Pages

Sunday, February 26, 2012

ప్రాచీన భారతీయులు మనం అనుకున్నంత అమాయకులు మాత్రం కాదు

    భారతీయులు చరిత్ర కందని పూర్వపు రోజుల్లోనే ఇప్పటి వారు ఎవరూ కనీసం కలలో కూడా ఊహించలేని, నమ్మడానికి కూడా సాధ్యం కాని అత్యద్భుతమైన నాగరికతను, వైభవాన్ని అనుభవించారు. కేవలం భారతీయులు అనుకుంటే అది తప్పు అవ్వవచ్చు. ప్రాచీన ప్రపంచంలో అనేక నాగరికతలు కూడా అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళాయి. అందరికీ ప్రముఖంగా తెలిసింది ఈజిప్ట్‌ నాగరికత. చరిత్రకు అందని అతి ప్రాచీన కాలంలోనే మన ఊహకు కూడా అందని అద్బుతమైన కట్టడాలను - పిరమిడ్లను కట్టారు. చుట్టూ ఎడారి ప్రాంతం. పక్కనే నైలు నది. పిరమిడ్స్‌ కట్టడానికి వాడిన రాళ్లు కూడా అక్కడికి ఎంతో దూరంగా ఉన్న కొండల నుండి తీసుకురాబడ్డాయి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే కొన్ని వందల టన్నుల బరువున్న రాళ్ళని నైలు నది మీదుగా రవాణా చేయడం ఒక ఎత్తయితే, వాటిని క్రమ పద్దతిలో కట్‌ చేయడం, పేర్చడం, కొన్ని వందల అడుగుల ఎత్తుకు పైకి ఎత్తి, అక్కడ ఖచ్చితంగా కొలతల ప్రకారం ఉంచగలగడం, ఇవన్నీ మనకు అంతు చిక్కని రహస్యాలే. ఆధునిక ఇంజినీరింగ్‌ కూడా అంతటి అద్బుతాన్ని సాధించలేదంటే అది అతిశయోక్తి కాదు.

    ఈజిప్ట్‌కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని మాయా నాగరికత మరో మిస్టరీ. దక్షిణ అమెరికాలో కూడా మహోన్నతమైన నాగరికత విలసిల్లింది. అక్కడ కూడా పిరమిడ్ల వంటి నిర్మాణాలు ఉన్నాయి. మనకు అంతు చిక్కని రహస్యమయ నాగరికతల్లో మాయా నాగరికత కూడా ఒకటి. మాయన్లు నిర్మాణ రంగంలో అద్వితీయులు. వారు కట్టిన నిర్మాణాలు ఇంజినీరింగ్‌ నిపుణుల్ని సవాలు చేసే విధంగా ఉంటాయి. మహా భారతంలో ప్రస్తావించిన దేవ శిల్పి మయుడు  కూడా ఈ మాయన్‌ నాగరికతకు చెందిన వాడుగా పలువురు చరిత్ర కారులు భావిస్తున్నారు. లంకా నగరం, మయ సభ వంటి నిర్మాణాలు ఆ రోజుల్లోనే అద్భుతమైనవి. కాని కొన్ని అంతుచిక్కని కారణాల వలన ఆనాటి నాగరికతలన్నీ ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. దానికి కారణాలేమిటనేది చరిత్ర కారుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అటువంటి సంఘటనే భారతదేశంలో కూడా జరిగి ఉండొచ్చని, దాని వల్లనే ఆనాటి నాగరికతా వైభవం ఇప్పటి తరానికి అందకుండా పోయి ఉండొచ్చని చరిత్రకారుల అబిప్రాయం.

  ప్రాచీన భారతదేశంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదని వాదించే వాళ్ళు ముఖ్యంగా చెప్పే కారణం... ఇక్కడ ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ఎటువంటి ఆనవాళ్ళు లభించడం లేదంటారు. అదీ నిజమే. పుస్తకాలు రాసినంత మాత్రాన అది నిజమైపోవాలని ఎక్కడా లేదు కదా... కాని.. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. వేదాల్లో గాని, రామాయణ, మహాభారతాల్లో గాని ప్రస్తావించినదంతా అబద్దమో లేదా కాల్పనికమో (ఫిక్షన్‌) అనుకుందాం.. మరలాగయితే అప్పటి వేద రుషులకి గాని, వాల్మీకి గాని, వ్యాసుడికి గాని కల్పనల్ని తమ కథల్లో ప్రస్తావించవలసిన అవసరం ఏముంది? వారువ్రాసిన గ్రంధాలేమీ ప్రజల్ని విజ్ఞానవంతులని చేయడానికి ఉద్దేశించినవి కాదు కదా. ఆ గ్రంధాల ముఖ్య ఉద్దేశ్యం ప్రజల నైతిక ప్రవర్తని సరైన దారిలో పెట్టడానికి, ధర్మ సూక్ష్మాల్ని విశదీకరించడానికే కదా.. ఏ విధంగా చూసినా ఆ గ్రంధాల్లో ఉన్న సైన్స్‌ విషయాలు అప్పటి సమాజంలో సహజమైన వాటిగానే పరిగణించాల్సి వస్తుంది.

    చిన్న ఉదాహరణ తీసుకుందాం... 2000 సంవత్సరానికి ముందు వచ్చిన సినిమాల్లో గాని, కథల్లో గాని ఎక్కడైనా సెల్‌ఫోన్‌ ప్రస్తావన ఉందా.. అది ఎంతటి సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కానివ్వండి... అప్పటి సినిమాల్లో హీరోకి ఏదైనా ప్రమాదం జరగబోతోందని తెలిసిన వెంటనే హీరోయిన్‌ లేదా మరొకరో అడవిలో అడ్డదారి గుండా కారు కన్నా వేగంగా పరిగెత్తి, ఆయాసపడిపోతూ ఆ విషయాన్ని హీరోకి చెప్పేవారు. అందరూ ల్యాండ్‌ లైన్‌ ఫోన్లే వాడేవారు. కాని, ఇప్పటి సినిమాల్లో / సీరియల్స్‌ లో చూడండి.. ఎవరి దగ్గర చూసినా సెల్‌ ఫోన్‌ ఉంటుంది. అంటే కథ అనేది నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే చరిత్ర కూడా.  సమాజంలో లేని విషయాల్ని చెబితే ఆ కథని ఎవరూ ఆదరించరు. దీన్ని బట్టి చూస్తే, రామాయణ, మహాభారతాలు, పురాణాల్లో చెప్పిన చాలా సంఘటనలు నిజంగా జరిగాయనడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే అప్పటి సమాజ అవసరాలను బట్టి అప్పటి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉండొచ్చు. ఇప్పటి సమాజ అభివృద్ధి, అవసరాల్ని బట్టి ఇప్పటి పరికరాలు, పరిజ్ఞానం ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు మనం వాడుతున్న ప్రతీ పరికరం పురాతన కాలంలో ఉండేదని చెప్పాలనుకోవడం దుస్సాహసమే.

    మరో ముఖ్యమైన వాదన ఏమిటంటే... భరధ్వాజుని వైమానిక శాస్త్రం ఆధారంగా బెంగుళూరులో ఎవరో విమానాన్ని తయారు చేయడానికి ప్రయత్నించారట. కాని విఫలమయ్యారట. దీన్ని బట్టి భారతీయుల గ్రంధాల్లో చెప్పింది నిజం కాదని వాదించవచ్చట. దాని పూర్తి వివరాలు నాక్కూడా తెలియదు. కాని ఒక్కటి మాత్రం చెప్పవచ్చు. బెంగుళూరులోనో మరో చోటో ఔత్సాహికులు ప్రయత్నించినా, ఆ ప్రయోగం విఫలమయినా దానికి ఆ గ్రంధం బాధ్యత వహించదు. మనందరికి తెలిసిన చిన్న ఉదాహరణ చెబుతాను. కంప్యూటర్‌లో 'సి' లాంగ్వేజి గురించి మీ అందరకూ తెలుసు. ఒక పుస్తకం కొనుక్కుని, ఆ పుస్తకంలో చెప్పినట్లు మన కంప్యూటర్‌లో, సి ప్రోగ్రామింగ్‌ చేస్తాము. కాని రన్‌లో ఎర్రర్‌ చూపిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఇబ్బంది ఉందో మనకు తెలియదు. కాని, ఒక కంప్యూటర్‌ నిపుణుడు మధ్యలో ఎక్కడో ఒక కామా గాని, సెమికోలన్‌గాని మరచిపోయినట్టుగా గుర్తిస్తాడు. వెంటనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర జరిగిన విషయంలోనే ఇంకొకరి సహాయం తీసుకోవలసి వచ్చినపుడు ఎప్పుడో గతంలో కొన్ని వేల యేళ్ళ క్రితం రాసిన గ్రంధంలో విషయాలన్నీ తప్పు అని వెంటనే నిర్థారించబూనడం హాస్యాస్పదమవుతుంది. అలాంటి అభిప్రాయానికి రావాలంటే ఎన్నో పరిశోధనలు అవసరమవుతాయి. ఆనాటి వస్తువుల పేర్లు, సాంకేతిక నామాలు, ఇలా చాలా వాటిల్లో ఎన్నో మార్పులు వచ్చి ఉండవచ్చు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని, సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల సంవత్సరాల తరువాత, అంటే ఇప్పటి నాగరికత అంతరించి పోయిన తరువాత, భవిష్యత్‌ తరంలో ఎవరికైనా సి.డి.లు., కంప్యూటర్‌ మదర్‌ బోర్డులు దొరికాయనుకుందాం. వారు మన గురించి ఏమని అనుకుంటారో ఊహించండి. అప్పట్లో మతిలేక ప్లాస్టిక్‌ ముక్కల్ని గుండ్రంగా కట్‌ చేసి, వాటిని అలంకారాలుగా ఉపయోగించుకొనే వారు అనుకునే అవకాశం ఉంది. మదర్‌బోర్డ్‌ని చూసి, అప్పట్లో జనాలకి చాలా కళాపోషణ ఉండేది అని చరిత్రలో వ్రాసుకుంటారు. కాని, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కనీసం వాళ్ళ ఆలోచనకి కూడా అందకపోవచ్చు. అంతమాత్రం చేత ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ నాగరికత అంతా జరగలేదు అని భవిష్యత్తు తరం వాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా మన తప్పు కాదు.