Pages

Sunday, September 3, 2017

అమ్మాయిల్ని ప్రేమించండి - కామించకండి... (చెత్త సినిమాలపై చిన్న చురక)

    ప్రేమ ఒక మధురమైన, అనిర్వచనీయమైన అనుభూతి. అది హృదయాంతరాళలో నుండి రావాలి. అంతేగాని నేటి సినిమాల్లో చూపించినట్లు ఒక అమ్మాయి భౌతిక రూపం చూసీ చూడగానే చిత్త కార్తె కుక్కల్లాగా వెంటబడి, వాళ్ళని తరిమి, హింసించి, తికమక పెట్టి, ఏదో రకంగా ప్రేమించాను అని వాళ్ళచేతనే చెప్పించుకునే పైశాచిక హీరోలు చేసే పిచ్చి చేష్టలు కాదు. డబ్బు కక్కుర్తి కోసం కొంత మంది సినిమాలు తీస్తున్నారు. తమలో ఉన్న పైశాచిక ఆనందాన్ని (శాడిజం) తీర్చుకోవడానికి కొంత మంది నీచులు డైరెక్టర్‌ అవతారం ఎత్తుతున్నారు. వీళ్ళు చేసేదల్లా సగటు మనిషిలో ఉన్న బలహీనతల్ని సినిమా అనే ముసుగులో రెచ్చగొట్టి, ఉచితంగా పబ్లిసిటీ, డబ్బు సంపాదించడం. ఇలాంటి నీతి జాతి లేని కుక్కలకు (అలా అంటే కుక్కలు బాధపడతాయేమో) మిగతా వాళ్ళు వత్తాసు పలకడం, అటువంటి చౌకబారు సినిమాలకు సో కాల్డ్‌ పనీపాట లేని యువత వెళ్ళి, వాళ్ళకు డబ్బుల వర్షం కురిపించడం... ఇదంతా చూస్తుంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. సదరు డైరెక్టర్లకు, నిర్మాతలకు సామాజిక బాధ్యత ఉండదు. కుటుంబ విలువల పట్ల, నైతికత పట్ల ఎటువంటి గౌరవం ఉండవు. వాళ్ళకు ఉండేది పశు వాంఛ. దాన్ని తీర్చుకోవడానికి సినిమాని ఒక సాధనంగా మార్చుకుంటారు. వారు తీస్తున్న ఇటువంటి నీచపు పనుల వల్ల ఎన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయో వారికి పట్టదు. అసభ్యత, అశ్లీలత మేళవించే సినిమాలు తీస్తున్నారంటే వారు పశువు కంటే హీనమైన వారు అని అర్థం. ఎందుకంటే ఏ జంతువైనా తన బాధ్యతగా, ప్రకృతి ధర్మం ప్రకారం కొన్ని సమయాల్లోనే తమ కోరికను తీర్చుకుంటాయి. కాని, ఇటువంటి నీచులు సర్వకాల సర్వావస్థల్లో అదే పనిగా ఉంటూ, తాము చెడిందే కాక, లోకమంతా అదే విధంగా నడవాలని కోరుకుంటారు. అందుకే వీరు పశువు కంటే ప్రమాదకరమైన వాళ్ళు.

    సహజంగా ఇటువంటి సినిమాల్లో హీరోయిన్‌కు ఎటువంటి వ్యక్తిత్వం, సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివాడు తమ మనసుతో, శరీరంతో ఎలా ఆడుకున్నా వాళ్ళు ఎదురు చెప్పరు. పైగా లొంగిపోయి, ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. కాని, వాస్తవంలో ప్రతి ఆడపిల్లకు ఒక మనసుంటుంది. సొంత ఆలోచన ఉంటుంది. తమకు ఏది మంచో, ఏది చెడో ఆలోచించుకోగలిగిన మానసిన పరిపక్వత అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సినిమాలో నీచ హీరోలు చేసే పిచ్చి చేష్టలకు లొంగరు. అలాంటి అమ్మాయి ఎదురైనపుడు, సినిమాల్లో చూపించిన విధంగా జరగకపోయే సదరు చిత్తకార్తె కుక్కకు అహం దెబ్బతింటుంది. ఆ అమ్మాయిని అల్లరి చేయడానికి, హింసించడానికి, చివరకు యాసిడ్‌ దాడి చేయడానికి కూడా వెనుకాడడు. సినిమాల ప్రభావంతో తాను ప్రేమిస్తున్నాననే అనుకుంటాడు. పత్రికలు కూడా దీనికి వత్తాసు పలుకుతూ 'అమ్మాయిపై ప్రేమోన్మాది దాడి' అని హెడింగ్‌ పెడుతూ ఉంటారు. నిజానికి ఆడపిల్లల్ని హింసించే వాళ్ళని ప్రేమోన్మాది అని కాదు... కామోన్మాది అని పిలవాలి.

    ఒక రచయిత్రి మాటల్లో చెప్పాలంటే... ''ఒక ఆడపిల్ల తన గుండె నిండుగా, నిండు మనసుతో ప్రేమిస్తే... ఆ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలుసా... అమాయకమైన ఆ ప్రేమ అమృతంతో సమానం... కాని ప్రేమను పొందే అదృష్టం ఎంత మందికి ఉంటుంది?'' అటువంటి ప్రేమను పొందడానికి ప్రయత్నించాలిగాని, శరీరాన్ని చూసి వెంటబడితే అది కామం అవుతుందేగాని, ప్రేమ ఎన్నటికీ కాదు...

Thursday, August 10, 2017

ఇండియా అనే పదం ఎక్కడ నుంచి వచ్చిందో మీకు తెలుసా?

    భారతదేశానికి 'ఆగష్టు'లో స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇండియా అనే పేరు వచ్చిందనే తప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున సాగుతోంది. నిజానికి స్వాతంత్య్రానికి, ఇండియా పేరుకి ఏ సంబంధం లేదు.

    ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో అత్యున్నత నాగరికత వెలసింది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, కళలు, భాష, సాహిత్యం వంటి అనేక రంగాలలో ఉజ్జ్వలమైన ప్రగతి సాధించింది. కేవలం భౌతిక పరమైన అభివృద్ది మాత్రమే కాకుండా, మానవ విలువల పరంగా, ఆధ్యాత్మికంగా, సంఘ పరంగా ఎవరూ ఊహించలేని అత్యున్నత స్థానానికి చేరుకుని, గురుస్థానాన్ని పొంది, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం చేసింది.

    శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకు, ఉపాధికి ఈనాటి ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా వైపు చూస్తున్నట్లుగానే, ప్రాచీన కాలంలో ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేది. ఆనాటి కాలంలో ఎవరైనా భారతదేశానికి వచ్చి, ఇక్కడ పర్యటిస్తే, వారికి వారి దేశాల్లో ''హిందూదేశాన్ని దర్శించినవాడు'' అనే బిరుదును ప్రదానం చేసేవారు. ఎన్నో రకాల విద్యలకు, కళలకు, వాణిజ్యానికి, శాస్త్రాలకు నిలయమైన హిందూ దేశాన్ని దర్శించడం అంటే వారి ఉద్దేశ్యంలో ఒక అద్భుత కార్యాన్ని సాధించిట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.

    చారిత్రికంగా చూస్తే, భారతదేశంలో ప్రాచీన నాగరికత సుమారు 5000 సంవత్సరాలకు పూర్వమే సింధు నదీ తీరంలో ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది. అందుకే విదేశీయులు ఈ నేలను సింధు దేశమనే పిలిచే వారు. యూరోపియన్లకు, భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు ప్రధానంగా అరబ్బులు, పర్షియన్ల ద్వారానే జరిగేవి. ఇక్కడ నుండి వస్త్రాలు, వజ్రాలు, సాంకేతిక పరికరాలు, శాస్త్ర సంబంధ విషయాలు, ఆహార పదార్థాలు వంటివి భారతదేశం నుండి మిగతా ప్రపంచానికి అరబ్బుల ద్వారానే పరిచయమయ్యాయి. సామాన్య శక పూర్వం 300 సం||లకు ముందే పర్షియన్లు తమ భాషలో సింధ్‌ పదాన్ని 'హింద్‌' గా పలికేవారు. అందుకే ఈ దేశాన్ని 'హిందు స్థాన్‌'' గా వ్యవహరించేవారు.  అయితే యూరోపియన్ల భాషలో 'హ' అక్షరం సరిగా పలకలేరు. అందుచేత వారు 'హింద్‌' పదాన్ని 'ఇండ్‌'గా పలికేవారు. ఆ విధంగా మన దేశం పాశ్చాత్యుల వాడుకలో ఇండియాగా పిలవబడింది.

    ఇక్కడ ఇండియా అంటే 'హిందూ దేశం'గా అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏనాడూ ఎటువంటి మతమూ లేదు. ఉన్నదల్లా ఒక చక్కని జీవన విధానం. మంచి కుటుంబ వ్యవస్థ, మంచి ఆహార, ఆరోగ్య అలవాట్లు, ప్రకృతితో మమేకమైన జీవిత విధానం, ఆధ్యాత్మికంగా, సాంకేతికంగా ఎంతో పురోగమించిన సమాజం. ఇక్కడి మహర్షులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు ఏనాడూ తాము ఎంతో కృషిచేసి సాధించిన విజ్ఞాన ఫలాలతో వ్యాపారం చేయాలని అనుకోలేదు. వారికున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర సమాజాలపై ఆధిపత్యం చెలాయించాలని గాని, వారి దేశాల్ని, సంస్క ృతుల్ని ఆక్రమించుకోవాలనిగాని అనుకోలేదు. కాని, ప్రపంచమంతటా హిందూ జీవన విధానం విస్తరించింది. కొత్త మతాలు వచ్చేనప్పటికీ, ఈనాటికీ, ప్రపంచమంతటా అన్ని సమాజాల్లో అంతర్లీనంగా మానవత్వం వెల్లివిరిసేలా చేస్తున్న అదృశ్య జీవిత విధానం ఉందంటే అది ముమ్మాటికీ హైందవ జీవన విధానం మాత్రమే. ఈ పుణ్య భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మత: హిందువులే. ఇక్కడి ఆలోచనా విధానంతో ప్రభావితమైన వ్యక్తి, సమాజం, దేశం ఏదైనా సరే హిందూ దేశమే. ఇండియా అంటే హిందూస్థాన్‌ మాత్రమే.

జై హింద్‌

(ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆలోచనా మాలిక - మీ ఎస్పీ జగదీష్‌)

Friday, May 26, 2017

భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశం

    భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పాకిస్థాన్‌ చెర నుండి విడిపింపబడి, తిరిగి భారతదేశానికి వచ్చిన ఉజ్మా అహ్మద్‌ అనే మహిళ అభిప్రాయపడ్డారు. ఒక పాకిస్థాన్‌ జాతీయుడితో బలవంతంగా వివాహ బంధంలో చిక్కుకుని అక్కడకు వెళ్ళిన ఉజ్మా అక్కడి పరిస్థితులలో ఇమడలేకపోయారు. ఆ దేశాన్ని ఒక 'మృత్యు బావి' గా అభివర్ణించారు. భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను సమర్థించే వారంతా ఈ సంఘటనతో కళ్లు తెరవాలి. నిజానికి భారతదేశం ఏ సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరించే వారు ఎవరికైనా సురక్షితమైన ప్రదేశం. వారి వారి ఆచారాల్ని, సంస్కృతిని అవలంభిస్తూనే ఇక్కడి సాంప్రదాయాలతో మమేకమై తమ జీవనాన్ని సాగించవచ్చు. వారిని ఇక్కడి మతంలోకి మారమనిగాని, ఇక్కడి ఆచారాల్ని అనుసరించమని గాని ఎవరూ బలవంతం పెట్టరు. ఎటువంటి ప్రలోభాలకి గురిచేయరు. ''మనం బాగుండాలి, మనతో పాటు అందరం బాగుండాలి'' అనేది ఇక్కడి ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న అత్యున్నత జీవన ప్రమాణం.

    గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని విదేశీ మతాలు, అక్కడి బానిస ఆలోచనా విధానాల్ని పుణికిపుచ్చుకున్న స్వదేశానికి చెందిన స్వయం ప్రకటిత మేధావులు ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అవలంభిస్తున్న సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అన్ని మతాలను, అన్ని సంస్కృతుల్ని గౌరవించే ఈ దేశ ప్రజల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ తమ మతాల వైపు ఆకర్షించడానికి అన్ని రకాల కుతంత్రాలు చేస్తున్నారు. ఇటువంటి వారి వలన దేశ ప్రజల మధ్యలో కనిపించని అడ్డుగోడలు ఎన్నో మొలుస్తున్నాయి. వాళ్ళు పనిగట్టుకుని ప్రచారం చేసే లేని దేవుళ్ళ పేరు చెప్పి ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోతూ, మానసికంగా నలిగిపోతున్నారు. అయినప్పటికీ, తమ మతమే గొప్పదంటూ, ఇక్కడ వేల సంవత్సరాలుగా ఉన్న ఆచార వ్యవహారాల్ని కించపరుస్తూ, చెలరేగిపోతున్నారు. ఎదుటి వారిని గుడ్డి నమ్మకాలవైపు లాగుతున్నారు.

    ఇప్పటికైనా మతాలు మారే వారు, మార్చేవారు తమ తమ సంకుచిత్వాన్ని విడనాడాలి. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి సాంప్రదాయాల్ని గుడ్డిగా వ్యతిరేకించే వారు కళ్ళు తెరవాలి. తమ తమ మతాన్ని అనుసరించడం, నమ్మడం అనేవి వారి వ్యక్తిగత విషయాలు. అవి ఎప్పటికైనా తప్పు అని తెలుసుకొనే రోజు వస్తుంది. అప్పుడు వారు నిజం తెలుసుకోవచ్చు. అంతేగాని, మా మతమే గొప్పది, మా మతంలోకి మారండి అంటూ చేసే బోధనలు ఎప్పటికైనా ముప్పు తెస్తాయి. అందరూ బాగుండాలి అనే విశాలదృక్పధం నుండి, నేను, నా దేవుడు మాత్రమే గొప్ప అనే సంకుచితత్వంలోని ప్రయాణం చేస్తే, ఎవరి దేవుడు వారికి గొప్పవుతాడు. ఎవరి అహంకారం వారికుంటుంది. అది ఘర్షణకు దారి తీస్తుంది. సమాజాన్ని శాంతియుత సహజీవనం చేసే పరిస్థితుల నుండి ఒకరినొకరు దేవుడి పేరు చెప్పి చంపుకునే పరిస్థితి వస్తుంది. అది అభిలషణీయం కాదు. ఇప్పటికే మూడొంతుల దేశాలు మతాల పేరు చెప్పి మారణకాండను సాగిస్తున్నాయి. ప్రతీ రోజు కొన్ని వేల, లక్షల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. కొన్ని వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. విభిన్న ఆలోచనల శాంతియుత జీవనమే భారతదేశ సంస్క ృతికి ఆయువుపట్టు. అటువంటి మూలాధారాన్ని కోల్పోయిన నాడు, తమ మూలాల్ని కోల్పోయి, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న అనేక ఇతర దేశాల్లాగానే భారత దేశ ప్రజలు కూడా అంధకారంలో మునిగిపోవాల్సి ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త...