Pages

Thursday, August 13, 2009

మీ పిల్లల్ని చంపెయ్యాలనుకుంటున్నారా? అయితే మా దగ్గరకి పంపించండి.

మీరు సరిగ్గానే చదివారు. ఎవరి పిల్లల్ని వారు చేతులారా చంపుకోలేరు కనుక, ఏదయినా కార్పోరేట్ విద్యాసంస్తలోనో, కాలేజ్ లోనో చేర్పిస్తే సరి. ఇలా తయారయింది నేటి కార్పోరేట్ విద్యాసంస్తల ముసుగులో జరుగున్న విద్యా వ్యాపారం. ఏ వ్యాపారంలో నయినా పెట్టుబడిదారుడికి రిస్క్ వుంటుంది. కాని ఈ వ్యాపారంలో మాత్రం అంతిమంగా నష్టపోయేది మాత్రం అక్షరాలా విద్యార్ధులే. వారి విలువయిన జీవితం నాశనం కావడమే కాకుండా, వారి నిండు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. నిన్న తాజాగా విజయవాడ శ్రీ చైతన్య కేంపస్ లో జరిగిన లోహితా రెడ్డి మరణమే దీనికి వుదాహరణ. ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది అమాయక విద్యార్దుల ప్రాణాలు విద్యపేరు చెప్పి హరించుకు పోయాయి.

ఈ విష సంస్కృతి కేవలం ఒక్క చైతన్యకే పరిమితం కాలేదు. ఏ కార్పోరేట్ విద్యా సంస్థని తీసుకున్నా ఇదే పరిస్తితి. పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్న ఇటువంటి సంస్థలపై ఎవరికి సరయిన నియంత్రణ లేకపోవడం, తల్లి దండ్రులకు విద్యపై సరయిన అవగాహన లేకపోవడం, వారి మూర్ఖత్వం ఎంతో విలువయిన పిల్లల ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఎంత ఎక్కువ సేపు చదివిస్తే అంత గొప్ప కాలేజ్ అన్నట్టుగా తయారయింది నేటి దుస్తితి. విద్యార్దులకేమీ అర్ధం కాకపోయినా గాని, వారి చేత బండ బట్టీ పట్టించేసి, ఏదో విధంగా మార్కుల్ని తెచ్చుకునేలా చేస్తున్నారు. నిజంగా సబ్జక్ట్ మీద అవగాహ వున్న విద్యార్ధి కూడా ఒక్కోసారి ఈ బట్టీ విక్రమార్కుల ముందు ఓడిపోక తప్పడం లేదు. కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో వస్తున్న ర్యాంకులని గొప్పగా చూపించుకుని, (ఎంతో మంది ఫెయిల్ అయినప్పటికీ) కొత్త అడ్మిషన్లు, కొత్త బ్రాంచీలు ప్రారంబించేస్తున్నారు. ఈ బ్రాంచీల్లో సౌకర్యాలు వున్నవా లేదా, సరయిన లెక్చరర్లు వున్నారా లేరా అని కూడా ఎవరూ ఆలోచించడం లేదు.

ఇక హాష్టళ్ళలో పిల్లలు పడుతున్న బాధల విషయానికి వస్తే అవన్నీ రాయాలంటే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. పిల్లలకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఎన్నో పేరుగొప్ప కాలేజిలు వున్నాయి. నలుగురికి కూడా ఇరుగ్గా వుండే ఒక్కో గదిలో పదేసి మందిని కుక్కేయడం, అందరికీ ఒకే బాత్ రూం ఏర్పాటు చెయ్యడం వంటివే కాకుండా, వారికి కనీసం నాణ్యమయిన తిండి కూడా పెట్టకుండా, విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.

ఒకసారి కార్పోరేట్ కాలేజ్ హాష్టల్లో అడుగుపెడితే ఏ నేరమూ చెయ్యకుండా, సెంట్రల్ జైల్లో అడుగుపెట్టినట్టే. తెల్లవారు జామునే నాలుగ్గంటలకి జైలు సెంట్రి... సారీ... హాష్టల్ వార్డెన్ వచ్చి నిద్ర లేపుతాడు. 4:30 నుంచి స్టడి హవర్స్ వుంటాయి. ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయ్యడానికి కలిపి మద్యలో ఒక గంట కేటాయిస్తారు. ఆ తక్కువ టైంలోనే అన్ని కార్యక్రమాలూ కానిచ్చేయ్యాలి. విజయవాడలో ఒక కాలేజ్ లో అయితే ఆడ పిల్లలు పది మందికి కలిసి ఒకే ఒక గది, దానికి అటాచ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేసారట. పదిమందికి కాలకృత్యాలు తీర్చుకోవడనికి లేట్ అవుతుంది కాబట్టి అందరు కలిసి ఒకేసారి స్నానం చేసెయ్యండి, టైం కలిసి వస్తుంది కదా అని యాజమాన్యం జవాబు చెప్పిందట. మన ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు ఒకేసారి అలాంటి పరిస్తితి తట్టుకోలేక ఆ కాలేజ్ నించి పారిపోవడనికి ప్రయత్నిస్తున్నారు. నేను స్వయంగా అటువంటి పిల్లలతో మాట్లాడి, తెలుసుకున్న సంఘటనలనే రాస్తున్నాను. అసలే తెల్లవారు జాము,... చలి, దానికి తోడు చన్నీటి స్నానం, ఎలా వుంటుందో పరిస్తితి వూహించండి..

ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత... వుదయం 6 గంటల నుంచి "క్లాస్" లు మొదలవుతాయి. అంత పొద్దున్నే మ్యథ్స్, కెమిస్ట్రీ వంటి సబ్జక్టులు చెపుతారు. నిద్ర వస్తున్నా, బుర్రకి ఎక్కకపోయినా, చచ్చినట్లు వినాల్సిందే. లేకపోతే శిక్షలు ఎలాగో తప్పవు. అలా మొదలయ్యే "శిక్ష"ణా కార్యక్రమం రాత్రి 10, 11 గంటలయ్యే వరకు జరుగుతూనే వుంటుంది. ఇక శెలవులు, వీకేండ్స్ అనేవి ఎలా వుంటాయో కూడా తెలియని పరిస్తితి. పండగలొచ్చినా శెలవులు వుండవు. ఇవి కాక మధ్య మధ్యలో విద్యార్ధికి అవమానాలు, శిక్షలు ఎలాగో తప్పవు. ఒక సారి కార్పోరేట్ కాలేజీలో చేరితే ఒకటి, ఆత్మ హత్య చేసుకోవాలి లేదా, ఎంత బండ బ్రతుకయినా బ్రతకడానికి సిద్దపడే సిగ్గులేని జీవితం ప్రాప్తిస్తుంది... ఇది నిజం.

ఈ కాలేజీల దగ్గర వుండే మంచి టెక్నిక్ ఏమిటంటే, కాలేజ్ లో చేరే విద్యార్ది దగ్గర ముందే పెద్ద మొత్తంలో ఫీజుని వసూలు చేసేస్తారు. దానితో ఎన్ని ఇబ్బందులున్నా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సర్దుకు పోవాల్సి వస్తుంది. ఎవరయినా హాష్టల్లో ఇమడ లేక ఇంటికి ఫోన్ చేసి, "నాన్నా, నాకిక్కడ బాగో లేదు, నేను నరకం అనుభవిస్తున్నాను, నేను చదవలేను నాన్నా." అనగానే అటువైపునుంచి వచ్చే మొట్టమొదటి సమాధానం,, "ఫీజు మొత్తం కట్టేసాం కదమ్మా, ఈ ఒక్క సంవత్సరానికే అడ్జస్ట్ అవ్వు.. వచ్చే సంవత్సరం మానేద్దువు గాని" అంటారు. కాని ఇప్పుడు కేవలం కొన్ని వేల రూపాయల ఫీజు గురించి చూసుకుంటే, తరువాత కొడుకో, కూతురో లేకుండా పోతున్నారు. దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు.

తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి.. దయచేసి మీ పిల్లలు చెప్పేది వినండి, వారి ఆవేదనని అర్ధం చేసుకోండి.. వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయ పడటంలో తప్పు లేదు కాని, దాన్ని సాధించే ప్రయత్నంలో, మీరు, పిల్లలు ఏమి కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ గొప్ప చాటుకోవడానికో, మీ స్టేటస్ చూపించుకోవడానికో పిల్లల ప్రాణాల్ని బలి పెట్టకండి. కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడయినా మంచి మార్కులు వస్తాయి. అందరూ ఇంజినీర్లు, డాక్టర్లూ అయిపోనవసరం లేదు.. కనీసం మనిషిగా బ్రతకగలిగితే అదే పది వేలు. వ్యాపారం చేసేవాళ్ళని ఎలాగో మార్చలేము... కనీసం మనమయినా మారితే, అంటే ఈ టపా చదివిన ఒక్క తండ్రి మనసులో అయినా మార్పు తీసుకురాగలిగితే, ఒక్క చిట్టి తల్లి ప్రాణన్నయినా నిలబెట్టగలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే.

9 comments:

  1. మన పాలకుల తప్పు కూడా ఉందులో ఎక్కువ భాగం ఉంది. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప వేరే చదువులు వేస్టు అంటూ ప్రచారం చేసిన చరిత్ర ఉంది కదా.

