Pages

Monday, April 1, 2013

బ్లాగర్లపై పన్ను పోటు - యోచనలో చిదంబరం

    అసలే ఎన్ని పన్నులు వేసినా ప్రభుత్వం నడపడానికి డబ్బులు సరిపోవడం లేదు. ప్రజల్ని పిండి, పిండి, వారి రక్తం మొత్తం తోడేసినా, ప్రభుత్వానికి ఆర్థిక ఆకలి తీరడం లేదు. ఒకవైపు కిలో రూపాయికి బియ్యం ఇవ్వాలి. రేపు ఎన్నికలొస్తే అర్థరూపాయికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వెనుకబడిన వారికి ఎన్నో పథకాలు ప్రకటించాలి. ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచాలి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు వస్తున్న ఆదాయం చాలదు. మరేం చేయాలి? ఉన్న పన్నుల్ని ఇంకా పెంచితే ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంది కాబట్టి, కొత్త పన్నుల్ని విధిస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దానితోపాటు ప్రజలకి భారం అనిపించదు. అందుచేత కొత్త పన్నుల్ని వేయడానికి ముసాయిదా సిద్దం చేసారట అధికారులు. ఇందుకోసం తుగ్లక్‌ మరియు ఇతర సుల్తానులు భారతదేశాన్ని ఎలా పన్నుల రూపంలో కొల్లగొట్టిందీ ప్రజల్ని ఎలా హింసించిందీ ఆరా తీస్తున్నారట. బ్రిటిష్‌ వారి సమయంలో కూడా ఎటువంటి కొత్త పన్నులు ముక్కు పిండి వసూలు చేసారో కూడా అవన్నీ మరలా విధించడానికి ఆలోచిస్తున్నారట. కొద్దిగా బయటకు వచ్చిన (లీకయిన) అంశాల సారాంశమేమిటంటే:

    1. గాలి పన్ను: ఇప్పటి వరకు పంచభూతాలయిన భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం - వీటిలో భూమి పైన (ఆస్థి పన్ను, రిజిస్ట్రేషన్‌ పన్ను) ఇప్పటికే పన్ను ఉంది. నిప్పు (వంట గ్యాస్‌) మీద పన్నును ప్రతి ఆరు నెలలకి పెంచుతున్నారు. ఇక మినరల్‌ వాటర్‌పైన ఎలాగో సేల్స్‌ ట్యాక్స్‌ వడ్డిస్తున్నారు. అందుకే గాలి మీద కూడా పన్ను వేయాలి. ప్రతి మనిషి రోజుకి ఎంత గాలి పీలుస్తున్నాడో లెక్కగట్టి, సంవత్సరానికి దాని విలువ మధింపు చేసి పన్ను వేయాలి. ఇలా లెక్క వేయడం కోసం చైనాకు ప్రత్యేక మైన పరికరాల తయారీ కోసం ఆర్డరివ్వాలి. (కనీసం పదివేల కోట్లు ఈ బడ్జెట్టుకు కేటాయించాలి)

    2. నడక మీద పన్ను: మనిషన్నాక ఏదో పని మీద నడుస్తూనే ఉంటాడు. నెలకు ఎన్ని అడుగులు వేస్తాడో లెక్కగట్టి, ప్రభుత్వ రోడ్ల మీద నడుస్తున్నాడు కాబట్టి, అవి అరుగుతాయి కాబట్టి, వాటికి పన్ను వసూలు చేయాలి. రెండు కాళ్ళకి మీటర్లు పెట్టి, ఎవరు ఎన్ని అడుగులు వేస్తారో వారి దగ్గర నుండి అంత పన్ను వసూలు చేయవచ్చు. వికలాంగులకి ఈ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.

    3. పడక గది పన్ను: బ్రిటన్‌లో బెడ్‌రూమ్‌ ట్యాక్స్‌ విధించింది ప్రభుత్వం. చివరకు ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత వెల్లువెత్తడంతో దాన్ని ఎత్తేసారు. కాని మన దేశంలో ఎన్ని పన్నులు వేసినా, ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత రాదు కాబట్టి, ఇక్కడ వెయ్యొచ్చు. బెడ్‌రూం ని ఎన్నిసార్లు వాడుకుంటే అంత, ఎంత వాడుకుంటే అంత పన్ను వేసి వసూలు చేయవచ్చు. దానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అధికారుల్ని నియమిస్తే, వారు ప్రతి ఇంటికి రాత్రి పూట 'రైడింగు' చేసి, నిజంగా పడకగదిని వాడుతున్నారా లేదా అని నిర్ధారించుకుని, పన్ను విధిస్తారు. ఎవరైనా పడక గదిని వాడుతూ, వాడట్లేదని లెక్కలో చూపిస్తే మాత్రం వారికి భారీ జరిమానా విధిస్తారు.

    4. బ్లాగర్లపై పన్ను: ఇక మన విషయానికి వస్తున్నాను. బ్లాగింగు చేయడం ద్వారా మానసిక ఆనందాన్ని, కామెంట్లు విసరడం ద్వారా మరికొంత ఆనందాన్ని, చదవడం ద్వారా కాలక్షేపాన్ని పొందుతున్నారు కాబట్టి, బ్లాగులు రాసే వాళ్ళకి సేవా పన్ను, దాని మీద సర్‌ఛార్జీలు, చదివే వాళ్ళకి, కామెంట్లు చేసే వాళ్ళకి యూజర్‌ ఛార్జీలు విధించబోతున్నారు. అందుకే బ్లాగర్లందరూ కాంగ్రెస్‌ పార్టీకి, చిదంబరానికి రుణపడి ఉండాలి. ఇక మీ అభిప్రాయం చెప్పడమే తరువాయి.

Wednesday, March 20, 2013

హిందుత్వమనేది ఒక మతం కాదు, హిందూ దేవీ దేవతలు అఖండ ప్రకృతి శక్తులకు ప్రతీకలు మాత్రమే : ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

    భారతదేశంలో వివిధ రకాలైన ప్రజలు ఆరాధించే లేదా ఆచరించే వివిధ రకాలైన ఆరాధనా పద్దతులను ఒక మతంగా పరిగణించలేమని ముంబయిలోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఒక కేసులో వ్యాఖ్యానించడం భారతీయ సమాజంచే స్వాగతించబడుతుంది. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగం నుండే ఎన్నో వేల రకాల ప్రజలు నివసిస్తున్నారు. వారు ఎన్నో విధమైన మత విశ్వాసాలు కలిగియున్నారు. విభిన్నమైన ప్రకృతి శక్తుల్ని లేదా ప్రతీకల్ని కొలుస్తూ ఉన్నారు. నిజానికి వారందరూ తమ తమ మత విశ్వాసాల దృష్ట్యా వేర్వేరు అయినప్పటికీ, వారందరినీ కలిపి ఉంచింది మాత్రం భారత సంస్కృతి ఒక్కటే. అదే వేద సంస్కృతి. ఈ దేశంలోని ప్రజలు ఏనాడు మతం పేరు చెప్పి కలహించుకోలేదు. దేవుడి పేరు చెప్పి ఇతరుల్ని దోచుకోలేదు, చంపలేదు. ఎంత విభిన్నమైనప్పటికీ వారందరినీ కలిపి ఉంచింది మాత్రం అఖండ ప్రకృతి శక్తుల ఆరాధన మాత్రమే. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు నిజానికి భారతీయ వేదాంత సారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఆచితూచి చేసిన వ్యాఖ్యానంగా మనం గమనించవచ్చు. కాని, బయటి వారికి మాత్రం హిందూ మతం ఒక మతమే కాదన్న వాదన చేయడానికి ఒక ఆయుధంగా పనికివస్తుంది. ట్యాక్స్‌ ఎగ్గొట్టడానికి హిందూ సంస్థలు చేసే ప్రయత్నంగా కొన్ని బ్లాగుల్లో ప్రచురించడం చూసాను. అటువంటి వారు ఎన్ని చెప్పినా వాస్తవం మాత్రం ఒక్కటే.

    భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు. భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు. అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు. దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు. ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో  దైవాన్ని దర్శిస్తాడు. అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది. భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం ఊహాత్మకం (Abstract)  కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు. ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు. కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం. భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.

    శివునికి ప్రత్యేకించి ఒక రూపం లేదు. ఆయన లింగాకారుడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే శివ తత్వం. శరీరంలో ఉన్న ప్రాణమే శివుడు అంటారు (శివపురాణం). అందుకే శివుడికి ఆత్మలింగం ఉంటుంది. ఆత్మయే శివుడు. ఆ శివుడు వెళ్ళిపోతే మిగిలిందే శవం. అంటే జీవుడి నుండి శివుడు వేరయితే అది శవం. అంటే జాతి, కుల, మత బేధం లేకుండా ప్రతి ప్రాణిలో ఉండే ప్రాణమే శివుడు. అది ఏ జాతి అయినా, ఏ దేశమయినా, ఆఖరికి మన ప్రపంచం కాకుండా వేరే లోకమైనా కూడా అందరిలోను శివతత్వాన్ని చూడవచ్చు. దీన్నే విశ్వజనీయత ( Universality) అంటారు. ఈ విశ్వాసానికి ఏ మత గ్రంధం అక్కర్లేదు. ఎవరూ చెవిలో ఇల్లు కట్టుకుని, పోరుపెట్టి చెప్పనక్కర్లేదు. పాంప్లెట్లు పంచనక్కర్లేదు.

    ఇక విష్ణువు విషయానికి వస్తే, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మరోలా చెప్పుకుంటే ఈ విశ్వమే విష్ణువు (విశ్వం విష్ణ్ణు: - విష్ణు సహస్రనామ స్తోత్రం, మొదటి నామం), లోకాలన్నీ ఎవరిలోనైతే ఇమిడి ఉన్నాయో, ఎవరైతే ఈ లోకాలన్నిటిలోను నివాసం ఉంటున్నాడో ఆయనే (ఆ మహాశక్తే) విష్ణువు. (వాసితం భునవత్రయం - సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే). అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీ జీవి, ప్రతీ వృక్షం, ప్రతీ మనిషీ - మరలా చెబుతున్నాను, కేవలం ఈ దేశంలోనో, ఈ మతంలోనో కాదు, జీవించి ఉన్న ప్రతీ జీవి కూడా, విష్ణువే అని భారతీయ దర్శనం. భారతీయ సంస్కృతిలో మరో విశేషమేమిటంటే, ప్రకృతిని మాతృ భావనతో ఆరాధించడం. అదే దుర్గా స్వరూపం. ఇంతటి ఉన్నతమైన భావన కేవలం భారతీయులకు మాత్రమే ఉన్నదని నేను గర్వంగా చెప్పగలను. నేను మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవారు ఎవరైనా చెప్పగలరు.

    ఇక ట్రిబ్యునల్‌ వ్యాఖ్యల్లో భారతీయ జీవిత విధానాన్ని ఒక మతంగా గుర్తించలేము అన్న దానికి కూడా విస్తృతమైన అర్థం ఉంది. మతం అంటే అందరికీ సమ్మతమైనది. ఒక జన సమూహం ఆచరించే ఆరాధనా పద్దతులు ఒకేలా ఉంటే అపుడు దాన్ని మతం అనవచ్చు. లేదా ఒక వ్యక్తి చెప్పినదాన్ని ఆచరించే వాళ్ళని ఒక మతంగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో చాలా మతాలు ఆ విధంగా ఏర్పడినవే. వాటికి సార్వజనీనత ఉండదు. క్రీస్తు చెప్పాడు కాబట్టి క్రైస్తవం ఏర్పడింది. మహ్మద్‌ ప్రవక్త చెప్పాడు కాబట్టి ఇస్లాం ఏర్పడింది. బుద్దుడు చెప్పిన బోధనలన్నీ కలిసి బౌద్ధ మతంగా ఆచరిస్తున్నారు. కాని  భారతీయ తత్వ దర్శనం ఆ విధంగా ఒక వ్యక్తి చెప్పడం వల్ల కాని, ఒక కాలంలో కాని ఏర్పడలేదు. చరిత్రకు పూర్వం, అంటే ఈ మతాల కుమ్ములాటలు ఏవీ లేని కాలంలో, ప్రపంచంలో దేశాలకి కృత్రిమ సరిహద్దులేవీ లేని కాలంలో, మానవులంతా ఒక్కటే  అనే ఉదాత్త భావన రాజ్యమేలిన కాలంలో ప్రాచీన మహర్షులకి వచ్చిన అత్యున్నత ఆలోచనల పరంపరే భారతీయ సంస్కృతి. అందుకే హిందు మతం అనే పదాన్ని భారతీయ సంస్కృతికి తగిలించలేము. మతం అనే చట్రంలో భారతీయతని బంధించలేము. భారతీయ ధర్మం సార్వజనీనమైనది. అంటే ప్రతీ సమాజం, ప్రతీ జాతి ఆచరించదగినది. ఇది మతం కాదు - ధర్మం. ధర్మాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. మంచి సమాజాన్ని సాధించవచ్చు. ధర్మాన్ని ఆచరించకపోతే అది సమాజ హానికి దోహదం చేస్తుంది. అందుకే ఈ సనాతన ధర్మం గురించి ఎవరూ ప్రచారం చేయలేదు. నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది. అది అగ్ని ధర్మం. దీని గురించి మైకుల్లో హోరెత్తించనక్కర్లేదు, టి.వి.ల్లో చెప్పనక్కర్లేదు. సూర్యుడు అందరికీ జీవ ప్రదాత. ఆయన లేకపోతే ఈ ప్రపంచంలో జీవులే లేవు. వాటికి ఆహారమూ లేదు. సూర్యుడు ఒక్క రోజు కనబడకపోయినా ఈ ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. ఆయన గనుక ఉదయించకపోతే ఇక మీరు చెప్పుకునే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఇది ఊహ కాదు, వాస్తవం. అందుకే సూర్యుడు ప్రత్యక్ష దైవం. ప్రపంచంలో మొట్టమొదట ఆరాధించిన వాళ్ళలోను, ఇప్పటికీ సూర్యుడిదే అగ్రస్థానం. సూర్యుడి గురించి ఎవరికీ ఎవరూ చెప్పనక్కర్లేదు, కళ్ళెదురుగా కనిపించే సత్యం. అటువంటి సూర్యుడిని ఆరాధించే వాళ్ళది ఒక ప్రత్యేకమైన మతం ఎందుకవుతుంది? అటువంటి ఆరాధనకు ఏ పేరు పెడతారు?

    కేవలం ఊహాత్మక (ఆబ్‌స్ట్రాక్ట్‌) దేవుళ్ళని ఆరాధించే వాళ్ళకయితే ఒక ప్రత్యేకమైన మతం కావాలి. దాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో కల్పనలు, ఎంతో సరంజామా కావాలి. పాంప్లెట్లు, పోస్టర్లు, పుస్తకాలు, టి.విలు, ఇంటర్‌నెట్‌లు ఇలా ఒకటేమిటి? ఎంతో ప్రచార సామాగ్రి కావాలి. ఎంతో మంది అమాయకులు కావాలి. ఇవన్నీ చాలకపోతే కత్తులు, బాంబులు కూడా కావాలి. కాని భారతీయ ధర్మానికి ఇవేమీ అక్కర్లేదు. ఇది ఒక ప్రత్యేకమైన సమూహం కాదు. భారతీయ ధర్మం ఆచరణలో ఎన్నో రకాల పద్దతులున్నాయి. అవి వేటికవే ప్రత్యేకం. విగ్రహాలని తామస పద్దతిలో పూజిస్తూ, వాటికి బలులిచ్చే వాళ్ళున్నారు. అవే విగ్రహాలని వేదానుసారం ప్రాణ ప్రతిష్ట చేసి, భక్తి మార్గంలో సాత్వికంగా ఆరాధించే వాళ్ళున్నారు. అసలు ఏ విగ్రహంతోను పని లేకుండా కేవలం యోగ సాధన ద్వారా భగవంతుని చేరుకోవచ్చుననే వాళ్ళున్నారు. లేదా భగవంతుడు ఎక్కడున్నాడు అంటూ జ్ఞాన మార్గం ద్వారా సాధన చేసేవాళ్ళున్నారు. ఇవన్నీ కాదు మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే దేవుడిని చేరుకోవచ్చు అని నమ్మి, సమాజ సేవ చేసే కర్మ యోగులున్నారు. ఆఖరికి దేవుడే లేడు అని వాదించే నాస్తికులు కూడా ఉన్నారు. సమాజంలో ఏ విధమైన ఆలోచన చేసినా, ఏ పూజా పద్దతి పాటించినా విజ్ఞానమంతా విష్ణువు నుండి ఉద్భవించినదే. (యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ: వేదా శాస్త్రాణి విజ్ఞానమ్‌ ఏ తత్సర్వం జనార్థనాత్‌ -  విష్ణు సహస్రనామ శ్లో). అంటే కేవలం ఒక విశ్వాసమో, ఒక ప్రార్థనా పద్దతి మాత్రమే భారతీయ దైవ పద్దతి కాదు. అది ఎన్నో విశ్వాసాల కలయిక. అన్ని విశ్వాసాలు  ఎక్కడా అరమరికలు లేకుండా కలిసి ఉంటాయి. ఏ పద్దతి అవలంభించినప్పటికీ వారు మిగతా వారితో కలహించుకోలేదు, ఎప్పటికీ కలహించుకోరు. పైగా ఒక పద్దతిలో వీలుకాకపోతే మరో పద్దతిలో దైవం గురించి ప్రయత్నించవచ్చు. వ్యక్తి ఆలోచనకి స్వేచ్చనిస్తూ, ఎవరిపైనా బలవంతంగా రుద్దకుండా, తమ ఇష్టమైన పద్దతిలో దైవాన్ని చేరుకోవచ్చు అనే విశాల భావన కేవలం భారతీయ ధర్మంలోనే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నది మతం కాదు - ధర్మం మాత్రమే అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

    ఇటువంటి చక్కటి ఆలోచన చేయడానికి స్ఫూర్తినిచ్చిన ముంబయి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ వారి వ్యాఖ్యలకి భారత జాతి ఋణపడి ఉంటుంది.

Thursday, December 27, 2012

ఇది మనుషులు చేసే పనేనా?

    ఇటీవల దేశ రాజధానిలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన, తదనంతర పరిస్థితులు దేశంలో నెలకొన్న విపరీత పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. ఇక్కడ యువతిపై జరిగింది కేవలం అత్యాచారం మాత్రమే కాదు, హత్యాయత్నం కూడా. యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనానికి, పాశ్చాత్య నాగరికతా అనుకరణకు ఈ సంఘటన ఒక నమూనా మాత్రమే. నైతిక విలువలు లేకపోతే మనిషి ఎంత మృగంగా మారతాడో ఈ సంఘటన వల్ల మనకు తేటతెల్లమవుతుంది. అత్యాచారానికి గురయిన యువతికి కలిగిన గాయాలు, ఆమె అనుభవిస్తున్న నరకం చదువుతుంటే, చూస్తుంటే, మనసుని ఎవరో గట్టిగా మెలిపెట్టినంత బాధ కలిగింది. రెండు రోజుల తరువాత కూడా కన్నీటి చెమ్మ ఆరలేదు. సభ్య సమాజం, మానవత్వం ప్రతి ఒక్కరు, ప్రభుత్వం అందరూ సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన ఇది. ఢిల్లీలో జరిగిన సంఘటన కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి రోజు వార్తల్ని పరిశీలిస్తే, దేశం మొత్తం మీద, ఆ మాటకొస్తే ప్రపంచంలో ప్రతి దేశంలోను ప్రతి సమాజంలోను మహిళల పట్ల లైంగిక వేధింపులు చాలా సర్వ సాధారణంగా ఉంటున్నాయి. బాలికలు, యువతులు, మహిళలు.. ఆ మాటకొస్తే, స్త్రీ అనే ప్రతి ఒక్కరూ ఇటువంటి లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. హేళనగా చూడడం, చులకనగా మాట్లాడడం, లైంగికంగా వేధించడం మొదలుకొని, అత్యాచారానికి తెగించడం చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడకపోవడం ద్వారా మహిళలను మానసికంగా శారీరకంగా హింసించడానికి నిత్యం ఎంతో మంది కామాంధులు అవకాశం కోసం కాచుకుని ఉంటారు.

    ఇటువంటి సంఘటనలు జరిగిన తరువాత స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరి మనసులోను ఉదయించే ప్రశ్న ఒకటే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆపలేమా? మరింత మంది చిట్టితల్లులు బలికాకుండా చూడలేమా? దీనిలో మన బాధ్యత ఎంత వరకు ఉంది? మన కూతుళ్లకు, తోబుట్టువులకు, అలాంటి మరికొంత మంది బంగారుతల్లులకి ఈ సమాజంలో రక్షణ కల్పించలేమా? అనిపిస్తుంది. కాని ఇవన్నీ చేసే ముందు కొంతమంది మగాళ్ళు, 'మృగాళ్ళు'గా ఎలా మారతారో ఆలోచించి, దానికి మూలకారణాలు ఆన్వేషించి, అక్కడి నుండి నివారించే ప్రయత్నం చేస్తే తప్ప, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా నివారించలేము.

అంతర్జాలం మరియు వినోద సాధనాలు:

    ఆధునిక సమాజంలో మహిళల పట్ల జరిగే పాపాల్లో వీటి వాటా కనీసం 80 శాతం ఉంటుంది. వినోదం కోసమైతే నేమి, వ్యాపారం కోసమైతేనేమి, స్త్రీలను ఒక ఆట బొమ్మగా, మాంసం ముద్దగా వాడుకుంటున్నారు. సినిమాల్లో, టివిల్లో అయితే ఎంత తక్కువ బట్టలేసుకుంటే అంత గొప్ప హిట్‌ లేదా అసలు ఏమీ వేసుకోకపోతే అది కూడా ఒక సంచలనం. అలాంటి సంచలనాత్మక అంగడిబొమ్మలు (పేరుకు హీరోయిన్లు) నటిస్తే, ఆ సినిమాకు కోట్ల రూపాయిల వసూళ్ళు. టీవీ సీరియళ్ళలో అయితే చెప్పనక్కర్లేదు. కేవలం ఆడవారిని ఏడిపించి రేటింగ్‌ పెంచుకునే చానళ్లు ఎన్నో... పగలంతా ఎన్నో నీతులు వల్లించి, రాత్రయేసరికి కామ పాఠాలు వల్లించే నీతి బాహ్యమైన 'ఛా'నళ్ళకు కొదవే లేదు. ఇవన్నీ చివరకు ఆడవారి పట్ల శాపాలుగా మారుతున్నాయి.

    ఇక అంతర్జాలం సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. నెట్‌లో విహరించే వాళ్ళలో కనీసం 80 శాతం మంది లైంగిక ప్రేరేపిత (పోర్నో) సైట్లు చూస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇలా చూసే వాళ్ళలో 14 నుండి 20 ఏళ్ల నవ యువకులు ఎక్కువగా ఉంటారని సర్వేల్లో వెల్లడయిన నిజం. ఆడపిల్లను అంగడి బొమ్మగా మార్చి, తమ సొంత కూతుళ్లను, తోబుట్టువుల్ని, సాటి ఆడపిల్లల్ని వివస్త్రలుగా చేసి, ఫోటోలు, వీడియోలు తీసి, అలా వచ్చిన దరిద్రపు సొమ్ముని వ్యాపారం చేస్తున్నామని ప్రకటించుకోవడం పాశ్చాత్య దేశాల్లో చేతనయినంతగా మరే దేశం వారికీ రాదు. నైతికంగా దిగజారిన అటువంటి సమాజంలోని పెనుపోకడలు ఇప్పుడు భారతీయ సమాజంపై పడడానికి ముఖ్య కారణం అంతర్జాలమే. దేశాల మధ్య సమాచార వారధి సృష్టించిన అంతర్జాలం ఇప్పుడు లైంగిక విషపురుగుగా తయారయింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో 'సెక్స్‌' అనే పదాన్ని వెతకమని చెబితే 25 లక్షల పైచిలుకు వెబ్‌సైట్స్‌ దర్శనమిస్తాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది అమాయక బాలికలు, ఆడపిల్లలు, యువతులు ఈ వెబ్‌ మహమ్మారి బారిన పడుతున్నారో అర్థం అవుతుంది. పైగా అమెరికా వంటి దేశాల్లో ఆడపిల్లల్ని నగ్నంగా ఫోటోలు తీసి అమ్ముకోవడం ఒక పరిశ్రమ. దానికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ పరిశ్రమ ముసుగులో ఎంత మంది అమాయక ఆడపిల్లలు దారుణంగా బలయిపోతున్నారో తెలుసుకుంటే గుండెలు పగిలిపోతాయి. ముందు కేవలం నగ్నంగా ఫోటోలు తీస్తామని చెప్పి తరువాత అత్యాచారం చేసి, ఇక వారిని శాశ్వతంగా ఆ రొంపిలోనే కూరుకుపోయేలా చేస్తారు ఈ వెబ్‌సైట్ల నిర్వాహకులు. ఈ పైత్యపు సైట్లు నిర్వహించే దేశాల్లో పరిస్థితులు ఇలా ఉంటే, మనలాంటి సాంప్రదాయ దేశాల్లో ఈ అంతర్జాలం వల్ల మరో విధమైన ప్రమాదం జరుగుతోంది. భారతీయ మహిళలు సహజంగానే సున్నిత మనస్కులు, సాంప్రదాయాలకి ఎక్కువ విలువనిస్తారు. అటువంటిది ఒకేసారి, ఇటువంటి వెబ్‌సైట్ల ప్రభావం వలన మగ స్నేహితులు లేదా భర్త వారిని అసహజ ప్రవర్తనకు ప్రేరేపించడం వంటివి చేస్తున్నారు. దాని వల్ల వారు మానసికంగా, శారీరకంగా పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇవే వారిని పరాయి ఆడపిల్లలపై అత్యాచారాల వంటి వాటికి పురికొల్పుతున్నాయి.

    మహిళల్ని కేవలం లైంగిక వస్తువులుగా చూపించే ఇటువంటి సైట్లు, సినిమాల వలన స్త్రీ అంటే కేవలం లైంగికంగా ఉపయోగపడే వస్తువు మాత్రమే అనే భావన యువకుల్లో కలుగుతోంది. ఆయా సినిమాల్లో చూపించే డబ్బుకు అమ్ముడుపోయే కొంత మంది నైతికంగా పతనమయిన ఆడవాళ్ళ వల్ల లోకంగా ప్రతీ ఆడపిల్లని ఇంతే తేలికగా లోబర్చుకోవచ్చుననే ఒక చులకన భావన, తప్పుడు అభిప్రాయం యువకుల్లో కలుగుతుంది. లోకంలో అమ్మాయిల శరీర అవయవాల్ని (అనాటమీ) చూపించే వెబ్‌సైట్లకు కొదవలేదు. కాని ఒక ఆడపిల్ల మనసులో ఏముందో, అదెంత లోతయినదో తెలియచెప్పే వెబ్‌సైట్స్‌ ఏమయినా ఉన్నాయా? ఆడపిల్ల కనబడగానే ప్రపోజ్‌ చేయడం, ఆనక వెంటబడడం, ఒకవేళ ఇంకెవర్నో అప్పటికే ప్రేమించి ఉన్నా సరే, మన వైపు తిప్పుకోవడం ఎలా అనే దిక్కుమాలిన కాన్సెప్ట్‌ల మీదే ఇప్పటి సినిమా, సీరియల్స్‌ నడుస్తున్నాయి. అటువంటి ఛండాలపు పనులు చేసే వాళ్ళే నేటి మన వెండితెర హీరోలు. ముందు ఇటువంటి వాటిని నియంత్రించాలి. 'ఎ' సర్టిఫికెట్‌ సినిమాలకి కూడా చిన్న పిల్లల్ని తీసుకెళ్లి చూపించే తల్లిదండ్రులకు నేటి సమాజంలో కొదవ లేదు. పిల్లలు లేకుండా వెళ్ళడం కుదరకపోతే వెళ్ళడం మానేయాలి. అంతేగాని చిన్న పిల్లల్ని కూడా అటువంటి సినిమాలకు తీసుకువెళ్ళి లేదా సీరియళ్ళు చూపించి వారి లేత మనసుల్ని కలుషితం చేయకూడదు.

 పాశ్చాత్యీకరణ: 
 
'పొరుగింటి పుల్ల కూర రుచి' అనే సామెత నేటి సమాజానికి సరిగ్గా అన్వయిస్తుంది. సనాతన భారతీయ సంస్క ృతిని వదిలి, పరాయి సాంప్రదాయం వెంట పడడం వల్ల సహజంగానే అనర్థం వస్తుంది. భాష ఎలాగో సగం మారిపోయింది. దుస్తులు సరేసరి, ఇప్పుడు మనసు కూడా మార్చేసుకుని మారు మనసు పొందితే సరి. బాయ్‌ ఫ్రెండ్‌ సంస్క ృతి, సగం శరీరం బయటపడేలా దుస్తులు, నైట్‌ క్లబ్‌లు, పబ్బుల సంస్క ృతి, మాదక ద్రవ్యాల వాడకం వంటి వాటి వల్ల కూడా యువతులకు హాని కలుగుతోంది. ఇలా సమాజం భ్రష్టు పట్టినపుడు ముందుగా బలయ్యేది మహిళలు మాత్రమే. 'డ్యాన్స్‌ బేబి', ఆట వంటి చిన్ని తెర కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని పాల్గొనేలా ప్రోత్సహించడం, శరీరాన్ని ప్రదర్శించడమే అన్నిటి కన్నా గొప్ప గౌరవం అనిపించేలా పిల్లల్ని ప్రలోభపెట్టడం, వారు పెరిగి పెద్దయిన తరువాత సమాజం పట్ల వారి నడవడికను, వ్యక్తిగతంగా వారు పడే ఇబ్బందుల్ని చూసి తీరిగ్గా ఏడవడం... ఇవన్నీ నేటి ఆధునిక తల్లిదండ్రుల సహజ సుగుణాలు. ముందు మనం మారి పిల్లల చేత మమ్మీ, డాడీ బదులు అమ్మా, నాన్నా అని పిలిపించుకుంటే చాలా రుగ్మతలు వదులుతాయి. నీతి కధలు చెప్పే నానమ్మలు, తాతయ్యలు ఎలాగో వృద్ధాశ్రమంలో మగ్గుతున్నారు. చందమామ వంటి పత్రికలు చదివే అలవాటు పిల్లలకి లేదు. వెధవ పనులు చేసే పాశ్చాత్య దేశాల హీరో లందరూ వీళ్ళకి ఆదర్శప్రాయులే. బాల హనుమాన్‌ టీవీలో వస్తే, చిన్నప్పటి నుండీ ఇటువంటివి ఎందుకని కొందరు, మనం ఇప్పుడు కొత్తగా ఫారిన్‌ మతం తీసుకున్నాం కాబట్టి, టామ్‌ అండ్‌ జెర్రీ తన్నులాటలు చూడమని ప్రోత్సహించే తల్లిదండ్రుల ఉన్నంత కాలం పిల్లలకి సుగుణాలు రమ్మంటే ఎక్కడ నుండి వస్తాయి?
 
విద్యావ్యవస్థ: 
 
ఈ పాపంలో విద్యా వ్యవస్థకి కూడా భాగం ఉంది. నేటి చదువులు ఎందుకూ పనికిరాని జీవం లేని వ్యర్థం మాత్రమే. భౌతిక పరమైన అభివృద్ధికి, నూతన వస్తు ఆవిష్కరణకి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి గాని సమాజం కొన్ని వేల సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రయాణించడానికి, మానసికంగా ఎదుగుదలకు, పశుస్థాయి నుండి మానవస్థాయికి మారడానికి  ఏ విధంగాను దోహదపడవు. 'కనకపు సింహాసనమున శునకము కూర్చొండబెట్టిన' అని సుమతీకారుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే సెలవిచ్చినట్లు, నేటి మనుషులమని చెప్పుకునే వారు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అది మనం కళ్ళెదురుగా చూస్తూనే ఉన్నాం. కుక్కని తీసుకెళ్ళి, ఎ.సి. రూమ్‌లో మెత్తటి ఫోమ్‌ బెడ్‌ వేసి పడుకోబెట్టి, 3జి కనెక్షన్‌ ఫోన్‌ ఇచ్చి, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ పెట్టించి, దాని మెడలో బాగా చదివినట్టు ఒక డిగ్రీ సర్టిఫికెట్‌ వేళాడదీసినంత మాత్రాన అది మానవత్వం ఉన్న మనిషి అవదు. పాత చెప్పు ముక్క కనబడగానే చెంగున దూకి దాన్ని అందుకుంటుంది. అలా ఉంది నేటి యువత పరిస్థితి. మారాల్సింది వస్తుగత స్థాయి కాదు, మానసిక స్థాయి. పూర్వపు గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ముందుగా మానవ ధర్మం గురించి నేర్పేవారు. పాఠ్యాంశాలు కూడా 'మాతృ దేవో భవ, పితృ దేవో భవ' అంటూ ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, మొత్తం మానవ సమాజం పట్ల నెరవేర్చవలసిన బాధ్యతను అనుక్షణం గుర్తు చేసేవి. ముందుగా అవన్నీ నేర్చుకున్నాక, ఆ వ్యక్తి కులవృత్తిని నేర్పేవారు. అంటే ఒక వ్యక్తి వృత్తి ఏదయినప్పటికీ, సమాజంలో అంతర్భాగంగానే దానికి అనుకూలంగానే నడిచేవాడు. కాని, ఇప్పుడు ధర్మం బదులు ధనం చేరింది. ఏ విద్యనయినా డబ్బు తీసుకుని నేర్పుతున్నారు. యంత్ర శాస్త్రం (ఇంజినీరింగ్‌) వంటివి పనిని ఎంత బాగా చేయగలమనే దానిపైనే దృష్టి పెడుతున్నాయి తప్ప మనిషిగా ఎంత ఎదగాలో, ఎలా ఎదగాలో ఎవ్వరూ నేర్పించడం లేదు. ఎందుకంటే వాటిని నేర్పే గురువులు కూడా ఆ తానులో ముక్కలే కాబట్టి. గురువులే తాము చదువు చెప్పే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే, వారి దగ్గర చదువుకునే విద్యార్థులు కూడా అదే బాట పడుతున్నారు. ఎనిమిది మంది కలిసి పశువుల్లాగా ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా అత్యాచారం స్థాయి వరకు దిగజారాం. ఇక్కడతో ఆగుదామా? లేదా తుపాకి తీసుకుని ముందు తల్లిని చంపి తరువాత 28 మంది చిన్న పిల్లల్ని, చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం జరిగిన అమెరికా స్థాయికి కూడా దిగజారదామా? ఎందుకంటే అన్నిటికీ మనకు ఆదర్శప్రాయం అమెరికాయో, రష్యాయో మాత్రమే కదా.
 
ప్రభుత్వం - చట్టాలు: 
 
ఇప్పటి ప్రభుత్వాలన్నీ రాజకీయ పార్టీలే. పార్టీ ఎజెండాయే ప్రభుత్వ ఎజెండా. అవెప్పుడూ కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదిక మీదనే అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరచడమే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. చట్టాల రూపకల్పలో గాని, వాటి అమలులో గాని, విశాల సమాజ హితం వాటికి పట్టనే పట్టదు. పార్లమెంటు దాడి కేసులో నిందితుడికి శిక్ష విధించడంలో జాప్యం చేయడం - అతడు కేవలం ఒక ప్రత్యేకమైన మతానికి చెందిన వాడు కావడమే అనేది బహిరంగ రహస్యం. ఆడపిల్లల పట్ల నేరాల్ని అదుపు చేయడంలోను, నిందితులకు కఠిన శిక్షలు విధించడంలోను అదే అలసత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికి ఎరుక? దాని కన్నా కళ్ళుండీ గుడ్డి వాడిలా నటిస్తే ఏ గొడవా ఉండదు. లేదా ఇటువంటి సంఘటనలకు కారణం ప్రభుత్వాధినేతలు, అధికారులు, లేదా వారి వంశాంకురాలో కారణమయి ఉంటే, ఇక నిందితుల్ని రక్షించడానికి చట్టాలకి తూట్లు పొడవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాగ్రహం, ప్రత్యేకించి ప్రభుత్వంపై, దాని పాలనపై యువత పోరాటం చేయడం సహేతుకమే. సమర్థనీయమే. నిందితులకు కఠిన శిక్షలు విధించడం వంటివి చేస్తేనే సమాజంలో నేరాల రేటు కొంత శాతమైనా తగ్గుతుంది. ఒక చిట్టితల్లిపై అకారణంగా దాడిచేసి, అమె వేదనకు కారణమైన మృగాలకి మరణ శిక్ష మాత్రమే సరైన శిక్ష. మన శరీరం మీద వాలి కొద్ది పాటి రక్తం తాగినందుకే దోమని ఒక్క దెబ్బ కొట్టి చంపుతాం కదా. అటువంటిది ఒక అమ్మాయిని శారీరకంగా, మానసికంగా హింసించి, ఆమె శాశ్వత అంగవైకల్యానికి లేదా మృతికి కారణమవుతున్న వికృత మనస్తత్వం గల దుర్మార్గులకు సమాజంలో చోటు లేకుండా చేయడం సరైన పనే. అటువంటి వారి వల్ల, లేదా వారు మారినట్లు కనిపించినా, వారి వల్ల సమాజానికి ఎటువంటి మేలు జరుగదు. వారు లేకపోవడం వల్ల ఎటువంటి కీడూ జరగదు. పైగా అటువంటి తప్పు మరొకరు చేయడానికి భయపడతారు.
 
 ప్రకృతి పరమైన కారణాలు: 
 
మానసిక శాస్త్ర రీత్యా పరిశీలిస్తే ప్రకృతి పరంగానే స్త్రీ పురుషుల మనస్తత్వాలలో చాలా తేడాలుంటాయి. అంతెందుకు? లైంగిక చర్య పరంగానే ప్రకృతిలో మిగతా ఉన్నత స్థాయి జంతువులకి, మనుషులకి బేధముంది. జంతువులు ఆయా కాలాల్లో మాత్రమే లైంగిక ఆసక్తిని ప్రదర్శిస్తాయి లేదా అటువంటి చర్యల్లో పాల్గొంటాయి. కాని, మనుషుల్లో మాత్రం - అది వరమో శాపమో తెలియదు గాని - యుక్త వయసుకి వచ్చినప్పటి నుండి వార్థక్యం వచ్చే వరకు లైంగిక ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక స్త్రీ పురుషుల విషయానికి వస్తే, లైంగిక ఆసక్తి పరంగా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మగవాళ్లు కేవలం దృశ్య పరంగా ఉద్రేకం పొందుతారు. అంటే అందమైన ఆడవాళ్ళను చూసినపుడు గాని, లేదా లైంగిక పరమైన అంశాల గురించి వినడం వల్లనే కోరిక పుడుతుంది. అందుకనే అటువంటి వ్యాపార ప్రకటనలకి, సినిమాలకి అంతటి ప్రాధాన్యత మరియు సంచలనం. వాటిలో కూడా స్త్రీలను మాత్రమే ఆకర్షక సాధనంగా చూపిస్తారు. ప్రతి పురుషుడిలోను కొంత స్థాయిలో కామం ఉంటుంది. కాని, ఇంటర్‌నెట్‌ వంటి మాధ్యమాల వల్ల గాని, సెల్‌లోగాని కామాన్ని కలిగించే విషయాన్ని చూడడం వల్ల కామాసక్తి మరింత ఎక్కువయ్యి, హద్దులు దాటి, అనైతిక ప్రవర్తనకి కారణమవుతుంది. కాని స్త్రీల విషయంలో అది పూర్తిగా వ్యతిరేకం. వారు రూపం కంటే గుణం కోరుకుంటారు. అంటే భర్త పెద్ద అందగాడు కానక్కర్లేదు గాని తనను ప్రేమగా చూసుకుంటే చాలనుకుంటుంది స్త్రీ. ఆమె ఎప్పుడూ ప్రేమను కోరుకుంటుంది. అందుకే భర్త పెద్దగా అందంగా లేకపోయినా, ఎక్కువ సంపాదనా పరుడు కాకపోయినా, తనను తాను పూర్తిగా అర్పించుకుంటుంది. అదే స్త్రీ ప్రేమలోని గొప్పదనం. కాని, కొన్ని పాశ్చాత్య దేశాలు స్త్రీకి కూడా పురుషుడితో సమానంగా లైంగిక ఆసక్తి ఉంటుందని, కొండొకచో ఎక్కువగానే ఉంటుందని, కాని దాన్ని వెల్లడి చేయలేదని... ఇటువంటి తప్పుడు వాదనలతో విష ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని చదివిన యువకులు కూడా అది నిజమేనని భ్రమించి, ఆడపిల్లల అభిప్రాయం, వారి మానసిన స్థితి వంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా, ప్రేమ పేరుతోను, లైంగిక చర్యల పేరుతోను వారిని వెంటాడి, వేధిస్తుంటారు. అయినా సరే వారు ఒప్పుకోకపోయే సరికి, తమ అభిప్రాయం నిజం కాలేనందుకు ఉక్రోషంతో వారిపై అమానుషంగా కత్తులతోను, యాసిడ్‌తోను దాడులు చేస్తారు. ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో అమ్మాయిలు 'మా దుస్తులపై ఆంక్షలు విదించడం కాదు - మగవారిని బుద్ధి మార్చుకోమనండి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాని అర్థం ఏమిటంటే ఆంక్షలు, చట్టాలు విధించడం వల్ల పరిస్థితి మరింత విషమిస్తుందే తప్ప అది పరిష్కారం కానే కాదు. చట్టాలు చేసే కన్నా, ఆంక్షలు విదించే కన్నా సమాజాన్ని సంస్కరించడమే మనం చేయగలిగిన మహోపకారం. చట్టాల వల్ల వచ్చే ప్రయోజనం తాత్కాలికమైతే, సమాజంలో సంస్కారాన్ని పెంచడం వల్ల వచ్చే ప్రయోజనాలు శాశ్వతంగా, దీర్ఘ కాలికంగా ఉంటాయి.

    స్త్రీపురుష సంబంధాలలో హుందాగా, పరిపక్వతతో వ్యవహరించడాన్నే సంస్కారమంటారు. అది వ్యక్తి మతాన్ని బట్టి, వారి సంస్కృతిని బట్టి మారుతుంటుంది. అందుకనే ఒక మతాన్ని ఎక్కువగా అవలంభించే దేశాల్లో స్త్రీని పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్చేసారు. ఆమె శరీరమే అంగడి సరుకయిపోయింది. కొంత భాగం చూపించాలంటే ఒక రేటు - పూర్తిగా చూపించాలంటే మరో రేటు - ఇదీ వారి దౌర్భాగ్యం. వారి మతంలో స్త్రీ ఎట్టి పరిస్థితిలోను అలంకరించుకోకూడదు. ఇక మరో మతం పూర్తిగా అవలంభించే దేశాల్లో స్త్రీల దుస్థితి వర్ణనాతీతం. శరీరంలో ఏ భాగం కనిపించకుండా పూర్తిగా దాచేయాలి లేదా కప్పేసుకోవాలి. ఆఖరికి కాళ్లు కూడా బయటకి కనిపించకూడదు. ఎందుకంటే ఏది కనిపించినా మగవాళ్ళ దౌష్ట్యానికి బలయిపోతుందనే వాదన వినిపిస్తారు. అది నిజం కూడా. కఠిన శిక్షల ద్వారా మాత్రమే పరిస్థితిని అదుపులో ఉంచగలమనే భావనలో వారు ఉంటారు.

    కాని ఒక్క భారతీయ సంస్కృతిలో మాత్రమే రెండింటికీ సమన్వయం సాధించారు. స్త్రీ ఎప్పుడూ చక్కని అలంకరణ కలిగి ఉండాలి. నుదుటన బొట్టుతో, చక్కటి పొడవైన జుట్టుతో లక్ష్మీ దేవిలా భాసిల్లాలి. సర్వ మంగళ స్వరూపిణిగా ఉండాలి. మందస్మితంగా ఉండాలి. ఆమెకు సమాజ పరంగా ఎటువంటి ఆంక్షలు లేవు. స్వేచ్ఛగా ఉండొచ్చు. భర్తతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆమె లేకపోతే పురుషుడు చేసే ఏ యజ్ఞమైనా యాగమైనా ఫలితాన్నివ్వదు. పరాయి పురుషుల్ని సోదరుల్లా భావించాలి. ఇదీ స్త్రీకి భారతీయ సమాజం ఇచ్చిన గౌరవం.

    అదే సమయంలో మగవారికి కూడా కొన్ని సుద్దులు నేర్పింది. పరాయి స్త్రీ ఎదురయితే గౌరవంగా పక్కకి తొలగాలి. ఆపదలో ఉన్న స్త్రీని సోదరిలా భావించాలి. పరాయి స్త్రీ ఎవరిని పలకరించాల్సి వచ్చినా 'అమ్మా' అని పలకరించాలి. ఎక్కడ ఒక ఆడది కన్నీరు పెడుతుందో, ఆ యింటిలో సిరి సంపదలు తొలగిపోతాయని శాస్త్ర కారుడి శాసనం. స్త్రీని గౌరవిస్తే, అక్కడ సర్వ దేవతలు ఆనందంగా ఉంటారని శాస్త్ర వచనం. అటు ఆడవారి గౌరవాన్ని కాపాడుతూనే, మగవారిని కూడా మృగాల్లా కాకుండా వారిని ప్రేమగా చూసుకునే రక్షకుల్లా ఉండమని శాస్త్ర నిర్దేశం. కామాన్ని నిషేధిత వస్తువుగా కాకుండా, మానవ ధర్మాలలో ఒకటిగా (ధర్మ, అర్థ, కామ, మోక్ష) చూపిస్తూనే, కామాన్ని సైతం ధర్మానికి అనుగుణంగా పొందమని విధి నిర్దేశించారు మన పెద్దలు. పరాయి స్త్రీ పొందు కోరడం వలన ఎటువంటి ఇబ్బందులు పడతారో, ఎంతటి గొప్పవారయినా ఎలా పతనమయిపోతారో రామాయణంలో రావణుడి ద్వారా, మహా భారతంలో దుర్యోధన, దుశ్శాసన పాత్రల ద్వారా నిరూపించి, సమాజాన్ని మంచి నడవడికలో పెట్టే ప్రయత్నం చేసారు. రాఖీ పూర్ణిమ వంటి పండుగల్ని పెట్టి, సొంత తోబుట్టువులే కాకుండా, పరాయి ఆడపిల్ల ఎవరు రాఖీ కట్టినా, ఆమెను తన సొంత సోదరిగా భావించి, జీవితాంతం ఆమె రక్షణ బాధ్యత వహిస్తానని ఒక అన్నగా మాటివ్వాలి అని సంప్రదాయం పెట్టారు. ఆడపిల్ల అంటే కేవలం లైంగిక వస్తువు మాత్రమే కాదు. ప్రేమను పంచే దేవత కూడా. ఇవన్నీ గుర్తు పెట్టుకుని, రాబోయే తరానికి కూడా ఈ విలువల్ని నేర్పాలి. పాశ్చాత్య వస్తువుల్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలిగాని, వారి ఆలోచనా విధానాన్ని, వారి మతాన్ని కూడా దిగుమతి చేసుకుని, అభాసుపాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు మరలా మరలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనందరి మీదా ఉంది.

Saturday, October 27, 2012

దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు - మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు





మనసు మూగబోయింది

మాటలు రాక కాదు - మాటలు లేక

చిట్టితల్లి సాన్వి ఇకలేదని తెలిసాక

చదువుకుంటానన్నందుకు మొన్న మాలాల

ఏపాపం తెలియని వయసులో నేడు సాన్వి

దేశాలు మారినా, మతాలు మారినా

మానవ మృగాల దారుణాలు

కన్నీటితో నిండిన శోకతప్త హృదయాలు...

విముక్తిలేదా చిన్నారులకు


దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు

మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు