Pages

Thursday, December 27, 2012

ఇది మనుషులు చేసే పనేనా?

    ఇటీవల దేశ రాజధానిలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన, తదనంతర పరిస్థితులు దేశంలో నెలకొన్న విపరీత పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. ఇక్కడ యువతిపై జరిగింది కేవలం అత్యాచారం మాత్రమే కాదు, హత్యాయత్నం కూడా. యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనానికి, పాశ్చాత్య నాగరికతా అనుకరణకు ఈ సంఘటన ఒక నమూనా మాత్రమే. నైతిక విలువలు లేకపోతే మనిషి ఎంత మృగంగా మారతాడో ఈ సంఘటన వల్ల మనకు తేటతెల్లమవుతుంది. అత్యాచారానికి గురయిన యువతికి కలిగిన గాయాలు, ఆమె అనుభవిస్తున్న నరకం చదువుతుంటే, చూస్తుంటే, మనసుని ఎవరో గట్టిగా మెలిపెట్టినంత బాధ కలిగింది. రెండు రోజుల తరువాత కూడా కన్నీటి చెమ్మ ఆరలేదు. సభ్య సమాజం, మానవత్వం ప్రతి ఒక్కరు, ప్రభుత్వం అందరూ సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన ఇది. ఢిల్లీలో జరిగిన సంఘటన కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి రోజు వార్తల్ని పరిశీలిస్తే, దేశం మొత్తం మీద, ఆ మాటకొస్తే ప్రపంచంలో ప్రతి దేశంలోను ప్రతి సమాజంలోను మహిళల పట్ల లైంగిక వేధింపులు చాలా సర్వ సాధారణంగా ఉంటున్నాయి. బాలికలు, యువతులు, మహిళలు.. ఆ మాటకొస్తే, స్త్రీ అనే ప్రతి ఒక్కరూ ఇటువంటి లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. హేళనగా చూడడం, చులకనగా మాట్లాడడం, లైంగికంగా వేధించడం మొదలుకొని, అత్యాచారానికి తెగించడం చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడకపోవడం ద్వారా మహిళలను మానసికంగా శారీరకంగా హింసించడానికి నిత్యం ఎంతో మంది కామాంధులు అవకాశం కోసం కాచుకుని ఉంటారు.

    ఇటువంటి సంఘటనలు జరిగిన తరువాత స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరి మనసులోను ఉదయించే ప్రశ్న ఒకటే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆపలేమా? మరింత మంది చిట్టితల్లులు బలికాకుండా చూడలేమా? దీనిలో మన బాధ్యత ఎంత వరకు ఉంది? మన కూతుళ్లకు, తోబుట్టువులకు, అలాంటి మరికొంత మంది బంగారుతల్లులకి ఈ సమాజంలో రక్షణ కల్పించలేమా? అనిపిస్తుంది. కాని ఇవన్నీ చేసే ముందు కొంతమంది మగాళ్ళు, 'మృగాళ్ళు'గా ఎలా మారతారో ఆలోచించి, దానికి మూలకారణాలు ఆన్వేషించి, అక్కడి నుండి నివారించే ప్రయత్నం చేస్తే తప్ప, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా నివారించలేము.

అంతర్జాలం మరియు వినోద సాధనాలు:

    ఆధునిక సమాజంలో మహిళల పట్ల జరిగే పాపాల్లో వీటి వాటా కనీసం 80 శాతం ఉంటుంది. వినోదం కోసమైతే నేమి, వ్యాపారం కోసమైతేనేమి, స్త్రీలను ఒక ఆట బొమ్మగా, మాంసం ముద్దగా వాడుకుంటున్నారు. సినిమాల్లో, టివిల్లో అయితే ఎంత తక్కువ బట్టలేసుకుంటే అంత గొప్ప హిట్‌ లేదా అసలు ఏమీ వేసుకోకపోతే అది కూడా ఒక సంచలనం. అలాంటి సంచలనాత్మక అంగడిబొమ్మలు (పేరుకు హీరోయిన్లు) నటిస్తే, ఆ సినిమాకు కోట్ల రూపాయిల వసూళ్ళు. టీవీ సీరియళ్ళలో అయితే చెప్పనక్కర్లేదు. కేవలం ఆడవారిని ఏడిపించి రేటింగ్‌ పెంచుకునే చానళ్లు ఎన్నో... పగలంతా ఎన్నో నీతులు వల్లించి, రాత్రయేసరికి కామ పాఠాలు వల్లించే నీతి బాహ్యమైన 'ఛా'నళ్ళకు కొదవే లేదు. ఇవన్నీ చివరకు ఆడవారి పట్ల శాపాలుగా మారుతున్నాయి.

    ఇక అంతర్జాలం సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. నెట్‌లో విహరించే వాళ్ళలో కనీసం 80 శాతం మంది లైంగిక ప్రేరేపిత (పోర్నో) సైట్లు చూస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇలా చూసే వాళ్ళలో 14 నుండి 20 ఏళ్ల నవ యువకులు ఎక్కువగా ఉంటారని సర్వేల్లో వెల్లడయిన నిజం. ఆడపిల్లను అంగడి బొమ్మగా మార్చి, తమ సొంత కూతుళ్లను, తోబుట్టువుల్ని, సాటి ఆడపిల్లల్ని వివస్త్రలుగా చేసి, ఫోటోలు, వీడియోలు తీసి, అలా వచ్చిన దరిద్రపు సొమ్ముని వ్యాపారం చేస్తున్నామని ప్రకటించుకోవడం పాశ్చాత్య దేశాల్లో చేతనయినంతగా మరే దేశం వారికీ రాదు. నైతికంగా దిగజారిన అటువంటి సమాజంలోని పెనుపోకడలు ఇప్పుడు భారతీయ సమాజంపై పడడానికి ముఖ్య కారణం అంతర్జాలమే. దేశాల మధ్య సమాచార వారధి సృష్టించిన అంతర్జాలం ఇప్పుడు లైంగిక విషపురుగుగా తయారయింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో 'సెక్స్‌' అనే పదాన్ని వెతకమని చెబితే 25 లక్షల పైచిలుకు వెబ్‌సైట్స్‌ దర్శనమిస్తాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది అమాయక బాలికలు, ఆడపిల్లలు, యువతులు ఈ వెబ్‌ మహమ్మారి బారిన పడుతున్నారో అర్థం అవుతుంది. పైగా అమెరికా వంటి దేశాల్లో ఆడపిల్లల్ని నగ్నంగా ఫోటోలు తీసి అమ్ముకోవడం ఒక పరిశ్రమ. దానికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ పరిశ్రమ ముసుగులో ఎంత మంది అమాయక ఆడపిల్లలు దారుణంగా బలయిపోతున్నారో తెలుసుకుంటే గుండెలు పగిలిపోతాయి. ముందు కేవలం నగ్నంగా ఫోటోలు తీస్తామని చెప్పి తరువాత అత్యాచారం చేసి, ఇక వారిని శాశ్వతంగా ఆ రొంపిలోనే కూరుకుపోయేలా చేస్తారు ఈ వెబ్‌సైట్ల నిర్వాహకులు. ఈ పైత్యపు సైట్లు నిర్వహించే దేశాల్లో పరిస్థితులు ఇలా ఉంటే, మనలాంటి సాంప్రదాయ దేశాల్లో ఈ అంతర్జాలం వల్ల మరో విధమైన ప్రమాదం జరుగుతోంది. భారతీయ మహిళలు సహజంగానే సున్నిత మనస్కులు, సాంప్రదాయాలకి ఎక్కువ విలువనిస్తారు. అటువంటిది ఒకేసారి, ఇటువంటి వెబ్‌సైట్ల ప్రభావం వలన మగ స్నేహితులు లేదా భర్త వారిని అసహజ ప్రవర్తనకు ప్రేరేపించడం వంటివి చేస్తున్నారు. దాని వల్ల వారు మానసికంగా, శారీరకంగా పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇవే వారిని పరాయి ఆడపిల్లలపై అత్యాచారాల వంటి వాటికి పురికొల్పుతున్నాయి.

    మహిళల్ని కేవలం లైంగిక వస్తువులుగా చూపించే ఇటువంటి సైట్లు, సినిమాల వలన స్త్రీ అంటే కేవలం లైంగికంగా ఉపయోగపడే వస్తువు మాత్రమే అనే భావన యువకుల్లో కలుగుతోంది. ఆయా సినిమాల్లో చూపించే డబ్బుకు అమ్ముడుపోయే కొంత మంది నైతికంగా పతనమయిన ఆడవాళ్ళ వల్ల లోకంగా ప్రతీ ఆడపిల్లని ఇంతే తేలికగా లోబర్చుకోవచ్చుననే ఒక చులకన భావన, తప్పుడు అభిప్రాయం యువకుల్లో కలుగుతుంది. లోకంలో అమ్మాయిల శరీర అవయవాల్ని (అనాటమీ) చూపించే వెబ్‌సైట్లకు కొదవలేదు. కాని ఒక ఆడపిల్ల మనసులో ఏముందో, అదెంత లోతయినదో తెలియచెప్పే వెబ్‌సైట్స్‌ ఏమయినా ఉన్నాయా? ఆడపిల్ల కనబడగానే ప్రపోజ్‌ చేయడం, ఆనక వెంటబడడం, ఒకవేళ ఇంకెవర్నో అప్పటికే ప్రేమించి ఉన్నా సరే, మన వైపు తిప్పుకోవడం ఎలా అనే దిక్కుమాలిన కాన్సెప్ట్‌ల మీదే ఇప్పటి సినిమా, సీరియల్స్‌ నడుస్తున్నాయి. అటువంటి ఛండాలపు పనులు చేసే వాళ్ళే నేటి మన వెండితెర హీరోలు. ముందు ఇటువంటి వాటిని నియంత్రించాలి. 'ఎ' సర్టిఫికెట్‌ సినిమాలకి కూడా చిన్న పిల్లల్ని తీసుకెళ్లి చూపించే తల్లిదండ్రులకు నేటి సమాజంలో కొదవ లేదు. పిల్లలు లేకుండా వెళ్ళడం కుదరకపోతే వెళ్ళడం మానేయాలి. అంతేగాని చిన్న పిల్లల్ని కూడా అటువంటి సినిమాలకు తీసుకువెళ్ళి లేదా సీరియళ్ళు చూపించి వారి లేత మనసుల్ని కలుషితం చేయకూడదు.

 పాశ్చాత్యీకరణ: 
 
'పొరుగింటి పుల్ల కూర రుచి' అనే సామెత నేటి సమాజానికి సరిగ్గా అన్వయిస్తుంది. సనాతన భారతీయ సంస్క ృతిని వదిలి, పరాయి సాంప్రదాయం వెంట పడడం వల్ల సహజంగానే అనర్థం వస్తుంది. భాష ఎలాగో సగం మారిపోయింది. దుస్తులు సరేసరి, ఇప్పుడు మనసు కూడా మార్చేసుకుని మారు మనసు పొందితే సరి. బాయ్‌ ఫ్రెండ్‌ సంస్క ృతి, సగం శరీరం బయటపడేలా దుస్తులు, నైట్‌ క్లబ్‌లు, పబ్బుల సంస్క ృతి, మాదక ద్రవ్యాల వాడకం వంటి వాటి వల్ల కూడా యువతులకు హాని కలుగుతోంది. ఇలా సమాజం భ్రష్టు పట్టినపుడు ముందుగా బలయ్యేది మహిళలు మాత్రమే. 'డ్యాన్స్‌ బేబి', ఆట వంటి చిన్ని తెర కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని పాల్గొనేలా ప్రోత్సహించడం, శరీరాన్ని ప్రదర్శించడమే అన్నిటి కన్నా గొప్ప గౌరవం అనిపించేలా పిల్లల్ని ప్రలోభపెట్టడం, వారు పెరిగి పెద్దయిన తరువాత సమాజం పట్ల వారి నడవడికను, వ్యక్తిగతంగా వారు పడే ఇబ్బందుల్ని చూసి తీరిగ్గా ఏడవడం... ఇవన్నీ నేటి ఆధునిక తల్లిదండ్రుల సహజ సుగుణాలు. ముందు మనం మారి పిల్లల చేత మమ్మీ, డాడీ బదులు అమ్మా, నాన్నా అని పిలిపించుకుంటే చాలా రుగ్మతలు వదులుతాయి. నీతి కధలు చెప్పే నానమ్మలు, తాతయ్యలు ఎలాగో వృద్ధాశ్రమంలో మగ్గుతున్నారు. చందమామ వంటి పత్రికలు చదివే అలవాటు పిల్లలకి లేదు. వెధవ పనులు చేసే పాశ్చాత్య దేశాల హీరో లందరూ వీళ్ళకి ఆదర్శప్రాయులే. బాల హనుమాన్‌ టీవీలో వస్తే, చిన్నప్పటి నుండీ ఇటువంటివి ఎందుకని కొందరు, మనం ఇప్పుడు కొత్తగా ఫారిన్‌ మతం తీసుకున్నాం కాబట్టి, టామ్‌ అండ్‌ జెర్రీ తన్నులాటలు చూడమని ప్రోత్సహించే తల్లిదండ్రుల ఉన్నంత కాలం పిల్లలకి సుగుణాలు రమ్మంటే ఎక్కడ నుండి వస్తాయి?
 
విద్యావ్యవస్థ: 
 
ఈ పాపంలో విద్యా వ్యవస్థకి కూడా భాగం ఉంది. నేటి చదువులు ఎందుకూ పనికిరాని జీవం లేని వ్యర్థం మాత్రమే. భౌతిక పరమైన అభివృద్ధికి, నూతన వస్తు ఆవిష్కరణకి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి గాని సమాజం కొన్ని వేల సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రయాణించడానికి, మానసికంగా ఎదుగుదలకు, పశుస్థాయి నుండి మానవస్థాయికి మారడానికి  ఏ విధంగాను దోహదపడవు. 'కనకపు సింహాసనమున శునకము కూర్చొండబెట్టిన' అని సుమతీకారుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే సెలవిచ్చినట్లు, నేటి మనుషులమని చెప్పుకునే వారు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అది మనం కళ్ళెదురుగా చూస్తూనే ఉన్నాం. కుక్కని తీసుకెళ్ళి, ఎ.సి. రూమ్‌లో మెత్తటి ఫోమ్‌ బెడ్‌ వేసి పడుకోబెట్టి, 3జి కనెక్షన్‌ ఫోన్‌ ఇచ్చి, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ పెట్టించి, దాని మెడలో బాగా చదివినట్టు ఒక డిగ్రీ సర్టిఫికెట్‌ వేళాడదీసినంత మాత్రాన అది మానవత్వం ఉన్న మనిషి అవదు. పాత చెప్పు ముక్క కనబడగానే చెంగున దూకి దాన్ని అందుకుంటుంది. అలా ఉంది నేటి యువత పరిస్థితి. మారాల్సింది వస్తుగత స్థాయి కాదు, మానసిక స్థాయి. పూర్వపు గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ముందుగా మానవ ధర్మం గురించి నేర్పేవారు. పాఠ్యాంశాలు కూడా 'మాతృ దేవో భవ, పితృ దేవో భవ' అంటూ ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, మొత్తం మానవ సమాజం పట్ల నెరవేర్చవలసిన బాధ్యతను అనుక్షణం గుర్తు చేసేవి. ముందుగా అవన్నీ నేర్చుకున్నాక, ఆ వ్యక్తి కులవృత్తిని నేర్పేవారు. అంటే ఒక వ్యక్తి వృత్తి ఏదయినప్పటికీ, సమాజంలో అంతర్భాగంగానే దానికి అనుకూలంగానే నడిచేవాడు. కాని, ఇప్పుడు ధర్మం బదులు ధనం చేరింది. ఏ విద్యనయినా డబ్బు తీసుకుని నేర్పుతున్నారు. యంత్ర శాస్త్రం (ఇంజినీరింగ్‌) వంటివి పనిని ఎంత బాగా చేయగలమనే దానిపైనే దృష్టి పెడుతున్నాయి తప్ప మనిషిగా ఎంత ఎదగాలో, ఎలా ఎదగాలో ఎవ్వరూ నేర్పించడం లేదు. ఎందుకంటే వాటిని నేర్పే గురువులు కూడా ఆ తానులో ముక్కలే కాబట్టి. గురువులే తాము చదువు చెప్పే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే, వారి దగ్గర చదువుకునే విద్యార్థులు కూడా అదే బాట పడుతున్నారు. ఎనిమిది మంది కలిసి పశువుల్లాగా ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా అత్యాచారం స్థాయి వరకు దిగజారాం. ఇక్కడతో ఆగుదామా? లేదా తుపాకి తీసుకుని ముందు తల్లిని చంపి తరువాత 28 మంది చిన్న పిల్లల్ని, చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం జరిగిన అమెరికా స్థాయికి కూడా దిగజారదామా? ఎందుకంటే అన్నిటికీ మనకు ఆదర్శప్రాయం అమెరికాయో, రష్యాయో మాత్రమే కదా.
 
ప్రభుత్వం - చట్టాలు: 
 
ఇప్పటి ప్రభుత్వాలన్నీ రాజకీయ పార్టీలే. పార్టీ ఎజెండాయే ప్రభుత్వ ఎజెండా. అవెప్పుడూ కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదిక మీదనే అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరచడమే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. చట్టాల రూపకల్పలో గాని, వాటి అమలులో గాని, విశాల సమాజ హితం వాటికి పట్టనే పట్టదు. పార్లమెంటు దాడి కేసులో నిందితుడికి శిక్ష విధించడంలో జాప్యం చేయడం - అతడు కేవలం ఒక ప్రత్యేకమైన మతానికి చెందిన వాడు కావడమే అనేది బహిరంగ రహస్యం. ఆడపిల్లల పట్ల నేరాల్ని అదుపు చేయడంలోను, నిందితులకు కఠిన శిక్షలు విధించడంలోను అదే అలసత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికి ఎరుక? దాని కన్నా కళ్ళుండీ గుడ్డి వాడిలా నటిస్తే ఏ గొడవా ఉండదు. లేదా ఇటువంటి సంఘటనలకు కారణం ప్రభుత్వాధినేతలు, అధికారులు, లేదా వారి వంశాంకురాలో కారణమయి ఉంటే, ఇక నిందితుల్ని రక్షించడానికి చట్టాలకి తూట్లు పొడవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాగ్రహం, ప్రత్యేకించి ప్రభుత్వంపై, దాని పాలనపై యువత పోరాటం చేయడం సహేతుకమే. సమర్థనీయమే. నిందితులకు కఠిన శిక్షలు విధించడం వంటివి చేస్తేనే సమాజంలో నేరాల రేటు కొంత శాతమైనా తగ్గుతుంది. ఒక చిట్టితల్లిపై అకారణంగా దాడిచేసి, అమె వేదనకు కారణమైన మృగాలకి మరణ శిక్ష మాత్రమే సరైన శిక్ష. మన శరీరం మీద వాలి కొద్ది పాటి రక్తం తాగినందుకే దోమని ఒక్క దెబ్బ కొట్టి చంపుతాం కదా. అటువంటిది ఒక అమ్మాయిని శారీరకంగా, మానసికంగా హింసించి, ఆమె శాశ్వత అంగవైకల్యానికి లేదా మృతికి కారణమవుతున్న వికృత మనస్తత్వం గల దుర్మార్గులకు సమాజంలో చోటు లేకుండా చేయడం సరైన పనే. అటువంటి వారి వల్ల, లేదా వారు మారినట్లు కనిపించినా, వారి వల్ల సమాజానికి ఎటువంటి మేలు జరుగదు. వారు లేకపోవడం వల్ల ఎటువంటి కీడూ జరగదు. పైగా అటువంటి తప్పు మరొకరు చేయడానికి భయపడతారు.
 
 ప్రకృతి పరమైన కారణాలు: 
 
మానసిక శాస్త్ర రీత్యా పరిశీలిస్తే ప్రకృతి పరంగానే స్త్రీ పురుషుల మనస్తత్వాలలో చాలా తేడాలుంటాయి. అంతెందుకు? లైంగిక చర్య పరంగానే ప్రకృతిలో మిగతా ఉన్నత స్థాయి జంతువులకి, మనుషులకి బేధముంది. జంతువులు ఆయా కాలాల్లో మాత్రమే లైంగిక ఆసక్తిని ప్రదర్శిస్తాయి లేదా అటువంటి చర్యల్లో పాల్గొంటాయి. కాని, మనుషుల్లో మాత్రం - అది వరమో శాపమో తెలియదు గాని - యుక్త వయసుకి వచ్చినప్పటి నుండి వార్థక్యం వచ్చే వరకు లైంగిక ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక స్త్రీ పురుషుల విషయానికి వస్తే, లైంగిక ఆసక్తి పరంగా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మగవాళ్లు కేవలం దృశ్య పరంగా ఉద్రేకం పొందుతారు. అంటే అందమైన ఆడవాళ్ళను చూసినపుడు గాని, లేదా లైంగిక పరమైన అంశాల గురించి వినడం వల్లనే కోరిక పుడుతుంది. అందుకనే అటువంటి వ్యాపార ప్రకటనలకి, సినిమాలకి అంతటి ప్రాధాన్యత మరియు సంచలనం. వాటిలో కూడా స్త్రీలను మాత్రమే ఆకర్షక సాధనంగా చూపిస్తారు. ప్రతి పురుషుడిలోను కొంత స్థాయిలో కామం ఉంటుంది. కాని, ఇంటర్‌నెట్‌ వంటి మాధ్యమాల వల్ల గాని, సెల్‌లోగాని కామాన్ని కలిగించే విషయాన్ని చూడడం వల్ల కామాసక్తి మరింత ఎక్కువయ్యి, హద్దులు దాటి, అనైతిక ప్రవర్తనకి కారణమవుతుంది. కాని స్త్రీల విషయంలో అది పూర్తిగా వ్యతిరేకం. వారు రూపం కంటే గుణం కోరుకుంటారు. అంటే భర్త పెద్ద అందగాడు కానక్కర్లేదు గాని తనను ప్రేమగా చూసుకుంటే చాలనుకుంటుంది స్త్రీ. ఆమె ఎప్పుడూ ప్రేమను కోరుకుంటుంది. అందుకే భర్త పెద్దగా అందంగా లేకపోయినా, ఎక్కువ సంపాదనా పరుడు కాకపోయినా, తనను తాను పూర్తిగా అర్పించుకుంటుంది. అదే స్త్రీ ప్రేమలోని గొప్పదనం. కాని, కొన్ని పాశ్చాత్య దేశాలు స్త్రీకి కూడా పురుషుడితో సమానంగా లైంగిక ఆసక్తి ఉంటుందని, కొండొకచో ఎక్కువగానే ఉంటుందని, కాని దాన్ని వెల్లడి చేయలేదని... ఇటువంటి తప్పుడు వాదనలతో విష ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని చదివిన యువకులు కూడా అది నిజమేనని భ్రమించి, ఆడపిల్లల అభిప్రాయం, వారి మానసిన స్థితి వంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా, ప్రేమ పేరుతోను, లైంగిక చర్యల పేరుతోను వారిని వెంటాడి, వేధిస్తుంటారు. అయినా సరే వారు ఒప్పుకోకపోయే సరికి, తమ అభిప్రాయం నిజం కాలేనందుకు ఉక్రోషంతో వారిపై అమానుషంగా కత్తులతోను, యాసిడ్‌తోను దాడులు చేస్తారు. ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో అమ్మాయిలు 'మా దుస్తులపై ఆంక్షలు విదించడం కాదు - మగవారిని బుద్ధి మార్చుకోమనండి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాని అర్థం ఏమిటంటే ఆంక్షలు, చట్టాలు విధించడం వల్ల పరిస్థితి మరింత విషమిస్తుందే తప్ప అది పరిష్కారం కానే కాదు. చట్టాలు చేసే కన్నా, ఆంక్షలు విదించే కన్నా సమాజాన్ని సంస్కరించడమే మనం చేయగలిగిన మహోపకారం. చట్టాల వల్ల వచ్చే ప్రయోజనం తాత్కాలికమైతే, సమాజంలో సంస్కారాన్ని పెంచడం వల్ల వచ్చే ప్రయోజనాలు శాశ్వతంగా, దీర్ఘ కాలికంగా ఉంటాయి.

    స్త్రీపురుష సంబంధాలలో హుందాగా, పరిపక్వతతో వ్యవహరించడాన్నే సంస్కారమంటారు. అది వ్యక్తి మతాన్ని బట్టి, వారి సంస్కృతిని బట్టి మారుతుంటుంది. అందుకనే ఒక మతాన్ని ఎక్కువగా అవలంభించే దేశాల్లో స్త్రీని పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్చేసారు. ఆమె శరీరమే అంగడి సరుకయిపోయింది. కొంత భాగం చూపించాలంటే ఒక రేటు - పూర్తిగా చూపించాలంటే మరో రేటు - ఇదీ వారి దౌర్భాగ్యం. వారి మతంలో స్త్రీ ఎట్టి పరిస్థితిలోను అలంకరించుకోకూడదు. ఇక మరో మతం పూర్తిగా అవలంభించే దేశాల్లో స్త్రీల దుస్థితి వర్ణనాతీతం. శరీరంలో ఏ భాగం కనిపించకుండా పూర్తిగా దాచేయాలి లేదా కప్పేసుకోవాలి. ఆఖరికి కాళ్లు కూడా బయటకి కనిపించకూడదు. ఎందుకంటే ఏది కనిపించినా మగవాళ్ళ దౌష్ట్యానికి బలయిపోతుందనే వాదన వినిపిస్తారు. అది నిజం కూడా. కఠిన శిక్షల ద్వారా మాత్రమే పరిస్థితిని అదుపులో ఉంచగలమనే భావనలో వారు ఉంటారు.

    కాని ఒక్క భారతీయ సంస్కృతిలో మాత్రమే రెండింటికీ సమన్వయం సాధించారు. స్త్రీ ఎప్పుడూ చక్కని అలంకరణ కలిగి ఉండాలి. నుదుటన బొట్టుతో, చక్కటి పొడవైన జుట్టుతో లక్ష్మీ దేవిలా భాసిల్లాలి. సర్వ మంగళ స్వరూపిణిగా ఉండాలి. మందస్మితంగా ఉండాలి. ఆమెకు సమాజ పరంగా ఎటువంటి ఆంక్షలు లేవు. స్వేచ్ఛగా ఉండొచ్చు. భర్తతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆమె లేకపోతే పురుషుడు చేసే ఏ యజ్ఞమైనా యాగమైనా ఫలితాన్నివ్వదు. పరాయి పురుషుల్ని సోదరుల్లా భావించాలి. ఇదీ స్త్రీకి భారతీయ సమాజం ఇచ్చిన గౌరవం.

    అదే సమయంలో మగవారికి కూడా కొన్ని సుద్దులు నేర్పింది. పరాయి స్త్రీ ఎదురయితే గౌరవంగా పక్కకి తొలగాలి. ఆపదలో ఉన్న స్త్రీని సోదరిలా భావించాలి. పరాయి స్త్రీ ఎవరిని పలకరించాల్సి వచ్చినా 'అమ్మా' అని పలకరించాలి. ఎక్కడ ఒక ఆడది కన్నీరు పెడుతుందో, ఆ యింటిలో సిరి సంపదలు తొలగిపోతాయని శాస్త్ర కారుడి శాసనం. స్త్రీని గౌరవిస్తే, అక్కడ సర్వ దేవతలు ఆనందంగా ఉంటారని శాస్త్ర వచనం. అటు ఆడవారి గౌరవాన్ని కాపాడుతూనే, మగవారిని కూడా మృగాల్లా కాకుండా వారిని ప్రేమగా చూసుకునే రక్షకుల్లా ఉండమని శాస్త్ర నిర్దేశం. కామాన్ని నిషేధిత వస్తువుగా కాకుండా, మానవ ధర్మాలలో ఒకటిగా (ధర్మ, అర్థ, కామ, మోక్ష) చూపిస్తూనే, కామాన్ని సైతం ధర్మానికి అనుగుణంగా పొందమని విధి నిర్దేశించారు మన పెద్దలు. పరాయి స్త్రీ పొందు కోరడం వలన ఎటువంటి ఇబ్బందులు పడతారో, ఎంతటి గొప్పవారయినా ఎలా పతనమయిపోతారో రామాయణంలో రావణుడి ద్వారా, మహా భారతంలో దుర్యోధన, దుశ్శాసన పాత్రల ద్వారా నిరూపించి, సమాజాన్ని మంచి నడవడికలో పెట్టే ప్రయత్నం చేసారు. రాఖీ పూర్ణిమ వంటి పండుగల్ని పెట్టి, సొంత తోబుట్టువులే కాకుండా, పరాయి ఆడపిల్ల ఎవరు రాఖీ కట్టినా, ఆమెను తన సొంత సోదరిగా భావించి, జీవితాంతం ఆమె రక్షణ బాధ్యత వహిస్తానని ఒక అన్నగా మాటివ్వాలి అని సంప్రదాయం పెట్టారు. ఆడపిల్ల అంటే కేవలం లైంగిక వస్తువు మాత్రమే కాదు. ప్రేమను పంచే దేవత కూడా. ఇవన్నీ గుర్తు పెట్టుకుని, రాబోయే తరానికి కూడా ఈ విలువల్ని నేర్పాలి. పాశ్చాత్య వస్తువుల్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలిగాని, వారి ఆలోచనా విధానాన్ని, వారి మతాన్ని కూడా దిగుమతి చేసుకుని, అభాసుపాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు మరలా మరలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనందరి మీదా ఉంది.