Pages

Friday, August 23, 2013

తెలంగాణా ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

    రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక ప్రాంతం వారు తమకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే, మరో ప్రాంతం వారు అందరం కలిసి ఉందామని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రెండు జాతుల మధ్య, తెగల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు చెలరేగినపుడు ఆ రెండు జాతుల ప్రజలు పరస్పరం ఘర్షించుకుని, విడిపోవడం చూస్తూ ఉంటాం. అది యుద్దం ద్వారా కావచ్చు, లేదా సామరస్య పూర్వకంగా కావచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి విభిన్నమైన వాతావరణం నెలకొని ఉంది. ఇతర ప్రాంతాల వారు తమపై పెత్తనం చేస్తున్నారని, లేదా తమకు అందవలసిన వనరుల్ని తమకు దక్కనివ్వడం లేదని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలో తమ కష్టాన్ని ధారబోసి, పరిశ్రమలు స్థాపించి, మౌలిక వసతుల్ని సమకూర్చి, సంపదని సృష్టించిన తరువాత తమను గెంటివేయడం ఎంత వరకు న్యాయం అని సీమాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్య రెండు వైపులా పదునుగానే ఉంది. దీనికి పరిష్కారం కూడా కనుచూపు మేరలో కనబడడం లేదు.

    ఇక్కడ తెలంగాణా నాయకులు గాని, ప్రజలు గాని ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా కేవలం ఒక్కరి శ్రమ మీద గాని, మేథస్సు మీదగాని ఆధారపడి అభివృద్ధి చెందదు. ఒకవేళ అభివృద్ధి చెందినా అది సంపూర్ణం కానేరదు. ఉదాహరణకు అమెరికాని తీసుకుంటే, ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా అభివృద్ధి అంతా అనేక దేశాల ప్రజల సమిష్టి శ్రమ, మేథస్సుల ఫలితమే అని అర్థం అవుతుంది. అది ఒక స్వేచ్ఛా ప్రపంచం. ప్రపంచంలో ఏ దేశానికి చెందినా, ఏ మతానికి లేదా ఏ జాతికి చెందిన ప్రజలైనా, అమెరికా అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు. రెండవ ప్రపంచం యుద్ధ సమయంలో జర్మనీ నుండి వెళ్ళిపోయిన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి శాస్త్రవేత్తలకి అమెరికా ఆశ్రయం కల్పించింది. అంతకు ముందు కూడా బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌ వంటి అనేక దేశాల నుండి వెళ్ళిన ప్రజలు అమెరికా అభివృద్ధికి అవిరళ కృషి సల్పారు. దాని మూలంగానే ఆ దేశం ప్రపంచాన్ని శాసించగల స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా అభివృద్ధిలో ఒక భారతీయునికి ఎంత పాత్ర ఉందో, ఒక చైనా దేశీయునికి కూడా అంతే స్థానం ఉంది. ఆయా దేశాల ప్రజల్ని అమెరికా సమాజం నుండి వేరు చేసి చూడడం సాధ్యం కాదు. అందరూ తాము ఏదో ఒక దేశానికి చెందిన వారమని చెప్పుకుంటూనే, సమిష్టిగా అమెరికన్స్‌గా గుర్తించబడాలని ఆశిస్తారు. మధ్య యుగాల్లో అన్ని ఐరోపా దేశాలు మత మౌఢ్యంతో అంధకారంలో ఉన్నపుడు ఆయా దేశాల్లోని శాస్త్రవేత్తలకి బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చింది. వారి పరిశోధనా ఫలితాల్ని ఉపయోగించుకుని, బ్రిటన్‌ వంటి చిన్న దేశం ప్రపంచంపై అధికారాన్ని చెలాయించగలిగింది.

