Pages

Sunday, May 29, 2016

బైబిల్‌ కాలం నాటి దేవుడిని చంపేసిన హాలీవుడ్‌.... ఎక్స్‌మెన్‌ మూవీ విశ్లేషణ

    హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా వాస్తవిక ఆలోచనల మీద ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో విడుదలయిన 'ఎక్సోడస్‌' బైబిల్‌లోని నిర్గమ కాండను బేస్‌ చేసుకుని తీసిన సినిమా. అయినప్పటికీ ఎక్కడా మహిమలు, మహత్యాల జోలికి పోకుండా ఉన్నదున్నట్టుగా తీసారు. ఎక్స్‌మెన్‌ అపోకలిప్స్‌ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇంతకు ముందు ఈ సిరీస్‌లోని సినిమాల్లో లాగానే జన్యుపరంగా మార్పు పొందిన మనుష్యులు తమకున్న అతీత శక్తుల ద్వారా మానవాళికి మేలు చేయడమే ముఖ్య కథాంశం. అయితే తమకున్న అపార శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని, తాము మాత్రమే ప్రయోజనం పొందాలా లేదా సమస్త మానవాళికోసం పోరాడి, తమ శక్తులకు ఒక సార్థకత చేకూర్చుకోవాలా అనే పాయింట్‌ చుట్టూ కధ తిరుగుతుంటుంది.

    ప్రస్తుత సినిమా విషయానికొస్తే, అపోకలిప్స్‌ అనేది బైబిల్‌ చేత నిషేధితమైన పుస్తకాల సంకలనం. అంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలన్నిటినీ ఆకాలం నాటి చర్చి గంపగుత్తగా నిషేధించి వాటిని సైతాను వ్రాతలుగా నిర్ధారించింది. అలా 3500 సంవత్సరాల క్రితం బైబిల్‌ (అపోకలిప్స్‌) లో వర్ణించబడిన ఒక దేవుడు ఈజిప్ట్‌ను కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు. తనకున్న అతీంద్రియ శక్తుల సాయంతో మనుష్యులను బానిసలుగా చేస్తాడు. తన మాట వినని వారికి ఒకటే శిక్ష.. అదే మరణం. తనకు ఎదురు చెప్పిన ప్రజలుండే నగరాల్ని, దేశాల్ని కూడా వదలడు. వాటిలో ఎన్నో ప్రకృతి విలయాల్ని సృష్టించి, అక్కడున్న ప్రజలందరినీ మృత్యు వాతకు గురిచేస్తాడు. ఆ దేవుడికి తెలిసిన ఒకే ఒక పరిపాలనా విధానం... భయ పెట్టి దారిలోకి తెచ్చుకోవడం. అయితే, అతని దుర్మార్గాన్ని సహించలేని అప్పటి ప్రజల్లో కొందరు తిరుగుబాటు చేసి, ఆ దేవుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అనుకోని విధంగా అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు. తిరిగి 1983లో కొందరు ఆ దేవుడిని మరలా ఈ లోకంలోకి తీసుకువస్తారు. స్పృహలోకి వచ్చిన ఆ దేవుడికి ఈ లోకం తీరు నచ్చదు. మరలా ఈ భూమిని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలని మరికొందరు ఎక్స్‌మెన్‌లను తన వైపు తిప్పుకుని, ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కాని, ఎక్స్‌మెన్‌లు తమ తప్పుని తెలుసుకుని, ఆ దేవుడిని చంపి, మానవాళిని ప్రళయం నుండి కాపాడుతారు. ఇదీ స్థూలంగా కథ.

    దేవుడికి చంపడమనే భావన భారతీయులకి కొత్తగా అనిపించవచ్చు. కాని, పాశ్చాత్య కోణం నుండి ఆలోచిస్తే, వారి బాధ మనకు అర్థం అవుతుంది. హిందువుల ఆలోచన ప్రకారం దేవుడికి రూపం లేదు, ఆయన సర్వాంతర్యామి, ఇంకా చెప్పాలంటే సృష్టిలోని ప్రతి అణువులోను ఆయనే నిండి వున్నాడు. ఆయనలోనే ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతమయిపోతుంది. కాని పాశ్చాత్య మతాల దృష్టిలో దేవుడు కూడా ఒక భౌతిక రూపమే. ఆయన స్వర్గం అనే ఒక 'ప్రదేశం'లో బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అక్కడి నుండి ఈ లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ ఈ భూమిమీదకి వచ్చి పోతూ ఉంటాడు. తన మాట వివని వారిని బాధలకు గురి చేస్తూ ఉంటాడు. ఒక వేళ ఇప్పుడు తప్పించుకున్నా, తన స్వర్గం పక్కనే ఒక నరకాన్ని కూడా సృష్టించి ఉంచుతాడు. ఎప్పటికీ ఆరని మంటలు అక్కడ ఉంటాయి. దానిలో పడేస్తాడు. అటువంటి సాడిస్ట్‌ దేవుడు ఇప్పటి ప్రపంచానికి అవసరంలేదు. ఒకవేళ పొరపాటున వచ్చి తమ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినా, ఇప్పటి మనుష్యులు ఊరుకోరు. తిరుగుబాటు చేస్తారు. అతడిని తన లోకానికి పంపేస్తారు. ఇదీ పాశ్చాత్య ప్రపంచం తీరు.

    ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా సేపు ఆలోచించాను. పాశ్చాత్య క్రైస్తవంలో వచ్చిన ఆలోచనలు చాలా విప్లవాత్మకమైనవి. బైబిల్‌ని ప్రస్తుత సమాజం అంగీకరించే దశలో లేదని అర్థమయింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంలేని సమాజాల్లో నుండి ప్రపంచానికి అందివ్వబడిన దుర్మార్గమైన కానుక 'బైబిల్‌'. ప్రత్యేకించి ఓల్డ్‌ టెస్టిమెంట్‌ చదివితే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అన్నీ ఆటవిక ఆలోచనలు, అర్థం పర్థం లేని సంఘటనలతో కలగలిసిపోయి ఉంటుంది. రెండు ప్రపంచ యుద్దాలకి కారణమైనది కూడా ఆ పుస్తకమే. అటువంటి పుస్తకం మీద ఆ మతాన్ని అనుసరించే వారే తిరుగుబాటు చేయడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దేవుడి కన్నా మానవత్వమే గొప్పదని, మానవత్వానికి హాని కలిగించేలా ఉంటే దేవుడినయినా తిరస్కరించవచ్చును అనేది ఇప్పటి పాశ్చాత్య దృక్పధంగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ ఆలోచన భారతీయ తాత్విక చింతనకు దగ్గరగా ఉంటుంది. సర్వ ప్రాణుల్లోను భగవంతుని రూపాన్ని దర్శించమని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కేవలం మానవ జాతి మాత్రమే కాక, పక్షులు, జంతువులు, జలచరాలు వంటి వాటిలో కూడా భగవంతుడు ఆవిర్భవిస్తాడు. అవసరాన్నిబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు భూమి మీద అవతరిస్తాడనేది మన సిద్ధాంతం. దశావతారాలు ఆ కోవలోకి చెందినవే. ''ఈ సమస్త ప్రకృతిని మానవుడు వాడుకోవడం కోసమే దేవుడు సృష్టించాడు'' అనే బైబిల్‌ మాటలు మన ఆలోచనకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తాయి. ఎంత గొప్ప మతమైనా, ఎన్ని మహిమలున్న దేవుడైనా, మానవత్వాన్ని మరచిపోతే, మనం ఉనికికి కారణమైన ఈ ప్రకృతిని గౌరవించకపోతే నామరూపాల్లేకుండా చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.