Pages

Monday, August 13, 2018

మూర్ఖత్వానికి పరాకాష్ట

కొన్ని మతాలలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే వృత్తాంతం ఇది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని వైజ్ఞానికంగా రుజువు చేసినందుకు గెలీలియోకు మరణశిక్ష విధించారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రీయ జ్ఞానం కొద్దిగా కూడా లేనివాళ్ళ చేత వ్రాయబడిన మత గ్రంధాన్నే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటామనే మత పెద్దల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాని, అప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేసింది. ప్రాచీన ఖగోళవేత్త అయిన ఆర్యభట్ట - భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రపంచానికి చాటిచెప్పాడు. వేదాలకి అనుబంధంగా ఉండే జ్యోతిషశాస్త్రంలో కూడా వివిధ గ్రహ గతుల్ని ఖచ్చితంగా లెక్కలు కట్టడమే కాకుండా, సూర్యునికి, భూమికి మధ్య దూరాన్ని, భూగోళ వైశాల్యాన్ని, చంద్రుని వ్యాసార్థాన్ని ఇప్పటి లెక్కలకు సరిపోయే రీతిలో సిద్ధాంతాల్ని రూపొందించి ఉంచారు. ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయో, సూర్య, చంద్ర గ్రహణాల అవధుల్ని, అవి ఎప్పుడు సంభవిస్తాయో కూడా పూర్తి శాస్త్రీయంగా లెక్కించగలిగారు. అదీ మన భారతీయ శాస్త్రవేత్తల, మహర్షుల గొప్పదనం.

Sunday, July 15, 2018

అందం చాటున దాగివున్న ముప్పు - ఆడపిల్లలూ.. జాగ్రత్త...

    అమ్మాయిలకున్న బలం - బలహీనత - రెండూ వారి అందం... అందంగా కనబడడం కోసం ఏమైనా చేయడానికి, ఏదైనా పూసుకోవడానికి, ఎంతైనా ఖర్చుపెట్టడానికి వారు సిద్ధం అయిపోతూ ఉంటారు. ఇదిగో... సరిగ్గా ఇదే బలహీనతని సొమ్ము చేసుకోవడానికి వీధి చివర ఉండే బ్యూటీ పార్లర్‌ నుండి బహుళజాతి కంపెనీలు వరకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. రకరకాలుగా ప్రలోభ పెట్టి, తెల్లగా లేకపోతే అదేదో పెద్ద నేరం అయినట్టు, అందరిలోను ఆకర్షణీయంగా కనబడకపోతే ఇక బ్రతుకే లేనట్లుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. అది చూసి, ఎంతో మంది ఆడపిల్లలు, ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు, టి.విలోను, పత్రికల్లోను కనబడే ప్రకటనలు చూసి, ఆయా బూడిదలు... సారీ... ఫేస్‌ పౌడర్లు కొనుక్కుంటూ ఉంటారు. కంపెనీలకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతూ ఉంటారు.


    సరిగ్గా అలాంటి సౌందర్య సాధనాలు తయారుచేసే కంపెనీపైనే అమెరికాలో కొందరు మహిళలు కేసుపెట్టారు. ఆ కంపెనీ తయారు చేసే  పౌడర్‌లో వాడే ఆస్‌బెస్టాస్‌ వల్ల అండాశయ కేన్సర్‌ వచ్చిందని కొందరు మహిళలు కోర్టుకెక్కారు. ఎన్నో పరీక్షలు నిర్వహించిన తరువాత, వైద్య నివేదికలు పరిశీలించిన తరువాత వారు చెప్పింది నిజమేనని కోర్టు తెల్చి, వారికి 31,000 కోట్ల రూపాయిలు పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. (ఇక్కడ నేను పెట్టిన న్యూస్‌ క్లిప్పింగ్‌ - ఈనాడు పత్రికలో 13-7-2018 తేదీన ప్రచురితమైనది). ఈ తీర్పు అందం వెంట పరుగులు తీసే యువతరానికి కనువిప్పు కావాలి.

    బహుళ జాతి సంస్థలు కేవలం లాభాలపైనే దృష్టి సారించి, ఎన్నో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికన్‌ కంపెనీలు నైతిక విలువలకి పూర్తిగా తిలోదకాలిస్తాయి. లాభాల కోసం ఎంతకైనా దిగజారతాయనేది ఎన్నో ఉదంతాలలో రుజువయింది.. ఇక ముందు కూడా రుజువవుతూనే ఉంటుంది. ధమ్స్‌ అప్‌ యాడ్‌లో కింద చిన్న చిన్న అక్షరాలతో ఇది ఆరోగ్యానికి హానికరం అని మీరు గమనించే ఉంటారు. కాని సౌందర్య సాధనాలు (ఫేస్‌ పౌడర్‌లు, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీములు, బాడీ లోషన్‌లు) లో ఎటువంటి హానికర రసాయనాలు వాడతారో, వాటిని ఎలా తయారుచేస్తారో ఎవరికీ తెలియదు. అవి శరీరంపై దీర్ఘ కాలంలో ఎటువంటి దుష్ప్రభావాలు చూపుతాయో ఎవరూ చెప్పరు. ఒక వేళ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా, డబ్బుతోను, అధికారంతోను వారి నోరు నొక్కే  ప్రయత్నం చేస్తారు. బాధ్యత లేని రాజకీయ నాయకులు, లంచాలు మరిగిన ప్రభుత్వ అధికారులు వారికి కొమ్ము కాస్తూ ఉంటారు. అందుకే ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలి.

    అమ్మాయిలు కూడా అందం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అని గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ వాడినంత మాత్రం అందంగా కనబడతామనే అపోహను మానుకోవాలి. అటువంటివి వాడడం వలన స్కిన్‌ ఎలర్జీ వంటి వాటిలో మొదలై, కేన్సర్‌ వంటి భయంకరమైన జబ్బుల బారిన పడతారు. చర్మం తెల్లగా రావడం కోసం వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. అవి దీర్ఘ కాలంలో శరీరంలో చేరి వివిధ అవయవాల పనితీరుని దెబ్బతీసి, చివరకు మరణానికి చేరువ చేస్తాయి. పైగా వాటిని కొనడం కోసం పెట్టే డబ్బు, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక పౌడర్‌ రాసుకోవడం వలన ఒక జబ్బు వస్తే, మళ్ళీ వాటిని నివారించడం కోసం మరో  క్రీమ్‌ రాసుకోవడం... ఇదో విషవలయంలా మారుతుంది.

    మరో ముఖ్య విషయం... ఎటువంటి క్రీములు, లోషన్లు, పౌడర్లు వాడకపోయినా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎంత ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకోండి. భారతీయుల సౌందర్యానికి ముఖ్య కారణం వారుపాటించే సంప్రదాయ సౌందర్య చిట్కాలే. పూర్తి ఆయుర్వేద పరంగా, ప్రకృతిలో సహజంగా దొరికే  పసుపు, సున్నిపిండి శరీరానికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేసేవారు. గంధం చెక్క అరగదీసి, ఆ గంధాన్ని ముఖానికి పట్టిస్తే, చర్మం చల్లబడి, గంధం, పసుపు మంచి యాంటీ బయోటిక్‌గా పనిచేసి, మొటిమలు, బాక్టీరియా వంటివి రాకుండా నివారించి చర్మాన్ని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉంటే అదే అందం... అటువంటి అందమే నిజమైన సౌందర్యం...

Thursday, May 17, 2018

తిరుమల శ్రీవారి ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులు గారికి మద్దతు తెలపడం ప్రతీ హిందువు కర్తవ్యం...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. సిగ్గు లేని రాజకీయాలు దేవాలయంలో కూడా తిష్టవేసుకుని కూర్చున్నాయి. శ్రీవారి ఆలయం గురించి, ఆచారం గురించి, ఆభరణాల గురించి సాక్షాత్తు శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితుల వారే పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. దేవాలయాల్ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసారు. తమకు, పార్టీకి అడుగుకు మడుగులొత్తే తొట్టిగ్యాంగ్‌ని దేవాలయ కమిటీ సభ్యులుగా నియమిస్తే పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. ప్రస్తుతం తితిదే  పాలకవర్గ అధ్యక్షుడిని చేయవద్దంటూ ఎంతమంది హిందువులు విమర్శించినా, ప్రభుత్వం తలొగ్గలేదు. ఇతర మతాల జోలికొస్తే, తాట తీస్తారని తెలుసు... కాని హిందువుల జోలికొచ్చినా, వారి దేవాలయాల్ని పరమతస్తులతో నింపేసినా, దేవుడి ఆభరణాలను, ఆస్తుల్ని నిర్లజ్జగా కాజేసినా, వాటిని బయటపెట్టినందుకు అర్చకుల్ని బయటకు గెంటేసినా, రాజకీయ కారణాలతో హిందువులందరూ కిమ్మనకుండా ఉన్నారు. ఇదే ఇతర మతాల్లో జరిగితే రాజకీయాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా ప్రపంచమంతా ఆ మతస్థులు ఏకమవుతారు. కాని, హిందూ మతంలో మాత్రం పైవాడు మా కులపోడు కాబట్టి, మా పార్టీవోడు కాబట్టి, మా నాయకుడు కాబట్టి, వాడు ఏమి చేసినా, దైవానికి ద్రోహం చేసినా మేము మాత్రం సిగ్గులేకుండా వాడినే సమర్థిస్తాము. ఎంత సిగ్గులేని తనం? ఎంత బరితెగించిన తెంపరితనం?

    శ్రీ రమణ దీక్షితులుగారు చదువు లేని వాడు కాదు. పరిస్థితులు అర్థం చేసుకోలేని వాడు కాదు. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, విదేశాలలో ఉద్యోగం కూడా కాలదన్నుకుని, దైవం పట్ల అనురాగంతో, వంశ పారంపర్య అర్చకత్వాన్ని చేపట్టిన మహోన్నత వ్యక్తి. ఏ దైవాన్ని రెప్పపాటు కాలంపాటు దర్శించుకున్నా, జన్మ ధన్యమవుతుందని భావిస్తామో, అటువంటి దైవాన్ని జీవితాంతం స్వయంగా అర్చన చేసి, తరించే అదృష్టశాలి. ఆయన మరే ఉద్యోగం చేసుకున్నా ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుంది. రాజకీయాల్లో చేరి, ఏ అడ్డమైన గడ్డి కరిచినా ఇంత కంటే ఎక్కువ 'గిట్టుబాటవుతుంది'. అర్చకులకు ఎటువంటి జీతం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవు. అది కూడా అర్థం చేసుకోకుండా, సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకుడిపైనే వేటు వేయాలనుకోవడం ఆలయంపై జరిగిన దాడిగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులకు గాని, పాలకమండలికి గాని శ్రీవారి ఆలయ చరిత్ర తెలుసా? అసలు ఆగమ శాస్త్రం అనే మాట వినే ఉంటారా? శ్రీవారికి ఎప్పుడెప్పుడు ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయో, ఏఏ నైవేద్యాలు సమర్పిస్తారో ఎవరికైనా తెలుసా? ఇవన్నీ 'కనకపు సింహాసనమున శునకాలే' కదా... ఏ అధికారంతో ఆలయ సేవల్లో వేలుపెడుతున్నారు? ఏ తెగింపుతో స్వామి వారి నిధుల్ని తమ సొంత అవసరాలకు మళ్ళించుకొంటున్నారు? ఏ ధైర్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరునితో ఆడుకుంటున్నారు?

    ఏం ఫర్వాలేదు... రావణాసురుడంతటి వాడు కూడా తన పాపం పండేవరకు తనంతటి వాడు లేడని విర్రవీగాడు... శిశుపాలుడిని కూడా శ్రీ కృష్ణుడు నూరు తప్పుల వరకు ఊరుకున్నాడు.... వామనుడు వచ్చే వరకు నేనే గొప్పవాడినని బలి భావించాడు... నరసింహుడు వచ్చే వరకు హిరణ్య కశిపుడు తానే దైవంగా భావించుకున్నాడు. ఏదైనా పాపం పండేవరకే... శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం... కేవలం సంకల్పమాత్రాన సకల సృష్టిని సృజించగల ఆయన ముందు పిచ్చి వేషాలేస్తే ఏం జరుగుతుందో చరిత్రలో ఎన్నో సంఘటనలు చూసాం... ప్రత్యక్షంగా కొన్నింటికి మనమే సాక్షులం కదా... ప్రస్తుతానికి శ్రీ రమణదీక్షితులుగారికి మన మద్దతు తెలుపుదాం... అది మన నైతిక బాధ్యత... కాగల కార్యమంటారా... శ్రీవారే చూసుకుంటారు... సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు....

Sunday, February 11, 2018

అత్యున్నత భారతీయ విలువలకు నిలువుటద్దం - పద్మావతి కథ (మూవీ రివ్యూ)

    సమకాలీన సినిమాల్లో చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు రావడం కొంచెం అరుదుగానే జరుగుతోంది. వచ్చిన కొన్ని సినిమాలు కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కమర్షియల్‌ హంగుల్ని అద్దుకున్నవి అయి ఉంటున్నాయి. కాని, చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం తక్కువ కాకుండా, అత్యున్నత భారతీయ విలువల్ని, భారతీయులు నమ్ముకున్న ధర్మంపై నిర్మించబడ్డ శిఖర సమానమైన ఆదర్శాలని, ఆ ఆదర్శాలను పాటించే క్రమంలో ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టే మహోన్నత కథా ప్రాభవానికి ఆధునిక సినిమా రూపమే సంజయ్‌ భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి'.

    మేవార్‌ మహారాణి పద్మావతి అపురూప సౌందర్యవతి. రాజపుత్ర రాజయిన రతన్‌సింగ్‌ను వివాహమాడుతుంది. అదే సమయంలో భారతదేశంపైకి  దండెత్తిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ పద్మావతి సౌందర్యం గురించి విని, ఆమెను ఎలాగైనా పొందాలని చిత్తోడ్‌ఘడ్‌ కోటపైకి దండెత్తుతాడు. కాని, విజయం సాధించలేకపోతాడు. ప్రాచీన భారతీయ ఇంజినీరింగ్‌ నిపుణతతో నిర్మించిన ఆ కోట ముందు, రాజపుత్రుల పరాక్రమం ముందు ఖిల్జీ సేనలు పరాజయం పాలవుతాయి. చివరికి తమకు మాత్రమే సొంతమైన కుతంత్రంతో కోటలోకి ప్రవేశించిన ఖిల్జీకి రాణి పద్మావతి దక్కిందా లేదా అనేది సినిమా కథ.

    నేటి యువత తప్పని సరిగా చూసి, ఎంతో నేర్చుకోవలసిన కథ ఇది. ప్రేమ పేరుతో ప్రతి అడ్డమైన, నీచ మనస్తత్వం కలిగిన వారందరూ దర్శకులుగా అవతారమెత్తి, నానా చెత్తా సినిమాలుగా తీసి, యువతను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. అటువంటి సినిమా చూసిన వాళ్ళందరూ అదే జీవితం అనుకుంటూ రకరకాల నేరాల్లో చిక్కుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ని చూడముచ్చటగా, రిచ్‌గా తీర్చిదిద్దారు. మేకప్‌, ఎడిటింగ్‌, డైరెక్షన్‌, బ్యాక్‌గ్రౌండ్‌.. ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా అత్యున్నత స్థాయిలో ఒక హాలీవుడ్‌ మూవీని చూసిన ఫీల్‌ని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆనాటి కోటగోడలు, వస్త్రధారణ, నగలు, అలంకరణ వంటి ఏ విషయంలోను రాజీ పడలేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఒక పక్క నుండి భారతీయులు నమ్ముకున్న ఆదర్శాల గురించి గర్వపడుతూనే, ఒక రాజకుటుంబం పరాయి మతాల మూర్ఖత్వానికి ఎలా బలయిపోయిందో చూస్తూంటే గుండెల్ని మెలిపెడుతున్న బాధ కలుగుతుంది.

    భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన భారతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా దోచుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త. అందుకే అవతలి శత్రువుని కూడా ధర్మబద్దంగా ఎదుర్కోవాలని భావించి, చివరికి వారి కరవాలానికే బలయిపోయారు. ఈ విధంగానే ముస్లిం, క్రైస్తవ పాలకులు హిందూ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంపదను, స్త్రీలను, వారసత్వాన్ని దోచుకోగలిగారు.

    సహజంగానే హిందూ జాతి గొప్పదనాన్ని, వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఎటువంటి ప్రయత్నానికైనా మీడియాలో ప్రాచుర్యం లభించదు. ఇటీవల విడుదలైన ఒక మానసిక రోగి సినిమా గురించి మాత్రం అటు మీడియాలోనీ, ఇటు వెబ్‌లోను ప్రచారం హోరెత్తిపోయింది. ఆ సినిమా చూడకపోతే అసలు యూత్‌ కాదన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ నేటి యువత అది కాదు తెలుసుకోవలసింది.. రతన్‌సింగ్‌ స్థానంలో ఉండవలసిన యువతని ఖిల్జీ స్థానంలోకి దిగజార్చేసి, అదే నిజమైన హీరోయిజం అన్నట్లుగా హైలైట్‌ చేస్తున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువతీ యువకుడు తప్పని సరిగా చూసి, మన నిజమైన సాంప్రదాయ విలువల్నీ, వాటిని కాపాడడం కోసం పూర్వీకులు పడ్డ తపననీ, చేసిన త్యాగాన్ని తెలుసుకుని, గుర్తుంచుకుని, ఆచరించడమే మన పూర్వీకులకు మనమిచ్చే నిజమైన నివాళి.