Pages

Monday, March 2, 2015

సంక్షోభం ముంగిట్లో భారత ఆర్థిక వ్యవస్థ

     ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం ఇపుడు ప్రజలందరి ఆశల్నీ అడియాశలు చేసింది. భారతదేశానికి ఒక కొత్త దిశా నిర్దేశం చేస్తారనుకుంటే, ఇది కూడా 'ఆ తానులో ముక్కే' అని ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరూపించింది. 'సీసా కొత్తది అయినప్పటికీ నీరు మాత్రం పాతదే' అనే సామెతను అనుసరించి, అవే ఆధార్‌ కార్డులు, అవే గ్యాస్‌ సబ్సిడీ కష్టాలు, అవే డీజిల్‌, పెట్రోల్‌పై బాదుడు, అదే ట్యాక్స్‌ల పెంపుదల. ఇక్కడ కొత్తగా ఏదైనా కనిపిస్తుందేమోనని ఎంతో ఎదురు చూసాం. కాని ఉపయోగం లేకుండా పోయింది. అభివృద్ధి అంటే ప్రజలపై కొత్త పన్నుల్ని విధించడమే అనే మూస ధోరణితోనే ఈ బడ్జెట్‌ వచ్చింది. ఈ విషయంలో నేను గతంలో ఇదే బ్లాగ్‌లో చేసిన పోస్ట్‌ల విషయమై మీ అందర్నీ తప్పుదోవ పట్టించినందుకు విచారిస్తున్నాను. మోడీ ప్రధాని అయితే ఇలా చేయబోతున్నారు, అలా చేయబోతున్నారు, ఆర్థిక సంస్కరణలు తీసుకురాబోతున్నారని ఎంతో వ్రాసాను. కాని అవేవీ నిజం కాదని, ఇప్పుడు నేను బాధపడుతున్నాను.

    ఆధునిక నాగరికత, పరిశోధనల ఫలితంగా పాశ్చాత్యదేశాల్లో ప్రకృతి వనరుల విధ్వంసం మొదలయింది. యంత్రాల సహాయంతో రకరకాల వస్తువులని తయారు చేసి, వాటిని అమ్మడం మాత్రమే వ్యాపారం చేయడం, వాటిని వాడడం మాత్రమే నాగరికత అనే విష వలయాన్ని సృష్టించారు. 16వ శతాబ్దంలో బ్రిటన్‌లో ఆవిరియంత్రం కనిపెట్టడం మొదలుకొని, నేటి వరకు పాశ్చాత్య దేశాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరిగాయి. ఎందుకంటే వారికి ఎటువంటి పంటలు పండవు. పండినా వాటి ద్వారా వచ్చే ఎందుకూ సరిపోదు. అందుకే వారు పరిశోధనలు చేసి, కొత్త వస్తువులు కనుక్కుంటూ, వాటిని ప్రపంచంలో మిగిలిన దేశాలకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇదే వారి ఆర్థిక వ్యవస్థ కూడా.

    కాని, ఈ పాశ్చాత్య ఆర్థిక నమూనాకి ఒక పరిమితి ఉంది. ప్రకృతిలో వనరులు పరిమితం. దానితో అపరిమితమైన వ్యాపారం చేయలేము. వస్తూత్పత్తిలో ఎప్పటికప్పుడు కొత్త నమూనాల్ని ఆవిష్కరించగలగాలి. అప్పుడే కొత్త వ్యాపారం ప్రారంభమవుతుంది. మరలా కొన్నాళ్ళకి ఆ ఉత్పత్తి పాతబడిపోతుంది. అపుడు వ్యాపారం ఆగిపోతుంది. దాన్ని నమ్ముకున్న కుటుంబాలు, దేశాలు, వీధిపాలవుతాయి. ఆర్థిక వ్యవస్థ మరలా శూన్యానికి చేరుకుంటుంది. లేదా వస్తూత్పత్తికి అవసరమైన వనరులు తరిగిపోతాయి. అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఇది చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం.

    భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తి విరుద్దమైనది. అత్యంత పురాతనమైన, సాంప్రదాయకమైనది కూడా. ఇది ఎన్నో రకాల ప్రభుత్వాలను, పాలకుల్ని, పన్ను విధానాల్ని తట్టుకుని నిలబడింది. ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న తరుణంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ తనదైన ప్రత్యేకత నిలబెట్టుకుని, వృద్ధి పథంలో పయనించింది. దీనికి కారణం, భారతదేశ జనాభాలో ఎక్కువ మంది భూమిపై, అంటే వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. సువిశాలమైన పంట భూములు, విస్తారమైన నీటి వనరులు,  ఎన్నో రకాలైన పంటలు పండించగలిగే నేల రకాలు, రైతులు అందరూ కలిసి భారతావనిని సస్యశ్యామల దేశంగా మార్చాయి. భూమిని, పంచభూతాలను, ప్రకృతిని దైవ స్వరూపంగా ఎంచే నాగరికత కలిగిన దేశం కావడం వలన, ప్రజలు ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా, ఇన్ని వేల సంవత్సరాలుగా జీవనం సాగించారు.

    ఇపుడు మోడీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపు మార్చాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇది అభివృద్ధి దిశగా కాకుండా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే 'మేకిన్‌ ఇండియా' స్లోగన్‌ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల ఉత్పత్తిదారుల్ని భారతదేశపు వనరుల్ని దోచుకోవడానికి ఎర్రతివాచీ పరుస్తోంది. వారు తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇప్పటి వరకు తన రూపు కోల్పోకుండా, తాజాగా ఉన్న ప్రకృతి వనరుల్ని వారి ధనదాహానికి దాసోహం చేస్తోంది. పైగా, అప్పటి వరకు, వ్యవసాయంపై ఆధార పడిన ప్రజలు, శ్రామికులు, తయారీ రంగంలో అప్పనంగా వచ్చే జీతాలకు ఆశపడి, వ్యవసాయాన్ని దండగమారిగా భావించి, పరిశ్రమల్లో కార్మికులుగా వెళ్ళిపోతారు. అందరికీ తిండి పెట్టే అన్నపూర్ణలాంటి పొలాన్ని బీడుపెట్టి, రియల్‌ ఎస్టేట్‌గానో, పరిశ్రమగానో మార్చి అదే అభివృద్ధి అని డంబాలు కొట్టుకుంటారు. కొంత కాలానికి, దేశ ప్రజలందరూ కార్మికులుగా మారిన తరువాత, ఇక అభివృద్ధి మంత్రం పనిచేయడం మానివేస్తుంది. తయారీ రంగం మందగిస్తుంది. అమ్ముకోవడానికి మార్కెట్‌లు కరువవుతాయి. పరిశ్రమలు మూతపడతాయి, ప్రజలందరూ నిరుద్యోగులుగా మారతారు. కనీసం వ్యవసాయం వచ్చుంటే, భూమిని దున్ని సేద్యం చేసి, తిండి వరకైనా పండించుకోవచ్చు. కాని, ఇప్పటి వరకు ఎ.సి. రూముల్లో పనిచేసిన వారికి వ్యవసాయం చేతగాదు. ఇక మిగిలింది, మగవాళ్ళయితే దొంగతనం, ఆడవాళ్ళయితే .....

    ఇప్పుడే ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను.

"ఆటబొమ్మ" అంతటా అతి చవకే! అతి పురాతన వృత్తి వ్యభిచారం మాత్రమే ఆర్థిక మాంద్యానికి అతీతమైనదనే "తిరుగులేవి సత్యం" నిన్నటి ఒక చారిత్రక అసత్యానికి, నేటి మరో అవాస్తవానికి పుట్టిన బిడ్డ!

నిజంగా ఆ వ్యాసం చదివి చాలా బాధ కలిగింది. మనం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందారు అని చెప్పుకుంటున్న అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపించింది. ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థ విఫలమైతే దాని చేదు ఫలితాల్ని ముందుగా అనుభవించేది మహిళలే అనే నిష్టూర నిజం ఈ వ్యాసంలో ప్రతిబింబించింది. అటువంటి దుస్థితి నా దేశంలో ప్రజలకు, ప్రత్యేకించి మహిళలు  కలగకూడదనే ఆలోచన నన్నీ వ్యాసం వ్రాయడానికి పురికొల్పింది. నిజంగా మోడీ ప్రభుత్వం చెప్పినట్లు పరిశ్రమలు పెడితే, అభివృద్ధి జరుగుతుందా అనేది పరిశీలిస్తే, భారతదేశం కూడా ఇతర దేశాల వలే కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థవైపు, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది అని అర్థమవుతుంది.

    భారతదేశానికి నిజమైన అభివృద్ధి నమూనా ఏమిటంటే, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నవీనీకరణ జరగాలి. పంట దిగుబడి పెంచే మార్గాల్ని అన్వేషించాలి. భూమి నుంచి వచ్చే పంటకి పరిమితి లేదు. భూమిని సరిగా కాపాడుకున్నంత సేపూ, పర్యావరణానికి హాని కలిగించని, సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్ని ఆధునికత మేళవించి, వ్యవసాయం చేసినంత సేపు, పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రజలకి కనీసం కూడు, గూడు, బట్ట వంటి సదుపాయాలకు ఎటువంటి లోటు ఉండదు. దేశీయంగా చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తే, ప్రజలందరూ ఒక పెద్ద పరిశ్రమలో కార్మికులుగా కాకుండా ఎవరికి వారే సొంతంగా వ్యవసాయంగాని, వ్యాపారం గాని, చిన్న పరిశ్రమలుగాని నడుపుకుంటూ ఉంటారు. అంటే దేశం మొత్తం ఒకే కార్పొరేషన్‌ మాదిరి కాకుండా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక స్వయంచాలిత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలందరూ ఎవరి దగ్గరో జీతాలు తీసుకునేవాళ్ళుగా కాకుండా, తమ సొంత ఉపాధిని తాము పొందుతూ, మరో నలుగురికి అన్నం పెట్టే పరిస్థితిలో ఉంటారు. దీని వలన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. అలా కాకుండా దేశం మొత్తాన్ని విదేశీయుల యంత్రాలతో నింపేసి, వారికి వస్తువులు తయారుచేసే కర్మాగారాల్లో మన సోదరుల్ని కూడా కార్మికులుగా మార్చేసి, లాభాలన్నీ ఆ దేశాలకు మూటగట్టుకు పోతుంటే, అది అభివృద్ధి అనిపించుకోదు. ఆత్మాభిమానాన్ని అమ్ముకోవడం అనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, అత్యాశలకు పోకుండా, అరచేతిలో స్వర్గం చూపించకుండా, దేశ ప్రజలకి సుదూర భవిష్యత్తులో మేలు కలిగే విధంగా  నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నాను.

జై హింద్‌

1 comment:

Note: Only a member of this blog may post a comment.