Pages

Thursday, June 28, 2012

మహోన్నత భారతీయ ఆలోచనలపై ఒక విదేశీ వనిత అంతరంగం.

     దైవం ఎవరు?  దైవత్వం  అంటే ఏమిటి? అంటే, అందుకు నా సమాధానం దైవం, దైవత్వం అనుభవించాల్సినవే గాని నిర్వచనానికి అందేవి కావు.

    దైవం తిరుగులేని సంపూర్ణ శక్తి. మన కళ్ళ ఎదురుగా కనిపించే అన్ని అంశాలూ ఆ శక్తి నుండే వచ్చాయి. చివరికి ఆ క్రమంలో మానవులమైన మనం కూడా. ఇవన్నీ వస్తాయి... పోతుంటాయి. నేడు చూసినవి రేపు కనిపించవు. ఇటువంటి అశాశ్వతాలన్నీ ఆ శాశ్వతం నుండి వచ్చి మళ్ళీ అందులోనే చేరతాయి. అదే దైవం. ఆ శక్తే దైవత్వం.

    ఆ తర్వాతి ప్రశ్న దేవుడు ఎవరు అనేది. తనకన్నా శక్తివంతమైనది. తన చర్యలన్నింటినీ శాసించేది, తనకు తెలియని వాటినన్నింటినీ తెలిసిన ఒక  మహత్తర శక్తికి మానవుడు ఇచ్చిన పేరు భగవంతుడు.

    ఆ పదం ఇచ్చి, ఆ తర్వాత దానిని నిర్వచించే యత్నం చేశాడు. ఆ భగవంతుని చుట్టూ అర్థం లేని అంశాలు జోడించాడు.

    నేను చూపించిన వారే భగవంతుడు, అదే విశ్వసించాలి అంటూ నా బాల్యంలో బోధనలు చేసి నన్నొక నాస్తికురాలిగా మారేంతగా హింస పెట్టారు.

    భారతదేశం వచ్చిన తరువాతే భగవత్‌ తత్వం నాకు అర్థమైంది. భగవంతుడు విశ్వవ్యాప్తి చెందిన వాడు. మానవుడి పరిణామానికి ముందే ఉన్నది దైవత్వం. మానవుడు అంతమైనా ఆ దైవత్వం ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకుని ప్రజలందరినీ దైవత్వం వైపు మరల్చేందుకు ఏర్పరచినవి మందిరాలు. అందులోని విగ్రహాలు కేవలం రాతి బొమ్మలు కావు. అటువంటి బొమ్మలు బయట మనకెన్నో కనిపిస్తాయి. కాని వాటిలో దైవత్వం కనిపించదు.

    ఆ విగ్రహాలలో నిక్షిప్తం చేయబడిన ఒక మహత్తర శక్తి దైవత్వం. మహనీయులే ఆ ప్రతిష్ట చేయగలరు. అందులోని శక్తి స్వచ్ఛమైనది. వాస్తవమైనది. మానవుడు పూజలు చేయవలసింది ఆ శక్తికి. గ్రహించవలసింది ఆ శక్తిలోని భాగాన్ని.

    ఆ దైవమే మనుషులకు సరైన మార్గం చూపుతుంది. మానవుడిని ధర్మబద్దమైన జీవితంలో నడిపించగలిగిన శక్తి స్వరూపానికి బద్దులై జీవించడం అలవరచుకోవాలి.

    - మదర్‌ (అరవిందాశ్రమం)

(స్వాతి వారపత్రిక 29-6-2012 సంచికలో ఊపర్‌వాలా శీర్షిక నుండి గ్రహీతం)

Sunday, June 10, 2012

ఆంగ్లం వల్ల మాత్రమే మనం బ్రతకగలమా?

    'కన్న తల్లిని, సొంత ఊరిని మరువకూడదు' అంటారు. మాతృ భాషకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఒక వ్యక్తి తను పుట్టిన కుటుంబంలో కొన్ని తరాలుగా వాడుకలో ఉన్న భాషనే మాతృ భాషగా వ్యవహరిస్తుంటారు. మనందరికి మాతృభాష తెలుగు మాత్రమే. మాతృభాష అనేది ఒక వ్యక్తికి అత్యంత స్వాభావికంగా, సహజంగా వస్తుంది. నేర్చుకునేటపుడు కృత్విమత్వం అంటూ ఉండదు. కారణం... కొన్ని వేల సంవత్సరాలుగా ఆ కుటుంబంలో, సమాజంలో వాడుకలో ఉండడం వలన ఆ భాష పలికే తీరు, దాని భావం, వ్యాకరణాలతో సహా ఆ వ్యక్తికి సహజంగా సంక్రమిస్తుంది. ప్రత్యేకించి వ్యాకరణ సూత్రాలు, వాడుకను గురించిన నియమాలు ఎవరూ చెప్పనక్కర్లేదు. మాతృభాషలోని భావం హృదయానికి ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు అన్నీ మాతృభాషలోనే ఏర్పడతాయి, బయటకు వెల్లడించబడతాయి. మహాత్మా గాంధీ చెప్పినట్లు 'తన మాతృభాషలో సంపూర్ణ జ్ఞానం సంపాదించిన వ్యక్తి, ఇతర భాషలని కూడా ఎంతో తేలికగా నేర్చుకోగలుగుతాడు'.

    కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సామాన్యుడి దగ్గర నుండి ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరు పర భాషా జపం చేస్తున్నారు. ఆంగ్లం నేర్చుకుంటేనే భవిష్యత్తు, అది లేకపోతే జీవితమే లేదు అనేట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడో పరాయి వారు వదిలి వెళ్ళిపోయిన భాషనే పట్టుకుని వేళ్లాడుతూ, భావి పౌరులకు కూడా అదే జీవితం అనేట్లుగా చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. అసలింతకీ ఆంగ్ల భాష నిజంగా ఉపయోగకరమైనదేనా? మాతృభాష కూడా నిర్లక్ష్యం చేసి, దాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉందా అనేది మన ప్రశ్న.

భారతదేశంలో ఆంగ్ల విద్య:

    ఆంగ్లేయులు భారత దేశంలో అడుగుపెట్టిన తరువాత వారికి ఇక్కడ పరిపాలనలో సహకరించే వారు కరువయ్యారు. అప్పటి వరకు మధ్యవర్తుల ద్వారాను, రెండు భాషలు తెలిసిన దూబాసీలు (ద్విభాషీలు) ద్వారాను పరిపాలన, రాజులతో మధ్యవర్తిత్వం నడపడం వంటివి చేసారు. రాను, రాను వారికి ప్రతి పనికీ ఇంగ్లండు నుండి ఉద్యోగుల్ని తెచ్చుకొనేబదులు ఒక్కడే తమ మాటని అర్థం చేసుకుని, ఆచరించే గుమాస్తాల్ని తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అలా భారతదేశంలో ప్రవేశపెట్టబడిందే 'మెకాలే' విద్యా విధానం. అప్పటి వరకు సర్వ మానవాళికి, ప్రపంచంలోని ప్రతి దేశానికి దిశా నిర్దేశం చేసి, మొట్టమొదటి విశ్వవిద్యాలయాల్ని స్థాపించిన భారత దేశ విద్యా విధానం తన ప్రాభవాన్ని కోల్పోయి, పరాయి దేశస్థుల చేతిలోకి వెళ్ళిపోయింది. మెకాలే విద్యా విధానం యొక్క మొట్టమొదటి లక్ష్యం 'భారతదేశంలో తమ పరిపాలనకు కావలసిన గుమాస్తాల్ని' తయారుచేసుకోవడం. భారతీయులు తమ విలువైన సాంస్కృతీ సాంప్రదాయాల్ని మరచిపోయేలా చేయడం. భారతీయులు ప్రతీ విషయంలో ఆలోచించే 'ధర్మాన్ని' వారి నుంచి వేరు చేయడం. ఇవీ ఆంగ్ల విద్యా విధానం యొక్క విషపు ఆలోచనలు.

    స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గతించినా, మనం ఇంకా ఆ ఆలోచనా సరళి నుండి బయట పడడానికి ప్రయత్నం చేయడం లేదు సరికదా, రోజు రోజుకీ ఆ ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోతున్నాము. నా చిన్న తనంలో ఒకటవ తరగతి పుస్తకంలో ముందు పాఠం 'మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ'. ఇది అత్యున్నత భారతదేశ ఆలోచనా సరళి. తల్లితండ్రుల పట్ల, సమాజం పట్ల, గురువుల పట్ల మనం వ్యవహరించాల్సి తీరు పాఠ్యాంశాలుగా ఉండేవి. మీలో ఎవరైనా ఇప్పటి ఒకటో తరగతి పుస్తకాలు తీసి చూడండి. ముందుగా పరమత ప్రార్థన. ఇంకొంచెం ముందుకెళితే మనకు ఎందుకూ పనికిరాని, మన సంస్కృతికి సంబంధం లేని ఆంగ్లంలో ఉన్న పొట్టి పాటలు. వాటికి ఏ విధమైన అర్థం పర్థం ఉన్నట్లు తోచదు. వాటిని చదవకపోతే, కంఠతాపట్టి అప్పజెప్పకపోతే పిల్లలకి గుంజీలు, అరదండాలు. పోనీ అవేమన్నా జీవితానికి పనికొచ్చే విశేషాలా? తలా తోకా లేని పొట్టి పద్యాలు మాత్రమే. ఇలా మొదలైన విద్య ద్వారా కేవలం గుమాస్తాల్ని తయారు చేయగలం కాని, సమాజానికి, దేశానికి పనికొచ్చే ఆదర్శమూర్తుల్ని తయారు చేయలేము. తన కుటుంబానికిగాని, తను ఉంటున్న సమాజానికి గాని, కనీసం కట్టుకున్న భార్యకి, ప్రాణ స్నేహితుడి కూడా పనికిరాని, మాట్లాడ్డం తెలిసిన ఒక జంతువును తయారుచేసి, సమాజంలోని వదులుతున్నాము. దానివల్లనే నేడు మనం చూస్తున్న ఇన్ని దోపిడీలు, ఇంత అరాచకం, ఎదుటివారిపై నిందలు, మనం సిగ్గులేకుండా బ్రతుకులు వెళ్ళదీయడం..

ఆంగ్లం వల్ల మాత్రమే మనం బ్రతకగలమా?

    ఆంగ్లాన్ని సమర్థించే వాళ్ళు చెప్పే మొదటి మాట... ఆ భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు కదా... నిజమే.. ఆ భాష నేర్వడం వల్ల ప్రపంచంలో ఎక్కడికైనా బానిసగా వెళ్లి, గొర్రెల్లా విదేశీయులు చెప్పినదానికి తలూపుతూ, గుమాస్తాగా బ్రతుకును వెళ్ళదీయవచ్చు. కాని, నీ సమాజంలో సింహంలా బ్రతకడానికి మాత్రం ఆ భాష ఎందుకూ పనిచేయదు. కారణం... ఆ భాషలో తగలబడిన విద్యా జ్ఞానం. ఈ నిజాన్ని గుర్తించిన అనేక దేశాలు అంటే చైనా, జపాన్‌, కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని రద్దు చేసి, మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని చేసే వీలు కల్పిస్తున్నాయి. దాని వల్ల విద్యార్థికి తను నేర్చుకున్నదేమిటో అర్థం అవుతుంది. ఆ నేర్చుకున్న దానిని ఆలోచించడం, ఆచరణలో పెట్టడం వంటివి సులభ సాధ్యమవుతాయి. నేను జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా, కొరియా, జపాన్‌ వంటి వారితో వ్యాపారపరంగా మాట్లాడవలసి వచ్చినపుడు వారు ఆంగ్లంలో ప్రవీణులు కారన్న విషయాన్ని గ్రహించాను. వారికి వచ్చిన ఆంగ్లమంతా కేవలం వ్యవహారికం మాత్రమే. అంటే కేవలం ఎదుటి మనిషి భావాల్ని అర్థం చేసుకొనేవరకు మాత్రమే. వారికి ఆంగ్లమే జీవితం మాత్రం కాదు.

ప్రతీ సాంకేతిక పదానికి మాతృభాషలో పదం దొరకడం సాధ్యమేనా?


    'ప్రపంచంలో అన్ని భాషలను ప్రభావితం చేసి, తన పద సంపదతో వాటిని పరిపుష్టం చేసిన భాష సంస్కృతం. సంస్కృత భాషలో ఉన్నన్ని పదాలు, వ్యుత్పత్తి అర్థంతో సహా, ప్రపంచంలో మరే భాషలోను ఉండవు. సంస్కృతం భారతీయ భాషలకు ఆత్మ వంటిది. 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్నట్లుగా మనసు పెట్టి వెతకాలే గాని, ప్రతీ ఆంగ్ల పదానికి మాతృభాషలో పదాన్ని సృష్టించవచ్చు. ఆ పదం సాధ్యమైనంత తేలికగా, పలకడానికి వీలుగా ఉండాలి. ఎప్పటికప్పుడు మిగిలిన అన్ని దేశాల్లోను జరుగుతున్న నూతన సాంకేతిక ఆవిష్కరణల్ని మాతృభాషలోకి తర్జుమా చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి. అలాగే పాఠ్య పుస్తకాల్ని తరచుగా నూతన విషయాలతో క్రోడీకరిస్తుండాలి. ఇలా చేయడం వలన విద్యార్థులకి మాతృభాషపై అవగాహన పెరుగుతుంది. శాస్త్ర విజ్ఞానం పట్ల కూడా అభిరుచి కలుగుతుంది. సరైన శిక్షణ ఇస్తే ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల కంటే ధీటుగా మాతృభాషలో చదివే విద్యార్థులు మంచి ఫలితాలను అందించగలరని నేను ప్రత్యక్షంగా ఎన్నో సార్లు రుజువు చేసాను.

ఎన్నో లాభాలు:

మాతృ భాషలో విద్యాభ్యాసం చేయడం వలన ముందుగా ప్రపంచ పటంలో నుండి ఒక భాషని అంతర్థానం కాకుండా కాపాడుకోగలం. ఆ భాషలో ఉన్న నుడికారాలు, సంస్కృతి, సాహిత్యం, ఆ భాషకే సొంతమైన సొగసు, ఇవన్నీ మించి, మాతృభాషపై మమకారం, తద్వారా దేశభక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా మేథో వలసని అరికట్టవచ్చు. అంటే ఇక్కడ విద్య నేర్చుకున్న వారందరూ సరైన సౌకర్యాలు లభించడం లేదని, అవకాశాలు లేవని విదేశాలకు వెళ్ళిపోవడాన్ని, అక్కడి వారికి బానిసత్వం చేయడాన్ని ఆపుచేయవచ్చు. తద్వారా మేథావుల సేవల్ని దేశ అభివృద్ధికి, తద్వారా సమాజ హితానికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మేధావులందరూ విదేశాలకు వెళ్ళి అక్కడ అభివృద్ధి చేస్తుంటే, ఎందుకూ పనికిరాని వారు అధికారులుగా, రాజకీయనాయకులుగా మారి, దేశ అభివృద్ధి మాట అటుంచితే, సామాన్య ప్రజల్ని దోచుకు తింటున్నారు.

    ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే, ముందుగా విద్యా వ్యవస్థని మార్చాలి. భారతీయ విలువలకి విద్యలో ప్రాధాన్యం కల్పించాలి. మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల్ని అనువాదం చేయాలి. వాటిని ఉపాధ్యాయులకు, విద్యార్థులు సంపూర్ణంగా అర్థం చేసుకునే విధంగా నిఘంటువులు, పుస్తకాలు రూపొందించాలి. దశల వారీగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్ని మూసివేయాలి. కేవలం వాడుక భాషగా మాత్రమే ఆంగ్లాన్ని ఉండనివ్వాలి. అంటే కేవలం అవసరమైన వారు మాత్రమే ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సంపూర్ణంగా మాతృభాషనే వినియోగించుకొనేలా వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ప్రతి అడ్డమైన పదానికి ఆంగ్లాన్ని శరణు వేడే దుస్థితి నుండి బయటపడాలి. అపుడే మాతృభాషలు బతికి బట్టకట్టగలుగుతాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమవుతుంది.