Pages

Thursday, August 13, 2009

మీ పిల్లల్ని చంపెయ్యాలనుకుంటున్నారా? అయితే మా దగ్గరకి పంపించండి.

మీరు సరిగ్గానే చదివారు. ఎవరి పిల్లల్ని వారు చేతులారా చంపుకోలేరు కనుక, ఏదయినా కార్పోరేట్ విద్యాసంస్తలోనో, కాలేజ్ లోనో చేర్పిస్తే సరి. ఇలా తయారయింది నేటి కార్పోరేట్ విద్యాసంస్తల ముసుగులో జరుగున్న విద్యా వ్యాపారం. ఏ వ్యాపారంలో నయినా పెట్టుబడిదారుడికి రిస్క్ వుంటుంది. కాని ఈ వ్యాపారంలో మాత్రం అంతిమంగా నష్టపోయేది మాత్రం అక్షరాలా విద్యార్ధులే. వారి విలువయిన జీవితం నాశనం కావడమే కాకుండా, వారి నిండు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. నిన్న తాజాగా విజయవాడ శ్రీ చైతన్య కేంపస్ లో జరిగిన లోహితా రెడ్డి మరణమే దీనికి వుదాహరణ. ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది అమాయక విద్యార్దుల ప్రాణాలు విద్యపేరు చెప్పి హరించుకు పోయాయి.

ఈ విష సంస్కృతి కేవలం ఒక్క చైతన్యకే పరిమితం కాలేదు. ఏ కార్పోరేట్ విద్యా సంస్థని తీసుకున్నా ఇదే పరిస్తితి. పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్న ఇటువంటి సంస్థలపై ఎవరికి సరయిన నియంత్రణ లేకపోవడం, తల్లి దండ్రులకు విద్యపై సరయిన అవగాహన లేకపోవడం, వారి మూర్ఖత్వం ఎంతో విలువయిన పిల్లల ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఎంత ఎక్కువ సేపు చదివిస్తే అంత గొప్ప కాలేజ్ అన్నట్టుగా తయారయింది నేటి దుస్తితి. విద్యార్దులకేమీ అర్ధం కాకపోయినా గాని, వారి చేత బండ బట్టీ పట్టించేసి, ఏదో విధంగా మార్కుల్ని తెచ్చుకునేలా చేస్తున్నారు. నిజంగా సబ్జక్ట్ మీద అవగాహ వున్న విద్యార్ధి కూడా ఒక్కోసారి ఈ బట్టీ విక్రమార్కుల ముందు ఓడిపోక తప్పడం లేదు. కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో వస్తున్న ర్యాంకులని గొప్పగా చూపించుకుని, (ఎంతో మంది ఫెయిల్ అయినప్పటికీ) కొత్త అడ్మిషన్లు, కొత్త బ్రాంచీలు ప్రారంబించేస్తున్నారు. ఈ బ్రాంచీల్లో సౌకర్యాలు వున్నవా లేదా, సరయిన లెక్చరర్లు వున్నారా లేరా అని కూడా ఎవరూ ఆలోచించడం లేదు.

ఇక హాష్టళ్ళలో పిల్లలు పడుతున్న బాధల విషయానికి వస్తే అవన్నీ రాయాలంటే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. పిల్లలకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఎన్నో పేరుగొప్ప కాలేజిలు వున్నాయి. నలుగురికి కూడా ఇరుగ్గా వుండే ఒక్కో గదిలో పదేసి మందిని కుక్కేయడం, అందరికీ ఒకే బాత్ రూం ఏర్పాటు చెయ్యడం వంటివే కాకుండా, వారికి కనీసం నాణ్యమయిన తిండి కూడా పెట్టకుండా, విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.

