Pages

Friday, November 13, 2009

ప్రపంచానికి ఆఖరు ఘడియలు... 2012 సినిమా రివ్యూ..


ఈ ప్రపంచానికి ఆఖరి రోజు వచ్చి, వినాశనం కళ్ళ ముందు జరుగుతూంటే, ఈ భూమి మీద మానవ జాతి అంతరించిపోతే, ఎలా వుంటుంది అనే అంశాలతో తీసిన చిత్రమే ఈ 2012. ఈ సినిమా దర్శకుడు రొనాల్డ్ ఎమ్రిక్ కి జనాలని భయపెట్టడం ఇదేమి కొత్త కాదు. ఇది వరకు ఇండిపెండెన్స్ డే, 10,000 బి.సి., డే ఆఫ్టర్ టుమారో వంటి సినిమాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. వినాశనం, ప్రళయం వంటి సబ్జక్టులతో సినిమాలు రావడం హాలీవుడ్ లో కొత్త కాకపోయినా, 2012 లో నిజంగానే భూమి వినాశనం అవుతుందనే అంచనాలతో రూపొందించిన సినిమాగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

సహజంగానే హాలీవుడ్ సినిమాలని ఇష్టపడే నేను, ఈ సినిమా చూడడానికి, అందునా ప్రపంచంలో అందరికన్నా ముందుగా (హాలీవుడ్‌లో ఈవాళ రిలీజ్ అవుతుంది) చూడడం థ్రిల్లింగ్‌గా వుండి నిన్న సాయంత్రమే థియేటర్‌కి వెళ్ళాను. మన దేశ ప్రేక్షకులని ఆకర్షించడానికి కాబోలు, ఈ సినిమా ముందుగా ఇండియాలో ప్రారంభమవుతుంది. సూర్యుడిలో జరిగే విస్ఫోటనాల కారణంగా (Solar flares) న్యూట్రినోలు విడుదలయి, అవి మైక్రోవేవ్స్‌లా పనిచేసి, భూమిలోపలి లావాని ఉడికించడం, దాని వలన విపరీతమయిన వేడి విడుదలయ్యి, భూమి పై పొరలు కంపించి, అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామీలు వచ్చి భూమి యొక్క ధృవాలు మారిపోయి, ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి, మానవ జాతి వునికే లేకుండా పోతుందనేది ఒక సిద్దాంతం. దీనికి తోడు, మెక్సికోలోని ఒక పురాతనమయిన మాయన్ తెగవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించుకున్న కేలండర్ సరిగ్గా 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది. అంటే ఆ తేదీ తరువాత కేలండర్‌తో పని వుండదనేది మాయన్ల నమ్మకంగా చెబుతారు. ఇవన్నీ కలగలిపి, ఒక వేళ నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందనేది మనకి రుచి చూపించడానికి, ఎమ్రిక్ చక్కటి ప్రయత్నం చేసాడు.

ఈ సినిమాలో హీరో జాక్సన్‌కి అందరికన్నా ముందుగా భూమి వినాశనం గురించి తెలుస్తుంది. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్నీ రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. తన కారులో పిల్లల్ని తీసుకు వెళుతూ ఉంటే వెనకాలే భూమి విడిపోవడం, విమానంలో వెళుతుంటే, కళ్ళ ఎదురుగా పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు కూలిపోవడం వంటివి కంపూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు. భూమి మీద వున్న నాగరికత మనుషులూ అందరూ అంతరించిపోయాక, మరలా కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పెద్ద పెద్ద షిప్స్ నిర్మించడం, ప్రపంచంలోని అన్ని రంగాలకి చెందిన శాస్త్రవేత్తలని, దేశాధినేతలని, కోటీశ్వరుల్ని ఆ షిప్స్ ద్వారా రక్షించడం వంటి దృశ్యాలు కేవలం ధియేటర్‌లో మాత్రమే చూడ వలసినవి. కొద్ది సేపటిలో అందరూ చనిపోతామనే భావన వచ్చినపుడు మనుషుల మధ్య సంబందాలు ఎలా వుంటాయి, వారి మానసిక స్తితి ఎలా వుంటుంది, తమ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు వంటివి, మానవీయ విలువల్ని కొత్త కోణంలో చూపిస్తాయి. కేవలం గ్రాఫిక్స్ గురించి మాత్రమే కాకుండా చక్కటి విలువలున్న చిత్రంగా కూడా ఈ సినిమా నాకు నచ్చింది.

అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఒబామా స్తానంలో ఒక నల్ల జాతీయుడిని వుంచడం, ఒబామా లాగే తన ప్రజల గురించి అతడు ఆలోచించడం వంటివి ఆలోచింపచేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్‌ని ప్రళయం నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసినా కూడా వాటిని కాదనుకుని, తాను మరణంలోనయినా తన ప్రజలతోనే వుంటానని చెప్పి, చివరకు వారితోనే జలసమాధి కావడం వంటి సంఘటనలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సినిమా చూస్తున్న థ్రిల్ వుండదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.

