Pages

Saturday, September 29, 2012

ఒక రమణీయ జీవిత కావ్యం.... 'అమ్మ ఒడిలోకి పయనం'...

    'అందరి జీవితం గురించి అందరూ తెలుసుకోనవసరం లేదు, కాని కొందరి గురించి మాత్రం అందరూ తెలుసుకొనే తీరాలి'. ఈ నానుడికి సరిగ్గా అతికినట్టు సరిపోయే పుస్తకమే 'అమ్మ ఒడిలోకి పయనం..'. రాధానాధ్‌ స్వామి అనే సాధారణ యువకుడి జీవితంలో జరిగిన అసాధారణ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. రిచర్డ్‌ అనే అమెరికన్‌ యూదు యువకుడు భగవంతుని గురించి చేసే అన్వేషణలో వేసిన అడుగులు, వివిధ సంఘటనలు చివరికి రాధానాధ్‌ స్వామిగా ఎలా మారాడన్నదే ఈ పుస్తక సారాంశం.

    రిచర్డ్‌ ఒక సాధారణ అమెరికన్‌ యూదు యువకుడు. చిన్నతనం నుండి యూదుల పట్ల క్రైస్తవులకు సహజంగా ఉండే ద్వేషాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటాడు. దానికి తోడు ఇంట్లో తల్లిదండ్రులు దేవుని పట్ల కృతజ్ఞతగా ఎలా ఉండాలో నేర్పుతారు. 1960ల్లో అప్పుడే అమెరికా యువతలో మొదలైన హిప్పీ సంస్కృతి (దేశ దిమ్మరులు అనవచ్చును), ఇవన్నీ రిచర్డ్‌ను ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియని కూడలిలో ఉంచుతాయి. కాని ఆ యువకుడు ఎవరి మాటను వినక, తన అంతరాత్మ ప్రబోధంతో ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గ్రంధాలని చదువుతాడు. కాని దేవుడి గురించిన భావనలు ఆయన్ని అయోమయంలో పడేస్తాయి. ఈ అయోమయంలో నుంచి బయట పడే మార్గం.. ప్రపంచ పర్యటన మాత్రమే అని నమ్ముతాడు. ఆ విధంగా అమెరికా నుండి స్నేహితుడు 'గేరి'తో కలిసి బయలుదేరి, లండన్‌, ఫ్రాన్స్‌ మీదుగా, ఇటలీ చేరుకుంటారు. రోమ్‌ను సందర్శిస్తారు. ఎంతో మంది క్రైస్తవ మతపెద్దల్ని కలుసుకుని, ఎన్నో చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. కాని ఆయన మనసుకు సమాధానం లభించదు. చివరకు ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికేది కేవలం 'భారతదేశం'లో మాత్రమే అని ఒక దివ్యవాణి ఆయనకు అంతరాత్మలో ప్రబోధిస్తుంది. అక్కడి నుండి భూమార్గం ద్వారా భారతదేశం చేరుకునే ప్రయత్నంలో ముస్లిం దేశాల్లో ప్రయాణం, అక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు మనల్ని కలిచివేస్తాయి. పుస్తకం చదువుతున్నంత సేపు రిచర్డ్‌తో పాటు మనం కూడా ప్రయాణిస్తూ, ఆయన పడుతున్న బాధల్ని, కష్టాల్ని మనం కూడా కలిసి ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తాయి.

    తనకి అసలెన్నడూ పరిచయం లేని ఒక 'అపరిచిత దేశం' గురించి రచయిత మాటల్లోనే... ''ప్రతి మైలూ ముందుకు పోతున్నపుడు, నా హృదయం పవిత్రమైన భారతభూమి వైపు విహరించసాగింది. ఆ భూమితో సమాగమం జరుగకుండా నేను బ్రతకలేనని నాకు మొదటి నుండి తెలుసు. భారత భూమి కోసం పరితపించాను. నా హృదయపు లోతుల్లోని బలమైన కోరిక ఇప్పుడు నిజమయ్యేటట్టుగా ఉంది''.

    అలా భారతదేశం చేరుకున్న రిచర్డ్‌, దేశంలోని వివిధ ప్రాంతాల సందర్శన, హిమాలయ యోగులతో సహవాసం, గంగానది ఒడ్డున ఒంటరి వాసం, ధ్యానం, హిమాలయ పర్వత సానువుల్లో ఆయన చూసిన యోగుల అద్భుత విన్యాసాలు.... ఇవన్నీ చదువరులను కట్టిపడేస్తాయి. మనమెన్నడూ చూడని అద్భుత లోకాలని తీసుకువెళతాయి. అక్షరాల వెంట మనసును పరుగులు తీయిస్తాయి. అన్నిటి కన్నా ముఖ్యంగా బృందావనంలో ఘనశ్యామ్‌ బాబా వృత్తాంతం ఎంతటి వారికైనా కళ్ళవెంబడి నీళ్ళు చిప్పిల్లజేస్తుంది. అంతటి కరుణాత్మకంగా సన్నివేశ చిత్రణ ఒక విదేశీయునికి ఎలా సాధ్యమయిందో నాకు ఎన్నటికీ అర్థం కాదు. కృష్ణుని ప్రేమలో మునిగి తేలిన బృందావనంలో భగవంతుని పట్ల ప్రేమను ఏదో ఒక మత పరమైన కర్మకాండగా కాకుండా, ప్రదర్శన యోగ్యమైన క్రతువుగా కాకుండా, తమ జీవిత విధానంగా మార్చుకుని, తమ దైనందిన జీవితంలో, ఒకరినొకరు 'రాధేశ్యామ్‌' అని పలకరించుకోవడం చూసి, రచయిత ఉద్వేగానికి లోనవుతాడు. వ్యాపార మతాల నుండి వచ్చిన వారికి ఈ దేశంలోని సహజమైన ప్రేమతో దేవుని ఆరాధించడం ఒకింత ఆశ్చర్యం కలిగించడం మనం గమనిస్తాము.

    పుస్తకం మొదలు నుండి చివరి వరకు ఒక అపరాధ పరిశోధ నవల చదువుతున్న అనుభూతిని కలుగజేస్తాయి. ఆంగ్ల మూలం నుండి తెలుగులోకి అనువదించిన తీరు కూడా చాలా సరళంగా ఉంది. అక్కడక్కడ రచయితలోని హాస్య ప్రియత్వం, సున్నితత్వం కూడా గిలిగింతలు పెడుతూ రచన ముందుకు సాగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంలో రచయితలో ఎక్కడా దాపరికం గాని, మొహమాటం గాని చూడము. తన మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం కోసం దారిలో ఎదరైన అన్ని రకాల యోగులు, గురువులు, స్వాములు, వివిధ మతాల పెద్దలు... ఇలా ఎంత మంది తమ దారిలోకి తెచ్చుకోవాలని చూసినా, మొండితనంతో, తెగువతో, తన నిజమైన దారిని కనిపెట్టడానికి, తన గురువును చేరడానికి ఆయన పడిన తపన, చదువరుల మనసుని కదిలింపచేస్తాయి. సత్యాన్వేషణ అంటే కేవలం తను నమ్మిన ఒక దారిలో వెళ్ళి, మిగతా వారిని విమర్శించడం కాదని, ప్రపంచం చాలా విశాలమైనదని, ఎన్నో రకాల భావాలు, ఆరాధనా పద్దతులు, ఆచారాలు, వీటన్నిటినీ మించి, రకరకాల మనుష్యులు... అన్నిటినీ తులనాత్మకంగా, పక్షపాత రహితంగా, సాక్షీభూతంగా పరిశీలించి, అప్పుడు మాత్రమే మన మనస్సుని భగవంతుని అధీనం కావించి, ఆయన చెప్పిన మార్గాన్నే అనుసరించాలనేది రచయిత సూచన. ఇది సర్వకాల సర్వావస్థలలోను అనుసరించదగ్గది. అందరూ ఇలా ఆలోచిస్తే, మనిషిగా పుట్టి, విచక్షణా జ్ఞానం ఉపయోగించిన వారందరికీ ఒకే మార్గం బోధపడుతుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం సాకారమవుతుంది. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చదువదగిన మంచి పుస్తకం 'అమ్మ ఒడిలోని పయనం'

    క్లుప్తంగా చెప్పాలంటే ''1960లలో ధనం, ఐశ్వర్యం, విలాస వస్తువులతో, విశృంఖల విహారంతో దారి తప్పింది అమెరికా యువత. అన్నీ ఉన్నప్పటికీ, ఉన్నత ఆశయంతో సమాజం నడిచే దారిని విడచిపెట్టిన యువకుడు రిచి. హృదయంలో పిలుపును అనుసరిస్తూ, ప్రాణాలకు తెగించి, శ్రమలకు ఓర్చి, నదులు, పర్వతాలు, అరణ్యాలు, జీవారణ్యాలు, దేశాలు, ఖండాలు దాటాడు. చివరకు భారతమాత ఒడిలో చేరి, చల్లని హిమాలయాలలో సేదదీరి, గంగా ప్రవాహం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుని, వృందావన వీధుల్లో వెన్నెల రాత్రుల్లో విహరించి పరవశించడం కథ కాదు. యదార్ధం. అదే ఈ అద్భుత కథ. నాగరికత ముసుగులో అతికించుకున్న నవ్వుతో, అవిశ్వాసం తాండవించే ఆధునిక అసహజ జగత్తులో విసిగి వేసారిన ప్రతి యువకునికీ ఈ గ్రంథం ఒక చక్కటి కరదీపికగా నిలిచే అక్షరపేటిక. అందరం ఈ అమ్మఒడిలోకి పయనిద్దాం. ఆ ప్రేమామృతాన్ని ఆస్వాదిద్దాం.

    పుస్తకంలో ముందుగా త్రిదండి చిన్న జీయరు స్వామి మంగళాశాసనములు, యండమూరి వీరేంద్రనాధ్‌, అజయ్‌ కల్లమ్‌, ఐ.ఎ.ఎస్‌., బి.కె.ఎస్‌. అయ్యంగార్‌, ప్రముఖ యోగా గురువు, సౌరవ్‌ గంగూలీ, క్రికెట్‌ కెప్టెన్‌, హృషీకేష్‌ మఫత్‌లాల్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త, యశ్‌బిర్లా, పారిశ్రామికవేత్త వంటి ప్రముఖుల అభిప్రాయాలను పొందుపరచడం మరింత అందాన్నిచ్చింది.


పుస్తకం పేరు: అమ్మ ఒడిలోకి పయనం (ఒక అమెరికా స్వామి ఆత్మ కథ), పబ్లిషర్స్‌: ఎస్‌. ఛాంద్‌ పబ్లిషింగ్‌ హౌస్‌, ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి అన్ని బ్రాంచీలు, వెల: 150 రూపాయిలు.

Saturday, September 15, 2012

మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయా?

    'మంత్రాలకు చింతకాయలు రాలవు' అనే సామెతను మనం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాము. నిజమే.. చింతకాయలు రాలడానికి మంత్రమేమీ లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ప్రయోగించే వాడికి ఎంతో ఆత్మశక్తి ఉండాలంటారు.  కానీ విచిత్రమైన విషయమేమిటంటే, క్రైస్తవులు మాత్రం ప్రార్థన ద్వారానే సకల రోగాలు తగ్గిస్తామని చెబుతారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు 'సాక్షి' పేపర్‌లో ఒకనాటి సినీ కథానాయిక దివ్యవాణితో ఇంటర్వ్యూ.  బాధలు, కష్టాలు, వ్యాధులు అనేవి ప్రతీ మనిషి జీవితంలో సహజం. భగవంతుడిని నమ్మడం ఎందుకంటే, ఎంత గొప్పవాడయినప్పటికీ, కష్ట సమయంలో మనో ధైర్యాన్ని కోల్పోతాడు. అది సహజం. ధైర్యం లేనపుడు చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా పెద్దవి కనిపించి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తాయి. అటువంటి సమయంలో గుర్తుకు వచ్చేది అత్యంత శక్తివంతుడైన భగవంతుడి గురించే. కొన్నిసార్లు సాటి మనిషి ఓదార్పు మాటలు కూడా ఆయుధంలా, మంత్రంలా పనిచేస్తాయి.

    సరిగ్గా ఈ పాయింట్‌నే క్రైస్తవులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరైనా కష్టంలో ఉన్న మనిషి, లేదా వ్యాధులతో బాధపడుతున్న వారు మన దగ్గరకు రాగానే ఏవో కొన్ని ఓదార్పు మాటలు చెబుతాము. లేదా దైవాన్ని ప్రార్థించమని చెబుతాము. ఎదుటి మనిషి మరో మతానికి చెందినవారయితే వారు నమ్మిన దేవుడిని ప్రార్థించమని చెబుతాము. కాని, ఎవరైనా క్రైస్తవుల దగ్గరకు వెళ్ళినట్లయితే, వెంటనే కాసిని మంచి మాటలు చెప్పి, ప్రార్థన మొదలుపెడతారు. అది తప్పుకాదు. ఒకవేళ ఆ వ్యక్తికున్న బాధలు లేదా వ్యాధులు నయమయితే, ఇక వెంటనే బ్రెయిన్‌ వాష్‌ మొదలుపెడతారు. దేవుడిని నమ్మడం వల్లనే ఇది నయమయింది కాబట్టి నీవు వెంటనే మతం మారు అని చెబుతారు. ఒకవేళ వినకపోతే, మా దేవుడిని ప్రార్థించడం వల్లనే నీకు నయమయింది కాబట్టి నీవు మతం మారాల్సిందే. మారకపోతే మరలా నీకు కష్టం / వ్యాధి తిరిగి వస్తుంది అని బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. ఇక చేసేదేముంది? ఇష్టం ఉన్నా లేకున్నా మతం మారాల్సిందే. ఈ సకల సృష్టిలో ప్రతీ జీవిలోను, రాయి, రప్పలోను, ఆకాశంలోను, అగ్నిలోను, భూమిలోను, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు.... ఇలా ప్రతీ జీవిలోను దైవత్వాన్ని దర్శించే విశాలతత్వం నుండి, దేవుడంటే ఒకడే అనే భావనకు మార్చేస్తారు. అక్కడి నుండి తనకు తానుతో సహా ప్రపంచంలో అందరూ అలా మారిన వారికి శత్రువులే. ఇలా మత మౌఢ్యాన్ని వ్యాప్తి చేసే హక్కు వారికెవరిచ్చారు? ప్రపంచంలో గత 25 వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఘనమైన నాగరికతకు వారసులుగా మెలగవలసిన వారిని వారి సంప్రదాయాల నుండి వేరు చేసి, వారి కుటుంబాల నుండి, సమాజం నుండి, ఆచార వ్యవహారాల నుండి వేరు చేసే దుర్మార్గం ఇంకెన్నాళ్ళు సాగుతుంది?

    నాకు తెలిసిన ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి స్నేహితుని ప్రోద్బలంతో మతం మారాడు. ఇక అప్పటి నుండి ఆ ఇంటిలో వారందరినీ శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగితే దూరంగా ఉంటాడు. ఇంటిలో ఏదైనా పండుగకి పిండివంటలు వండితే, అది దేవుని ప్రసాదం నాకు వద్దు అంటాడు. చివరికి భార్య పూజ చేసి, గంట మోగిస్తే, అది నాకు వినబడకూడదు అంటూ ఆ అమ్మాయిని హింస పెట్టాడు. చివరికి అతనితో భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోతే, నాకు దేవుడు ముఖ్యం.... భార్య పోయినా పర్వాలేదు అంటూ మంకు పట్టు పట్టాడు. ఆదివారం వచ్చిందంటే మా వూర్లో అది సంత రోజు. వ్యాపారాలన్నీ చాలా బిజీగా ఉంటారు. ఎక్కువ టర్నోవర్‌ నమోదు అయ్యేది ఆ ఒక్క రోజే. ఈ మతం తీసుకున్న తరువాత ఆదివారం వచ్చిందంటే  అంత వ్యాపారాన్ని వదులుకుని, చర్చికి పోవడం మొదలుపెట్టాడు. అంటే ఆర్థికంగా కూడా నష్టపోతున్నాడు. కుటుంబ సభ్యులందరూ కుమిలిపోతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా, దేవుడే కావాలంటాడు. ఇక అతని జీవితం నాశనయినట్లే. ఎన్ని సార్లు ఎంతో మంది నచ్చచెప్పినా, తన వైఖరి మార్చుకోవట్లేదు.

    దేవుడి పట్ల భక్తి ఉండొచ్చు, కాని మూర్ఖత్వం ఉండకూడదు. క్రైస్తవ దేశాల్లోనే ఎంతో మంది వాస్తవం తెలుసుకుని, చర్చి పట్ల విముఖత ప్రదర్శించడమో, లేదా హిందూ మతమో, బౌద్ధమతమో తీసుకోవడం చేస్తున్నారు. అటువంటిది ఇంతటి మౌఢ్యాన్ని నూరిపోయడం ఈ మతంలో వారికి ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు.

    దివ్యవాణి విషయమే తీసుకుంటే ఆవిడ ఎన్నో కష్టాల్లో ఉండి ఉండవచ్చు. కొడుక్కి మందులతో నయం కాని జబ్బు వస్తే సిస్టర్‌ కొన్ని స్వాంతన మాటలు చెప్పిఉండవచ్చు. అంతమాత్రం చేత ప్రార్థన వల్లనే నా కొడుక్కి తగ్గిందని పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుంది? సెలబ్రిటీలు స్టేట్‌మెంట్లు ఇచ్చే ముందు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా చూసుకోవాలి. కేవలం ప్రార్థన వల్లనే జబ్బులు నయమయ్యే వీలుంటే, ఇన్ని హాస్పిటల్స్‌, ఇంతమంది డాక్టర్లు, వైద్య వ్యవస్థ, కొన్ని వేల కోట్ల రూపాయిల ఖర్చు.... ఇవన్నీ ఎందుకు? పైగా మిషనరీలే హాస్పిటల్స్‌ నడుపుతాయి. నర్సుల్ని తయారు చేస్తాయి. వైద్యం చేస్తూ, మందులు వాడుతూ, డాక్టర్లు చికిత్స చేస్తూ, వ్యాధి దేవుడి వల్లనే నయమయింది అనే వాళ్ళని ఏమనాలి?

    హిందూ స్వాములు, బాబాలు ఏదైనా మహిమ చేసారని చెప్పగానే అదంతా 'మ్యాజిక్‌' అంటూ గొంతు చించుకునే 'సమాజ సేవకులు', క్రైస్తవంలో పబ్లిక్‌గా ఇటువంటి పనులు చేస్తుంటే, నోరు మెదపరెందుకు? టి.వి.లో డజనుకు పైగా క్రైస్తవ చానళ్ళలో కళ్ళెదురుగా గుడ్డి వాళ్ళకు చూపు తెప్పిస్తున్నారు. కుంటివాళ్ళను పరిగెట్టిస్తున్నారు. ఇదంతా నిజమేనా? నిజమైతే ఇక హాస్పిటల్స్‌ మూసేద్దాం. డాక్టర్స్‌ని ఇళ్ళకి పంపేద్దాం. ఇంత జరుగుతున్నా, మీడియాగాని, ప్రభుత్వం గాని సుప్త చేతనావస్థలో ఉంటుంది. ఇది మన ప్రారబ్ధం.

    ఇదంతా నేను క్రైస్తవం పట్ల ద్వేషంతోనో, మరో దానితోనో రాయడం లేదు. ఎవరి మతాన్ని వారు అనుసరించే హక్కు ప్రతీ వారికి ఉంది. ఎవరి ఆరాధనా పద్దతులు వారివి. కాని ఆ పేరు చెప్పి ఎదుటి వారి విశ్వాసాల్ని, నమ్మకాల్ని అగౌర పర్చే హక్కు వారికి లేదు. బ్లాక్‌మెయిల్‌ చేసి, అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రపంచంలోనే పురాతన నాగరికతలోని ప్రజల్ని వారి సంప్రదాయాల నుండి శాశ్వతంగా దూరం చేసే సాంస్కృతిక దురాక్రమణ నుండి తమను తాము రక్షించుకునే ఆలోచనను ప్రతి ఒక్కరి హృదయంలోను రగిలించాలనేదే నా ప్రయత్నం.

Sunday, September 9, 2012

విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి : 'హైందవి' పుస్తక సమీక్ష

    ప్రపంచ దేశాలన్నీ అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నపుడు భారతదేశంలో మహోజ్జ్వల సంస్కృతి వెల్లివిరిసింది. చీకట్లో చిరుదివ్వె కాదది. మహా ప్రకాశవంతమైన నాగరికత. ప్రపంచంలోని అన్ని దేశాలకీ ఆ సంస్కృతే, ఆ నాగరికతే దిక్సూచి అయింది. ఆ నాగరికతే దారి చూపింది. కొన్ని లక్షల సంవ్సతరాల మానవ ఇతిహాస చరిత్రలో, కొన్ని వేల సంవత్సరాల మానవ నాగరికతా ప్రవాహంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సాంఘిక వ్యవస్థలతో ప్రయోగాలు ఇవన్నీ ఫలించి, పరిఢవిల్లి, సమాజ హితం కోరే దార్శనికులు, ఆలోచనాపరులు, స్వలాభం ఆశించని భారతీయ రుషుల ఆలోచనల ఫలితంగా, భారతీయ నాగరికత రూపుదిద్దుకుంది. ఎటువంటి ప్రచార సాధనాలు లేని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అన్ని దేశాలలో, మానవ జాతి ఉనికిలో ఉన్న ప్రతి గడ్డమీదా ఆర్ష ధర్మం ఆచరించబడింది. 'లోక స్సమస్తా సుఖినోభవన్తు' అని కోరుకుని, ప్రజలందరూ సుఖంగా ఉండేవేళ, ఆ ధర్మాన్ని కాదని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం స్థాపించబడిన కొన్ని కొత్త మతాలు, వ్యాపార ధోరణిని అవలంభించి, లోకంలో ఉండే శాంతి సామరస్యాలను నాశనం చేసి, ప్రజల మధ్య యుద్ధాలు రెచ్చగొట్టి, అన్ని దేశాల పురాతన సంస్కృతుల్ని దారుణంగా తుడిచిపెట్టేసాయి.  కాని నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటకి వస్తుంది. అది 'హైందవి' వంటి పుస్తక రూపంలో...

    హైదరాబాద్‌కి చెందిన శ్రీ ముదిగొండ ఇందుశేఖర్‌ గారి సంవత్సరాల కృషి ఫలితంగా 'హైందవి' రూపుదిద్దుకుంది. 'భారతీయ సంస్కృతి - విశ్వ వ్యాప్తం అని చెప్పుకోవడం కాదు, శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణలతో, కొన్ని వందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్‌లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది - హైందవి' అంటారు ఇందుశేఖర్‌గారు. అది నిజమే. ఏవో కొంత గాలి పోగుచేసి, మన గొప్ప మనం చెప్పుకున్నాం అనిపించుకోకుండా, నిజాయితీగా కృషి చేసి, ఆయన స్వయంగా కొన్ని, అంతర్జాలంలో వెతికి కొన్ని, స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు సేకరించి, ఎంతో అమూల్య సంపదను ప్రోది చేసారు. ఇదంతా ఒక ఎత్తయితే సేకరించిన సమాచారాన్ని దేశాల వారీగా విడదీసి, ఆయా దేశాల నాగరికతను, సంస్కృతుల్ని అధ్యయనం చేసి, వాటిని ప్రాచీన ఆర్ష సంస్కృతితో తులనాత్మక పరిశీలన చేసి, పరిశోధనాత్మక వ్యాసంగా అందించిన ఇందుశేఖర్‌ గారి కృషి అభినందనీయం. కేవలం వ్యాసం వ్రాయడమే కాకుండా, ఎంతో శ్రమ కోర్చి కలర్‌ ఫోటోలను కూడా సంపాదించి, పుస్తకం మొత్తం వర్ణ రంజితంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. మరో ముఖ్యమైన విషయం... ప్రతీ వ్యాసంలోను ప్రస్తావనకు వచ్చిన విషయాలను, విశేషాలను తాను ఎక్కడి నుండి సేకరించిందీ, పుస్తకం వెనుక రిఫరెన్స్‌ల రూపంలో పొందుపరిచారు. ఏవైనా అనుమానాలు ఉన్నవారు ఆ రిఫరెన్స్‌లో చూపిన అంతర్జాల లంకెలుగాని, పుస్తక పుటల్ని గాని చూడవచ్చు.

    ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నది భారతదేశంలో కాదు, కంబోడియా దేశంలో. క్రైస్తవ మతం మూలాలు, ఇస్లాం మతం మూలాలు, అరబ్బుల, యూరోపియన్ల ప్రాచీన సంస్కృతి గురించి మనకు తెలియని ఎన్నో వివరాలు అందించారు. మనకు ప్రాచ్య దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, జపాన్‌ దేశాల్లో బయట పడిన ఆర్య దేవీ దేవతా విగ్రహాలు, అక్కడి పూజా మందిరాలు, ఇటలీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ వాడుకలో ఉన్న ఆచారాలు, క్రైస్తవ, ఇస్లాం పూర్వపు సంప్రదాయాలు, వాటి పుట్టుక, ఆచరణ, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి సుదూర దేశాలలో కూడా భారతీయ ఆర్ష సంస్కృతి ఏ విధంగా పరిఢవిల్లిందో ఎంతో చక్కగా వర్ణించారు. ప్రాచీన సంస్కృతిని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన పరిశోధనాత్మక గ్రంధం - 'హైందవి'

    పుస్తక రచయిత: ముదిగొండ మల్లిఖార్జున ఇందుశేఖర్‌ గారు, పుస్తకం సైజ్‌ : 1/8 డెమీ, పుటలు: 140 (అన్నీ మల్టీకలర్‌ పేజీలు), రచయిత    సెల్‌ నెం: 99082 21589

Saturday, September 8, 2012

మన్‌ 'మౌన' ప్రధాని

    అండర్‌ అచీవర్‌ అంటూ టైమ్‌ మ్యాగజైన్‌ గౌరవనీయ భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ని దుమ్మెత్తి పోసిన విషయం మరువక ముందే వాషింగ్‌టన్‌ టైమ్స్‌ తిరిగి అదే బాటలో నడిచింది. అండర్‌ అచీవర్‌ అనే మాటకు అచ్చతెలుగులో 'అసమర్థుడు' అని అర్థం చెప్పుకోవచ్చునేమో. భారతదేశ ప్రజలు అసలే తమను తాము తిట్టుకునే పనిలో బాగా బిజీగా ఉంటారు. దీనికితోడు సాక్షాత్తు ప్రధాన మంత్రిని కూడా ఆ విధంగా తిట్టుకోవడం ఎంత వరకు సమంజసం? అందుచేత అందరం కలిసి ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడని కీర్తిద్దాం.

    రాజకీయ నాయకులు ఎన్నడూ నిజమైన నాయకులు కాలేరని అందరికీ తెలిసిన విషయమే. కాని విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ వంటి మేధావులు నాయకులు కాలేకపోవడం నిజంగా బాధపడాల్సిన విషయమే. దీనికి కారణం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ని వెనుక నుండి ఎవరు ఏ విధంగా ఆడిస్తూ, ప్రపంచానికి తోలుబొమ్మలాట చూపిస్తున్నారో జగమెరిగిన సత్యం. అంతర్జాతీయంగా భారత ప్రభుత్వ పరువును తీయడానికి ఏ దేశస్థులు ఈ హైడ్రామా ఆడిస్తున్నారో అందరికీ తెలుసు.

    మన్మోహన్‌ సింగ్‌ స్వతహాగా నెమ్మదైన వ్యక్తిత్వం కలవారు. 1990లలో పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా, ఇద్దరూ కలిసి చేపట్టిన సంస్కరణలు, గ్లోబలైజేషన్‌ వంటి వాటి వల్ల ఆయన ప్రతిష్ట ఇనుమడించింది. భారతదేశ ప్రధానిగా మన్మోహన్‌ను ఎన్నుకున్నపుడు తిరిగి అటువంటి ఆర్థిక సంస్కరణలు చేపట్టి, మరలా దేశ ప్రతిష్టను పెంచుతారని అందరూ భావించారు. కాని ఆయన ఇటలీ పెద్దల వారసత్వ పార్టీలో ఒక రబ్బర్‌ స్టాంప్‌గా మారిపోయారు. ప్రభుత్వం నిలువునా అవినీతిలో కూరుకుపోయినా, కుంభకోణాలు వరుసపెట్టి పార్లమెంటును కుదిపేస్తున్నా, పారిశ్రామిక, ఉత్పాదక రంగాల వృద్ధి రేటు దారుణంగా మందగించినా, రూపాయి విలువ పాతాళంలోకి కుంగిపోయినా, కనీస చర్యలు తీసుకోకుండా, అన్నిటికీ అతీతంగా ఉండగలగడం మన్మోహన్‌ సింగ్‌కే సాధ్యమయింది. పైగా ప్రపంచమంతటా ఆర్థిక వృద్ధి రేటు ఇలాగే ఉందన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వ వాదన. ఆర్థిక శాస్త్రంలో కనీస పరిజ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా విషయం ఇట్టే అర్థమవుతుంది.

    భారత్‌ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. ఇక్కడి పారిశ్రామిక, సేవా రంగాలన్నీ వ్యవసాయాధారితాలే. అంటే వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులు, వ్యవసాయ రంగంలోని వారు ఖర్చుపెట్టి, పారిశ్రామిక రంగంలోని ఉత్పాదనలు కొంటారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బాగుంటే సేవా రంగం కూడా బాగుంటుంది. మన దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ తక్కువ. అందుచేత ఎక్కువగా దేశీయంగానే ఆధారపడాలి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా వచ్చే ఒడిదుడుకులకి భారత ఆర్థిక రంగం లోనవడకుండా స్థిరంగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. ఇంతటి సుస్థిరమైన ఆర్థిక రంగంలో కూడా ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోతుంది అంటే అది ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఈ ద్రవ్యోల్బణం ప్రభుత్వ ప్రేరేపితం. అంటే ప్రభుత్వం ఎక్కువ పన్నులు విధించే కొద్దీ, ఆర్థిక రంగంలో వస్తు, సేవలన్నీ విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. దాని కన్నా ప్రభుత్వ ఖర్చుని నియంత్రణ చేసి, దానిని సరైన విధంగా ఖర్చు చేయగలిగితే, పన్నులు విపరీతంగా విధించాల్సిన అవసరం ఉండదు. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.

    ఇవన్నీ ప్రధాని స్థానంలో ఉన్న మన్మోహన్‌కి తెలియవని కాదు. ఆయనకి తెలుసు. కాని ఏమీ చేయలేని నిష్క్రియత. ఒక ప్రధానిగా అలంకార ప్రాయంగా ఉండడమే ఆయకిష్టం. మనసుని చంపుకుని ప్రధానిగా ఉండడం కన్నా, ఆ పదవికి రాజీనామా చేసి, తన గౌరవం నిలుపుకుంటే ఒక ఆర్థిక వేత్తగా ఆయనకు గౌరవప్రదం. అంతేగాని, ఒకరిచేతిలో కీలుబొమ్మగా, రబ్బర్‌స్టాంప్‌గా ఉండి, అంతర్జాతీయంగా తన పరువుతో పాటు, దేశ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే, చరిత్ర ఆయన్ను క్షమించదు. అటువంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా ఆయన ధైర్యం వహించి, ఆర్థిక వ్యవస్థను, దేశ పరిస్థితిని చక్కబెట్టి, మంచి నాయకుడు అనిపించుకుంటారని ఆశిద్దాం.