ఒకసారి కార్పోరేట్ కాలేజ్ హాష్టల్లో అడుగుపెడితే ఏ నేరమూ చెయ్యకుండా, సెంట్రల్ జైల్లో అడుగుపెట్టినట్టే. తెల్లవారు జామునే నాలుగ్గంటలకి జైలు సెంట్రి... సారీ... హాష్టల్ వార్డెన్ వచ్చి నిద్ర లేపుతాడు. 4:30 నుంచి స్టడి హవర్స్ వుంటాయి. ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయ్యడానికి కలిపి మద్యలో ఒక గంట కేటాయిస్తారు. ఆ తక్కువ టైంలోనే అన్ని కార్యక్రమాలూ కానిచ్చేయ్యాలి. విజయవాడలో ఒక కాలేజ్ లో అయితే ఆడ పిల్లలు పది మందికి కలిసి ఒకే ఒక గది, దానికి అటాచ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేసారట. పదిమందికి కాలకృత్యాలు తీర్చుకోవడనికి లేట్ అవుతుంది కాబట్టి అందరు కలిసి ఒకేసారి స్నానం చేసెయ్యండి, టైం కలిసి వస్తుంది కదా అని యాజమాన్యం జవాబు చెప్పిందట. మన ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు ఒకేసారి అలాంటి పరిస్తితి తట్టుకోలేక ఆ కాలేజ్ నించి పారిపోవడనికి ప్రయత్నిస్తున్నారు. నేను స్వయంగా అటువంటి పిల్లలతో మాట్లాడి, తెలుసుకున్న సంఘటనలనే రాస్తున్నాను. అసలే తెల్లవారు జాము,... చలి, దానికి తోడు చన్నీటి స్నానం, ఎలా వుంటుందో పరిస్తితి వూహించండి..

ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత... వుదయం 6 గంటల నుంచి "క్లాస్" లు మొదలవుతాయి. అంత పొద్దున్నే మ్యథ్స్, కెమిస్ట్రీ వంటి సబ్జక్టులు చెపుతారు. నిద్ర వస్తున్నా, బుర్రకి ఎక్కకపోయినా, చచ్చినట్లు వినాల్సిందే. లేకపోతే శిక్షలు ఎలాగో తప్పవు. అలా మొదలయ్యే "శిక్ష"ణా కార్యక్రమం రాత్రి 10, 11 గంటలయ్యే వరకు జరుగుతూనే వుంటుంది. ఇక శెలవులు, వీకేండ్స్ అనేవి ఎలా వుంటాయో కూడా తెలియని పరిస్తితి. పండగలొచ్చినా శెలవులు వుండవు. ఇవి కాక మధ్య మధ్యలో విద్యార్ధికి అవమానాలు, శిక్షలు ఎలాగో తప్పవు. ఒక సారి కార్పోరేట్ కాలేజీలో చేరితే ఒకటి, ఆత్మ హత్య చేసుకోవాలి లేదా, ఎంత బండ బ్రతుకయినా బ్రతకడానికి సిద్దపడే సిగ్గులేని జీవితం ప్రాప్తిస్తుంది... ఇది నిజం.

ఈ కాలేజీల దగ్గర వుండే మంచి టెక్నిక్ ఏమిటంటే, కాలేజ్ లో చేరే విద్యార్ది దగ్గర ముందే పెద్ద మొత్తంలో ఫీజుని వసూలు చేసేస్తారు. దానితో ఎన్ని ఇబ్బందులున్నా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సర్దుకు పోవాల్సి వస్తుంది. ఎవరయినా హాష్టల్లో ఇమడ లేక ఇంటికి ఫోన్ చేసి, "నాన్నా, నాకిక్కడ బాగో లేదు, నేను నరకం అనుభవిస్తున్నాను, నేను చదవలేను నాన్నా." అనగానే అటువైపునుంచి వచ్చే మొట్టమొదటి సమాధానం,, "ఫీజు మొత్తం కట్టేసాం కదమ్మా, ఈ ఒక్క సంవత్సరానికే అడ్జస్ట్ అవ్వు.. వచ్చే సంవత్సరం మానేద్దువు గాని" అంటారు. కాని ఇప్పుడు కేవలం కొన్ని వేల రూపాయల ఫీజు గురించి చూసుకుంటే, తరువాత కొడుకో, కూతురో లేకుండా పోతున్నారు. దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు.

తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి.. దయచేసి మీ పిల్లలు చెప్పేది వినండి, వారి ఆవేదనని అర్ధం చేసుకోండి.. వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయ పడటంలో తప్పు లేదు కాని, దాన్ని సాధించే ప్రయత్నంలో, మీరు, పిల్లలు ఏమి కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ గొప్ప చాటుకోవడానికో, మీ స్టేటస్ చూపించుకోవడానికో పిల్లల ప్రాణాల్ని బలి పెట్టకండి. కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడయినా మంచి మార్కులు వస్తాయి. అందరూ ఇంజినీర్లు, డాక్టర్లూ అయిపోనవసరం లేదు.. కనీసం మనిషిగా బ్రతకగలిగితే అదే పది వేలు. వ్యాపారం చేసేవాళ్ళని ఎలాగో మార్చలేము... కనీసం మనమయినా మారితే, అంటే ఈ టపా చదివిన ఒక్క తండ్రి మనసులో అయినా మార్పు తీసుకురాగలిగితే, ఒక్క చిట్టి తల్లి ప్రాణన్నయినా నిలబెట్టగలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే.

Saturday, August 8, 2009

దర్శకులకి శాడిజం వుంటుందా?

సినిమా డైరెక్షన్ చేయడం ఒక కళ అని అందరు అనుకుంటారు కదా. కాని సినిమాలకి దర్శకత్వం వహించే వాళ్ళకి కొద్దిగా.. కాదు.. కాదు.. చాలా శాడిజం వుంటుందని నాకనిపిస్తుంటుంది. ఈ మధ్యన రాంగోపాల్ వర్మ కొత్త సినిమా అగ్యాత్ (తెలుగులో అడవి) సినిమా పబ్లిసిటీ చూసిన తరువాత అలాగే అనిపించింది. ఆ సినిమా ఫంక్షన్‌లో వర్మ పక్కన, హీరోయిన్ పక్కన శవాలని పెట్టుకున్నారు. అచ్చం మనుషుల శవాలని పోలిన విధంగా బొమ్మల్ని తయారు చేసి వాటి పక్కన కూర్చుని "వేడుక" (శవానందం అనాలేమో) చేసుకున్నారు. ఈ పిచ్చి అక్కడితో అయిపోలేదు. ఏకంగా ముంబయి లో హోర్డింగుల మీద కూడా ఈ నకిలి శవాలని తగిలించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారట. అక్కడి వారి ఫిర్యాదు మేరకు ఆ నకిలీ డెడ్ బాడీలని పోలీసులు తొలగించారట. ప్రజల్ని మరీ ఈ రేంజ్ లో భయపెడుతున్నందుకు వర్మ గురించి మనం ఏమనుకోవాలి.

ఇవన్ని ఒక ఎత్తయితే, చాలా కాలం నుంచి సినిమాలను చూస్తున్న నాకు కొన్ని విషయాలలో దర్శకులకి కొంచెం "మెంటల్" కూడా వుండాలేమో అనిపిస్తుంది. వుదాహరణకి, మనం అన్ని సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్ ని వర్షంలోనో, నీటిలోనో తడిపేసి, అన్ని రకాల అంగిల్స్‌లో కెమెరాని తిప్పేస్తూ వుంటారు. కొంచెం మామూలుగా ఆలోచించండి. ఎవరయినా ఒక పరాయి ఆడపిల్లని మనం నీ బొడ్డు చూపించు, నీ అందాలని ఆరబొయ్యి, నేను ఫోటో (లేదా సినిమా) తీసుకుంటాము అని అనగలమా? ఒకవేళ నిజంగా ఏ వర్షం వచ్చి ఎదురుగా వున్న ఆడపిల్ల తడిస్తే వెంటనె అటు వైపు నుంది చూపు మరల్చుకోమా (కనీసం మర్యాద కోసమయినా గాని). బొడ్డు మీద ఆపిల్స్, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు ఇలా రకరకాల తినుబండారాలు, పెట్టి పాటలు తీస్తారు ఒకాయన. అదేమి చిత్రమో గాని, ఏ సినిమాలో పాటల్ని చూసినా, హీరోకి ఒంటినిండా బట్టలేసుకుని డ్యాన్స్ చేస్తాడు (కుప్పిగంతులు లేదా ఎక్సర్సైజ్ అనొచ్చేమో). పాపం హీరోయిన్ దగ్గరకి వచ్చేప్పటికి అసలు కావాల్సిన దానికన్నా తక్కువ డ్రెస్సులు వేసుకుంటుంది. ఒకటి.. హీరోయిన్ కయినా పూర్తిగా బట్టలు వేస్తే బాగుంటుంది. లేదా హీరోకి కూడా చెడ్డీలు వేస్తే ఏ గొడవా వుండదు. (మహిళా పాఠకులు నన్ను క్షమించాలి)

హింస గురించి ఎంత తక్కువ చేసి చెపితే అంత మంచిది. అవసరం వున్నా లేకపోయిన బక్కెట్ల కొద్దీ రక్తాన్ని తెర మీద చిమ్ముతూంటారు ఇప్పటి దర్శకులు. ఎన్నో అధునాతన ఆయుధాలు వచ్చాయి కదా. సింపుల్‌గా తుపాకీతో కాల్చుకోవచ్చు. కాని హీరో చేతిలో కత్తి వుంటేనే వీరోచితంగా వుంటుంది అనుకుంటా. కర్రలతో వళ్ళంతా విరగ్గొట్టుకుని, కత్తులతో నరికేసుకుని, బోల్డంత రక్తం చిందిస్తే గాని మన హీరోకి కోపం చల్లారదు. శతృవు కాపాడాడని సొంత కొడుకుని కూడా చంపుకుంటాడు ఒక సినిమా విలన్. లేదా మాటలు రాని మూగ పిల్లని కత్తితో పొడిచి ఆమె పై అత్యాచారానికి తెగబడతాడు మరో సినిమా విలన్. ఇవన్నీ తెరపై చూసేప్పుడు ఎంత జుగుప్సని కలిగిస్తాయో, ప్రేక్షకులపై వాటి ప్రభావం ఎలా వుంటుందో అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సినిమాలు తీసేస్తుంటారు మన దర్శకులు.

ఈ మధ్యన మరో కొత్త ట్రెండ్ మొదలయింది. మామూలుగా లవ్వు (కొవ్వు) సినిమాలు మనకు కొత్త కాదు. కాని ఆ లవ్‌ని చాలా చిన్న వయసు నుంచే మొదలెట్టించేస్తున్నారు. చాలా కాలం క్రితం వచ్చిన ఒక సినిమాలో పుట్టిన కొన్ని నెలలకే లవ్ మొదలవుతుంది. తరువాత వచ్చిన తూనీగ సినిమాలో ఆడుకొనే వయసులో మొదలవుతుంది.
ఇక టెంత్ క్లాస్ ప్రేమలు, ఇంటర్ కాలేజ్ ప్రేమలు గురించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్ బొడ్డు కనబడేలా నుంచుంటే, ఆ బొడ్డు చుట్టూ నెమలి ఈకతో గోరింటాకుపెడతాడు మన హీరో. పోనీ సినిమాలో ఆ సన్నివేశం వుంటే పర్వాలేదు. ఏకంగా పోస్టర్లకెక్కించి చిన్న పిల్లల్ని కూడా పాదు చెయ్యడమెందుకు? దీనికన్నా డైరెక్ట్‌గా బూతు సినిమాలు తీసి జనాలమీదకి వదిలితే నయం. కావలసి వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఏదో ఫ్యామిలీ సినిమా అని వెళితే పైన వుదహరించిన సన్నివేశాల్లో ఏదో ఒకటో లేక కొన్నో వుంటే పక్కనే వున్న కుటుంబ సబ్యులతో కలిసి చూడాలంటే సిగ్గు వేసే విధంగా ఇప్పటి సినిమాలు తయారయ్యాయి.

ఇప్పుడు చెప్పండి, సినిమా దర్శకుడికి శాడిజం వుంటుందా? వుండదా? ...