    ReplyDelete
  2. You are really correct Mr Jagadish. I often feel very bad about this education system. There are lot many courses (Non-technical) like CA, CS, ICWA, MCA, MBA, Law which can give a good future. But no one is thinking of these courses. Parents are under a false impression that only Engineering, Medicine are the courses and these only give good future. To change this type of situation, each and every school management should give counsiling to 10 class students and their parents regarding various courses and employment opportunities. Uma Kalyani U

    ReplyDelete
  3. నా ఫ్రెండ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో జాయిన్ అయ్యాడు. చార్టర్ట్ అకౌంటెన్సీ కోర్సు చేస్తే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని సంపాదించొచ్చు.

    ReplyDelete
  4. చాలా చక్కగా చెప్పారు.

    తల్లితండ్రులు ఈ గొర్రెదాటు వ్యవహారం నుండి ఎప్పటికి బయట పడతారో అర్ధంకాదు.
    అంత వత్తిడులకు పిల్లలను గురిచెయ్యాలా అని ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం.

    పిల్లల మానసిక వికాసానికి దోహదమిచ్చే సాంస్కృతిక, ఎస్సే, ఎలొక్యూషను వంటి పోటీలు, దేహానికి ఆరోగ్యాన్నిచే ఆటలను ఈ కోళ్లఫారాలలో ఏనాడో పక్కన పెట్టేసారు. ఎవరైనా అడిగితే వాటి వల్ల రాంకులు రావుకదా అన్న సమాధానాలు వస్తాయి.

    నా ఉద్దేశ్యంలో తప్పంతా తల్లితండ్రులదే. నిజమే నూటికి నూరు వంతులూ తల్లితండ్రులదే. అందులో వేరే అనుమానమే లేదు.

    ఏం, ఎక్కడో దూరంగా టౌనులో ఉండే కోళ్ల ఫారాలకు పంపే బదులు, దగ్గరలో ఉన్న చిన్న కళాశాలలకు పంపి ఇంటివద్దే పిల్లలను పెట్టుకొని కొద్దిపాటి పర్యవేక్షణలో చదివించుకోవచ్చుగా? లేదా ప్రభుత్వ కళాశాలలకు పంపించి, స్థానికంగా ఉండే మాస్టర్ల ను ఉపయోగించుకొని తర్ఫీదు ఇచ్చుకోవచ్చుగా?

    ఇప్పుడు ఇలా కోళ్ల ఫారాలకు పంపటం ఒక స్టాటస్ సింబల్, చిన్న కాలేజీలకు పంపటం నామోషీ.

    చంపుకోండి. చంపుకోండి. చేజేతులారా మీ పిల్లలను మీరే చంపుకోండి. వాళ్లు చచ్చినప్పుడు, ఆనందంగా ఏడవండి.

    అటువంటి తల్లితండ్రుల పట్ల జాలి పడాల్సిన అవసరం కూడా లేదు.



    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. లోహితా రెడ్డికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

    మీ అభిప్రాయంతో, బొల్లోజు బాబా గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  6. I totally agree. The fault is entirely that of parents. I can't understand what can convince a parent to send their kids to these jails.
    A few months ago I read that some of the corporate colleges make the previous year's rank students appear for the entrance exams in the current year and pay them some money if they come in top ranks! The entire entrance examination system, corporate college system and PARENTS are using children like performing horses to secure ranks and money! It is shocking and disgusting. Especially the greed of parents!

    ReplyDelete
  7. పిల్లల్ని ఎక్కువగా ఇంజినీరింగ్, మెడిసిన్ చదవమని ఒత్తిడి చేస్తుంటారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క బ్యాంక్ ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెడుతున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉద్యోగులకి కూడా నెలకి పాతిక వేలు జీతం వస్తుంది. వాటి కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంజినీరింగ్ చదవాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
  8. PKMCT గారు...
    అనానిమస్ గారు..
    మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం... ఉద్యోగం అంటే కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదని వీళ్ళందరికీ ఎప్పుడు అర్ధం అవుతుందో ఎమిటో?..
    బొల్లోజు బాబా గారు..
    మీ సూచనతో ఏకీభవిస్తాను.. మీరు వాడిన కోళ్ళ ఫారాలు ప్రయోగం బాగుంది. అన్ని వేల మంది పిల్లలతో అవి నిజంగానే కోళ్ళ ఫారాలని తలపిస్తున్నాయి.
    శరత్ గారికి, శారద గారికి నా నెనర్లు..

    ReplyDelete
  9. జగదీష్ గారూ చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.