనలు ఊదరగొడుతున్నారు. అసలు ప్రేమికులే లేని వాళ్ళు 'వట్టి వెధవాయిలోయ్‌' అనుకొనేట్టుగా చేస్తున్నారు. యువతీ యువకులు కూడా ఈ 'ప్రేమ మైకం'లో పడి ఆ రోజు ఖరీదైన బహుమతులు, పువ్వులు కొనడానికి, తమ నెచ్చెలులకు కానుకగా ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. ఇదంతా వ్యాపారుల, కార్పొరేట్‌ సంస్థల మాయాజాలం. జనాన్ని కైపెక్కించి తమ పబ్బం గడుపుకోవడం మాత్రమే ఇందులో కనిపిస్తుంది.

    నిజమైన ప్రేమ కానుకలు ఆశించదు. విలువైన కానుకలు ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. అలా వచ్చే ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు కూడా. కానుకలు ఇచ్చిపుచ్చుకున్నంత సేపు మాత్రమే నిలబడేది వ్యాపారం అవుతుందే గాని ప్రేమ ఎప్పటికీ కాదు. ప్రేమంటే హృదయాంతరాలలో నుండి అప్రయత్నంగా పొంగుకొచ్చే ప్రవాహం. దానికి కాల, స్థల పరిమితులు ఉండవు. ప్రేమ మనసులో ఎప్పటికీ గుబాళిస్తూనే ఉంటుంది. అంతే కాని, సంవత్సరానికి ఒక సారి వచ్చే పండుగ లాగా, చచ్చిపోయిన వాళ్ళకి పెట్టే తద్దినంలాగా, ప్రేమికుల 'దినం' అంటూ ఒకటి ఉండదు. ప్రేమ నిత్య నూతనమైనది. ప్రేమించిన వారికి, ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రతి రోజు పండుగే. ఏదో ఒకరోజు గుర్తుకు తెచ్చుకుని, తరువాత రోజు మరొకరి వెంట పడితే అది లవ్వు కాదు - కొవ్వు.

    ఇంకా చెప్పాలంటే, యువతీ యువకుల మధ్య యవ్వనకాలంలో అంకురించేది నిజమైన ప్రేమ కానే కాదు. అది కేవలం హర్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఆకర్షణ మాత్రమే అంటారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు. లేత ప్రాయంలో ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియక, స్నేహితుల ప్రభావం వల్లనో, సినిమాల్లో, సాహిత్యం చూపించే యువతీ యువకుల సాన్నిహిత్యాన్ని మాత్రమే ప్రేమ అనుకుంటూ తప్పటడుగులు వేసే యువతకు కొదవే లేదు. దానికి తోడు తల్లిదండ్రులు కూడా అటువంటివి ప్రోత్సహిస్తూ ఉండడం వల్లనో, లేదా తెలిసినా ఏమవుతుందిలే అనే ధీమా వల్లనో ఈ ప్రేమ రుగ్మత సమాజంలో అంటు వ్యాధిలా వ్యాపిస్తూనే ఉంది. యుక్త వయసులోని పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉంది. సైకాలజీ ప్రకారం, ప్రేమలో ఎన్నో రకాలున్నాయి. ప్రేమనేది యువతీ యువకుల మధ్యనే అంకురించనక్కర్లేదు. భార్యాభర్తల మధ్య జీవితాంతం ఒకరిపై ఒకరికి ఉండేది కూడా బాధ్యతతో కూడిన ప్రేమ కూడా. తల్లిదండ్రులకు పిల్లలపై ఉండేది మమకారంతో కూడిన ప్రేమ. పిల్లలకు అమ్మానాన్నపై ఉండేది అనురాగంతో కూడిన ప్రేమ. లోకంలో ఇన్ని రకాల ప్రేమలుండగా వెర్రి వేషాలు వేసేది మాత్రమే ప్రేమ అని లోకాన్ని నమ్మిస్తున్నారు. వంచన చేస్తున్నారు.