నిజంగా 2012లో ప్రళయం వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సినిమా ఇది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వున్న ఈ సినిమాని DVD వచ్చే వరకు వెయిట్ చేసేకన్నా, థియేటర్‌లో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలం.

Monday, November 9, 2009

మార్పు కోసం చిన్న ప్రయత్నం.. శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్


ప్రస్తుతం మన సమాజం సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎన్నో మార్పులకి లోనవుతూ ఉంది. ప్రత్యేకించి విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు అవసరమని మేధావి వర్గం భావిస్తూండగా, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఇక విద్యా సంస్థలు ఇష్టా రాజ్యంగా అటు విద్యర్ధుల్ని, తల్లిదండ్రుల్నీ ఇబ్బందుల పాలు చేస్తూ, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నయి. ఇది చాలదన్నట్లు వెర్రి మొర్రి సినిమాలు చూసి కుర్రకారు వేసే వేషాలు సాటి విద్యార్ధులకి ప్రత్యేకంగా ఆడపిల్లల పాలిట శాపాలుగా మారాయి. దీని గురించి మన బ్లాగ్లోకంలో ఎన్నో చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇలా ఎన్ని మాటలు చెప్పినా వుపయోగం వుండదు కాని కనీసం ఆచరణలో కొన్నయినా చూపగలిగితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి సారిగా ప్రత్యేకించి ఆడపిల్లల కోసం ఒక జూనియర్ కాలేజీని స్థాపించాము. నాకు ఇంకా ఇతర వ్యాపారాలు వున్నప్పటికీ, కేవలం లాభార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా, పిల్లలకి మంచి చేద్దామనే వుద్దేశ్యంతో, ఒక చక్కటి మార్పుకి నాంది పలకాలనే ఉద్దేశ్యంతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దీనికి మా తాడేపల్లిగూడెం వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు గారు కూడా సంపూర్ణ ప్రోత్సాహం అందించారు. కాలేజీ నిర్వహణ బాధ్యతని నా సోదరి శ్రీమతి కృష్ణ చైతన్య నిర్వహిస్తుంది. మా ముగ్గురి ఆలోచనలు ఒకటి కావడంతో ఈ జూన్ నెలలో కాలేజీ ప్రారంభించాము. ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా మీకు తెలియజేసినందుకు బ్లాగ్మిత్రులు నన్ను మన్నించాలి.

పిల్లల జీవితంలో ఇంటర్మీడియెట్ అనేది ఒక ముఖ్యమయిన మలుపు. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకి లోనవుతూ, ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలెని స్థితిలో పిల్లలు వుంటారు. అటువంటి వారికి సరయిన దిశా నిర్దేశం చేయగలిగితే చక్కటి భవిష్యత్తుని వారు నిర్మించుకుంటారు. అందుకే మా కాలేజీలో విద్యతో బాటుగా సంపూర్ణ వ్యక్తిత్వం పొందేలాగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం జరిగింది. విద్యార్ధినుల రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాము.

* మానసిక వత్తిడి తగ్గించడానికి ప్రతీ రోజు మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాము.
* వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు.
* ప్రతీ వారాంతంలో ఫ్లవర్ మేకింగ్, డ్రాయింగ్, గార్మెంట్ డిజైనింగ్ వంటి వాటిలో శిక్షణ.
* ఆలోచనలని పెంపొందించేలా గ్రూప్ డిస్కషన్స్, కవితలు చెప్పడం, సృజనాత్మక వ్యాసాలు వ్రాయడం నేర్పించడం.
* అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయడంతో బాటుగా, ప్రాచీన భారతీయ విలువలు, సమాజంలో మనం మెలగవలసిన విధానం గురించి ప్రత్యేక క్లాసుల నిర్వహణ.

వీటన్నిటితో బాటుగా విద్యార్ధినులందరికీ స్మార్ట్ కార్డులు అందించాము. వాటిని కాలేజ్ మెయిన్ డోర్ దగ్గర ఒకసారి చూపిస్తే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ కావడంతో బాటుగా, ఆ విద్యార్దిని అటెండెన్స్ కూడా పడుతుంది. వెంటనే అదే విషయం పేరెంట్ సెల్‌కి SMS పంపబడుతుంది. మరలా సాయంత్రం ఇంటికి వెళ్ళెటప్పుడు ఇక్కడ బయలుదేరిన విషయం పేరెంట్‌కి తెలియజేయబడుతుంది. ఇక పిల్లల గురించి తల్లిదండ్రులకి ఎటువంటి బెంగా పడనక్కర్లేకుండా పూర్తి బాధ్యత మేమే వహించేలా దీనికి రూపకల్పన చేసాము.

మా కాలేజ్ నినాదం... "మీ బంగారు తల్లి ఉజ్జ్వల భవిష్యత్తు విజ్ఞాన వంతంగా, సురక్షితంగా, ఆహ్లాదకరంగా...."

విద్యారంగంలో నా ఈ చిన్న ప్రయత్నం విజయవంతం కావడానికి మీ అందరి అమూల్యమయిన ఆశీస్సులు , సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను.