Pages

Tuesday, August 18, 2015

'నారాయణ' భూతానికి బలయిపోయిన మరో రెండు నిండు జీవితాలు

    కార్పొరేట్‌ కాలేజీల ధన దాహానికి, తల్లిదండ్రుల మూర్ఖత్వానికి పరాకాష్టగా, సజీవ ఉదాహరణగా నిలుస్తూ, మరో రెండు జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. చెట్టు పేరు చెప్పుకుని, కాయలు అమ్ముకునే రెండు విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఊడల్లా పాతుకుపోయి, ఇప్పుడు విషనాగుల్లా విద్యార్దుల్ని కాటువేస్తున్నాయి. మొత్తం జరిగిన విషయమంతా రాజకీయ రంగు పులుముకుని, విద్యార్దినులే తప్పు చేసారని, వారి ప్రేమ వ్యవహారాలే వారి ఆత్మహత్యలకు కారణమని నిరూపించడానికి రంగం సిద్దమవుతోంది. మహాభారతంలో బకాసురుడు అనే రాక్షసుడిని రోజుకి ఒకరిని మాత్రమే తినడానికి అనుమతించి, ఊరిలో నుండి ప్రతి రోజు ఒక్కో ఇంటి నుండి ఆ రాక్షసుడికి ఆహారంగా పంపించేవారట. అలాగే ప్రతి సంవత్సరం తల్లిదండ్రులందరూ కూడబలుక్కుని, ఒక్కో ఊరి నుండి ఒక్కొక్కరి చొప్పున చైతన్య నారాయణ కాలేజీలకు ఆత్మహత్యలు చేసుకోవడానికి పంపిస్తున్నట్టుగా పరిస్దితి తయారయ్యింది.

    ఇటువంటి సంఘటనలు జరగడానికి కాలేజీ యాజమాన్యాలది ఎంత తప్పు ఉందో, తల్లిదండ్రులదీ అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది. తమ పిల్లలు ఎంత ఎక్కువ సేపు చదివితే అంత గొప్ప వారయిపోతారని, ఎన్ని ఎక్కువ పుస్తకాలు మోసుకెళితే అంత పెద్ద స్కూల్లో చదువుతున్నట్టుగా భావించే తల్లిదండ్రులకు ఈ సమాజంలో కొదవ లేదు. సాయంత్రం 5 గం||లకు కాలేజీ విడిచిపెడితే, మర్నాడు కనీసం ఐదారుగురు పేరెంట్స్‌ దగ్గర నుండి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చేసేవి. అదేమిటండీ, మా అమ్మాయిని ఐదింటికే పంపించేసారు. స్టడీ అవర్స్‌ పెట్టి ఎనిమిది గంటలకు పంపించ వచ్చు కదా అని. ''అవసరం లేదండీ, హోమ్‌వర్క్‌తో సహా అన్నీ ఇక్కడే చేయించేసాము'' అని చెబితే, ఏదో బాగా చదువు చెబుతారని పంపిస్తే, స్టడీ అవర్స్‌ పెట్టకుండా తప్పించుకుంటున్నారు అని అభాండాలు వేసే వారు. దీన్ని బట్టి తల్లిదండ్రుల అవగాహనను ఈ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఎంతగా కలుషితం చేసారో అర్థం చేసుకోవచ్చు. మీరు మా పిల్లల్ని ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బాగా చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి అనే వారిని మనం ఏం చేయాలి? మంచి చెబితే ఎవరు అర్థం చేసుకుంటారు?

