Pages

Saturday, September 8, 2012

మన్‌ 'మౌన' ప్రధాని

    అండర్‌ అచీవర్‌ అంటూ టైమ్‌ మ్యాగజైన్‌ గౌరవనీయ భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ని దుమ్మెత్తి పోసిన విషయం మరువక ముందే వాషింగ్‌టన్‌ టైమ్స్‌ తిరిగి అదే బాటలో నడిచింది. అండర్‌ అచీవర్‌ అనే మాటకు అచ్చతెలుగులో 'అసమర్థుడు' అని అర్థం చెప్పుకోవచ్చునేమో. భారతదేశ ప్రజలు అసలే తమను తాము తిట్టుకునే పనిలో బాగా బిజీగా ఉంటారు. దీనికితోడు సాక్షాత్తు ప్రధాన మంత్రిని కూడా ఆ విధంగా తిట్టుకోవడం ఎంత వరకు సమంజసం? అందుచేత అందరం కలిసి ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడని కీర్తిద్దాం.

    రాజకీయ నాయకులు ఎన్నడూ నిజమైన నాయకులు కాలేరని అందరికీ తెలిసిన విషయమే. కాని విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ వంటి మేధావులు నాయకులు కాలేకపోవడం నిజంగా బాధపడాల్సిన విషయమే. దీనికి కారణం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ని వెనుక నుండి ఎవరు ఏ విధంగా ఆడిస్తూ, ప్రపంచానికి తోలుబొమ్మలాట చూపిస్తున్నారో జగమెరిగిన సత్యం. అంతర్జాతీయంగా భారత ప్రభుత్వ పరువును తీయడానికి ఏ దేశస్థులు ఈ హైడ్రామా ఆడిస్తున్నారో అందరికీ తెలుసు.

    మన్మోహన్‌ సింగ్‌ స్వతహాగా నెమ్మదైన వ్యక్తిత్వం కలవారు. 1990లలో పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా, ఇద్దరూ కలిసి చేపట్టిన సంస్కరణలు, గ్లోబలైజేషన్‌ వంటి వాటి వల్ల ఆయన ప్రతిష్ట ఇనుమడించింది. భారతదేశ ప్రధానిగా మన్మోహన్‌ను ఎన్నుకున్నపుడు తిరిగి అటువంటి ఆర్థిక సంస్కరణలు చేపట్టి, మరలా దేశ ప్రతిష్టను పెంచుతారని అందరూ భావించారు. కాని ఆయన ఇటలీ పెద్దల వారసత్వ పార్టీలో ఒక రబ్బర్‌ స్టాంప్‌గా మారిపోయారు. ప్రభుత్వం నిలువునా అవినీతిలో కూరుకుపోయినా, కుంభకోణాలు వరుసపెట్టి పార్లమెంటును కుదిపేస్తున్నా, పారిశ్రామిక, ఉత్పాదక రంగాల వృద్ధి రేటు దారుణంగా మందగించినా, రూపాయి విలువ పాతాళంలోకి కుంగిపోయినా, కనీస చర్యలు తీసుకోకుండా, అన్నిటికీ అతీతంగా ఉండగలగడం మన్మోహన్‌ సింగ్‌కే సాధ్యమయింది. పైగా ప్రపంచమంతటా ఆర్థిక వృద్ధి రేటు ఇలాగే ఉందన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వ వాదన. ఆర్థిక శాస్త్రంలో కనీస పరిజ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా విషయం ఇట్టే అర్థమవుతుంది.

    భారత్‌ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. ఇక్కడి పారిశ్రామిక, సేవా రంగాలన్నీ వ్యవసాయాధారితాలే. అంటే వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులు, వ్యవసాయ రంగంలోని వారు ఖర్చుపెట్టి, పారిశ్రామిక రంగంలోని ఉత్పాదనలు కొంటారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బాగుంటే సేవా రంగం కూడా బాగుంటుంది. మన దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ తక్కువ. అందుచేత ఎక్కువగా దేశీయంగానే ఆధారపడాలి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా వచ్చే ఒడిదుడుకులకి భారత ఆర్థిక రంగం లోనవడకుండా స్థిరంగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. ఇంతటి సుస్థిరమైన ఆర్థిక రంగంలో కూడా ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోతుంది అంటే అది ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఈ ద్రవ్యోల్బణం ప్రభుత్వ ప్రేరేపితం. అంటే ప్రభుత్వం ఎక్కువ పన్నులు విధించే కొద్దీ, ఆర్థిక రంగంలో వస్తు, సేవలన్నీ విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. దాని కన్నా ప్రభుత్వ ఖర్చుని నియంత్రణ చేసి, దానిని సరైన విధంగా ఖర్చు చేయగలిగితే, పన్నులు విపరీతంగా విధించాల్సిన అవసరం ఉండదు. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.

    ఇవన్నీ ప్రధాని స్థానంలో ఉన్న మన్మోహన్‌కి తెలియవని కాదు. ఆయనకి తెలుసు. కాని ఏమీ చేయలేని నిష్క్రియత. ఒక ప్రధానిగా అలంకార ప్రాయంగా ఉండడమే ఆయకిష్టం. మనసుని చంపుకుని ప్రధానిగా ఉండడం కన్నా, ఆ పదవికి రాజీనామా చేసి, తన గౌరవం నిలుపుకుంటే ఒక ఆర్థిక వేత్తగా ఆయనకు గౌరవప్రదం. అంతేగాని, ఒకరిచేతిలో కీలుబొమ్మగా, రబ్బర్‌స్టాంప్‌గా ఉండి, అంతర్జాతీయంగా తన పరువుతో పాటు, దేశ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే, చరిత్ర ఆయన్ను క్షమించదు. అటువంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా ఆయన ధైర్యం వహించి, ఆర్థిక వ్యవస్థను, దేశ పరిస్థితిని చక్కబెట్టి, మంచి నాయకుడు అనిపించుకుంటారని ఆశిద్దాం.

1 comment:

  1. pv narasimha rao manmohan ni hero cheste ee sonia desha prajala drustilo zero ni chesindi denikante sonia videsiyuralu kabatti

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.