    తెలంగాణా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న తెలివైన లేదా సంపన్న వర్గాలకి చెందిన అనేక మందికి హైదరాబాద్‌ ప్రాంతం ఒక అయస్కాంతంగా ఆకర్షించింది. దేశానికి నడిబొడ్డున్న ఉండడం, ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళడానికి రవాణా వంటి మౌలిక వసతులు కల్పించబడి ఉండడం, ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎంతో విస్తారమైన, చౌకగా లభించే బీడు భూములు లభించడం వంటి కీలకమైన అంశాల వల్ల హైదరాబాద్‌ ఒక ప్రపంచ స్థాయి నగరం (కాస్మొపాలిటన్‌ సిటీ)గా విస్తరించబడింది. ఈ అభివృద్ధి అంతా కేవలం ఒక్క తెలంగాణా ప్రజల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. దీని వెనుక కేవలం సీమాంధ్రుల కష్టం మాత్రమే కాక, గుజరాతీలు, రాజస్థానీయులు, మరాఠీయులు వంటి అందరి కష్టం ఇమిడి ఉంది. ఇంత మంది కష్టపడి ఒక మహోన్నత స్వప్నాన్ని సాకారం చేసుకున్నాక, అది మాకు మాత్రమే సొంతం అని ఆ ప్రాంతం వారు అంటే, ఎవరూ హర్షించరు. ఇప్పటి తెలంగాణా ఉద్యమ నాయకులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో, వారు చేసిన, చేస్తున్న ప్రకటనలు ఇతర ప్రాంతాల వారిలో భయాందోళనలు పెంచుతున్నాయి. ముందు చెప్పుకున్నట్టుగా హైదరాబాద్‌ నగరం నుండి ఇతర ప్రాంతాల వారిని పంపించి వేసినట్లయితే, ఇక అభివృద్ధి అనేది సాధ్యం కాదు.

    దీనికి నిలువెత్తు ఉదాహరణ బర్మా (ఇప్పటి మియన్మార్‌). ఒకప్పుడు రంగూన్‌ (బర్మా రాజధాని) వెళ్ళివచ్చారంటే ఒక ప్రత్యేకత ఉండేది. పాత తరం ఇళ్ళలో ఇప్పటికీ రంగం సామాను (రంగూన్‌కి ఏర్పడ్డ దేశ్యం) చూడవచ్చు. కాని, ఆ దేశం ప్రజాస్వామ్యం నుండి ఒక నియంత పాలనలోకి వెళ్ళింది. ఆ నియంత పాలనలో బర్మా నుండి బయటి దేశస్థులందరినీ, వారి వారి దేశాలకి గెంటివేసాడు. ఒక్క సారిగా అక్కడి అభివృద్ధి ఆగిపోయింది. ఎన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ పరిపాలన సరిగా లేకపోవడం వలన, విదేశీ మేధావి, శ్రామిక వర్గం అండదండలు లేకపోవడం వల్ల, బర్మా ఒక్కసారిగా అధఃపాతాళంలోకి కూరుకుని పోయింది. ఒకప్పటి అందరి కలల ధామం - ఇప్పటి ఒక నిరుపేద దేశం. దీనికంతటికి ముఖ్య కారణం ప్రాంతీయ బేధాలు, సంకుచిత ఆలోచనా దృక్పధం మాత్రమే.

    తెలంగాణా నాయకులు మరో ముఖ్య వాదన - సీమాంధ్ర నాయకుల వలన తమ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు అని. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. హక్కుల్ని పోరాడి సాధించుకోవడంలో ఉన్న ఓర్పు నేర్పు బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో కూడా ఉండాలి. సీమాంధ్ర నేతలు కేవలం హైదరాబాద్‌ రాజధాని ఉండడం వల్ల ఆ ఒక్క ప్రాంతంపై మాత్రమే అధికారం కలిగి ఉంటారు. కాని, తెలంగాణాలో మిగిలిన ప్రాంతం అంతా ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధుల ఏలుబడిలోనే ఉంది. దీనిలో ఎటువంటి సందేహాలకి తావు లేదు. మరి, సీమాంధ్రలో సాధ్యమైన అభివృద్ధి, తెలంగాణాలో ఎందుకు సాధ్యం కాలేదు? అంటే, అక్కడి నాయకుల్లో ప్రజలకి మంచి చేయాలనే తలంపు లేదు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన లేదు. వనరులు ఉన్నా, లేకపోయినా, సంకల్ప బలం వల్ల మాత్రమే అభివృద్ది సాధ్యమవుతుంది. దీనికి ఇజ్రాయేల్‌ దేశం మంచి ఉదాహరణ. దేశమంతా ఎడారి మయం. ఏ పంటలు పండవు. తాగడానికి చుక్క నీళ్ళు గగనం. నాలుగువైపులా ముస్లిం దేశాలతో ప్రతిరోజు సరిహద్దు యుద్దాలు. అటువంటి ప్రతికూల వాతావరణంలో సైతం, సంకల్ప బలంతో అభివృద్ధి చెంది చూపించారు. అంతేగాని, తాము పతనమయ్యి, కారణాన్ని ముస్లిం దేశాల మీద నెట్టలేదు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతున్న తెలంగాణా నాయకులు (?) ఎవరికైనా అభివృద్ధి అంటే ఏమిటో తెలుసా? వారి దగ్గర అభివృద్ధి చెందడానికి బ్లూ ప్రింట్‌గాని, రోడ్‌ మేప్‌ గాని ఉందా? ఎంతసేపు సోదరుల్లా కలిసి ఉన్న తెలుగు జాతి మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించడం, ఈ ప్రాంతం కాని వారిని ఇక్కడి నుండి వెళ్లగొడతాం అంటూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఉన్న వనరులన్నీ మనమే సొంతం చేసుకుందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం - ఇవన్నీ కాదు అభివృద్ధి అంటే...

    అభివృద్ధి అంటే - అన్ని ప్రాంతాల ప్రజల్ని కలుపుకు పోవడం, సమిష్టిగా జీవన ప్రమాణాల్ని, మౌలిక వసతుల్ని కల్పించుకోవడం, ప్రతీ పౌరుడు నిర్భయంగా, ఆనందంగా గడిపేలా చేయగలగడం, మన దేశం నుండి మాత్రమే కాక, ప్రపంచంలో నలుమూలల నుండి నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని, మేధావుల్ని ఆకర్షించడం, వారి మేధా ఫలాల్ని సంపద సృష్టికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగించగలగడం. ఇవన్నీ చేసినపుడు దాన్ని అభివృద్ధి అంటారు. తెలంగాణా ప్రజలు, మిగతా తెలుగు జాతి వలే ఏ విషయంలోను తీసిపోరు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకత్వం వహిస్తే, ఆ గొర్రెల గుంపు, గొర్రె నాయకత్వం వహిస్తున్న సింహాల గుంపుని సునాయాసనంగా ఓడిస్తుందని దాని అర్థం. అంటే సింహాలు ఎంత గొప్పవి, పరాక్రమం కలవి అయినప్పటికీ, గొర్రె నాయకత్వం వల్ల ఓటమి పాలవుతాయి. ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్నది అదే. అక్కడ గొర్రెలు నాయకత్వం వహిస్తున్నాయి. మేధావులైన తెలంగాణా ప్రజలు ఆ గొర్రెల మాటలు నమ్ముతున్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రజలు కళ్ళు తెరిచి, తాము సింహాలమని గుర్తించి, తమ శక్తి సామర్థ్యాలని తెలుసుకుని, గొర్రె నాయకుల్ని పక్కనపెట్టి, నిజమైన అభివృద్ధి పథం వైపు పయనిస్తారని ఆశిద్దాం.

20 comments:

  1. Challa baga chepparu...Andaroo meeru cheppinatlu alochiste ee godava ki tvaraga paroshkaram labhistundi..Well said.

    ReplyDelete
    Replies
    1. నా ఆశ కూడా అదేనండి...

      Delete
  2. ఈ మీ ఆలోచనల్ని ఇంత ఆలస్యంగా బయట పెట్టినా ఇక ముందుకు ప్రయోజనం ఉంటుందనే ఆశిద్దాము.

    ReplyDelete
  3. బాగా రాసారు. మంచి విశ్లేషణ

    ReplyDelete
  4. ఆమెరికా అభివృధ్ధిలో ఒక భారతీయునికి ఎంత పాత్ర వుందో ఒక చైనీయుడికి కూడా అంతే పాత్ర వుందని మీరు సెలవిచ్చారు.
    కానీ ఏ భారతీయుడూ, ఏ చైనీయుడూ అమెరికా మీద ఆధిపత్యం చెలాయించాలనుకోడం లెదు.

    హైదరాబాదును మెమె అభివృధ్ధి చేసామనే ఆంధృలు మాత్రం హైదరాబాద్ మీద పెత్తనం తమకే ఉండాలనుకుంటున్నారు.
    అమెరికాలో చైనీయుల్లా, భారతీయుల్లా అధికారం లెకుందా వుండాలనుకోదం లేదు. అదీ అసలు సమస్య.

    కాస్త నిజాయితీగా అలొచిస్తె తెలంగాణ ఉద్యమాన్ని గొర్రెలు నడిపిస్తున్నాయో ...
    ఆంధ్ర అహంభావపు అల్లరిని గొర్రెలు నడిపిస్తున్నాయో స్పష్టం గా అర్ధం అయ్యేది.
    మరేం ఫరవాలేదు.
    ఎవరు గెలుస్తారొ నాలుగు నెలల్లో తేలిపోతుంది.
    చూస్తూ ఉండండి.

    ReplyDelete
    Replies
    1. కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్ధం తో చెసిన దానికి మొత్తం రాష్త్రం విడిపోవలనడం సబబు కాదు.దయచెసి గమనించాలి మీరు విదేశీయులు కాదు, మీరు కూడ అంధ్రులే తెలుగు వారే

      Delete
    2. ఇక్కడా పెత్తనం అనేది సమస్య కానేకాదు. ఇక్కడ కోరుకుంటే ఎవరయినా అధికారాన్ని చేపట్టవచ్చు. ఒక తెలంగాణా బిడ్డ దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు కదా.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కేవలం అధికారం కోసం మాత్రమే... కొంచెం నిదానంగా ఆలోచించి చూడండి... మీకే అర్ధం అవుతుంది..

      Delete
  5. very nice analysis. Please try to take this into people of Andhra through media either print of TV channels. Let people know what to do in future and what for to fight. try to show some solutions and deepen your analysis specifically. Very good.

    ReplyDelete
  6. నాలుగు సంవత్సరాల చరిత్ర కల హైదరాబాద్ వివిధ కారణాల వల్ల వివిధ వ్యక్తుల వల్ల రాజధాని అభివృద్ధిచెందుతున్నది!౧౯౯౧లో విశ్వవిపణీకరణ నేపధ్యంలో బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు దేశంలోని వివిధ పెట్టుబడిదారులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలకు ఆకర్షితులై హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి ఇబ్బడిముబ్బడిగా లాభాలు మూటలు కట్టుకున్నారు!అందులో సీమాంధ్ర పెట్టుబడిదారులు కూడా ఉన్నారు!అంత మాత్రం చేత మేమే అభివృద్ధి చేశామనడం పెత్తందారీ ఆభిజాత్యం!UPA,కాంగ్రెస్ ఏకగ్రీవంగా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి!ఒక్క CPM తప్ప అన్ని జాతీయ పార్టీలు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని,తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదని లేఖలు ఇచ్చాయి!ఈ విధంగా ఏకాభిప్రాయం వెలిబుచ్చడానికికూడా చాలా సంవత్సరాలు పట్టింది!చివరాఖరికి ఎట్టకేలకు తెలంగాణా ప్రజల చిరకాల వాంచ ఈరేడుతున్న ఈ శుభసమయంలో మొకాలడ్డడం న్యాయమా!?మీ పార్టీల అధినేతలు ఆమోదం తెలుపుతున్నప్పుడు మీరు ఏమి చేశారు!?ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ పరోక్షంగా సీమాంధ్ర సోదరులను రెచ్చగొట్టి ఉద్యమాలు రాజేస్తారా!?ఇదెక్కడి న్యాయం?!పెద్దలు పొత్తూరి వెంకటేశ్వరరావు,త్రిపురనేని హనుమాన్ చౌదరి,ఓల్గా,దేవిప్రియ,శ్యాం బెనెగల్ గారలు కూడా తెలంగాణా ప్రజలది,న్యాయమైన,ధర్మబద్ధమైన కోరిక అని నొక్కి వక్కాణించారు కదా!మీకు ఏమైనా అనుమానాలుంటే తీర్చడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది కదా!ఈ అవకాశం ఉపయోగించుకోండి!హైదరాబాద్ తెలంగాణా వారి జన్మహక్కు,హృదయస్పందనం!

    ReplyDelete
    Replies
    1. మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. కేవలం అధికార మార్పిడి కోసం మాత్రమే మీ పోరాటం అయితే, దానివల్ల ఏ విధమయిన ఉపయోగం ఉండదు. భారత స్వాతంత్ర ఉద్యమంతో జరిగింది కూడా అధికార మార్పిడి మాత్రమే. దేశం ప్రగతీశీల శక్తుల చేతిలోకి వెళ్ళకుండా, అధికారం కోసం పోరాడే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిండి. దాని ఫలితాన్ని ఇప్పటికీ మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా.. రేపు తెలంగాణా నాయకుల విషయంలో కూడా జరగబోయేది అదే. ఇన్నాళ్ళ ఇంతమంది శ్రమ అంతా వ్యర్ధమయిపోతుందనేదే మా బాధ. తెలంగాణా ప్రాంతంపై అంతిమ అధికారం, హక్కు ఎప్పటికీ ఆ ప్రాంత ప్రజలకే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

      Delete
  7. ఏమిటి ఓల్గా కూడ పెద్దలలో ఒకరే. వింటే ఎవరైనా నవ్విపోతారు.

    ReplyDelete
  8. జగదీశ్ గారు మీరు రాసిన వాటికి సమాధానాలు:

    మొదటి పేరాలో "తెలంగాణా ప్రాంతంలో తమ కష్టాన్ని ధారబోసి, పరిశ్రమలు స్థాపించి, మౌలిక వసతుల్ని సమకూర్చి, సంపదని సృష్టించిన తరువాత తమను గెంటివేయడం ఎంత వరకు న్యాయం అని సీమాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు." అని రాశారు దీనికి సమాధానం నా బ్లాగులోని తెలంగాణా గుండె కాయ హైదరాబాదు అనే పోస్ట్.

    ఇంక మీ రెండవ పేరాలో సమిష్టిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే సారాంశంతో రాశారు - సమానత లేని దగ్గర సమిష్టి మిధ్య. అందుకే కదా సమిష్టిగా ఉందామన్నా వినకుండా మీ ఆంధ్రా వాళ్ళు మద్రాసు విడిచి వచ్చింది. అప్పుడు ఈ సమిష్టి కృషి జ్ఞప్తికి రాలేదా? అయినా తెలంగాణా అంతా సమిష్టిగానే ఉంది - సమిష్టిగానే రాబోవు కాలంలో అభివృద్ధి సాధిస్తుంది. 1952-1955 వరకు హైదరాబాదు రాష్ట్రం సాధించిన అభివృద్దే అందుకు నిదర్శనం. సమిష్టి అంటే విభిన్న జాతులు/ ప్రాంతాలు కలిసినపుడే అని మనం అర్థం తీసుకుంటే పొరపాటు. అది చిన్న ప్రాంతమైన అందరూ కలిస్తే అది సమిష్టి అవుతుంది. దీనికి ఉదాహరణ మదరాసు రాష్ట్రమే - ఆంధ్రా విడిపోయినా మదరాసు అభివృద్ధి సాధించలేదా?

    ఇంకా మీ 2,3 పేరాకు సమాధానం:- అభివృద్ధిలో అమెరికా గురించి మీరు ప్రస్తావిస్తూ ప్రపంచం నుండి వచ్చిన అందరూ కృషి చేసి ఆ స్థితికి తెచ్చారు అన్నారు. ఉదా: అమెరికాలో బాగా అభివృద్ధి చెంది ఒక నగరాన్ని ఆ నగర కృషిలో భాగమైన భారతదేశ వాసులు ఇది భారత దేశంలో కలపాలి అంటే, అది అమెరికా కు చెందదని అంటే దానికి అర్థం ఉందంటారా? న్యాయంగా అది అమెరికాది కాదంటారా? అక్కడ ఉండటానికి హక్కు ఉంటుంది - అదీ అమెరికా పౌరునిగా, కాని మొత్తాన్ని సొంతం చేసుకోవటానికో అధికారం ఉండదు.

    ఇంకా మీ 4 వ పేరాలో బర్మాను ఉదాహరిస్తూ అందర్నీ వెళ్ళగొట్టి నాశన మయ్యారు అన్నారు. కాని తెలంగాణా వల్లెపుడు ఎవర్నీ వెళ్ళగొట్ట లేదే? నీవేక్కడి వాడివని ఏరి ఏరి పంపలేదే? ప్రస్తుతం కూడా ఇక్కడ నివాసముంటున్న వారిని వెళ్ళ మానటం లేదే? అలా అయితే తెలంగాణా 8 జిల్లాల నొదులుకున్న 1955 నాడే మరాఠి, కన్నడ, గుజరాతీ ఆది ప్రాంతాల వారిని వెళ్ళ గొట్టేది కదా? ఇంకా మీరు ప్రాంతీయ తత్త్వం గురించి ప్రస్తావించారీ పేరాలో, ప్రాంతీయ తత్త్వం తెలంగాణా వారిలో లేదు ఉంటె ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాల వారితో కలిసి ఉండేది కాదు. చాలా మందికి తెలిసింది ఆంధ్రా ప్రాంతం వారు ఒక్క హైదరాబాదు లోనే ఉన్నారని. కాని తెలంగాణా అన్ని జిల్లాల్లో ఉన్నారు - అక్కడి నుండి వచ్చి భూములు కౌలు తీసుకుని వ్యవసాయం, భవన నిర్మాణం, హోటల్స్, టైలరింగ్ లాంటి పనులు ఎన్నో చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తెలంగాణా వారు ప్రాంతీయ తత్త్వంతో ఉద్యమాలు సాగిస్తే వీళ్ళు ఇంకా ఇక్కడ ఉండేవారా? స్వతంత్రించి బ్రతకాలనుకునే వాడిది ప్రాంతీయ తత్త్వం అనాలంటే ముందుగా మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్రులనే అనాల్సి వస్తుంది.

    ఇంకా మీ 5 వ పేరాలో తెలంగాణా నాయకులే అభివృద్ధి చేసుకోవటంలేదని రాసారు. తెలంగాణా ఎవరి వల్ల అనగదొక్క బడుతుందో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ లోనే అనే ముఖ్య మంత్రులు ఉన్నారు. ఆంధ్రా నాయకత్వం ప్రవేశిస్తే తెలంగాణా అణచి వేయబడుతుందన్న ఉద్దేశంతోనే ఆనాడు ఫజల్ అలీ (SRC) నివేదిక తెలంగాణాని సపరేట్ రాష్ట్రంగా ఉంచాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో అల్ప సంఖ్యాకులైన తెలంగాణా వారు తమ ప్రాంత అభివృద్దికి చేసే పోరాటం ఏనాడూ చెల్లలేదు. అధికారం, సంఖ్యా బలమే అభివృద్దికి దోహదం చేస్తుంది.

    ఇంకా చివరి 6వ పేరాలో తెలంగాణా ప్రజల్ని నాయకుల్ని గొర్రెలుగా పోల్చారు. తెలంగాణా వారంతా గొర్రెలూ కాదు - సీమంద్రా వారంతా సింహాలూ కాదు. అది మనం చూసే కళ్ళలో-వారినర్థం చేసుకొనే భావనలోనే ఉంటుంది. భిన్న తత్వాల మనుషులు ప్రతి ప్రాంతంలోనూ ఉంటారు. అయినా తెలంగాణా ప్రజలు కాని నాయకులు కాని తెలంగాణా అభివృద్ధి సాధించటానికి తెలంగాణా ప్రత్యెక రాష్ట్రమోకటే కోరుకుంటున్నారే. వాళ్ళు రోజోకొక మాట చెప్పి వారి మాటల వెంబడిస్తే అపుడు గొర్రెలని అన్వయిస్తే అర్థం ఉండేది. ఇలాంటి పరుష పదజాలాలు వాడే సీమంధ్రులు తెలంగాణా వారికి దూరమవుతున్నారు.

    ఆంధ్రా నాయకులు తానా అంటే తందానా అనే ఆంధ్రా వారినేమనాలి? ఆంధ్రా నాయకులు సపరేట్ ఆంధ్రా అంటే ఆంధ్రా ప్రజలు సై అన్నారు - ఆపై విశాలాంద్ర అంటే అదీ సై అన్నారు - మద్యలో జై ఆంధ్రా అంటే వారి వెంటే పరుగెత్తారు - ఇపుడు సమైక్య ఆంధ్రా అంటే పరుగెత్తు తున్నారు.

    గొర్రెలు అనే పదం ఎవరికీ అన్వయమనేది మీరే నిర్ణయించుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. మల్లికార్జునస్వామి గారూ,
      "1952-1955 వరకు హైదరాబాదు రాష్ట్రం సాధించిన అభివృద్దే అందుకు నిదర్శనం." - ఇదీ మీరన్న మాట. 1952 లో హైదరాబాదు రాష్ట్ర ఆదాయం 29.87 కోట్లు. ఆ తరవాతి సంవత్సరాల్లో వరసగా 26.74, 25.56, 27.41. వరసగా తగ్గి చివరి సంవత్సరం కొద్దిగా పెరిగింది. పోతే ఈ ఐదేళ్ళలో బడ్జెటు మిగులు/లోటు చూస్తే ఇలా ఉంది: +0.92, -0.5, -2.31, -2.65 కోట్లు.

      ఇదీ ఆ నాలుగేళ్ళలో హైదరాబాదు రాష్ట్రం సాధించిన అభివృద్ధి !! దీన్నే ఇంగ్లీషులో ముద్దుగా నెగటివ్ గ్రోత్ అనో ఏదో అంటారంట.

      ఇంకా ఎన్నాళ్ళు చెబుతార్సార్ ఈ అబద్ధాలు?

      Delete
    2. చదువరి గారు

      అభివృద్ధి అంటే ఆదాయం అని మీ అభిప్రాయంలా ఉంది. ప్రజల నెత్తిపై పన్నుల భారం మోపితే ఆదాయం కుప్పలు తెప్పలు వస్తుంది. అదే అభివృద్దా? ప్రజా సౌకర్యాలు పెరిగినపుడే, ప్రజోపయోగ పనులు జరిగినపుడే అది నిజమైన అభివృద్ధి. రజాకర్ల దోపిడీ దారుల కట్టడి చేయటానికి రక్షణ వ్యవస్థకు ఎక్కువగా ఖర్చు చేయబడింది. ఆ ఖర్చు రాను రాను తగ్గి ద్రవ్య లోటు తగ్గింది- అది మీ లెక్కలలోనే కనిపిస్తుంది కూడా. ఇంకా 1952 నాటి పరిస్థితికి 1956 నాటి పరిస్థితికి ఉన్న వ్యత్యాసం జరిగిన అభివృద్ధి ఇక్కడ పెట్టడం కుదరదు కాన నా బ్లాగులో పోస్టు చేస్తున్నాను గమనించండి.

      Delete
  9. NIJANGA ANDRODIVI ANIPINCHUCKUNNAV...............
    ITALANE LOLLI CHESTE MADRAS POYINATTU HYDERABAD POTUNDI...........
    VITANDAVADAM MANI NEE PROBLEMS CHEPTE VATINI SALVE CHEYADANIKI VEELU AVUTUNDI.............
    NUVVU EPPATIKI AINA YDERABAD LO KIRAYI GADIVE........SONTADARUDIVI KALEVU...ENDUKANTE NEEKU NEE SAMSKRUKE GOPPAGA KANIPISTUNDI..........

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.