    ఇవన్నీ కాకుండా మరో రకం ప్రేమ కూడా ఉంది. అది ఎల్లలు ఎరుగనిది, అనంతమైనది. ఒకరి నుండి ఏదీ ఆశించకుండా, ప్రతిఫలం తీసుకోకుండా, కేవలం ప్రేమను పంచేవాళ్ళు కూడా ఉంటారు. వారిది పవిత్రమైన ప్రేమ. సూర్యుడు ఏవిధంగా అయితే ఎటువంటి బేధం లేకుండా అందరికీ వెలుగును, జ్ఞానాన్ని పంచుతాడో, చంద్రుడు ఏవిధంగా అయితే ప్రాణులన్నింటికీ తరతమ బేధం లేకుండా తన అమృత కిరణాలు కురిపిస్తాడో, అదే విధంగా తపశ్శక్తి సంపన్నులైన రుషులు, యోగులు తమ చుట్టూ ఉన్న వారికి ప్రేమను పంచుతారు. ఆ ప్రేమ నిష్కళంకమైనది. ఆ ప్రేమ అనుభవించే వారికే గాని బయటి వారికి తెలియదు. ఆ ప్రేమ మరింత విస్తృతమైనపుడు కేవలం మానవాళిని మాత్రమే కాకుండా విశ్వంలో ప్రతి ప్రాణిని ప్రేమించే తత్వం వస్తుంది. మహర్షుల సన్నిధిలో పులులు, సింహాలు సైతం తమ సహజ ప్రవర్తనని మాని, సాధు జంతువులుగా ప్రవర్తిస్తుంటాయి. అందరినీ బెంబేలెత్తించిన మద గజం సైతం గౌతమ బుద్దుని ప్రేమ పూర్వక భావానికి లొంగిపోయి, ఆయన ముందు మోకరిల్లింది. మనసులో అటువంటి ప్రేమను నింపుకున్న వారికి లోకంలో శత్రువులనే వారే ఉండరు. లోకాన్ని సంపదతో, కండబలంతో, అస్త్రశస్త్రాలతో భౌతికంగా జయించడం కన్నా, ప్రేమ ద్వారా అందరి మనసుల్ని గెలుచుకున్న వాడే నిజమైన లోక విజేత అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

    కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు తన రాజనీతిలో 'రాజు ప్రజల్ని కన్నబిడ్డల వలే ప్రేమించమని' చెప్పాడు. నేటి నాయకుల్లో లోపించింది అదే. ఒక నాయకుడు తన అనుచరుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటే, అవినీతికి తావుండదు - రాజ్యం సుభిక్షమవుతుంది. ఒక వ్యక్తి సమాజాన్ని ప్రేమిస్తే, ఆ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాడు. దానివల్ల కుల, మత, ప్రాంతీయ, భాషా బేదాలు సమసిపోతాయి. ఒక గురువు తన వద్ద విద్య నేర్చుకునే వారిని కన్న బిడ్డల్లా ప్రేమిస్తే, పిల్లలు నేర్చుకునే విద్య సార్థకమవుతుంది. అందుకే పరమహంస యోగానంద 'ప్రేమ మాత్రమే' పంచమని తన శిష్యులకు ఉద్భోదించాడు.

    భారతీయులకు ప్రేమ గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా వారు ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ప్రపంచానికి ప్రేమను పంచుతూనే ఉన్నారు. కాని దురదృష్టవశాత్తూ, నేటి భారతీయ యువత తమ ఉజ్వల పరంపరని మరచిపోయి, పాశ్చాత్య పద్దతుల్ని, వారి అనాచారాల్ని ప్రచారం చేసే వారికి సులభంగా లొంగిపోయి, కాముకత్వాన్ని ప్రేమగా పొరపడుతున్నారు. నిజానికి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు - పాశ్చాత్యుల కాముకుల రోజు. మహిళను ఆట వస్తువుగా, అంగడిబొమ్మగా పరిగణించే సమాజం నుండి వచ్చే పెనుపోకడలను వంటపట్టించుకోవలసిన అవసరం భారతీయ యువతకు లేదు. ప్రేమ అనేది శరీరానికి సంబంధించినది కాదు - మనసుకి సంబంధించినది. దానికోసం ప్రత్యేకంగా ఒక 'దినం' జరుపుకోవలసిన అసవరంలేదు, ఇది మంచిది కూడా కాదు. ప్రేమ బేహారుల వలలో పడకుండా నిజమైన ప్రేమని పంచితే భూమిపైనే స్వర్గాన్ని చూడవచ్చు.

Monday, January 6, 2014

బానిసత్వ సంకెళ్ళు తెంచుకొనే ప్రయత్నం - మోడీ ప్రతిపాదించిన కొత్త పన్ను విధానం

ఎప్పుడో బ్రిటిష్‌ వారి హయాంలో ఏర్పరిచిన కాలం చెల్లిన పన్నుల విధానాన్నే అవలంభిస్తూ, అందిన కాడికి ప్రజల్ని దోచుకొనే విధానానికి స్వస్తి పలుకబోతున్నామంటూ, భాజపా అభ్యర్థి నరేంద్ర మోడి నుండి స్పష్టమైన సంకేతాలు రావడం దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది.

ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వంటి ప్రత్యక్ష పన్నులు, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి ఎన్నో రకాల పన్నుల స్థానంలో లావాదేవీ పన్ను మాత్రమే విధిస్తే ఎలా ఉంటుందన్నదే ప్రస్తుత ఆలోచన. సాంప్రదాయ పన్నుల విధానంలో ఎవరికీ అర్తం కాని బ్రహ్మ పదార్థం వంటి పన్నులు, అవి వేటిమీద విధించాలో ఆయా శాఖల్లో ఉన్న తలపండిన అధికారులకే తెలియక తలపట్టుకుంటూ ఉంటారు. పన్ను మీద పన్ను, దాని మీద మరో పన్ను వంటివి మనం చాలా బిల్లుల్లో చూస్తూ ఉంటాము. కొన్ని రకాల వస్తువుల మీద ఎంత శాతం పన్ను వసూలు చేయాలో ప్రభుత్వానికే అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ప్రజల దగ్గర నుండి సంస్థలు  పరోక్ష పన్నులు వసూలు చేసినప్పటికీ అవి ప్రభుత్వానికి జమ అవుతున్నాయో లేదో తెలియని అయోమయం. మధ్యలో అధికారుల దందాలు, ఎవరికి తోచిన విధంగా వారు ఆయా చట్టాలకు భాష్యం చెబుతూ ప్రజల్ని మరింత అయోమయానికి గురి చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, తమ ఆదాయాన్ని పెంచుకొనే దారులు వెతుక్కుంటున్నారు. మధ్యలో బలయ్యేది ముమ్మాటికీ సామాన్య ప్రజలు మాత్రమే. ఈ మధ్యన ఒక వాణిజ్య పన్నుల అధికారి తిరుమల తిరుపతి దేవస్థానానికి యాత్రికులు విడిది చేసే గదులపై విలాసపన్ను కట్టమని తాఖీదు ఇచ్చాడట. అంటే ఇష్ట దైవాన్ని దర్శించుకుంటే అది విలాసం కింద లెక్కట. దేవుడిని దర్శించుకుంటే విలాసం ఎందుకవుతుందో ఆ ఏడు కొండల వాడికే తెలియాలి. ఒక్కొక్క ట్యాక్స్‌ మాన్యూల్‌ చూస్తే కొన్ని వేల పేజీలు ఉంటుంది. ఎవరికి అర్థం కాని సెక్షన్లు, ఎందుకూ పనికి రాని వివరణలు. ఇవన్నీ వలస పాలకులు భారత ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి మాత్రమేనని, వారి కష్టాల నుండి తమ ఆదాయాన్ని పెంచుకొనే మార్గంగా ఏర్పరిచినవేనని చూడగానే అర్థం అవుతుంది. నేను ఎన్నో సార్లు ఈ విషయం గురించి ఆలోచించాను. మధ్య యుగాల్లోని ముస్లిం పాలకులు హిందువులపై ఆచరణ సాధ్యంగాని ఎన్నో రకాల పన్నులు విధించిన విషయం గుర్తుకు వచ్చేది. సంస్థానాల మీద బ్రిటిష్‌ పెత్తందార్లు విధించిన లెక్కకు మిక్కిలి పన్నులు గుర్తుకు వచ్చేవి. మనకు పేరుకు  స్వాతంత్య్రం వచ్చిన్పటికీ, కేవలం అధికార మార్పిడి మాత్రమే జరిగింది అనడానికి, సామాన్య ప్రజల కష్ట సుఖాల్ని పరిగణలోకి తీసుకోకుండానే పరిపాలన విధానాన్ని కొనసాగించారనడానికి ఈ పన్నుల విషయమే ఒక పెద్ద ఉదాహరణ.
 
ప్రస్తుత విషయానికి వస్తే నరేంద్ర మోడీ ఆలోచనలో నుండి పుట్టిన ఈ కొత్త పన్ను విధానం అన్ని విధాల స్వాగతించదగిందే. ఇన్‌కమ్‌ట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ వంటి అన్ని రకాల పన్నుల్ని రద్దు చేసి, వాటి స్థానంలో కేవలం లావాదేవీ పన్ను మాత్రమే వసూలు చేయబూనడం ఒక మంచి ఆలోచన. అంటే బ్యాంకు ద్వారా జరిగే ప్రతి  లావాదేవీపై ఒక వాతం నుండి ఒకటిన్నర శాతం వరకు పన్నుగా వసూలు చేస్తారు. ఎవరికైనా కొంత మొత్తాన్ని ఇవ్వదలిచినా, వారి నుండి కొంత మొత్తాన్ని పొందదలచినా, ఈ పన్ను విధించబడుతుంది. ఈ విధానం విజయవంతం కావాలంటే నేను కొన్ని సూచనలు చేయదలిచాను.

1.  ముందుగా భారతదేశంలో ప్రతి పల్లెకు కనీసం ఒక బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలి. ఆ శాఖలన్నింటినీ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ ద్వారా అంతర్జాలానికి అనుసంధానించాలి.

2. రూ. 100ల పైబడిన అన్ని నోట్లను (రూ.500, రూ. 1000) రద్దు చేయాలి. అంటే వాడకంలో లేకుండా చేయాలి.

3. కనీసం రూ. 10,000ల పైబడిన అన్ని లావాదేవీలనీ పూర్తి చేయడానికి ఖచ్చితంగా డెబిట్‌ / క్రెడిట్‌ కార్డు ఉపయోగించాలి.

4. ప్రతీ ఉద్యోగి జీతాన్ని నెల నెలా బ్యాంకులో వారి ఖాతాలో జమ చేయాలి.

5. ఎ.టి.యం.ల వాడకాన్ని నిరుత్సాహ పరచాలి. వాటిస్థానంలో వ్యాపార సంస్థల్లో (POS) స్వైపింగ్‌ మిషన్ల వాడకం పెంచాలి.

6. ఆదాయంపై ఉన్న అన్ని రకాల పరిమితుల్ని తొలగించాలి.



ఉపయోగాలు:


1. సామాన్యులకు పన్ను నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. అతడు వినియోగించే చిన్న చిన్న వస్తువులపై ఎటువంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక వస్తువు తయారయ్యే వివిధ దశల్లో పన్ను చెల్లించబడింది కాబట్టి.

2. పైకి ఒక శాతంగా కనిపించినప్పటికీ, వస్తూత్పత్తి వివిధ దశల్లో పన్ను కట్టబడుతుంది కాబట్టి, చివరి దశకు వచ్చేప్పటికి ఆ పన్ను 10 నుండి 20 శాతం వరకు అవుతుంది.

3. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఒక శాతం అనేసరికి పన్ను కట్టడానికి ఎవరూ వెనకాడరు.

4. అవినీతిని పూర్తిగా అరికట్టవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గరైనా లంచంగా పెద్దమొత్తంలో తీసుకొన్నప్పటికీ దాన్ని వస్తు రూపంలో మార్చడానికి వేరే దారి ఉండదు. బ్యాంకు ద్వారా లావాదేవీ చేస్తే రేపు ప్రభుత్వానికి ఖచ్చితంగా దొరికిపోతారు.

5. ఈ పన్నుల విధానం పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

6. బ్యాంకుల్లో పన్నును సేకరిస్తారు కాబట్టి, పన్ను అధికారులు, వారి కార్యాలయాలకు అయ్యే ఖర్చు ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు మిగులుతుంది. ప్రత్యేక పన్ను సేకరణ వ్యవస్థ ఉండనవసరం లేదు. ఇంత మందిని వేరే ఉత్పాదక రంగాలకు తరలించవచ్చు.

7. వినడానికి నిష్టూరంగా ఉన్నా, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే లంచాలు ప్రత్యేకంగా కొన్ని లక్షల కోట్లు ప్రజలకు మిగిలిపోతాయి. వాటితో వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవచ్చు. ఆ విధమైన వ్యయంపై కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

8. ఆదాయంపై పరిమితి తొలగించడం వలన విదేశాలకు నల్లధనం తరలిపోవడం ఆగిపోతుంది. ఆ డబ్బంతా మన దేశంలోనే ఉండి ఉత్పాదక రంగం మెరుగవుతుంది. పన్ను కొద్ది శాతం మాత్రమే కావడం వలన ప్రతి ఒక్కరూ కట్టడానికి ప్రయత్నిస్తారు.
 
   ప్రజలకి నిజమైన సేవ చేయాలనుకుని, మనస్ఫూర్తిగా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే ఇటువంటి ప్రగతిశీల ఆలోచనలు వస్తాయి. ఎంత సేపూ, పేదరికాన్ని నిర్మూలిస్తామని, అభివృద్ధి చేస్తామని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే పనికిమాలిన నేతలకు ఇటువంటి ఆలోచనలు కలలో కూడా రావు. ఎంతసేపు ప్రజల నెత్తి మీద చెయ్యిపెట్టి, నుదుటి మీద వాసన చూసి, తరువాత వారి కష్టాన్ని దోచుకుని, వారికి ఎంతో చేస్తున్నట్టు నటించే నాయకులకు మన దేశంలో లెక్కలేదు. వారందరికీ భిన్నంగా ప్రజలకోసం నిజంగా ఆలోచించే మోడీ లాంటి వారిని స్వాగతించి, అధికారం అప్పజెప్పకపోతే దేశానికి ఎప్పటికీ భవిష్యత్తు ఉండదు.