Pages

Thursday, December 29, 2011

వైదిక మతం సైన్స్‌కి వ్యతిరేకమా?


    చాలా మంది అనుకున్నట్టుగా, ప్రపంచంలో మిగతా మతాల మాదిరిగా కాకుండా వైదిక మతం శాస్త్ర విజ్ఞానానికి పెద్ద పీట వేసింది. హిందువులకు ముఖ్యమైన మత గ్రంధాలు వేదాలు. 'వేదం' అనే పదం 'విత్‌' అనే ధాతువు నుండి వచ్చింది. విత్‌ అంటే 'జ్ఞానం' అని అర్థం. మానవ సమాజం యొక్క మొదటి మెట్టు జ్ఞానంతోనే మొదలయిందని దీని అర్థం. మనిషి నాగరికత మొదటి అడుగు వేసింది నిప్పును కనిపెట్టడంతోనే అని అందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి ప్రాచీనమైన గ్రంధమైన ఋగ్వేదం 'అగ్నిమీళే పురోహితమ్‌' అనే అగ్ని దేవుని ఋక్కు (ప్రార్థన)తో మొదలయింది. హిందూ మత గ్రంధాలు ఎన్నడూ అంధ విశ్వాసాలను నూరిపోయవు. అలాగే తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు. వైదిక మతం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. ప్రశ్నించడం జ్ఞానం తెలిసిన వాడి హక్కు. ఫలానా గ్రంధంలో ఇలాగే ఉంది కాబట్టి దాని గురించి మీకు ప్రశ్నించే హక్కు, అధికారం లేదు అని ఎవరూ అనలేరు. ప్రశ్నించ గల నేర్పు, ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చునో కూడా ఒక శాస్త్రంగా రూపుదిద్దుకున్నాయి. అదే 'తర్కశాస్త్రం' - వేదాంగాలలో ఒకటి. వేదాంతమైన ఉపనిషత్తు కూడా గురు శిష్యుల మధ్య సంవాద రూపంలో ఉంటాయి. అంటే శిష్యుడు తనకు వచ్చిన ఒక అనుమానాన్ని గురువుని అడుగుతాడు. దానికి గురువు చక్కటి, సమాధానం చెబుతాడు. ఒకవేళ గురువుగారు చెప్పిన సమాధానంతో శిష్యుడు తృప్తి పడకపోతే, లేదా ప్రక్కనున్న మరో శిష్యుడికి దానికి సంబంధించిన మరో అనుమానం వస్తే, మరల గురువుగారిని తన ప్రశ్నని గురించి అడగవచ్చు. ఈ విధంగా మనం ఇపుడు చెప్పుకుంటున్న గ్రూప్‌ డిస్కషన్స్‌ ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధమైన చర్చల ద్వారా వేద విషయాలలోని సంక్లిష్టత అందరికీ అర్థమయ్యే సులభ భాషలో ఉపనిషత్‌ రూపంలో భద్రపరచబడింది. ఉపనిషత్తులలో లేని అంశమంటూ లేదు. ఈ సృష్టి ఏర్పడిన విధానం - భగవంతుని గుణ గణాలు - ఆయన రూపం - ఆత్మ - పరమాత్మ - వీరిద్దరికీ గల సంబంధం - ప్రకృతి శక్తులు ఏమిటి - మనిషికి ప్రకృతికిగల సంబంధం - జననం - మరణం - పునర్జన్మ - వీటి రహస్యాలు ఇలా మనిషికి వచ్చే ప్రతీ అంశం గురించి ఉపనిషత్తులలో కూలంకంషంగా అధ్యయనం చేసారు - మన ప్రాచీన ఋషులు, యోగులు.

    మానవ నాగరికతకు మూల స్థంభమే వేదం. మనకి జన్మ నిచ్చిన స్త్రీని మాతృ మూర్తిగా పిలవాలని ప్రపంచానికి నేర్పింది వేదం. అందుకే ఏ భాషలోనైనా అమ్మని పిలిచే పిలుపులో 'మ' అనే అక్షరం తప్పని సరిగా ఉంటుంది. మన జన్మకి కారకుడైన పురుషుడిని తండ్రిగాను, వీరందరినీ ఒక కుటుంబంగా వ్యవహరించాలని, నిత్యం మనం చేయవలసిన పనులు, సమాజం నడవడిక ఎలా ఉండాలో, రాజు ఎలా పరిపాలించాలో అన్నీ తెలిపింది వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది వేదం. వేదం అంటే జ్ఞానం - జ్ఞానం అంటే వేదం. ఇక వేదం జ్ఞానాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది?

    ఇదే కాకుండా ఈ రోజు ఆధునిక ప్రపంచానికి వచ్చే అనేక రుగ్మతల నుండి విముక్తి ప్రసాదిస్తున్న అతి ప్రాచీన - ఋషి ప్రసాదిత - యోగ విజ్ఞానం కూడా వేద కాలంలోనే రూపొందించబడింది. మనిషి శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి - ఏఏ నాడి పని తీరు ఎలా ఉంటుంది - ఏమి చేస్తే ఆయా అంగాల తీరుని మెరుగుపరచుకోవచ్చును - మనిషి తన ఆరోగ్యం కోసం ఏమి చేయాలి - ఇత్యాది విషయాలన్నీ యోగ శాస్త్రంలో నిబిడీకృతతం చేయబడ్డాయి. అవన్నీ కనిపెట్టడానికి ఇప్పటి వైద్య శాస్త్రానికి మరో వందేళ్ళ కాలం పట్టవచ్చు. ఇది అతిశయోక్తి కాదు - సంపూర్ణమైన నిజం. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన సత్యం. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం లోక క్షేమమే తమ పరమావధిగా తలచి మానవాళి మొత్తానికి ప్రాచీన ఋషి పుంగవులు అందించిన కల్తీ లేని, వ్యాపార ధృక్పదం లేని నిజమైన జ్ఞానం.

    భరధ్వాజుని వైమానిక శాస్త్రం - శుశ్రుతుని శస్త్ర విద్య పరిజ్ఞానం (ఆపరేషన్‌) - వరాహమిహిరుడు, ఆర్యభట్ట మొదలగు వారి ఖగోళ శాస్త్రం, భాస్కరుని లీలా గణితం (ప్రపంచంలో మొట్టమొదటి ఆల్జీబ్రా గణితం) - పాణిని వ్యాకరణ సూత్రాలు (మొట్టమొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌), ప్రపంచానికే తలమానికమైన దశాంశ పద్దతి వాడుక, అంకెల్ని కనిపెట్టడం, సున్నాని కనిపెట్టడం - ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రీయమైన క్యాలండర్‌ రూపకల్పన - ఋతువుల విభజన - ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతు ఉండదు. ఇవన్నీ ఎందుకు - రెండేళ్ళ తరువాత గ్రహణం ఎప్పుడు వస్తుందో ఖగోళ శాస్త్రవేత్తని లేదా ప్లానిటేరియం వాళ్ళని అడిగి చూడండి - వాళ్ళు చెప్పలేరు. కాని ఎక్కడో రేలంగిలో ఉన్న తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారినో మరో ప్రఖ్యాత సిద్ధాంతి గారినో అడిగి చూడండి - ఖచ్చితంగా లెక్కలు వేసి - కూర్చున్న చోట నుండి లేవకుండా సమాధానం చెప్పగలరు. అది కూడా ఎలా - గ్రహణం ఏ రోజు, ఎన్ని ఘడియల - ఎన్ని విఘడియలకు మొదలవుతుంది - ఆ సమయంలో గ్రహ స్థితి ఏమిటి - ఎన్ని గంటల ఎన్ని నిముషాల పాటు ఆ గ్రహణం ఉంటుంది - దాని స్పర్శా కాలం ఎంత - సంపూర్ణ గ్రహణం ఎంత సేపు ఉంటుంది ఇలా పూర్తి వివరాల్ని సంపూర్ణంగా అందించగలరు. ఇంతటి అద్భుతమైన ఖగోళ పరిజ్ఞానం ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఏ ఒక్క సమాజానికి లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. పైగా ఇదంతా కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేని (మనం అనుకుంటున్నాం- నిజమో కాదో తెలియదు) ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు వ్రాసి ఉంచిన శాస్త్రాల ఆధారంగా గణించి చెప్పినటువంటిది. అంటే ఖగోళ శాస్త్రంలో ఎంతటి అద్భుతమైన కృషి జరిగిందో ఇటే ఊహించవచ్చు.

    మిగతా మతాల్లో జ్ఞానం అనేది ఒక నిషిద్ధ ఫలం. జ్ఞానాన్ని తెలుసుకోవడం దేవుడిని ఎదిరించడమే. అందుకే ఆడమ్‌, ఈవ్‌లు సాతాను మాట విని నిషిద్ధ జ్ఞాన ఫలాన్ని తిని దేవుని శాపానికి గురయ్యారు. కాని వైదిక మతంలో జ్ఞానమే రాజమార్గం. భగవంతుడిని చేరడానికి భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో జ్ఞానమార్గానిదే అగ్రస్థానం. జ్ఞానిగా మారినవారు దేవునికి ఇష్టులవుతారు. వారు ఎప్పటికైనా భగవంతునిలో ఐక్యమవుతారంటోంది వేదం. అలా నేను అనే అహంకారం నశించి, భగవంతునిలో ఐక్యమవ్వడమే మోక్షం.

    ఇప్పటి తరం దేన్నయితే నిజమైన అభివృద్ధిగా భ్రమపడుతుందో - ఏ ప్రకృతి వినాశనాన్ని వ్యాపారం అనుకుంటున్నదో - ఏ శారీరక మానసిక అనారోగ్యాన్ని నాగరికత అనుకుంటున్నదో అటువంటి ప్రయోగాలన్నీ దీర్ఘకాలంలో మనిషి మనుగడకు, తద్వారా ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. అందుచేత అటువంటి పరిజ్ఞానాన్ని ప్రాచీన కాలంలోనే సామాన్య ప్రజలకు అందకుండా చేశారు దీర్ఘదర్శులైన మన మహర్షులు.

    మరి ఇంతటి అద్భుతమైన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్న భారతీయులు ఎందుకు మిగతా జాతులకి బానిసగా మారవలసి వచ్చింది. ప్రాచీన కాలంలో ప్రపంచానికే మార్గదర్శి అయిన భారత దేశం ఒక సామాన్య దేశంగా ఎందుకు మిగిలిపోయింది - భారతీయులంతా పర జాతికి తొత్తులుగా మారి వారు చెప్పిందే వేదంగా చెలామణీ అవుతూ  - వారి నాగరికత (?)ను అనుసరిస్తూ, అనుకరిస్తూ, తమ మూలాల్ని మరచిపోయి - ఒక నిస్సత్తువ జాతిగా మారి తమని తాము నిత్యం కించపరుచుకుంటూ - స్వార్థ పరంగా జీవిస్తున్నారు? వీటి గురించి నా తరువాతి పోస్టులో వివరిస్తాను.

అంత వరకు 'సర్వేజనా సుఖినోభవన్తు'.

Sunday, October 9, 2011

కె.సి.ఆర్‌.కి ఇంత రక్షణ అవసరమా?

ఈరోజు ఈనాడు పేపర్‌లో చూసాను. కె.సి.ఆర్‌.కి. ప్రభుత్వం ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్‌ ఇచ్చిందట. ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం అంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు కదా, వీరికి ఇటువంటి రక్షణ చర్యలు అవసరమా? వెధవ పనులు చేసే వాళ్ళకి, ఎవరితోనైనా విరోధం పెట్టుకునే వాళ్ళకి ఇటువంటి రక్షణ చర్యలు కావాలి గాని, 'ప్రజలతో మమేకమై' తిరిగే కె.సి.ఆర్‌.కి ఇటువంటివి అవసరమా? ఇంతటి ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. రేపు నేను కూడా గోదావరి జిల్లాలు ప్రత్యేకంగా ఒక దేశంగా ఉండాలని ఉద్యమం లేవదీసి, నా ప్రజలకి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడితే, అపుడు కూడా ప్రభుత్వం నాకు కూడా ఇలాగే ప్రత్యేక రక్షణ కల్పిస్తుందా? తెలుసుకోవాలి.

    ఇపుడు జరుగుతున్న ఉద్యమం మనుషులు చేస్తున్న ఉద్యమంలా నాకు కనిపించడం లేదు. మీరెలా ఊహించుకున్నా నాకు అభ్యంతరం లేదు. అమాయకులైన ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న పెద్ద మనుషులు కూడా వారి బాధ్యతల్ని వదిలి ఉద్యమాల బాట పట్టి అందర్నీ ఇబ్బంది పెట్టడం సిగ్గుమాలిన చర్య. రోడ్ల మీద వంటలు వండుకు తినడం ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో చూసి ఉండం. ఆ సమయంలో ఎంత మంది ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉండి ప్రయాణంలో ఉండి ఉంటారో ఊహించలేం. అలా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వారిలో ఒక నిండు గర్భిణీ ఉండొచ్చు, ఒక పసిపాప ఆహారం, మంచి నీళ్ళు లేక విలవిలలాడిపోవచ్చు, ఒక రోగి వైద్యం అందక నరకయాత పడుతూండవచ్చు. ఇవన్నీ ఎ.సి. రూముల్లో కూర్చున్న పెద్దమనుషులకి పట్టదు. వారికి కావాలిసింది వారి పదవి మాత్రమే. సిగ్గు లేకపోతే పోయే, కనీసం మానవత్వం ఉండనక్కర్లేదా? మనకెలాగూ చదువు లేదాయే. కూలి పని చేసుకునే వాడైనా తన పిల్లల్ని మంచి చదువు చదివించి, ప్రయోజకుడిని చేద్దామనుకుంటాడు. కాని, తెలంగాణా ప్రాంతంలో మాత్రం పిల్లల్ని బడులు మాన్పించి, ఉద్యమాలకి వారి చదువుల్ని ఆహుతి చేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 

    రైల్‌ రోకోలంటూ రైలు పట్టాల మీద కూర్చుంటున్నారు. సరైన నాయకుడు ఒక్కడు ఉండి మీద నుండి రైలు నడిపితే, పట్టాల మీద ఒక్కడైనా కూర్చుని ఉంటాడా? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం సామాన్యులని కూడా తప్పుదోవ పట్టిస్తోంది. పని చేయకుండా జీతాలు అడగడం ఎంత వరకు సబబు? అంటే ఒక ఉద్యమం పేరుచెప్పి పని ఎగ్గొట్టినా, డబ్బులు మాత్రం లోటు ఉండకూడదు. ఆఖరికి సింగరేణి కార్మికుల్ని కూడా రెచ్చగొట్టి, రాష్ట్రంలో మంచి సీజనులో కరెంటు కష్టాలకి కారణమయ్యారు. రాజకీయంగా ఉద్యమం ఎలాగైనా చెయ్యొచ్చు. కాని ఇలా బరి తెగించి, ప్రజలకి నిత్యావసరాలు కూడా అందకుండా చేసే వాళ్ళని ఏమనాలి? ఏ పేరుతో పిలవాలి? కరెంట్‌ లేక ఎన్నో పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇళ్ళల్లో పిల్లలు, వృద్ధులు విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర ఆపరేషన్లని బ్యాటరీ లైట్ల వెలుగులో చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఒకటుందా అని అనుమానం వేస్తుంది ఇదంతా చూస్తుంటే...

    ఇంత ఉద్యమం నడుపుతున్న పెద్దమనుషులకి అసలు తెలంగాణా అభివృద్ధి గురించి ఒక బ్లూ ప్రింట్‌ అంటూ ఉందా? ఏ ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి సాధించాలో ఒక అవగాహన ఉందా? కేవలం రాజకీయ పదవుల కోసం పోరాటమేనా? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. నిజంగా అభివృద్ధి మీద అంత మమకారం ఉంటే, కె.సి.ఆర్‌.ని గాని, కోదండరాంని గాని ఒక్క తెలంగాణా పల్లెని అభివృద్ధి చెయ్యమనండి. చూద్దాం. ప్రతీ పనిలోను కమీషన్లకి కక్కుర్తిపడే రాజకీయ నాయకులు, లంచం కోసం చేతులు చాచే అధికారులు ఉన్నంత కాలం అభివృద్ధి అనేది వట్టి మాట మాత్రమే. తెలంగాణా పేరు చెప్పి, చందాలు వసూలు చేసి, ఎంతో మంది నాయకులు కోట్లకు పడగలెత్తారు. అది మన కళ్ళ ముందున్న నిజం. వారిలో ఎవరైనా ప్రజల కోసం నిజంగా ఏదైనా చేసారా? చెప్పమనండి.

    తెలంగాణా వెనుకబడిన ప్రాంతమే. కాదనడం లేదు. ఆ మాట కొస్తే దేశం మొత్తం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉందిగాని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది? ప్రజల జీవన ప్రమాణాలు మారినపుడే దానిని అభివృద్ధి అంటారు. అంతే గాని ఒక ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని, పదవులు పంచుకుంటే దానిని అభివృద్ధి అనరు. పైగా ప్రజల మీద భారం రెట్టింపు అవుతుంది. ఏర్పడే రాష్ట్రం యొక్క మంత్రులు, రాజకీయ నాయకులు, వారి జీతాలు, భత్యాలు, రక్షణ వంటి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అటువంటి భారాన్ని తట్టుకునే స్థితిలో రాష్ట్రం లేదు. దానికన్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అదే సమయంలో కుటిల నాయకులు చేసే దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. అటువంటి రాజకీయ విషపురుగుల్ని ఏరిపారేయాలి. ఆ సందర్భంలో ఎవరి వత్తిళ్ళకు తలొగ్గకూడదు. ఏ ప్రభుత్వం ఇలా చేస్తుందో, చేయగలదో, ఆ ప్రభుత్వం, ఆ నాయకులు చరిత్రలో ధీరోధాత్తులుగా మిగిలిపోతారు. అంతే గాని ఏ పనీ చేయకుండా, దేవుడి మీద భారం వేసి, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే, చరిత్ర హీనులుగా మారటం తథ్యం.

Friday, October 7, 2011

స్పూర్తినిచ్చిన స్టీవ్ జాబ్స్‌కి అశ్రు నివాళి...

స్టీవ్‌ జాబ్స్‌....

ఎల్లలెరుగని సృజనశీలి.

మ్యాక్‌ ప్రపంచపు మహారాజు



    కంప్యూటర్‌తో నా మొదటి అనుబంధం, పరిచయం ఆపిల్‌ మ్యాక్‌లతోనే మొదలయ్యింది. నాన్నగారి చెయ్యి పట్టుకుని, విజయవాడలోని ఒక ప్రెస్‌లో మొదటి సారి కంప్యూటర్‌పై డిజైన్‌ చేయడం చూసాను. అది మ్యాక్‌ -2 కంప్యూటర్‌. అప్పట్లో అది ఒక అద్భుతం. కొంత కాలం తరువాత మా ప్రెస్‌లో మొదటి కంప్యూటర్‌ వచ్చింది. అప్పట్లో అదో పెద్ద అద్భుతం. అదో పెద్ద పండుగ. సింగపూర్‌ నుండి ఇంపోర్ట్‌ చేసిన కంప్యూటర్‌ కావడంతో మా ఆఫీస్‌ అంతా కంప్యూటర్‌ చూడడానికి వచ్చిన వారితో నిండిపోయేది. అది మ్యాక్‌ ఎల్‌.సి.-2. 4 మెగాబైట్ల ర్యామ్‌, 16 మెగాహెర్జ్‌ స్పీడ్‌, మ్యాక్‌ ఓఎస్‌.4.0, హార్డ్‌డిస్క్‌ స్పేస్‌ 40 మెగాబైట్స్‌. ఆ కంప్యూటర్‌పైన డిజైన్‌చేస్తుంటే అంతా నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేవారు. ఒక పెద్దాయన అయితే ఉండబట్టలేక అడిగేసాడు. ''ఏమండీ, ఆ టి.వి.(మోనిటర్‌)లో ఎగురుతున్నదేమిటి? అది ఈగా?'' అని. అప్పటికి గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ లేదు. విండోస్‌ ఇంకా నడకలు నేర్చుకుంటుంది. విండోస్‌ వైపు చూస్తే చాలు... కడుపులో దేవినట్లుండేది. ఎందుకంటే మా చేతిలో అద్భుతమైన 'మౌస్‌' ఉంది. దానితో మేము ఏదైనా చేసే వాళ్ళం. గేమ్స్‌ ఆడుకోవడం, పాటలు వినడం, మొదటి సి.డి. డ్రైవ్‌, మొదటి సారిగా కంప్యూటర్‌లో సినిమాలు చూడడం, మొదటి ల్యాప్‌టాప్‌ అనుభవం, మొదటి సారి టచ్‌ప్యాడ్‌పై మౌస్‌ అడించడం, .... అన్నీ మ్యాక్‌లోనే. ఇప్పటికీ బాగా హైఎండ్‌, హై డెఫినిషన్‌లో యానిమేషన్‌ చేయాలంటే, మ్యాక్‌ కంప్యూటర్లే గతి. ఇంతటి అద్భుతమైన ప్రపంచం సృష్టికర్త, సృజనశీలి... స్టీవ్‌ జాబ్స్‌.

    నిజానికి యాపిల్‌ మ్యాక్‌ లేకపోతే బిల్‌గేట్స్‌కి అనుకరించడానికి ఏదీ లేకపోయేది అనే నానుడి అక్షరాలా నిజం. ఇప్పటికీ ముందు మ్యాక్‌ ఒ.ఎస్‌. రిలీజ్‌ అయిన తరువాత మాత్రమే అందులో ఉన్న అన్నీ కాకపోయినా, కనీసం కొన్నయినా, విండోస్‌లో ఉండితీరుతాయి. కావాలంటే గమనించి చూడండి. అలాగే మ్యాక్‌ ఒ.ఎస్‌. ముందు బయటకు వచ్చిన తరువాత మాత్రమే విండోస్‌ రిలీజ్‌ పెట్టుకుంటారు. అంతటి అద్భుతంగా ఉంటాయి మ్యాక్‌ ఆపరేటింగ్‌ & అప్లికేషన్లు. అలాగే అడోబ్‌ వంటి పెద్ద కంపెనీలు ముందుగా తమ అప్లికేషన్లు యాపిల్‌ మ్యాక్‌కు రిలీజ్‌ చేస్తాయి. తరువాత మాత్రమే విండోస్‌కు తయారుచేస్తాయి.

    ఏదేమైనా మ్యాక్‌ అనేది ఒక అద్భుత ప్రపంచం. అదొక ఎడిక్షన్‌. ఒకసారి మ్యాక్‌పై అలవాటు అయితే ఇక మరే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రుచించదు. ఒకసారి ఆ గ్రాఫిక్స్‌కు అలవాటు పడితే... 'రాజుని చూసిన కళ్లతో..' అనే సామెత గుర్తుకొస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్‌ స్టోర్‌కి వెళితే ముందు నా కళ్ళు ఆపిల్‌ గురించి వెతుకుతాయి.  మొదటి సారి కంప్యూటర్‌ చూసిన అనుభూతి నుండి.. మొదటి సారి ఐఫోన్‌ టచ్‌ చేసిన ఫీలింగ్‌ వరకు ఏదైనా యాపిల్‌ మయమే. ఆ ప్రతి ఆవిష్కరణ వెనుక ఉన్న అత్యున్నత మేథస్సు గురించి నేనెప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆ ప్రతిభా సంపన్నుడు స్టీవ్‌ జాబ్స్‌ మాత్రమే. ప్రతి సంవత్సరం కాలిఫోర్నియాలో జరిగే ఆపిల్‌ షోలో జరిగే కొత్త ఆవిష్కరణల కోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూంటాను. అందులో జాబ్స్‌ మాట్లాడే ప్రతి మాటను నేను రికార్డ్‌ చేసుకుంటాను. తను సృజించిన ఆ కొత్త ఉత్పత్తి గురించి, జాబ్స్‌ వివరిస్తున్నపుడు ఆ కళ్ళలో కనిపించే మెరుపు, ఆ గొంతులో తారాడే చిన్నపాటి గర్వం... నాకెంతో స్ఫూర్తి నిస్తాయి. మ్యాక్‌, ఐఫోన్‌ ఉన్నంత కాలం ఆయన మన మధ్య బ్రతికే ఉంటారు..

యాపిల్ కంపెనీ తన వెబ్‌సైట్లో వుంచిన విచార సందేశంలో ఇలా పేర్కొంది... అది అక్షరాలా నిజం... 
Apple has lost visionary and creative genius, and the world has lost an amazing human being. Those of us who have been fortunate enough to know and work with Steve have lost a dear friend and an inspiring mentor. Steve leaves behind a company that only he could have built, and his spirit will forever be the foundation of Apple.

ఆ సృజనశీలికి...

ఆ నిరంతర కృషీవలునికి...

ఆ అద్భుత ఆవిష్కరణ కర్తకీ...



నా హృదయపూర్వక అశ్రు నివాళి.....

Monday, August 22, 2011

డబ్బెవరికి చేదు? అందుకే మీ కోసం చిన్న మొత్తం (రోజుకి 10-20 డాలర్లు) సంపాదించే మార్గం....

యాడ్స్ చూస్తే డబ్బులిస్తారని ఇప్పుడే ఒక స్నేహితుడి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ఇదేదో బాగానే వుంది కదాని నేను కూడా నొక్కి చూసాను... ఇందులో జాయిన్ అవ్వడం కూడా పూర్తిగా వుచితం. చిన్న మొత్తమేమీ కాదు.. ఒక  సారి క్లిక్ చేసి, 30 సెకండ్లపాటు ఆ యాడ్ చూసి, వాడు ఆడిగిన నెంబర్ మీద క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలో రెండు డాలర్ల నుండి నాలుగు డాలర్ల వరకు జమవుతుంది... సరాసరిగా రోజుకి 4 నుండి 12 యాడ్స్ వరకు వస్తున్నాయి. ఇప్పటికి 250 డాలర్లు నా ఖాతాలో జమయ్యాయి. 1000 డాలర్లు పోగయ్యక అప్పుడు ఒకేసారి మన paypal account లోకి ఆ మొత్తాన్ని పంపిస్తామని websiteలో రాసి వుంది.. వాళ్ళెంతవరకు నిజంగా ఇస్తారో లేదో తెలీదు కాని మన ఖాతాలో రోజూ 10-20 డాలర్ల చొప్పున పెరుగుతూ వుంటే అదో ఆనందం... మీరు కూడా ట్రై చేసి చూడండి... మీకు కూడా డబ్బు వస్తే ఆనందం... ఒక వేళ రాకపోతే నన్ను ఆడక్కండే.... ఇక్కడున్న link మీద నొక్కండి... మీ వివరాలు టైప్ చేసి లాగిన్ అవ్వండి... Best of Luck.