    చదువు అనేది పుస్తకాల్ని బట్టీ పట్టడం ద్వారా రాదు. అవగాహన ద్వారా మాత్రమే చదువు వస్తుంది. విషయాన్ని అవగాహన చేసుకోకుండా బట్టీ పట్టిస్తే చదువు రావడం మాట అటుంచి, కళ్ళజోడు, వెన్ను నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు చదివితేనే చదువు వస్తుంది అనేది ఒట్టి భ్రమ మాత్రమే. తల్లిదండ్రులకి ఇటువంటి తప్పుడు అభిప్రాయం రావడంలో ప్రైవేటు విద్యాసంస్థలు నూరు శాతం సక్సెస్‌ అయ్యాయి. ఎందుకంటే చాలా విద్యాసంస్థల్లో సరైన అర్హతలు కలిగిన బోధకులు ఉండరు. అది కాలేజ్‌ కానివ్వండి, స్కూల్‌ కానివ్వండి. వారికి తెలిసిందల్లా పిల్లల్ని కూర్చోబెట్టి సాధ్యమైనంత ఎక్కువ సేపు చదివించడం. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏముందో ఆ బోధకులకే పూర్తిగా అవగాహన ఉండదు. వాళ్ళు కూడా అలా చదివి పాసయిన బాపతే అయి ఉంటారు. ఇంక వారి నుండి పిల్లలు ఏదో నేర్చుకుంటారు అనడం దురాశే అవుతుంది. ఇక కోళ్ళ ఫారాలు (కార్పొరేట్‌ కాలేజీలు) సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కడో ఒక బ్రాంచిలో వచ్చిన ర్యాంకుల్ని చూపించి, లేదా మరో కాలేజీలో వచ్చిన ర్యాంకుల్ని డబ్బులిచ్చి కొని, వాటిని తమ ర్యాంకులుగా రాష్ట్రమంతటా ప్రచారం చేస్తారు. గొర్రెలమందల్లాంటి తల్లిదండ్రులు తమ ఊరిలో ఉన్న ఆ బ్రాంచికి అనుమతులు ఉన్నాయా లేవా, కనీసం అక్కడ అర్హత కలిగిన ఉపాధ్యాయుల ఉన్నారా లేదా, కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే విషయాలు ఏమీ పట్టించుకోకుండా తమ పిల్లల్ని అక్కడ జాయిన్‌ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ స్టేటస్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ''మా అబ్బాయిని చైతన్యలో జాయిన్‌ చేసామండీ... మా అమ్మాయి నారాయణలో చదువుతుందండీ...'' వంటి స్టేటస్‌ని ప్రతిబింబించే మాటల్ని వింటూ ఉంటాం. వాటితో పాటుగా ''అదేమిటీ? మీ పిల్లలు మన ఊరి స్కూల్లో చదవడం ఏమిటి?'' వంటి ఎత్తిపొడుపు మాటలు కూడా వింటూంటాం. పిల్లలు తెలివైన వారయితే, చెప్పే బోధకులు సరైన అర్హతలు కలిగిన వారయితే,  వారు ఇంటి పక్కన స్కూల్లో చదువుకున్నా చదువు వస్తుంది. ఒక్క తాడేపల్లిగూడెం పట్టణం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది చక్కటి స్కూల్స్‌ నడుపుతూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అలంపురం, పెదతాడేపల్లి, నారాయణపురం వంటి గ్రామాల్లో చాలా విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 10కి 10 పాయింట్లు సాధించారు.

    ఇదే విషయాన్ని మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌ కలాం గారు తన జీవితంలో సాధించి చూపించారు. ఎక్కడో రామేశ్వరం అనే చిన్న పల్లెటూరిలో పుట్టి, రోజు 6 కిలోమీటర్లు నడిచి, పట్టుదలతో దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తెరిగి, వేలకు వేలు ఫీజులు చెల్లించినంత మాత్రాన తమ పనయిపోయింది అనుకోకుండా, పిల్లల బాగోగుల్ని ఎప్పుడూ శ్రద్దగా గమనిస్తూ, వారికి ఎదురయ్యే ఇబ్బందుల్ని జాగ్రత్తగా వింటూ ఉండాలి. తగిన పరిష్కారం కోసం ఆలోచించాలి. అంతేగాని, ఏదో పెద్ద కార్పొరేట్‌ స్కూల్‌ లేదా కాలేజ్‌లో పిలల్ని జాయిన్‌ చేసారు కాబట్టి, ఒక టి.వి., ఫ్రిజ్‌ వంటి వస్తువులు ఆటోమేటిక్‌గా తయారయి వచ్చేసినట్టు తమ పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా ఇంజినీర్‌గానో, డాక్టర్‌గానో తయారయి వచ్చేస్తారు అనుకోవడం దురాశే అవుతుంది. తల్లిదండ్రుల దురాశను, అజ్ఞానాన్ని గమనించే, విద్యారంగంలో కూడా కార్పొరేట్‌ విష సంస్క ృతి వేళ్ళూనుకుంటుంది. దయ చేసి, తల్లిదండ్రులు కూడా దురాశకి పోకుండా, పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసి, వారికి నిజంగా ఇష్టమున్న రంగంలో ఎదిగేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. అలాగే బండ బట్టీ చేస్తేనే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారనే భ్రమలో నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఇది చదివిన వారిలో కొంత మందయినా మారతారని ఆశిస్తున్నాను. ఈ విధంగానైనా ఒక్క చిట్టితల్లి ప్రాణాన్ని కాపాడగలిగినా నా ప్రయత్నం సఫలమయినట్లే.