Sunday, December 20, 2009

తెలంగాణ వద్దు.. సమైఖ్యాంధ్ర ముద్దు అనే నినాదంతో ర్యాలీ..


తెలంగాణ వద్దు.. సమైఖ్యాంధ్ర ముద్దు అనే నినాదంతో తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఒక ర్యాలీ చేసాము. నా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్సుల యజమానులు, స్టాఫ్ అందరూ, ప్రెస్సులకి శెలవు ప్రకటించి సమైక్యంగా ర్యాలీలో పాల్గొన్నారు. స్తానిక పోలీస్ ఐలాండ్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి, తాలూకా ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి, దారిలో వున్న అఖిల పక్ష కమిటి వారి శిబిరాన్ని సందర్శించి అక్కడ దీక్షలో కూర్చున్నవారికి మా మద్దతు తెలిపి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి, మా ప్రదర్శనని ముగించాము. జై సమైక్యాంద్ర అనే నినాదాలతో ఆ రోజు పట్టణం మొత్తం హోరెత్తింది.

Tuesday, December 15, 2009

నేనూ నిరాహార దీక్ష చేస్తా.. నాకూ ఒక రాష్ట్రం ఇస్తారా.... ప్లీజ్....

నాకూ ఒంటి నిండా పని లేకుండా పోయింది... ఎంతసేపూ చిన్న చిన్న వ్యాపారాలు ఏమి చేస్తాం? శుభ్రంగా నిరాహార దీక్ష అని పేరు చెప్పి కాస్సేపు తిండి తినకుండా కూర్చుంటే... ఆ పై అమ్మ దీవెన లభిస్తే నేను కూడా ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిపోవచ్చు.

ఏమిటీ పనికి మాలిన సోది అనుకుంటున్నారా?.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తుంటె అదే అనిపిస్తుంది. కాస్త కడుపుకి అన్నం తింటున్న వాడెవడికయినా సేం ఫీలింగ్ వస్తుంది. అసలింత అర్జంటుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పమంటే ఎవరూ చెప్పరు. పోని తెలంగాణా వాళ్ళకు జరిగిన అన్యాయం ఏమిటో ఎవరూ చెప్పరు. అదేదో బ్రహ్మ పదార్ధం అనుకుంటా. మనకు అర్ధం కాదు. పూర్వం నుంచి తెలంగాణా వాదాన్ని తెరపైకి తెస్తున్న వారందరికీ రాజకీయ దురుద్దేశ్యం తప్ప మరొకటి వున్నట్టు కనబడదు. రాష్ట్రాన్ని భాషా ప్రయుక్తంగా అంటే భాషల వారీగా విడదీసినప్పుడు తెలుగు వాళ్ళందరు ఒకే నేలపై సంఘటితంగా వుండాలని కోరుకుంటేనే కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? మళ్ళీ ఇప్పుడేమిటీ గోల? మనం వున్నది ప్రజాస్వామ్యంలోనే కదా.. మనకు కావలసినవి శాసన సభలో పోరాడి సాధించుకోవచ్చు. ఇలా ఎవరికి వారు తమకు అన్యాయం జరుగుతోందని రోడ్లెక్కి కొట్టుకుంటే, ప్రతీ ఒక్కరికి ఒక్కో రాష్ట్రం ఇవ్వడం మొదలు పెడితే దేశాన్ని కనీసం ఒక వంద ముక్కలు చెయ్యాలి. బహుశా అంతకన్న ఎక్కువయినా ఆశ్చర్య పడనక్కర్లెదు.

భారత దేశ చరిత్రని పరిశీలిస్తే పూర్వం నుండి, ఈ దేశంలో అనేక రకాలయిన ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. వారు ఏ సంస్కృతికి చెందిన వారయినా, ఏ భాష మాట్లాడే వారయినా, ఏ మతానికి చెందిన వారయినా ఇక్కడ చక్కటి ఐకమత్యంతో ఒకే ఒక భారతీయత అనే భావంతో వున్నారు. అయితే మధ్య యుగాల్లో ప్రాంతాల వారిగా ఎక్కువయిన పోరాటాల వల్ల స్తానిక రాజులకి ఒకరికొకరికి పడక, వీళ్ళళ్ళొ వీళ్ళు కొట్టుకుచచ్చి దేశాన్ని ముందుగా ముస్లింలకి, తరువాత యూరోపియన్స్ కి అప్పచెప్పారు. ఇంక వాళ్ళు పెట్టే బాధలు పడలేక మనందరం ఏకమై భారతీయులమనే భావనతో స్వాతంత్ర పోరాటం చేసాము.. సాధించుకున్నాము.. స్వాతంత్రం వచ్చిన తరువాతయినా ఇంకా మిగిలిపోయిన సంస్తానాల్ని భారతావనిలో విలీనం చేయడం అనే కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వుక్కు మనుషుల కృషి ఫలితంగా అఖండ భారతావని ఆవిర్భవించింది.

ఇప్పుడు కె.సి.ఆర్ లాంటి వాళ్ళని చూస్తుంటే మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందేమో అనిపిస్తుంది. దేశాన్ని మళ్ళి కుక్కలు చింపిన విస్తరి చేస్తారేమో అనిపిస్తుంది... అలాంటి చిల్లర రాజకీయ నాయకుల్ని, మతిలేని వాళ్ళని అదుపులో పెట్టుకోలేక పోవడం వల్లనే నేడు ఈ దుస్తితి వచ్చింది. ఎందుకూ పనికిరాని కె.సి.ఆర్ ప్రసంగాలని, వాడు చేసే అర్ధం లేని పనులని కూడా రోజూ మెయిన్ హెడ్డింగుల్లో, కలర్ ఫోటోల్లో వేసి ప్రజలందరికి వాడినొక పెద్ద నాయకుడిగా ఇమేజ్ కల్పించిన మీడియాకి కూడా ఈ పాపంలో భాగం వుందని చెప్పక తప్పదు. అడగ్గానే రాసిచ్చెయ్యడానికి ఇదేమీ ఆయన సొంత జాగీర్దారు కాదు కదా. కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సున్నితమయిన అంశం.

కె.సి.ఆర్ అడిగాడు కదాని తెలంగాణా ఇచ్చెస్తే దేశం ఇంకా వంద ముక్కలవుతుంది. రేపు మళ్ళి ఇదే కె.సి.ఆర్ పత్యేక తెలంగాణా దేశం కావాలని నిరాహార దీక్ష చెయ్యడని నమ్మకమేమిటి? అప్పుడు కూడా ఇలాగే హైదరాబాద్ ప్రత్యేక దేశం ఏర్పాటు చేస్తారా? ఒకవేళ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఇస్తే, ఇప్పటికే హైదరాబాద్ వున్న వుగ్రవాదుల్ని ఆణచడంలో ఆ చిన్న రాష్ట్రానికి వున్న శక్తి సరిపోతుందా... ఒక వేళ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల లాగా తెలంగాణా పూర్తిగా వుగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని నిరోధించే సత్తా ఈ వూసరవెల్లి రాజకీయ నాయకులకి వుంటుందా?

ఇక్కడ తెలంగాణా ఇవ్వాలా వద్దా అనేది కాదు సమస్య.. అసలు తెలంగాణా రాష్ట్రం అవసరమా కాదా అనేదే... గొడవలనేవి ఎక్కడయినా వుంటాయి... అన్యాయం అనేది ఎక్కడయినా జరుగుతుంది.. అది భార్యా భర్తల మధ్య కావచ్చు.. అన్నదమ్ముల మధ్య కావచ్చు.. అత్తా కోడళ్ళ మధ్య కావచ్చు. ప్రతీ దానికి విడిపోవడమే పరిష్కారం అనుకుంటే ఇంక మనకు చుట్టుపక్కల కలిసుండే వాళ్ళెవరు కనిపించరు. చచ్చి సాధించేదేమీ వుండదు.. విడిపోయి బావుకునేదేమీ వుండదు. కలిసి వుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ప్రతీ సమస్యకీ ఒక పరిష్కారం వుంటుంది. అది సరయిన సమయంలో కనుక్కోవడంలోనే విజ్ఞత వుంటుంది...

రాజకీయమంటే ప్రజల బలహీనతలతోను, వారి భావోద్వేగాలతోనూ ఆడుకోవడం కాదు.. నిజంగా మనస్ఫూర్తిగా వారి బాగుకోసం కృషి చేసిన వారే ధీరోదాత్తులుగా చరిత్రలో నిలబడతారు.. అంతే గాని చవకబారు రాజకీయాలు చేసి, తెలుగు జాతిని నిలువునా విడదీసి, వారి ఆత్మ గౌరవాన్ని బజారు కీడ్చి, ప్రపంచం ముందు తలవంచుకొనేలా చేస్తున్న కె.సి.ఆర్. వంటి నాయకుల్ని చరిత్ర, భావి తరాల ప్రజలు క్షమించరు...

Friday, November 13, 2009

ప్రపంచానికి ఆఖరు ఘడియలు... 2012 సినిమా రివ్యూ..


ఈ ప్రపంచానికి ఆఖరి రోజు వచ్చి, వినాశనం కళ్ళ ముందు జరుగుతూంటే, ఈ భూమి మీద మానవ జాతి అంతరించిపోతే, ఎలా వుంటుంది అనే అంశాలతో తీసిన చిత్రమే ఈ 2012. ఈ సినిమా దర్శకుడు రొనాల్డ్ ఎమ్రిక్ కి జనాలని భయపెట్టడం ఇదేమి కొత్త కాదు. ఇది వరకు ఇండిపెండెన్స్ డే, 10,000 బి.సి., డే ఆఫ్టర్ టుమారో వంటి సినిమాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. వినాశనం, ప్రళయం వంటి సబ్జక్టులతో సినిమాలు రావడం హాలీవుడ్ లో కొత్త కాకపోయినా, 2012 లో నిజంగానే భూమి వినాశనం అవుతుందనే అంచనాలతో రూపొందించిన సినిమాగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

సహజంగానే హాలీవుడ్ సినిమాలని ఇష్టపడే నేను, ఈ సినిమా చూడడానికి, అందునా ప్రపంచంలో అందరికన్నా ముందుగా (హాలీవుడ్‌లో ఈవాళ రిలీజ్ అవుతుంది) చూడడం థ్రిల్లింగ్‌గా వుండి నిన్న సాయంత్రమే థియేటర్‌కి వెళ్ళాను. మన దేశ ప్రేక్షకులని ఆకర్షించడానికి కాబోలు, ఈ సినిమా ముందుగా ఇండియాలో ప్రారంభమవుతుంది. సూర్యుడిలో జరిగే విస్ఫోటనాల కారణంగా (Solar flares) న్యూట్రినోలు విడుదలయి, అవి మైక్రోవేవ్స్‌లా పనిచేసి, భూమిలోపలి లావాని ఉడికించడం, దాని వలన విపరీతమయిన వేడి విడుదలయ్యి, భూమి పై పొరలు కంపించి, అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామీలు వచ్చి భూమి యొక్క ధృవాలు మారిపోయి, ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి, మానవ జాతి వునికే లేకుండా పోతుందనేది ఒక సిద్దాంతం. దీనికి తోడు, మెక్సికోలోని ఒక పురాతనమయిన మాయన్ తెగవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించుకున్న కేలండర్ సరిగ్గా 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది. అంటే ఆ తేదీ తరువాత కేలండర్‌తో పని వుండదనేది మాయన్ల నమ్మకంగా చెబుతారు. ఇవన్నీ కలగలిపి, ఒక వేళ నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందనేది మనకి రుచి చూపించడానికి, ఎమ్రిక్ చక్కటి ప్రయత్నం చేసాడు.

ఈ సినిమాలో హీరో జాక్సన్‌కి అందరికన్నా ముందుగా భూమి వినాశనం గురించి తెలుస్తుంది. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్నీ రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. తన కారులో పిల్లల్ని తీసుకు వెళుతూ ఉంటే వెనకాలే భూమి విడిపోవడం, విమానంలో వెళుతుంటే, కళ్ళ ఎదురుగా పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు కూలిపోవడం వంటివి కంపూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు. భూమి మీద వున్న నాగరికత మనుషులూ అందరూ అంతరించిపోయాక, మరలా కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పెద్ద పెద్ద షిప్స్ నిర్మించడం, ప్రపంచంలోని అన్ని రంగాలకి చెందిన శాస్త్రవేత్తలని, దేశాధినేతలని, కోటీశ్వరుల్ని ఆ షిప్స్ ద్వారా రక్షించడం వంటి దృశ్యాలు కేవలం ధియేటర్‌లో మాత్రమే చూడ వలసినవి. కొద్ది సేపటిలో అందరూ చనిపోతామనే భావన వచ్చినపుడు మనుషుల మధ్య సంబందాలు ఎలా వుంటాయి, వారి మానసిక స్తితి ఎలా వుంటుంది, తమ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు వంటివి, మానవీయ విలువల్ని కొత్త కోణంలో చూపిస్తాయి. కేవలం గ్రాఫిక్స్ గురించి మాత్రమే కాకుండా చక్కటి విలువలున్న చిత్రంగా కూడా ఈ సినిమా నాకు నచ్చింది.

అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఒబామా స్తానంలో ఒక నల్ల జాతీయుడిని వుంచడం, ఒబామా లాగే తన ప్రజల గురించి అతడు ఆలోచించడం వంటివి ఆలోచింపచేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్‌ని ప్రళయం నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసినా కూడా వాటిని కాదనుకుని, తాను మరణంలోనయినా తన ప్రజలతోనే వుంటానని చెప్పి, చివరకు వారితోనే జలసమాధి కావడం వంటి సంఘటనలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సినిమా చూస్తున్న థ్రిల్ వుండదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.

నిజంగా 2012లో ప్రళయం వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సినిమా ఇది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వున్న ఈ సినిమాని DVD వచ్చే వరకు వెయిట్ చేసేకన్నా, థియేటర్‌లో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలం.

Monday, November 9, 2009

మార్పు కోసం చిన్న ప్రయత్నం.. శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్


ప్రస్తుతం మన సమాజం సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎన్నో మార్పులకి లోనవుతూ ఉంది. ప్రత్యేకించి విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు అవసరమని మేధావి వర్గం భావిస్తూండగా, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఇక విద్యా సంస్థలు ఇష్టా రాజ్యంగా అటు విద్యర్ధుల్ని, తల్లిదండ్రుల్నీ ఇబ్బందుల పాలు చేస్తూ, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నయి. ఇది చాలదన్నట్లు వెర్రి మొర్రి సినిమాలు చూసి కుర్రకారు వేసే వేషాలు సాటి విద్యార్ధులకి ప్రత్యేకంగా ఆడపిల్లల పాలిట శాపాలుగా మారాయి. దీని గురించి మన బ్లాగ్లోకంలో ఎన్నో చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇలా ఎన్ని మాటలు చెప్పినా వుపయోగం వుండదు కాని కనీసం ఆచరణలో కొన్నయినా చూపగలిగితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి సారిగా ప్రత్యేకించి ఆడపిల్లల కోసం ఒక జూనియర్ కాలేజీని స్థాపించాము. నాకు ఇంకా ఇతర వ్యాపారాలు వున్నప్పటికీ, కేవలం లాభార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా, పిల్లలకి మంచి చేద్దామనే వుద్దేశ్యంతో, ఒక చక్కటి మార్పుకి నాంది పలకాలనే ఉద్దేశ్యంతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దీనికి మా తాడేపల్లిగూడెం వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు గారు కూడా సంపూర్ణ ప్రోత్సాహం అందించారు. కాలేజీ నిర్వహణ బాధ్యతని నా సోదరి శ్రీమతి కృష్ణ చైతన్య నిర్వహిస్తుంది. మా ముగ్గురి ఆలోచనలు ఒకటి కావడంతో ఈ జూన్ నెలలో కాలేజీ ప్రారంభించాము. ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా మీకు తెలియజేసినందుకు బ్లాగ్మిత్రులు నన్ను మన్నించాలి.

పిల్లల జీవితంలో ఇంటర్మీడియెట్ అనేది ఒక ముఖ్యమయిన మలుపు. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకి లోనవుతూ, ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలెని స్థితిలో పిల్లలు వుంటారు. అటువంటి వారికి సరయిన దిశా నిర్దేశం చేయగలిగితే చక్కటి భవిష్యత్తుని వారు నిర్మించుకుంటారు. అందుకే మా కాలేజీలో విద్యతో బాటుగా సంపూర్ణ వ్యక్తిత్వం పొందేలాగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం జరిగింది. విద్యార్ధినుల రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాము.

* మానసిక వత్తిడి తగ్గించడానికి ప్రతీ రోజు మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాము.
* వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు.
* ప్రతీ వారాంతంలో ఫ్లవర్ మేకింగ్, డ్రాయింగ్, గార్మెంట్ డిజైనింగ్ వంటి వాటిలో శిక్షణ.
* ఆలోచనలని పెంపొందించేలా గ్రూప్ డిస్కషన్స్, కవితలు చెప్పడం, సృజనాత్మక వ్యాసాలు వ్రాయడం నేర్పించడం.
* అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయడంతో బాటుగా, ప్రాచీన భారతీయ విలువలు, సమాజంలో మనం మెలగవలసిన విధానం గురించి ప్రత్యేక క్లాసుల నిర్వహణ.

వీటన్నిటితో బాటుగా విద్యార్ధినులందరికీ స్మార్ట్ కార్డులు అందించాము. వాటిని కాలేజ్ మెయిన్ డోర్ దగ్గర ఒకసారి చూపిస్తే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ కావడంతో బాటుగా, ఆ విద్యార్దిని అటెండెన్స్ కూడా పడుతుంది. వెంటనే అదే విషయం పేరెంట్ సెల్‌కి SMS పంపబడుతుంది. మరలా సాయంత్రం ఇంటికి వెళ్ళెటప్పుడు ఇక్కడ బయలుదేరిన విషయం పేరెంట్‌కి తెలియజేయబడుతుంది. ఇక పిల్లల గురించి తల్లిదండ్రులకి ఎటువంటి బెంగా పడనక్కర్లేకుండా పూర్తి బాధ్యత మేమే వహించేలా దీనికి రూపకల్పన చేసాము.

మా కాలేజ్ నినాదం... "మీ బంగారు తల్లి ఉజ్జ్వల భవిష్యత్తు విజ్ఞాన వంతంగా, సురక్షితంగా, ఆహ్లాదకరంగా...."

విద్యారంగంలో నా ఈ చిన్న ప్రయత్నం విజయవంతం కావడానికి మీ అందరి అమూల్యమయిన ఆశీస్సులు , సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను.