Pages

Saturday, October 27, 2012

దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు - మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు





మనసు మూగబోయింది

మాటలు రాక కాదు - మాటలు లేక

చిట్టితల్లి సాన్వి ఇకలేదని తెలిసాక

చదువుకుంటానన్నందుకు మొన్న మాలాల

ఏపాపం తెలియని వయసులో నేడు సాన్వి

దేశాలు మారినా, మతాలు మారినా

మానవ మృగాల దారుణాలు

కన్నీటితో నిండిన శోకతప్త హృదయాలు...

విముక్తిలేదా చిన్నారులకు


దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు

మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు

Friday, October 26, 2012

'వెర్రి ముదిరింది - రోకలి తలకి చుట్టండి' సామెత ఎందుకొచ్చిందో అర్థం అయింది

    కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచమంతటా రావణాసురుడిని చంపినందుకు పండుగ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కంచె ఐలయ్య గారికి మాత్రం రావణాసురుడు హీరోగా కనిపించాడు. 'మూలవాసీ రారాజు రావణాసురుడు' అని కితాబిచ్చారు. అసలు రావణుడు మూలవాసీ ఎలా అయ్యాడో, ఏ చారిత్రక ఆధారం బట్టి ఆ విధంగా నిర్ణయించారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. రామాయణమంతా తిరగేసినా రావణుడు వెనుకబడిన మూలవాసీతెగకు చెందిన వాడని వాల్మీకి ఎక్కడా ప్రస్తావించలేదు. రావణుడు సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ మునిమనుమడు. అందుకే రావణుడిని రావణబ్రహ్మ అని కూడా అంటారు. అంటే రావణుడు శూద్రుడు కాడు, బ్రాహ్మణుడు. సాటి బ్రాహ్మణుడిని దురుద్దేశ పూరితంగా కుట్ర చేసి చంపాల్సిన అవసరం ఏముంటుంది? కంచె ఐలయ్య గారి హ్రస్వ దృష్టి కేవలం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా విశదమవుతుంది.

    రావణుడు స్వతహాగా మహాజ్ఞాని, వేదవేదాంగ కోవిదుడు, మహా శివభక్తి సంపన్నుడు. తన భక్తితో శివుడిని ఎన్నో సార్లు ప్రసన్నం చేసుకున్నాడు. అంత మాత్రం చేత రావణుడు గొప్పవాడు, ఆరాధ్యనీయుడు అయిపోడు. అతనికున్న దుర్గుణాల వల్ల మాత్రమే పతనం అయ్యాడు. ఈ సమావేశంలో ఐలయ్యగారు ''రాముడి కంటే రావణుడు నీతివంతమైన పాలన అందించాడని'' సెలవిచ్చారు. అంటే ఏ విధంగానో కూడా చెబితే బాగుంటుంది. రాక్షసుల్ని పాలిస్తూ, వారి దుర్మార్గాలని ప్రోత్సహిస్తూ, కేవలం తన జాతి వారనే అభిమానంతో వారు ఎటువంటి అన్యాయం చేసినా, వారిని కాపాడుతూ ఉండే నేటి రాజకీయ నాయకుల్లాగా పాలించాడు. అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రోత్సహించే నాయకులు ఎవరైనా చివరికి పతనంకాక తప్పదు. అదే రావణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం.

    ఇక్కడ మరో ఉదాహరణ కూడా చెప్పవచ్చు. ఒక పెద్దమనిషి ఉన్నాడు. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎంతో మేధావి, పాండిత్యం కలవాడు. గవర్నర్‌ స్థాయికి వెళ్ళాడు. కాని ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి తన పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన పదవి కాని, అనుభవం కాని, తెలివితేటలు కాని ఏవీ ఆయన్ను కాపాడలేకపోయాయి. కేవలం అసభ్యంగా ప్రవర్తించినందుకే ఆయన అంత శిక్ష అనుభవించితే, పరాయి భార్యను అపహరించి, అధర్మంగా ప్రవర్తించి, తన తప్పు తెలుసుకోకుండా యుద్దానికి సిద్దపడ్డందుకే రాముడు రావణుడిని చంపాల్సి వచ్చింది. ఒక మనిషి ఎంత గొప్ప వాడయినప్పటికీ, అతని ప్రవర్తన మీదే అతని గౌరవం ఆధారపడి ఉంటుంది. డబ్బు, పలుకుబడి, హోదా ఇవేవీ మంచి గుణం లేనప్పుడు రాణించవు. అందుకే రావణుడు చరిత్రలో హీనుడయ్యాడు. ఇప్పుడు రావణుడిని ఆదర్శంగా తీసుకోవాలి అని గౌరవనీయ ఐలయ్య గారు ఏ విధంగా చెప్పారో ఆయనకే తెలియాలి.

    చరిత్రను తిరగరాసి, రావణాసురుడు, తాటకి, నరకాసురుడు, శూర్పణఖ వంటి వారి చరిత్రల్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన శెలవిచ్చారు. ఇప్పుడు మనం ఉన్న ఈ చరిత్రలో రాజకీయ నాయకులు చేసిన, చేస్తున్న పనులు చూస్తుంటే, పురాణాలలో వర్ణించిన రాక్షసులే మేలనిపించేలా ఉన్నారు. అంత మాత్రం చేత అప్పటి రాక్షసుల చరిత్రల్ని, ఇప్పటి చరిత్ర హీనులయిన రాజకీయ నాయకుల్ని ప్రజలు పాఠ్యాంశంగా చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే, ఇప్పటి వరకు మనం సాధించిన నాగరికతకు, సంస్క ృతికి అర్థం లేకుండా పోతుంది.

    రాముడు కూడా ధర్మ సంస్థాపనార్థం యుద్ధం చేసాడే కాని, రాజ్య కాంక్ష కోసం యుద్ధం చేయలేదు. యుద్దంలో విజయం సాధించిన తరువాత కూడా లంకా రాజ్యాన్ని ఆయోధ్య సామంత రాజ్యంగా కలుపుకోలేదు. రావణుడి తమ్ముడు, ధర్మ బద్ధుడైన విభీషణుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేసాడు. రావణ వధ అనంతరం యుద్ధభూమికి వచ్చిన మండోదరి కూడా తన పతిని చంపినందుకు రాముడిని శాపనార్థం పెట్టలేదు. ధర్మాన్ని విడవవద్దని చెప్పినా వినకుండా తన పతి చెఎప్పిన మాట విననందుకు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడని విచారించింది. ఇదంతా రామాయణం చదివితే తెలుస్తుంది.

    రామాయణం కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మందికి ఆరాధ్యనీయ గ్రంధం. అటువంటి కావ్యం మీద వ్యాఖ్యానించే ముందు, అందులోని పాత్రలపై తమ అభిప్రాయం వెలిబుచ్చే ముందు కొంచెం అధ్యయనం చేస్తే మంచిది. ఇదే మరో మతంలో చేస్తే ఏమయ్యేదో, ఎన్ని గొడవలకి దారితీసేదో అందరికీ తెలిసిన విషయమే. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పోయేది మాట్లాడే వారి గౌరవమే. ఆకాశం మీదకి ఉమ్ము వేయాలని ప్రయత్నిస్తే, చివరికి జరిగేదేమిటో కూడా అందరికీ తెలుసు. కాని సమాజంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదు. చేతనయితే సమాజంలో మరింత మంచిని పెంచడానికి ప్రయత్నించాలే కాని, విపరీత ఆలోచనల్ని రేకెత్తించకూడదు. మన కులం, మన ప్రాంతం, మన భాష... ఇలా 'మనోడు' అయినంత మాత్రాన వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంతటి దుర్మార్గుడయినా వాడిని వెనకేసుకు రావాలా? ఆరాధించాలా? అలా చేస్తే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఐలయ్య లాంటి వారు ఇకనైనా తమ సంకుచిత దృష్టిని వీడి, విశాల ప్రజాహితం కోరితే బాగుంటుంది.

Sunday, October 21, 2012

స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం

    ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. 'మాతృ దేవోభవ' - ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి 'పితృ దేవోభవ'.   యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత.

    ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి  రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే..


యత్ర నార్యస్తు పూజ్యంతే

రమంతే తత్ర దేవతా||


''స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది'' ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము.

    స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా.

    పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం.