Pages

Monday, June 17, 2013

భారతదేశం అంటే గాంధీ, నెహ్రులు మాత్రమే కాదు

ఇండోనేషియా ప్రభుత్వం అమెరికాతో తన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా ఇటీవల ఒక సరస్వతీ దేవి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించడానికి ఆ దేశానికి బహూకరించింది. ఇండొనేషియా జనాభాలో సుమారు 80 శాతం మంది ముస్లిములు. అయినప్పటికీ, ఆ దేశంలో శతాబ్దాల క్రితమే మరుగున పడిపోయిన ఆ దేశ సాంస్కృతిక వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇండొనేషియా అంతటా, ఆ మాటకొస్తే ఆగ్నేయాసియా దేశాలన్నిటిలోను పూర్వకాలం హిందూ సంస్కృతి వ్యాప్తి చెంది ఉండేది. కాని కాల క్రమంలో చాలా దేశాల్లో బౌద్ధమతం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇండొనేషియా, కంబోడియా వంటి దేశాల్లో ముస్లిం మతం వ్యాప్తి చెందింది. కాని ఇప్పటికీ ఆయా దేశాల్లో హిందూ ఆచారాల్ని, దేవీ దేవతల ఆలయాల్ని, విగ్రహాల్ని ఎంతో గౌరవంగా పరిరక్షించడం మనం గమనించవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా దేశాలు తమ ఘనమైన వారసత్వ సంపదను ఎటువంటి అరమరికలు లేకుండా ప్రపంచానికి చాటి చెప్పడం
కూడా చూడవచ్చు. ఇండొనేషియా దేశంలో చెలామణీలో ఉన్న 20000 రూపాయిల నోటుపై వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌ పేరు గరుడ ఎయిర్‌లైన్స్‌. ఇది పురాణాలలోని విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడికి సంకేతం. కంబోడియా దేశంలో 'అంగ్‌కోర్‌వాట్‌'లో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నది. ఇది 400 ఎకరాలలో విస్తరించి ఉంది. 12వ శతాబ్దం నాటి కంబోడియా రాజు రవి వర్మ -2 దీనిని నిర్మించినట్లుగా చెబుతారు. తరువాతి కాలంలో ఇంతటి అద్భుతమైన దేవాలయం తన ఉనికిని కోల్పోయి, అడవులలో కప్పబడి ఉండిపోయింది. కంబోడియా ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తరువాత తిరిగి వెలుగులోకి తీసుకురాబడింది. కంబోడియా జాతీయ పతాకంపై 'అంగ్‌కోర్‌వాట్‌' దేవాలయం ముద్రించబడి ఉంటుంది. కంబోడియా ఈ ఆలయానికి ఇచ్చే గౌరవం అటువంటిది. థాయ్‌లాండ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు 'సువర్ణభూమి ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌'. ఇది సంస్కృత పదం. బంగారు నేల అని దీని అర్థం. విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది నిలువెత్తు 'క్షీర సాగర మథన ఘట్టం' విగ్రహం. ఆ దేశంలో బౌద్ధం ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, వారు క్షీర సాగర మధనం విగ్రహాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో పెట్టడం, ప్రాచీన సంస్కృతిపై వారికి గల అభిమానాన్ని స్పష్టం చేస్తుంది.

ప్రపంచమంతటా ఇలా ఉంటే, అన్ని దేశాల సంస్కృతిని ఇంతగా ప్రభావితం చేసిన మన దేశంలో మాత్రం ప్రాచీన సంస్కృతిపై ఎనలేని నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన గాంధీ నెహ్రూల జపం వినిపిస్తుంది. మన దేశానికి విదేశీ అతిధులు ఎవరు వచ్చిన ముందుగా వాళ్ళని సరసరి రాజ్‌ఘట్‌ దగ్గర తీసుకుని పోయి మహాత్మా గాంధీ సమాధికి పువ్వులు జల్లిస్తారు. ఇంకా లోకువ ఎవరైన దొరికితే నెహ్రూ సమాధి దగ్గకి ఇంకా ఇందిరా గాంధీ సమాధి దగ్గరకు కూడా తీసుకువెళతారు. భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారీ ఈ సమాధుల సందర్శన గొడవేమిటో అని కొందరు విదేశీ నాయకులు తిట్టుకున్న సందర్భాలు కూడా మనకు తెలుసు. దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత శిల్ప సంపద ఉంది, తాజ్‌మహల్‌ వంటి అద్భుత కట్టడాలు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే మన వాళ్ళకి ఇవేమీ పట్టవు. మన దేశ కరెన్సీ నోట్ల మీద ఓ పది సంవత్సరాల క్రితం వరకు మూడు సింహాల బొమ్మలు ఉండేవి. మన ఘన చరిత్రకు ఆనవాలుగా ఉండేవి. భారత ప్రభుత్వం అధికారిక ముద్ర అది. ఇప్పటి తరం వారికి అవేమీ తెలియవు. ఏ కరెన్సీ నోటు మీద చూసినా గాంధీ గారి బొమ్మే. అసలు గాంధీ బొమ్మ ముద్రించమని రిజర్వు బ్యాంకు వారికి ఎవరు ఆదేశించారో తెలుపమని, ముంబాయికి చెందిన ఒక విద్యార్థిని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాసు చేస్తే, బ్యాంకు అధికారులు నీళ్ళు నమిలారు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కరెన్సీ ప్రింటింగ్‌ విషయంలో ఎవరి సలహాలు, సంప్రదింపులు లేకుండా, కేవలం మౌఖిక ఆదేశాల మేరకు డిజైన్‌ మార్చారన్నమాట. అలా చేయమని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ గారికి ఎవరు చెప్పి వుంటారో మన ఊహకి అందని విషయం కాదు. 

ఆధునిక భారతదేశ చరిత్రలో గాంధీజీ పాత్ర మరువలేనిది. ఆయన అనుసరించిన సత్యాగ్రహం, వ్యూహాలు ఇవన్నీ ఎన్నో ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం చేసాయి. అందులో కూడా అనుమానం లేదు. ఆయన్ని కరెన్సీ నోట్ల మీద ముద్రించడం కూడా తప్పేమీ కాదు, కాని గాంధీ మాత్రమే భారతదేశం కాదు. భారతదేశానికి కొన్ని వేల యేళ్ళ సాంస్కృతిక చరిత్ర ఉందన్న విషయం ఎప్పుడూ మరువ రాదు. అందుకనే అశోక స్థూపాన్ని మన దేశ అధికారిక ముద్రగా స్వీకరించారు. ముండకోపనిషత్‌లోని 'సత్యమేవ జయతే' అనే వాక్యాన్ని భారతదేశ అధికారిక వాక్యంగా పెట్టారు. కాని నేటి ప్రభుత్వాలు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని గాంధీ మయం చేయాలని చూస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లన్నీ గాంధీ మయమే. ప్రాజెక్టులన్నీ నెహ్రూ మయమే. ఇక పట్టణాల్లో ప్రతి వీధిలోను కనీసం రెండు నాయకుల విగ్రహాలు ఉంటున్నాయి. ఎవరెవరనేది మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఆ విగ్రహాల మీద పక్షులు రెట్టలు వేసినా ఎవరూ కనీసం పట్టించుకోరు. కానీ, ఖర్మ కాలి ఆ విగ్రహానికి ఒక వేలు విరగిపోతే నానా యాగీ చేసి, బంద్‌లు, రాస్తారోకోల వరకు ఈ వ్యవహారాన్ని తీసుకువెళతారు. ఒక వ్యక్తి పట్ల గౌరవ భావం ఉండవచ్చు. ఆరాధనీయుడే కావచ్చు. ఆ గౌరవం, ఆరాధన ఒక స్థాయి వరకు తప్పు లేదు. కానీ వ్యవహారం శృతి మించకూడదు.

భారతదేశం ఎన్నో కళలకి ప్రసిద్ధి. విభిన్నమైన నాట్య రీతులున్నాయి, ప్రతీ ప్రాంతానికి విభిన్నమైన కళారూపాలున్నాయి, సాంస్కృతిక భిన్నత్వం ఉంది. ఎంతో మంది అద్భుతమైన నాయకులు, చక్రవర్తులు, మహనీయులు ఈ గడ్డమీద జన్మించారు. కరెన్సీ నోట్ల మీద వీటన్నిటినీ ప్రతిబింబించవచ్చు. ప్రధాన కట్టడాలకి ఆయా నాయకుల పేర్లు పెట్టవచ్చు. ప్రధాన కూడళ్ళలో దేశ శిల్పకళను ప్రతిబింబించేలా మహోన్నటమైన శిల్పాలను ప్రతిష్టించవచ్చు. దీని ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు. మన దేశ వారసత్వ సంపదను అందరికీ తెలియజేయవచ్చు. కావలసింది సత్‌ సంకల్పం మాత్రమే. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడితే ఓట్లు రాలవచ్చును. కాని సుసంపన్నమైన దేశ వారసత్వ సంపద భావి తరాలకు అందకుండా పోతుంది.

(ఈ టపా రాయడానికి స్ఫూర్తి నిచ్చిన మిత్రుడు శ్రీ చక్కా ఉమకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు)

Monday, June 3, 2013

పగటి వేషగాళ్ళకి, సినిమా హీరోలకీ తేడా ఏమిటి?

    నేటి సమాజం మొత్తం సినిమా ప్రభావానికి లోనయి ఉంది. ఏ టి.వి. ఛానల్‌ చూసినా సినిమా ఆధారిత కార్యక్రమాలు ఉంటున్నాయి. ఏ మాటలు మొదలు పెట్టినా అవి చివరికి సినిమావైపు మళ్ళుతున్నాయి. ఇక యువత అయితే సినిమాకి బాగా ఎక్కువగా ప్రభావితమవుతున్నది. సినిమాలో  కళాకారులు వేసే వేషభాషల్ని అనుకరించడం నాగరికతగా భావించడం, అదే చాలా గొప్పగా ఆలోచించడం మనం చూస్తూనే ఉన్నాము. మంచి చెడ్డలు చెప్పాల్సిన తల్లిదండ్రులు గాని, సంస్కారం నేర్పాల్సిన పెద్దలుగాని ఈ విషయంలో ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. వారు కూడా ఎంతో కొంత సినిమా ప్రభావానికి లోనవడం వల్ల, పిల్లలకి ఎటువంటి మేలు చేకూర్చలేకపోతున్నారు. మితిమీరిన అశ్లీలత, హింస, పరిమితి లేని భావోద్వేగాల వ్యక్తీకరణ ఎంత ఎక్కువగా ఉంటే అంత 'మాస్‌' సినిమాగా, కథంటూ ఏదీ లేకపోయినా, అదే గొప్ప సూపర్‌హిట్‌ సినిమాగా చలామణీ అవుతున్నది.

    వీటన్నిటి కంటే అత్యంత ప్రమాదకరమైనది వ్యక్తిపూజ. దాన్నే ఇంగ్లీష్‌లో 'హీరో వర్‌షిప్‌' అంటారు. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతని వ్యక్తిత్వం, సమాజ హితం కోసం అతడు చేసే త్యాగాలు, ఇవన్నీ కలిపి ఒక సామాన్యుడిని నిజమైన హీరోని చేస్తాయి. ఇంకా మంచి గుణాలున్న వ్యక్తి దేవుడిగా ఆరాధించబడతాడు. యుగపురుషుడిగా కీర్తించబడతాడు. హీరోలనే వాళ్ళు ప్రతి సమాజంలోను కనబడతారు. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాలలో, సమాజం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే వేళ ఆయా పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని, ఎవరైతే తమ ప్రయత్నంలో సఫలీకృతమయ్యి, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారో వారే నిజమైన హీరోలు. పురాతన కాలంలో ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఆధునిక కాలంలో ఒక శివాజీ, ఒక గాంధీజీ, జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి కష్టపడ్డ ఒక శాస్త్రవేత్త, ... వీరందరూ హీరోలే. సమాజాన్ని ఒక మలుపు తిప్పిన కథానాయకులే. అటువంటి వారిని ఆరాధించడంలో ఏ తప్పులేదు. వారిని అనుకరించడంలో ఎటువంటి ఇబ్బందిలేదు. హీరోల కథలు చదివిన వారిలో స్ఫూర్తినింపుతాయి. వారిని అనుకరించిన వారిలో మంచి లక్షణాలు కనబడతాయి. ఇది వ్యక్తిగతంగానే కాకుండా, సమాజ పరంగా కూడా ఎంతో మంచిని కలుగజేస్తుంది. వారిలాగానే త్యాగాలు చేయడానికి, సమాజ శ్రేయస్సుకోసం పాటుపడడానికి మరింత మందికి ఉత్తేజం కలిగిస్తుంది.

    కాని, ఇప్పటి సమాజంలో హీరో అనే పదానికి అర్థమే మారిపోయింది. సినిమా అనే మాధ్యమం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అప్పటి నుండి హీరో పదం తన అర్థాన్ని మార్చేసుకుంది. వెండి తెర వెలుగునీడల్లో ముఖానికి రంగులేసుకుని, ఆయా రకాల నాటకాలు వేసే పగటి వేషగాళ్ళందరూ హీరోలు అయిపోయారు. రంగుల ప్రపంచంలో మైమరచిపోయి, నిజమైన ప్రపంచానికి, మాయా లోకానికి తేడా మర్చిపోయి, ఆయా పాత్రలు వేసిన వాళ్ళందరినీ నిజమైన హీరోలే అనుకునే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. వెండి తెరపైన రంగులేసుకుని గెంతులు వేసే వారందరికీ సమాజం లేని విలువను ఆపాదించింది. అటువంటి వారందరికీ స్టార్‌లని బిరుదులివ్వడం, యుగపురుషులని కీర్తించడం, మహానుభావులని ప్రచారం చేయడం... ఇవన్నీ అవసరమా? అనిపిస్తుంది. నిజానికి ఈ వెండితెర హీరోలందరూ చేసిన పనేమిటి? పగటి వేషం వేయడం మాత్రమే కదా... మనం ఇచ్చే డబ్బుల కోసం రకరకాల వేషాలు వేయడం, మన వినోదం కోసం కిందా మీదా పడడం, ఎవరో రాసిన డైలాగులు పలకడం, మరెవరో చెప్పినట్టు నటించడం... ఈ మాత్రం దానికే వారికి అన్ని బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం అవసరమా?

    వీటన్నిటికీ తోడు సినిమా రంగంలో కూడా రాజరికం వచ్చేసింది. తెలుగు సినిమాలో మరీ దారుణం. ఇక్కడ హీరో అవ్వాలంటే మరో పెద్ద హీరో కొడుకు గాని, లేకపోతే మరో పెద్ద నిర్మాత మనుమడు గాని అయి ఉండాలన్న భావం రాజ్యమేలుతోంది. పూర్వం నాటకాల్లో స్టేజి ఎక్కాలంటే ఎన్నో అర్హతలు చూసేవారు. సందర్భానుసారంగా శరీర ఆకృతి, భావ వ్యక్తీకరణ - ఆంగికం, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడగలిగిన నేర్పు, భాష మీద పట్టు - వాచికం, నాటకాన్ని రక్తి కట్టించగలిగే నటన,.... ఇవన్నీ నటులకి ఉంటేనే రంగస్థలం మీదకి వెళ్ళనిచ్చేవారు. ఇవి లేకపోతే అటువంటి నటుల వల్ల నాటకం పాడయితే అది మొత్తం నాటక సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని భయపడేవారు. కాని ఇప్పటి నటుల వారసులకి, అదేనండి బలవంతంగా రుద్ద బడ్డ హీరోలకి పైన చెప్పబడిన లక్షణాలేవీ ఉండనక్కర్లేదు. ముఖం బాగా లేకపోతే ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తారు. మాటలు సరిగ్గా లేకపోతే అదో కొత్త వింత కింద జనం మీద రుద్దుతారు. తెలుగు ఎంత చెత్తగా మాట్లాడితే అంత గొప్ప. ఇక నటించడం రాకపోయినా ఫర్లేదు. ఎడిటింగ్‌లో సర్దుబాటు చేస్తారు. ఇంకా బాగా రాకపోయినా, గ్రాఫిక్స్‌లో సరిచేస్తారు. ఇంత బలవంతంగా తయారైన హీరోని బలవంతంగా జనం మీద రుద్దుతారు.  వీళ్ళు తప్ప మరెవ్వరూ బాగా చేయలేరు అనే భావన కలుగజేస్తారు. మధ్య మధ్యలో మా వంశం ఇంత గొప్పది, అంత గొప్పది, మేము తప్ప మరెవ్వరూ ఇంత చెత్తగా నటించలేరు అని డైలాగులు చెప్పిస్తారు. వీలయితే పాత తరంలో వాళ్లని కూడా ఒకసారి చూపిస్తారు. వినోద రంగం కూడా కులాల వారీగా, కుటుంబాల వారీగా విడిపోయింది. ఇంతటి దారుణం మరే ఇతర పరిశ్రమలోను చూడమేమో.

    సినిమా అనేది ఒక రంగుల కల. 25 రకాల వృత్తి నిపుణలు కలిసి, దర్శకుడు కనే ఒక అందమైన కలకి దృశ్య రూపం ఇస్తారు. కెమెరా, ఎడిటింగ్‌, మ్యూజిక్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌, ఆర్టిస్టులు... ఇలా విభిన్న రకాల నిపుణలు కలిసి, ఎంతో కాలం కష్టించి, ఒక సినిమాని నిర్మిస్తారు. సినిమా అందంగా రావడంలో కనీసం 200 నుండి 300 మంది సాంకేతిక నిపుణుల శ్రమ ఉంది. వీరందరి శ్రమ కలిసి, ఒక వ్యక్తిని హీరోగా తెర మీద చూపిస్తారు. కాని వీరందరి శ్రమను ఒక్క హీరోయే దోచుకోవడం నిజంగా చాలా దారుణం, నీచం కూడా. ఇంత మంది కష్టపడ్డప్పుడు వచ్చిన లాభం నిపుణులందరికీ సమానంగా ఉండాలి కాని, ఎవరో ఒకరే దోచుకెళ్ళడం బాధాకరం.

    ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే యువత అటువంటి రంగుల వలలో పడకూడదనేది నా ఆవేదన. నటులంటే గౌరవం ఉండొచ్చు, వారి నటనకి మైమరచిపోవచ్చు. కాని అదంతా సినిమా వరకే. నటులు కూడా మామూలు మనుష్యులే. మేకప్‌ తీసేస్తే, వాళ్ళని కనీసం చూడను కూడా చూడలేం. ముసలి హీరోలు విగ్గు పెట్టకుండా, మేకప్‌ వేయకుండా బయట కనబడితే కనీసం ఎవరూ పలకరించరు కూడా. అటువంటి రీల్‌ లైఫ్‌ హీరోలు వ్యక్తిగతంగా, నైతికంగా  కూడా ఎంతో దిగజారి ఉంటారు. ఒక మామూలు మనిషి వీరికంటే ఎంతో ఉన్నతంగా ప్రవర్తిస్తాడు కూడా. మనందరిలో ఒక మంచి ఇంజనీర్‌, ఒక డాక్టర్‌, ఒక శాస్త్రవేత్త, ఒక శ్రామికుడు, ఒక నిపుణుడు.... ఇలా ఎంతో మంది ఉండొచ్చు. మేకప్‌ తీసిన పగటి వేషగాడు మీకన్నా గొప్పవాడు కాడు. మీరు సమాజానికి ఒక రకంగా ఉపయోగపడితే, ఒక నటుడు పది మందికీ వినోదాన్నిస్తూ, తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంత మాత్రం చేత మీ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందని, కాలేజ్‌ ఎగ్గొట్టడం, ఇంట్లో అమ్మానాన్నలు కష్ట పడి సంపాదించింది వాళ్ళతో దెబ్బలాడో, దొంగతనం చేసో బ్లాక్‌లో టికెట్లు కొనడం, బ్యానర్లు రాయించడం, స్నేహితులకి పార్టీలు ఇవ్వడం.... ఇవన్నీ దారుణమైన నేరాలు. పగటి వేషగాళ్ళని అనుకరిస్తూ, ఫ్యాన్స్‌ అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది గాని, చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. వ్యక్తి పూజ హద్దుల్లో ఉంటే ఫర్వా లేదు, కాని, అది హద్దులు మీరి మీ జీవితాన్ని పాడు చేసే స్థితికి తెచ్చుకోవద్దు. ఒక ఆడపిల్లని ఏడిపించడం, ప్రేమలోకి దించడం, వెర్రిమొర్రి వేషాలు వేయడం, ఎక్కడపడితే అక్కడ పిచ్చి గెంతులు వేయడం, అడ్డొచ్చిన ప్రతి వాడిని నరికేయడం వంటివి రీల్‌ లైఫ్‌లో బాగానే ఉంటాయి. కాని రియల్‌ లైఫ్‌లో అటువంటివి చేస్తే జనం రాళ్ళిచ్చుకొని కొడతారు.

    జీవితంలో వినోదం ఒక అంశం మాత్రమే. అది మాత్రమే జీవితం కాదు. మీ కేరీర్‌ కన్నా ముఖ్యమైనది, మీ జీవితంకన్నా ముఖ్యమైనది మరేదీ ఉండదు, ఉండబోదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. హీరోల చేతుల్లో కాదు. మీకేదన్నా జరిగితే మీ అమ్మానాన్నలు, మిగిలిన  కుటుంబ సభ్యులు ఆదుకుంటారు గాని, మీ హీరోలు మాత్రం కాదు అని గుర్తుంచుకోండి. చివరిగా మరొక్క విషయం... సినిమాలో నటించే వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు మాత్రమే. వాళ్ళు ఎప్పటికీ నిజ జీవితంలో హీరోలు కాలేరు.