Pages

Monday, June 12, 2023

ఇందులో అద్భుతం ఏమీ లేదు... ప్రకృతి తానేమిటో నిరూపించుకుంది.....

ప్రకృతి తనకు దగ్గరగా ఉండి, తనలో ఇమిడిపోయే జీవుల్ని ప్రేమగా చూసుకుంటుంది. వాటికి ఎటువంటి హానీ కలుగనివ్వదు. దానికి సజీవ ఉదాహరణే... కొలంబియాలో జరిగిన ఘటన.

కారడవిలో కూలిపోయిన విమానంలో ప్రయాణిస్తున్న పిల్లల తల్లి, పైలట్‌, గైడ్‌ అందరూ చనిపోయారు. కాని అదే విమానంలో ప్రయాణిస్తున్న 11, 9, 4 సం॥ల వయసున్న పిల్లలు క్షేమంగా బయటపడడం విశేషం.. మరొక అద్భుతం ఏమిటంటే.. వారిలో 11 నెలల చిన్నారి కూడా ఉండడం. వీరందరూ దట్టమైన కారడవిలో 40 రోజుల పాటు క్షేమంగా, సజీవంగా ఉన్నారు. ఇది మరింత అద్భుతం.

నిజానికి మనందరికీ ఈ సంఘటన చాలా అద్భుతంగా కనిపించవచ్చు. కాని, జాగ్రత్తగా ఆలోచిస్తే... ప్రకృతిలో ఇవన్నీ సహజమే అని తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కోట్ల జీవులు వున్నాయి. అవన్నీ ప్రకృతికి అతి దగ్గరగా జీవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ ప్రకృతిలో కలిసిపోయి వున్నాయి. సృష్టి మొత్తం మీద అత్యంత తెలివైన జీవిని అని విర్రవీగే మనిషి మాత్రం రోజు, రోజుకీ ప్రకృతి నుండి దూరం అయిపోతున్నారు. అలా దూరం అయిపోవడం వలన తనకు కలిగే కష్టాలు,  ఆకలి, అనారోగ్యాలు, ప్రకృతి విపత్తులు... వీటన్నిటికీ ప్రకృతి కారణమని నిందిస్తున్నాడు. అన్ని జీవులు తమకు కలిగే అనారోగ్యాలకు, వ్యాధులకు ప్రకృతిలోనే మందులను వెతుక్కుంటాయి. వాటి ఆహారంలో మార్పులు చేసుకుంటాయి. ఆయా కాలాలకు తగ్గట్టుగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ, అనారోగ్యం బారిన పడకుండా ఆనందంగా జీవిస్తున్నాయి.

కాని మనిషి మాత్రం ఆధునిక నాగరికత పేరుతో ప్రకృతి దూరం అవ్వడమే కాకుండా, ప్రకృతిని నాశనం చేసి, సమస్త సృష్టికి ద్రోహం చేస్తున్నాడు. వేళకు నిద్రపోకుండా, వేళకు లేవకుండా, సహజంగా దొరికే ఆహారాన్ని తినకుండా, దానిలో అడ్డమైన కెమికల్స్‌ కలిపి తింటూ, తన ఆరోగ్యానికి తానే తూట్లు పొడుచుకొంటున్నాడు. తిరిగి ఆరోగ్యవంతుడు కావడానికి కూడా అదే ప్రకృతిని పాడు చేస్తున్నాడు. నిజానికి మనకు వచ్చే అనారోగ్యాలలో 90 శాతం వరకు ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వలనే వస్తాయి. మన జీవన అలవాట్లను మర్చుకోవడం ద్వారా చాలా వరకు అనారోగ్యాలను దూరం చేసుకుని, ఆనందంగా జీవించవచ్చు. భారతీయ జీవన విధానం ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతో మంది మహర్షులు, శాస్త్రవేత్తలు ఈ దేశంలో అత్యుత్తమ జీవన విధానాన్ని రూపొందించి ఇచ్చారు. ఆధునికత పేరుతో ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని ఆహారపు అలవాట్లని, వింత వింత జీవన విధానాలను అవలంబించి, మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాము.

పై సంఘటన ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే... పసిపిల్లలు ఎంత అమాయకంగా ప్రకృతికి దగ్గరగా, అడవి అమ్మ ఒడిలో సురక్షితంగా ఉన్నారో, అదే విధంగా మనం కూడా సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉంటూ, ఎటువంటి చెట్ల నుండి వచ్చే చల్లటి గాలి పీలుస్తూ, సహజ జలవనరుల్ని కలుషితం చేయకుండా, అదే నీటిని తాగుతూ, ప్రతి రోజు కొద్దిసేపైనా సూర్యకాంతిని శరీరమంతా తగిలేలా వ్యాయామం, ఆసనాలు వేస్తూ, చక్కటి శాకాహారం తీసుకుంటూ ఉంటే మనం కూడా ఆ పిల్లల్లాగా సురక్షితంగా ఉంటాం. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ఆ ప్రకృతి మనల్ని అమ్మలా రక్షిస్తుంది.. తన చల్లటి ఒడిలో పసిపాపల్లా మనల్ని పోషిస్తుంది.. కాపాడుకుంటుంది.... సర్వేజనా స్సుఖినో భవంతు...

Monday, June 27, 2022

మాతృభాషను మరవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గారు


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, మన తెలుగువాడు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గారు విదేశీ గడ్డపై తనకున్న తెలుగు భాషాభిమానాన్ని చాటిచెప్పారు. ఆయన గతంలో కూడా ఎన్నో సార్లు ఎన్నో వేదికలపై తెలుగు భాష గొప్పదనాన్ని ఉటంకించారు. ప్రతి మనిషికి కన్నతల్లి, పుట్టినగడ్డ, అమ్మభాషపై మమకారం అత్యంత సహజం. కాని దానిని కాదనుకుని పరభాషపై మమకారాన్ని పెంచుకోవడం కన్నతల్లిని కాదని సవతి తల్లి పంచన చేరడం వంటిదే. 

ఎన్నో సొబగులు, అలంకారాలు, నుడికారాలు, పలకడంలో కమ్మదనం వంటివి తెలుగు భాషకు ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టాయి. కేవలం శబ్ద సౌందర్య పరంగానే కాక, అక్షరాలు కూడా ఎంతో పొందికగా, బింకంగా ఉంటూ పలికేవారితో పాటు, చూసేవారికి కూడా చవులూరిస్తాయి తెలుగు అక్షరాలు. ‘‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’’ అంటారు ప్రముఖ కవి మన్నెంకొండ బాలగంగాధర్‌ తిలక్‌. ఆధునిక కవులతో పాటు, తెలుగు కన్నడ నేలల్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కవి రాజు ‘‘శ్రీకృష్ణదేవరాయలు’’ చక్రవర్తి మాత్రమే కాక స్వయంగా కవి కూడా. ఆయన రాసిన ‘‘ఆముక్త మాల్యద’’ కావ్యం అజరామరమైనది. అటువంటి మహారాజు నోటివెంట ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని వినడమే ప్రతి తెలుగు వాడికి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషకున్న గొప్పదనాన్ని గ్రహించినందువల్లనే తెలుగులో విశేష కృషి సలిపి, మొట్టమొదటి తెలుగు ఆంగ్ల నిఘంటువును వెలువరించాడు. ఆయన నిఘంటువుని పరిశీలిస్తే, కేవలం తెలుగుకు ఆంగ్లపదాన్ని చెప్పడమే కాకుండా, ఆయా పదాలు రామాయణ, భారత పురాణాలు, వేమన, సుమతీ శతకాలలో ఏఏ సందర్భాలలో ప్రస్తావించబడ్డాయో సోదాహణగా తెలియజేసారు. అటువంటి బ్రౌణ్య నిఘంటువును తిరిగేస్తే చాలు, తెలుగు భాష కరతలామలకమవుతుంది. తెలుగు అజంత భాష. అంటే తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. దాని వలన తెలుగుని రాగయుక్తంగా పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అందుకే యూరోపియన్‌ భాషల్లో మరో అజంత భాష అయిన ‘‘ఇటాలియన్‌’’తో పోల్చి ‘‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’’ అని యూరోపియన్‌ పండితులచే కీర్తించబడిరది. పోతన పద్యాలు, అన్నమయ్య పదకవితలు తెలుగుకున్న సహజసిద్దమైన అందాన్ని మరింత ఇనుమడిరపజేసాయి అనడంలో సందేహం లేదు. అక్షర సేద్యం చేసే కవులకు, అవధానం చేసే పండితులకు, రాగాలు తీసే గాయకులకు అత్యంత అనువైన మనోహరమైన భాష తెలుగు మాత్రమే. అందుకే జస్టిస్‌ ఎన్‌.వి.రమణగారు తెలుగుని పల్లకిలో పెట్టుకుని, ప్రపంచమంతా మోస్తున్నారు. ఒక తెలుగు వాడిగా ప్రతి ఒక్క తెలుగు వాడికి అనుసరణీయుడు అవుతున్నారు.

ఇటీవలి కాలంలో అమ్మభాషను నిదారించడం ఒక సరికొత్త పోకడగా మొదలయింది. పొట్టకూటి కోసం అయితేనేమి, నలుగురిలో గొప్పగా చెలామణి అయ్యే పేరుతోనేమి పరభాషా మోజు పట్టి, తెలుగును భ్రష్టుపట్టిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులు కూడా ప్రజలకు మాతృభాషను దూరంచేసే పనిలో పోటీ పడుతున్నారు. అసలు తెలుగు నేర్చుకొంటేనే అదేదో నేరం అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుని పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు నేటి పాలకులు. పరాయి భాషను నేర్చుకుంటేనే అభివృద్ధి అని, మనం బ్రతకాలి అంటే అమ్మభాషను చంపేయాలని సుద్దులు చెబుతున్నారు. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు మాతృభాషలోనే చదువుకుని అత్యున్నత స్థానాల్ని అలంకరించారనేది విస్మరించరాదు. వీధి బడిలో చదువుకుని రాష్ట్రపతులు అయినవారు ఉన్నారు. గొప్ప శాస్త్ర వేత్తలుగా అనేక ఆవిష్కరణలు చేసిన వారు కూడా ప్రభుత్వ బడిలోనే ఓనమాలు దిద్దిన వారు అనేది మరువకూడదు.

ప్రపంచంలో ఎన్నో నాగరిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా మాతృభాషలో చదవడం వల్లనే గొప్ప దేశాలుగా మారాయి. జర్మనీ, జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌ వంటి చాలా దేశాల్లో ఇప్పటికీ మాతృభాషకే అగ్రతాంబూలం. ఆంగ్లాన్ని కేవలం అవసరం వరకే నేర్పుతారు. అంతే గాని, పరాయి భాష నేర్చుకొన్నంత మాత్రాన గొప్పవారయి పోతారు అనేది ఒట్టి అపోహ మాత్రమే. పిల్లల్ని ఇంట్లో తాము మాట్లాడే భాష నుండి దూరం చేసి, ఇంగ్లీష్‌లో చిలుకపలుకులు నేర్పితే, వారు బానిస బుద్దితో బయటకు వస్తారు తప్ప, స్వతంత్ర ఆలోచనా పరులై దేశాన్ని ఉద్దరించేది ఏదీ ఉండదు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఒక వేళ బయట బళ్ళో ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదువు నేర్పినప్పటికీ ఇంట్లో తెలుగులో మాట్లాడడం, తెలుగు సంస్కారాన్ని గరపడం, తెలుగు బంధాల్ని అల్లుకోవడం వంటివి పిల్లలకు నేర్పడం తమ బాధ్యతగా చేసుకోవాలి. మాతృభాషని మరిచిన సమాజం చుక్కాని లేని నావలాగా దిక్కులేనిదిగా మారుతుంది. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి భాష ఒక మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి, తెలుగుని పరిరక్షించుకుని, మంచి సమాజం వైపు అడుగులు పడాల్సిన అవసరాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణగారు మరొక్క సారి గుర్తు చేసారు.

Thursday, June 10, 2021

ప్లే బ్యాక్‌ మూవీ రివ్యూ

     కరోనా కాలంలో ‘ఆహా’ ఒ.టి.టి.లో రిలీజైన ఒక చక్కటి మూవీ ‘ప్లే బ్యాక్‌’. సాధారణంగా తెలుగు సినిమాలలో ఉండే 3 ఫైట్లు, 6 పాటలు అనే రొటీన్‌కి భిన్నంగా చక్కటి కథతో, మరింత చక్కటి స్క్రీన్‌ప్లేతో ఈ మూవీని తీసారు. ఈ మూవీ కథ కూడా మన ఊహకి అందకుండా ఉంటుంది. ఇటువంటి భిన్నమైన జోనర్‌లో సినిమా చూసిన తరువాత తెలుగు సినిమాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా, ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్దపెద్ద డైలాగులు, భారీ సెట్టింగులు... ఇటువంటి హడావుడి ఏదీ లేకుండా, కేవలం కథతోనే కట్టిపడేసాడు దర్శకుడు హరిప్రసాద్‌. హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే టైమ్‌ ట్రావెల్‌, టైమ్‌ మెషీన్‌ వంటి కాన్సెప్ట్‌లతో తెలుగులో కూడా చాలా మూవీస్‌ వచ్చాయి. ఆదిత్య 369, 24 వంటి మూవీస్‌లో టైమ్‌ ట్రావెల్‌ గురించి తెలుసుకున్నాం. కాని, గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ టైమ్‌, స్పేస్‌ కంటిన్యూయమ్‌లో ఒక చిన్న క్రాక్‌

ఏర్పడి, అప్పటి వారితో ఇప్పటి వారికి కమ్యూనికేషన్‌ ఏర్పడితే ఏమవుతుందో అనే ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీసాడు దర్శకుడు.

ఇప్పటి వరకు నేను తెలుగు మూవీస్‌కి రివ్యూలు రాయలేదు. నేను తెలుగు సినిమాలు చూడడమే తక్కువ. ఒక వేళ చూసినా, రివ్యూ రాయవలసినంత కంటెంట్‌ ఉన్న చిత్రాలు ఇప్పటి వరకు నేను చూడలేదు... బహుశా తీయలేదు. కాని ఈ మూవీ చూసిన తరువాత, ఇటువంటి మంచి మూవీని, మంచి అభిరుచి ఉన్న వారు ఎవ్వరూ మిస్‌ అవ్వకూడదు అనిపించింది. 

కథ విషయానికి వస్తే, 1993లో ఉన్న యువతికి, ప్రస్తుతం 2020లో ఉన్న యువకుడికి మధ్య ఒక పాత టెలిఫోన్‌ ద్వారా కమ్యూనికేషన్‌ ఏర్పడుతుంది. అంటే టైమ్‌ లైన్‌లో గతంలో ఉండే వ్యక్తులు, ప్రస్తుతం ఉన్న వారు మాట్లాడుకోగలుగుతారు. నిజానికి గతంలో ఉండే యువతి ప్రస్తుతం చనిపోయి ఉంటుంది. కాని, ప్రస్తుతం ఉన్న యువకుడు ఆ విషయం తెలుసుకుని, గతంలో ఉన్న యువతికి సహాయం చేసి, ఏ విధంగా తన ప్రాణాలు కాపాడాడు అన్నది సినిమా కథాంశం. ఆ యువతికి, తన ప్రాణాలు కాపాడిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెబితే సినిమాలో థ్రిల్‌ ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది అమ్మ సెంటిమెంట్‌. అమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం కొడుకు ఎంత రిస్క్‌ చేసాడు అనేది కూడా అంతర్లీనంగా చాలా బాగా చూపించారు. 

కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. చక్కటి ప్రెజెంటేషన్‌ చేసాడు. ఎక్కడా ఎటువంటి తికమక లేకుండా గతానికి, వర్తమానానికి మధ్య తేడాని చూపిస్తూ, సాధారణ ప్రేక్షకుడికి కూడా కష్టమైన ఫిజిక్స్‌ సూత్రాలని అర్ధమయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. నటీనటుల్లో ‘వకీల్‌సాబ్‌’లో నటించిన అనన్య చాలా చక్కటి అభినయం కనబరిచింది. 1993 నాటి ఆమ్మాయిలు ఎంత అమాయకంగా ఉండేవారో అంతే అమాయకంగా నటించింది. నటనా పరంగా తనకి చక్కటి భవిష్యత్తు ఉంది అనిపించేలా చేసింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో చక్కగా నటించారు. కెమెరా పనితనం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాకి హైలైట్‌ గా ఉంది. మంచి అభిరుచి గల ప్రేక్షకులు తప్పని సరిగా చూడతగిన సినిమా ఇది. తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన మూవీగా ఈ ‘ప్లే బ్యాక్‌’ ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తుండి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Sunday, September 13, 2020

చాలా కాలం తరువాత.... మరలా మీ ముందుకు...

సరదా బ్లాగ్ వీక్షకులకు నమస్కారం. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వలన బ్లాగింగ్ కు దూరం అయ్యాను. ఇప్పుడు మరలా మీ అందరిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో వలే ఇకమీదట కూడా నేను పెట్టబోయే బ్లాగులను చదివి ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

Sunday, June 23, 2019

గోదారమ్మకి దిక్కెవరు...?



వేసవి కాలం సెలవులకి పిల్లలతో కలిసి రాజమండ్రి విహార యాత్రకు వెళ్ళాము. ముందుగా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర కొంత సేపు ఆగాము. గోదావరి అందాల్ని ఆస్వాదించి, అక్కడి నుండి రాజమండ్రి వెళ్ళాము. గోదావరి గట్టు వెంబడి కార్పొరేషన్‌ వాళ్ళు పెంచిన అందమైన గార్డెన్స్‌ చూడడానికి రోడ్‌ పక్కన కార్‌ పార్క్‌ చేసి, లోపలికి వెళ్ళాము. చాలా అందంగా తీర్చిదిద్దారు. తీరా లోపలికి వెళ్ళాక, మురుగు కంపు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందా అని రైలింగ్‌ నుండి కిందకి చూస్తే, పట్టణంలో ఉన్న మురుగునీటి కాలువని డైరెక్ట్‌గా గోదావరి నదిలోకి పెట్టేసారు. ఎక్కడెక్కడి మురుగు, ప్లాస్టిక్‌, చెత్త అంతా గోదావరిలోకి ప్రవహిస్తుంది. చూసి చాలా బాధేసింది. గోదావరిని తల్లిలా, దైవంలా భావిస్తూనే మురుగు నీటితో కలుషితం చేయడం సబబు కాదు. ఆ నీటినే గోదావరి కింద ఉన్న కొన్ని వందల గ్రామాల వారు త్రాగు నీటిగా, సాగు నీటిగా వాడుతూ ఉంటారు. అటువంటి పవిత్రమైన నదిలోకి ఇలా నిర్దాక్షిణ్యంగా మురుగు నీటిని వదలడం చాలా తప్పు. 

నదులను దేవతలుగా పూజించే సంప్రదాయం మనది. ఒక పక్క పూజలు చేస్తూనే మరో పక్క నదులను కలుషితం చేయడం మనకే చెల్లింది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరప్‌ దేశాలలో నదులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. లండన్‌ మధ్య నుండి ప్రవహిస్తున్న థేమ్స్‌ నది కానివ్వండి, పారిస్‌ నగరంలో ప్రవహిస్తున్న డాన్యూబ్‌ నదిని కాని, అక్కడి ప్రజలు చాలా గౌరవంగా చూసుకుంటారు. మనలాగా పూజలు, పండుగలూ చేయకపోయినా, నదుల్ని కలుషితం కానివ్వరు. నీరు స్వచ్ఛంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ నీటిలో ఉండే జలచరాలకు కూడా ఎటువంటి హాని కలుగనివ్వరు. 

ఇదే శ్రద్ధ మనమెందుకు తీసుకోలేము. గోదావరి, కృష్ణాతో పాటుగా రాష్ట్రంలో ప్రవహించే జలవనరుల్ని జాగ్రత్తగా కాపాడుకుని, ముందు తరాలకి అందించవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది. ప్రభుత్వం, అధికారులు దీని మీద శ్రద్ద వహించి, మురుగు నీటిని ఆధునిక పద్దతుల ద్వారా శుద్దిచేసి, దాన్ని మొక్కలు పెంచడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల నీరు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా, ప్రజల్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Monday, August 13, 2018

మూర్ఖత్వానికి పరాకాష్ట

కొన్ని మతాలలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే వృత్తాంతం ఇది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని వైజ్ఞానికంగా రుజువు చేసినందుకు గెలీలియోకు మరణశిక్ష విధించారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రీయ జ్ఞానం కొద్దిగా కూడా లేనివాళ్ళ చేత వ్రాయబడిన మత గ్రంధాన్నే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటామనే మత పెద్దల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాని, అప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేసింది. ప్రాచీన ఖగోళవేత్త అయిన ఆర్యభట్ట - భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రపంచానికి చాటిచెప్పాడు. వేదాలకి అనుబంధంగా ఉండే జ్యోతిషశాస్త్రంలో కూడా వివిధ గ్రహ గతుల్ని ఖచ్చితంగా లెక్కలు కట్టడమే కాకుండా, సూర్యునికి, భూమికి మధ్య దూరాన్ని, భూగోళ వైశాల్యాన్ని, చంద్రుని వ్యాసార్థాన్ని ఇప్పటి లెక్కలకు సరిపోయే రీతిలో సిద్ధాంతాల్ని రూపొందించి ఉంచారు. ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయో, సూర్య, చంద్ర గ్రహణాల అవధుల్ని, అవి ఎప్పుడు సంభవిస్తాయో కూడా పూర్తి శాస్త్రీయంగా లెక్కించగలిగారు. అదీ మన భారతీయ శాస్త్రవేత్తల, మహర్షుల గొప్పదనం.

Sunday, July 15, 2018

అందం చాటున దాగివున్న ముప్పు - ఆడపిల్లలూ.. జాగ్రత్త...

    అమ్మాయిలకున్న బలం - బలహీనత - రెండూ వారి అందం... అందంగా కనబడడం కోసం ఏమైనా చేయడానికి, ఏదైనా పూసుకోవడానికి, ఎంతైనా ఖర్చుపెట్టడానికి వారు సిద్ధం అయిపోతూ ఉంటారు. ఇదిగో... సరిగ్గా ఇదే బలహీనతని సొమ్ము చేసుకోవడానికి వీధి చివర ఉండే బ్యూటీ పార్లర్‌ నుండి బహుళజాతి కంపెనీలు వరకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. రకరకాలుగా ప్రలోభ పెట్టి, తెల్లగా లేకపోతే అదేదో పెద్ద నేరం అయినట్టు, అందరిలోను ఆకర్షణీయంగా కనబడకపోతే ఇక బ్రతుకే లేనట్లుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. అది చూసి, ఎంతో మంది ఆడపిల్లలు, ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు, టి.విలోను, పత్రికల్లోను కనబడే ప్రకటనలు చూసి, ఆయా బూడిదలు... సారీ... ఫేస్‌ పౌడర్లు కొనుక్కుంటూ ఉంటారు. కంపెనీలకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతూ ఉంటారు.


    సరిగ్గా అలాంటి సౌందర్య సాధనాలు తయారుచేసే కంపెనీపైనే అమెరికాలో కొందరు మహిళలు కేసుపెట్టారు. ఆ కంపెనీ తయారు చేసే  పౌడర్‌లో వాడే ఆస్‌బెస్టాస్‌ వల్ల అండాశయ కేన్సర్‌ వచ్చిందని కొందరు మహిళలు కోర్టుకెక్కారు. ఎన్నో పరీక్షలు నిర్వహించిన తరువాత, వైద్య నివేదికలు పరిశీలించిన తరువాత వారు చెప్పింది నిజమేనని కోర్టు తెల్చి, వారికి 31,000 కోట్ల రూపాయిలు పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. (ఇక్కడ నేను పెట్టిన న్యూస్‌ క్లిప్పింగ్‌ - ఈనాడు పత్రికలో 13-7-2018 తేదీన ప్రచురితమైనది). ఈ తీర్పు అందం వెంట పరుగులు తీసే యువతరానికి కనువిప్పు కావాలి.

    బహుళ జాతి సంస్థలు కేవలం లాభాలపైనే దృష్టి సారించి, ఎన్నో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికన్‌ కంపెనీలు నైతిక విలువలకి పూర్తిగా తిలోదకాలిస్తాయి. లాభాల కోసం ఎంతకైనా దిగజారతాయనేది ఎన్నో ఉదంతాలలో రుజువయింది.. ఇక ముందు కూడా రుజువవుతూనే ఉంటుంది. ధమ్స్‌ అప్‌ యాడ్‌లో కింద చిన్న చిన్న అక్షరాలతో ఇది ఆరోగ్యానికి హానికరం అని మీరు గమనించే ఉంటారు. కాని సౌందర్య సాధనాలు (ఫేస్‌ పౌడర్‌లు, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీములు, బాడీ లోషన్‌లు) లో ఎటువంటి హానికర రసాయనాలు వాడతారో, వాటిని ఎలా తయారుచేస్తారో ఎవరికీ తెలియదు. అవి శరీరంపై దీర్ఘ కాలంలో ఎటువంటి దుష్ప్రభావాలు చూపుతాయో ఎవరూ చెప్పరు. ఒక వేళ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా, డబ్బుతోను, అధికారంతోను వారి నోరు నొక్కే  ప్రయత్నం చేస్తారు. బాధ్యత లేని రాజకీయ నాయకులు, లంచాలు మరిగిన ప్రభుత్వ అధికారులు వారికి కొమ్ము కాస్తూ ఉంటారు. అందుకే ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలి.

    అమ్మాయిలు కూడా అందం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అని గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ వాడినంత మాత్రం అందంగా కనబడతామనే అపోహను మానుకోవాలి. అటువంటివి వాడడం వలన స్కిన్‌ ఎలర్జీ వంటి వాటిలో మొదలై, కేన్సర్‌ వంటి భయంకరమైన జబ్బుల బారిన పడతారు. చర్మం తెల్లగా రావడం కోసం వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. అవి దీర్ఘ కాలంలో శరీరంలో చేరి వివిధ అవయవాల పనితీరుని దెబ్బతీసి, చివరకు మరణానికి చేరువ చేస్తాయి. పైగా వాటిని కొనడం కోసం పెట్టే డబ్బు, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక పౌడర్‌ రాసుకోవడం వలన ఒక జబ్బు వస్తే, మళ్ళీ వాటిని నివారించడం కోసం మరో  క్రీమ్‌ రాసుకోవడం... ఇదో విషవలయంలా మారుతుంది.

    మరో ముఖ్య విషయం... ఎటువంటి క్రీములు, లోషన్లు, పౌడర్లు వాడకపోయినా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎంత ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకోండి. భారతీయుల సౌందర్యానికి ముఖ్య కారణం వారుపాటించే సంప్రదాయ సౌందర్య చిట్కాలే. పూర్తి ఆయుర్వేద పరంగా, ప్రకృతిలో సహజంగా దొరికే  పసుపు, సున్నిపిండి శరీరానికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేసేవారు. గంధం చెక్క అరగదీసి, ఆ గంధాన్ని ముఖానికి పట్టిస్తే, చర్మం చల్లబడి, గంధం, పసుపు మంచి యాంటీ బయోటిక్‌గా పనిచేసి, మొటిమలు, బాక్టీరియా వంటివి రాకుండా నివారించి చర్మాన్ని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉంటే అదే అందం... అటువంటి అందమే నిజమైన సౌందర్యం...

Thursday, May 17, 2018

తిరుమల శ్రీవారి ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులు గారికి మద్దతు తెలపడం ప్రతీ హిందువు కర్తవ్యం...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. సిగ్గు లేని రాజకీయాలు దేవాలయంలో కూడా తిష్టవేసుకుని కూర్చున్నాయి. శ్రీవారి ఆలయం గురించి, ఆచారం గురించి, ఆభరణాల గురించి సాక్షాత్తు శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితుల వారే పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. దేవాలయాల్ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసారు. తమకు, పార్టీకి అడుగుకు మడుగులొత్తే తొట్టిగ్యాంగ్‌ని దేవాలయ కమిటీ సభ్యులుగా నియమిస్తే పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. ప్రస్తుతం తితిదే  పాలకవర్గ అధ్యక్షుడిని చేయవద్దంటూ ఎంతమంది హిందువులు విమర్శించినా, ప్రభుత్వం తలొగ్గలేదు. ఇతర మతాల జోలికొస్తే, తాట తీస్తారని తెలుసు... కాని హిందువుల జోలికొచ్చినా, వారి దేవాలయాల్ని పరమతస్తులతో నింపేసినా, దేవుడి ఆభరణాలను, ఆస్తుల్ని నిర్లజ్జగా కాజేసినా, వాటిని బయటపెట్టినందుకు అర్చకుల్ని బయటకు గెంటేసినా, రాజకీయ కారణాలతో హిందువులందరూ కిమ్మనకుండా ఉన్నారు. ఇదే ఇతర మతాల్లో జరిగితే రాజకీయాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా ప్రపంచమంతా ఆ మతస్థులు ఏకమవుతారు. కాని, హిందూ మతంలో మాత్రం పైవాడు మా కులపోడు కాబట్టి, మా పార్టీవోడు కాబట్టి, మా నాయకుడు కాబట్టి, వాడు ఏమి చేసినా, దైవానికి ద్రోహం చేసినా మేము మాత్రం సిగ్గులేకుండా వాడినే సమర్థిస్తాము. ఎంత సిగ్గులేని తనం? ఎంత బరితెగించిన తెంపరితనం?

    శ్రీ రమణ దీక్షితులుగారు చదువు లేని వాడు కాదు. పరిస్థితులు అర్థం చేసుకోలేని వాడు కాదు. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, విదేశాలలో ఉద్యోగం కూడా కాలదన్నుకుని, దైవం పట్ల అనురాగంతో, వంశ పారంపర్య అర్చకత్వాన్ని చేపట్టిన మహోన్నత వ్యక్తి. ఏ దైవాన్ని రెప్పపాటు కాలంపాటు దర్శించుకున్నా, జన్మ ధన్యమవుతుందని భావిస్తామో, అటువంటి దైవాన్ని జీవితాంతం స్వయంగా అర్చన చేసి, తరించే అదృష్టశాలి. ఆయన మరే ఉద్యోగం చేసుకున్నా ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుంది. రాజకీయాల్లో చేరి, ఏ అడ్డమైన గడ్డి కరిచినా ఇంత కంటే ఎక్కువ 'గిట్టుబాటవుతుంది'. అర్చకులకు ఎటువంటి జీతం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవు. అది కూడా అర్థం చేసుకోకుండా, సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకుడిపైనే వేటు వేయాలనుకోవడం ఆలయంపై జరిగిన దాడిగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులకు గాని, పాలకమండలికి గాని శ్రీవారి ఆలయ చరిత్ర తెలుసా? అసలు ఆగమ శాస్త్రం అనే మాట వినే ఉంటారా? శ్రీవారికి ఎప్పుడెప్పుడు ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయో, ఏఏ నైవేద్యాలు సమర్పిస్తారో ఎవరికైనా తెలుసా? ఇవన్నీ 'కనకపు సింహాసనమున శునకాలే' కదా... ఏ అధికారంతో ఆలయ సేవల్లో వేలుపెడుతున్నారు? ఏ తెగింపుతో స్వామి వారి నిధుల్ని తమ సొంత అవసరాలకు మళ్ళించుకొంటున్నారు? ఏ ధైర్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరునితో ఆడుకుంటున్నారు?

    ఏం ఫర్వాలేదు... రావణాసురుడంతటి వాడు కూడా తన పాపం పండేవరకు తనంతటి వాడు లేడని విర్రవీగాడు... శిశుపాలుడిని కూడా శ్రీ కృష్ణుడు నూరు తప్పుల వరకు ఊరుకున్నాడు.... వామనుడు వచ్చే వరకు నేనే గొప్పవాడినని బలి భావించాడు... నరసింహుడు వచ్చే వరకు హిరణ్య కశిపుడు తానే దైవంగా భావించుకున్నాడు. ఏదైనా పాపం పండేవరకే... శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం... కేవలం సంకల్పమాత్రాన సకల సృష్టిని సృజించగల ఆయన ముందు పిచ్చి వేషాలేస్తే ఏం జరుగుతుందో చరిత్రలో ఎన్నో సంఘటనలు చూసాం... ప్రత్యక్షంగా కొన్నింటికి మనమే సాక్షులం కదా... ప్రస్తుతానికి శ్రీ రమణదీక్షితులుగారికి మన మద్దతు తెలుపుదాం... అది మన నైతిక బాధ్యత... కాగల కార్యమంటారా... శ్రీవారే చూసుకుంటారు... సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు....

Sunday, February 11, 2018

అత్యున్నత భారతీయ విలువలకు నిలువుటద్దం - పద్మావతి కథ (మూవీ రివ్యూ)

    సమకాలీన సినిమాల్లో చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు రావడం కొంచెం అరుదుగానే జరుగుతోంది. వచ్చిన కొన్ని సినిమాలు కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కమర్షియల్‌ హంగుల్ని అద్దుకున్నవి అయి ఉంటున్నాయి. కాని, చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం తక్కువ కాకుండా, అత్యున్నత భారతీయ విలువల్ని, భారతీయులు నమ్ముకున్న ధర్మంపై నిర్మించబడ్డ శిఖర సమానమైన ఆదర్శాలని, ఆ ఆదర్శాలను పాటించే క్రమంలో ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టే మహోన్నత కథా ప్రాభవానికి ఆధునిక సినిమా రూపమే సంజయ్‌ భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి'.

    మేవార్‌ మహారాణి పద్మావతి అపురూప సౌందర్యవతి. రాజపుత్ర రాజయిన రతన్‌సింగ్‌ను వివాహమాడుతుంది. అదే సమయంలో భారతదేశంపైకి  దండెత్తిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ పద్మావతి సౌందర్యం గురించి విని, ఆమెను ఎలాగైనా పొందాలని చిత్తోడ్‌ఘడ్‌ కోటపైకి దండెత్తుతాడు. కాని, విజయం సాధించలేకపోతాడు. ప్రాచీన భారతీయ ఇంజినీరింగ్‌ నిపుణతతో నిర్మించిన ఆ కోట ముందు, రాజపుత్రుల పరాక్రమం ముందు ఖిల్జీ సేనలు పరాజయం పాలవుతాయి. చివరికి తమకు మాత్రమే సొంతమైన కుతంత్రంతో కోటలోకి ప్రవేశించిన ఖిల్జీకి రాణి పద్మావతి దక్కిందా లేదా అనేది సినిమా కథ.

    నేటి యువత తప్పని సరిగా చూసి, ఎంతో నేర్చుకోవలసిన కథ ఇది. ప్రేమ పేరుతో ప్రతి అడ్డమైన, నీచ మనస్తత్వం కలిగిన వారందరూ దర్శకులుగా అవతారమెత్తి, నానా చెత్తా సినిమాలుగా తీసి, యువతను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. అటువంటి సినిమా చూసిన వాళ్ళందరూ అదే జీవితం అనుకుంటూ రకరకాల నేరాల్లో చిక్కుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ని చూడముచ్చటగా, రిచ్‌గా తీర్చిదిద్దారు. మేకప్‌, ఎడిటింగ్‌, డైరెక్షన్‌, బ్యాక్‌గ్రౌండ్‌.. ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా అత్యున్నత స్థాయిలో ఒక హాలీవుడ్‌ మూవీని చూసిన ఫీల్‌ని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆనాటి కోటగోడలు, వస్త్రధారణ, నగలు, అలంకరణ వంటి ఏ విషయంలోను రాజీ పడలేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఒక పక్క నుండి భారతీయులు నమ్ముకున్న ఆదర్శాల గురించి గర్వపడుతూనే, ఒక రాజకుటుంబం పరాయి మతాల మూర్ఖత్వానికి ఎలా బలయిపోయిందో చూస్తూంటే గుండెల్ని మెలిపెడుతున్న బాధ కలుగుతుంది.

    భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన భారతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా దోచుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త. అందుకే అవతలి శత్రువుని కూడా ధర్మబద్దంగా ఎదుర్కోవాలని భావించి, చివరికి వారి కరవాలానికే బలయిపోయారు. ఈ విధంగానే ముస్లిం, క్రైస్తవ పాలకులు హిందూ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంపదను, స్త్రీలను, వారసత్వాన్ని దోచుకోగలిగారు.

    సహజంగానే హిందూ జాతి గొప్పదనాన్ని, వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఎటువంటి ప్రయత్నానికైనా మీడియాలో ప్రాచుర్యం లభించదు. ఇటీవల విడుదలైన ఒక మానసిక రోగి సినిమా గురించి మాత్రం అటు మీడియాలోనీ, ఇటు వెబ్‌లోను ప్రచారం హోరెత్తిపోయింది. ఆ సినిమా చూడకపోతే అసలు యూత్‌ కాదన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ నేటి యువత అది కాదు తెలుసుకోవలసింది.. రతన్‌సింగ్‌ స్థానంలో ఉండవలసిన యువతని ఖిల్జీ స్థానంలోకి దిగజార్చేసి, అదే నిజమైన హీరోయిజం అన్నట్లుగా హైలైట్‌ చేస్తున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువతీ యువకుడు తప్పని సరిగా చూసి, మన నిజమైన సాంప్రదాయ విలువల్నీ, వాటిని కాపాడడం కోసం పూర్వీకులు పడ్డ తపననీ, చేసిన త్యాగాన్ని తెలుసుకుని, గుర్తుంచుకుని, ఆచరించడమే మన పూర్వీకులకు మనమిచ్చే నిజమైన నివాళి.

Sunday, September 3, 2017

అమ్మాయిల్ని ప్రేమించండి - కామించకండి... (చెత్త సినిమాలపై చిన్న చురక)

    ప్రేమ ఒక మధురమైన, అనిర్వచనీయమైన అనుభూతి. అది హృదయాంతరాళలో నుండి రావాలి. అంతేగాని నేటి సినిమాల్లో చూపించినట్లు ఒక అమ్మాయి భౌతిక రూపం చూసీ చూడగానే చిత్త కార్తె కుక్కల్లాగా వెంటబడి, వాళ్ళని తరిమి, హింసించి, తికమక పెట్టి, ఏదో రకంగా ప్రేమించాను అని వాళ్ళచేతనే చెప్పించుకునే పైశాచిక హీరోలు చేసే పిచ్చి చేష్టలు కాదు. డబ్బు కక్కుర్తి కోసం కొంత మంది సినిమాలు తీస్తున్నారు. తమలో ఉన్న పైశాచిక ఆనందాన్ని (శాడిజం) తీర్చుకోవడానికి కొంత మంది నీచులు డైరెక్టర్‌ అవతారం ఎత్తుతున్నారు. వీళ్ళు చేసేదల్లా సగటు మనిషిలో ఉన్న బలహీనతల్ని సినిమా అనే ముసుగులో రెచ్చగొట్టి, ఉచితంగా పబ్లిసిటీ, డబ్బు సంపాదించడం. ఇలాంటి నీతి జాతి లేని కుక్కలకు (అలా అంటే కుక్కలు బాధపడతాయేమో) మిగతా వాళ్ళు వత్తాసు పలకడం, అటువంటి చౌకబారు సినిమాలకు సో కాల్డ్‌ పనీపాట లేని యువత వెళ్ళి, వాళ్ళకు డబ్బుల వర్షం కురిపించడం... ఇదంతా చూస్తుంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. సదరు డైరెక్టర్లకు, నిర్మాతలకు సామాజిక బాధ్యత ఉండదు. కుటుంబ విలువల పట్ల, నైతికత పట్ల ఎటువంటి గౌరవం ఉండవు. వాళ్ళకు ఉండేది పశు వాంఛ. దాన్ని తీర్చుకోవడానికి సినిమాని ఒక సాధనంగా మార్చుకుంటారు. వారు తీస్తున్న ఇటువంటి నీచపు పనుల వల్ల ఎన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయో వారికి పట్టదు. అసభ్యత, అశ్లీలత మేళవించే సినిమాలు తీస్తున్నారంటే వారు పశువు కంటే హీనమైన వారు అని అర్థం. ఎందుకంటే ఏ జంతువైనా తన బాధ్యతగా, ప్రకృతి ధర్మం ప్రకారం కొన్ని సమయాల్లోనే తమ కోరికను తీర్చుకుంటాయి. కాని, ఇటువంటి నీచులు సర్వకాల సర్వావస్థల్లో అదే పనిగా ఉంటూ, తాము చెడిందే కాక, లోకమంతా అదే విధంగా నడవాలని కోరుకుంటారు. అందుకే వీరు పశువు కంటే ప్రమాదకరమైన వాళ్ళు.

    సహజంగా ఇటువంటి సినిమాల్లో హీరోయిన్‌కు ఎటువంటి వ్యక్తిత్వం, సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివాడు తమ మనసుతో, శరీరంతో ఎలా ఆడుకున్నా వాళ్ళు ఎదురు చెప్పరు. పైగా లొంగిపోయి, ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. కాని, వాస్తవంలో ప్రతి ఆడపిల్లకు ఒక మనసుంటుంది. సొంత ఆలోచన ఉంటుంది. తమకు ఏది మంచో, ఏది చెడో ఆలోచించుకోగలిగిన మానసిన పరిపక్వత అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సినిమాలో నీచ హీరోలు చేసే పిచ్చి చేష్టలకు లొంగరు. అలాంటి అమ్మాయి ఎదురైనపుడు, సినిమాల్లో చూపించిన విధంగా జరగకపోయే సదరు చిత్తకార్తె కుక్కకు అహం దెబ్బతింటుంది. ఆ అమ్మాయిని అల్లరి చేయడానికి, హింసించడానికి, చివరకు యాసిడ్‌ దాడి చేయడానికి కూడా వెనుకాడడు. సినిమాల ప్రభావంతో తాను ప్రేమిస్తున్నాననే అనుకుంటాడు. పత్రికలు కూడా దీనికి వత్తాసు పలుకుతూ 'అమ్మాయిపై ప్రేమోన్మాది దాడి' అని హెడింగ్‌ పెడుతూ ఉంటారు. నిజానికి ఆడపిల్లల్ని హింసించే వాళ్ళని ప్రేమోన్మాది అని కాదు... కామోన్మాది అని పిలవాలి.

    ఒక రచయిత్రి మాటల్లో చెప్పాలంటే... ''ఒక ఆడపిల్ల తన గుండె నిండుగా, నిండు మనసుతో ప్రేమిస్తే... ఆ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలుసా... అమాయకమైన ఆ ప్రేమ అమృతంతో సమానం... కాని ప్రేమను పొందే అదృష్టం ఎంత మందికి ఉంటుంది?'' అటువంటి ప్రేమను పొందడానికి ప్రయత్నించాలిగాని, శరీరాన్ని చూసి వెంటబడితే అది కామం అవుతుందేగాని, ప్రేమ ఎన్నటికీ కాదు...

Thursday, August 10, 2017

ఇండియా అనే పదం ఎక్కడ నుంచి వచ్చిందో మీకు తెలుసా?

    భారతదేశానికి 'ఆగష్టు'లో స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇండియా అనే పేరు వచ్చిందనే తప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున సాగుతోంది. నిజానికి స్వాతంత్య్రానికి, ఇండియా పేరుకి ఏ సంబంధం లేదు.

    ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో అత్యున్నత నాగరికత వెలసింది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, కళలు, భాష, సాహిత్యం వంటి అనేక రంగాలలో ఉజ్జ్వలమైన ప్రగతి సాధించింది. కేవలం భౌతిక పరమైన అభివృద్ది మాత్రమే కాకుండా, మానవ విలువల పరంగా, ఆధ్యాత్మికంగా, సంఘ పరంగా ఎవరూ ఊహించలేని అత్యున్నత స్థానానికి చేరుకుని, గురుస్థానాన్ని పొంది, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం చేసింది.

    శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకు, ఉపాధికి ఈనాటి ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా వైపు చూస్తున్నట్లుగానే, ప్రాచీన కాలంలో ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేది. ఆనాటి కాలంలో ఎవరైనా భారతదేశానికి వచ్చి, ఇక్కడ పర్యటిస్తే, వారికి వారి దేశాల్లో ''హిందూదేశాన్ని దర్శించినవాడు'' అనే బిరుదును ప్రదానం చేసేవారు. ఎన్నో రకాల విద్యలకు, కళలకు, వాణిజ్యానికి, శాస్త్రాలకు నిలయమైన హిందూ దేశాన్ని దర్శించడం అంటే వారి ఉద్దేశ్యంలో ఒక అద్భుత కార్యాన్ని సాధించిట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.

    చారిత్రికంగా చూస్తే, భారతదేశంలో ప్రాచీన నాగరికత సుమారు 5000 సంవత్సరాలకు పూర్వమే సింధు నదీ తీరంలో ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది. అందుకే విదేశీయులు ఈ నేలను సింధు దేశమనే పిలిచే వారు. యూరోపియన్లకు, భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు ప్రధానంగా అరబ్బులు, పర్షియన్ల ద్వారానే జరిగేవి. ఇక్కడ నుండి వస్త్రాలు, వజ్రాలు, సాంకేతిక పరికరాలు, శాస్త్ర సంబంధ విషయాలు, ఆహార పదార్థాలు వంటివి భారతదేశం నుండి మిగతా ప్రపంచానికి అరబ్బుల ద్వారానే పరిచయమయ్యాయి. సామాన్య శక పూర్వం 300 సం||లకు ముందే పర్షియన్లు తమ భాషలో సింధ్‌ పదాన్ని 'హింద్‌' గా పలికేవారు. అందుకే ఈ దేశాన్ని 'హిందు స్థాన్‌'' గా వ్యవహరించేవారు.  అయితే యూరోపియన్ల భాషలో 'హ' అక్షరం సరిగా పలకలేరు. అందుచేత వారు 'హింద్‌' పదాన్ని 'ఇండ్‌'గా పలికేవారు. ఆ విధంగా మన దేశం పాశ్చాత్యుల వాడుకలో ఇండియాగా పిలవబడింది.

    ఇక్కడ ఇండియా అంటే 'హిందూ దేశం'గా అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏనాడూ ఎటువంటి మతమూ లేదు. ఉన్నదల్లా ఒక చక్కని జీవన విధానం. మంచి కుటుంబ వ్యవస్థ, మంచి ఆహార, ఆరోగ్య అలవాట్లు, ప్రకృతితో మమేకమైన జీవిత విధానం, ఆధ్యాత్మికంగా, సాంకేతికంగా ఎంతో పురోగమించిన సమాజం. ఇక్కడి మహర్షులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు ఏనాడూ తాము ఎంతో కృషిచేసి సాధించిన విజ్ఞాన ఫలాలతో వ్యాపారం చేయాలని అనుకోలేదు. వారికున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర సమాజాలపై ఆధిపత్యం చెలాయించాలని గాని, వారి దేశాల్ని, సంస్క ృతుల్ని ఆక్రమించుకోవాలనిగాని అనుకోలేదు. కాని, ప్రపంచమంతటా హిందూ జీవన విధానం విస్తరించింది. కొత్త మతాలు వచ్చేనప్పటికీ, ఈనాటికీ, ప్రపంచమంతటా అన్ని సమాజాల్లో అంతర్లీనంగా మానవత్వం వెల్లివిరిసేలా చేస్తున్న అదృశ్య జీవిత విధానం ఉందంటే అది ముమ్మాటికీ హైందవ జీవన విధానం మాత్రమే. ఈ పుణ్య భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మత: హిందువులే. ఇక్కడి ఆలోచనా విధానంతో ప్రభావితమైన వ్యక్తి, సమాజం, దేశం ఏదైనా సరే హిందూ దేశమే. ఇండియా అంటే హిందూస్థాన్‌ మాత్రమే.

జై హింద్‌

(ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆలోచనా మాలిక - మీ ఎస్పీ జగదీష్‌)

Friday, May 26, 2017

భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశం

    భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పాకిస్థాన్‌ చెర నుండి విడిపింపబడి, తిరిగి భారతదేశానికి వచ్చిన ఉజ్మా అహ్మద్‌ అనే మహిళ అభిప్రాయపడ్డారు. ఒక పాకిస్థాన్‌ జాతీయుడితో బలవంతంగా వివాహ బంధంలో చిక్కుకుని అక్కడకు వెళ్ళిన ఉజ్మా అక్కడి పరిస్థితులలో ఇమడలేకపోయారు. ఆ దేశాన్ని ఒక 'మృత్యు బావి' గా అభివర్ణించారు. భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను సమర్థించే వారంతా ఈ సంఘటనతో కళ్లు తెరవాలి. నిజానికి భారతదేశం ఏ సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరించే వారు ఎవరికైనా సురక్షితమైన ప్రదేశం. వారి వారి ఆచారాల్ని, సంస్కృతిని అవలంభిస్తూనే ఇక్కడి సాంప్రదాయాలతో మమేకమై తమ జీవనాన్ని సాగించవచ్చు. వారిని ఇక్కడి మతంలోకి మారమనిగాని, ఇక్కడి ఆచారాల్ని అనుసరించమని గాని ఎవరూ బలవంతం పెట్టరు. ఎటువంటి ప్రలోభాలకి గురిచేయరు. ''మనం బాగుండాలి, మనతో పాటు అందరం బాగుండాలి'' అనేది ఇక్కడి ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న అత్యున్నత జీవన ప్రమాణం.

    గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని విదేశీ మతాలు, అక్కడి బానిస ఆలోచనా విధానాల్ని పుణికిపుచ్చుకున్న స్వదేశానికి చెందిన స్వయం ప్రకటిత మేధావులు ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అవలంభిస్తున్న సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అన్ని మతాలను, అన్ని సంస్కృతుల్ని గౌరవించే ఈ దేశ ప్రజల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ తమ మతాల వైపు ఆకర్షించడానికి అన్ని రకాల కుతంత్రాలు చేస్తున్నారు. ఇటువంటి వారి వలన దేశ ప్రజల మధ్యలో కనిపించని అడ్డుగోడలు ఎన్నో మొలుస్తున్నాయి. వాళ్ళు పనిగట్టుకుని ప్రచారం చేసే లేని దేవుళ్ళ పేరు చెప్పి ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోతూ, మానసికంగా నలిగిపోతున్నారు. అయినప్పటికీ, తమ మతమే గొప్పదంటూ, ఇక్కడ వేల సంవత్సరాలుగా ఉన్న ఆచార వ్యవహారాల్ని కించపరుస్తూ, చెలరేగిపోతున్నారు. ఎదుటి వారిని గుడ్డి నమ్మకాలవైపు లాగుతున్నారు.

    ఇప్పటికైనా మతాలు మారే వారు, మార్చేవారు తమ తమ సంకుచిత్వాన్ని విడనాడాలి. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి సాంప్రదాయాల్ని గుడ్డిగా వ్యతిరేకించే వారు కళ్ళు తెరవాలి. తమ తమ మతాన్ని అనుసరించడం, నమ్మడం అనేవి వారి వ్యక్తిగత విషయాలు. అవి ఎప్పటికైనా తప్పు అని తెలుసుకొనే రోజు వస్తుంది. అప్పుడు వారు నిజం తెలుసుకోవచ్చు. అంతేగాని, మా మతమే గొప్పది, మా మతంలోకి మారండి అంటూ చేసే బోధనలు ఎప్పటికైనా ముప్పు తెస్తాయి. అందరూ బాగుండాలి అనే విశాలదృక్పధం నుండి, నేను, నా దేవుడు మాత్రమే గొప్ప అనే సంకుచితత్వంలోని ప్రయాణం చేస్తే, ఎవరి దేవుడు వారికి గొప్పవుతాడు. ఎవరి అహంకారం వారికుంటుంది. అది ఘర్షణకు దారి తీస్తుంది. సమాజాన్ని శాంతియుత సహజీవనం చేసే పరిస్థితుల నుండి ఒకరినొకరు దేవుడి పేరు చెప్పి చంపుకునే పరిస్థితి వస్తుంది. అది అభిలషణీయం కాదు. ఇప్పటికే మూడొంతుల దేశాలు మతాల పేరు చెప్పి మారణకాండను సాగిస్తున్నాయి. ప్రతీ రోజు కొన్ని వేల, లక్షల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. కొన్ని వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. విభిన్న ఆలోచనల శాంతియుత జీవనమే భారతదేశ సంస్క ృతికి ఆయువుపట్టు. అటువంటి మూలాధారాన్ని కోల్పోయిన నాడు, తమ మూలాల్ని కోల్పోయి, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న అనేక ఇతర దేశాల్లాగానే భారత దేశ ప్రజలు కూడా అంధకారంలో మునిగిపోవాల్సి ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త...

Thursday, June 9, 2016

రిజర్వేషన్ల కోసం సిగ్గులేకుండా నడి రోడ్డుపై ధర్నాలు చేసే వారికి గుణపాఠం .... స్విస్‌ ప్రజల తీర్పు

    ప్రభుత్వం నుండి అప్పనంగా అన్నీ వచ్చేయాలనుకునే వారు స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన సందేశాన్ని చూసి తలదించుకోవాల్సిందే. దేశ ప్రజలందరికీ బ్రతకడానికి అవసరమైన కనీస మొత్తాన్ని ఉచితంగా ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తెచ్చింది. ప్రపంచంలోనే ఇది మొదటిసారట. కాని, అనూహ్యంగా, తమకు అటువంటి ఉచితాలు ఏవీ వద్దంటూ స్విస్‌ ప్రజలు తమ నిరాకరణను ఓటింగ్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ ఒకటి. ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశం స్విట్జర్లాండ్‌. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు అందరికీ తెలిసిన బ్యాంకింగ్‌ రంగమే. నల్లకుబేరులందరికీ ఈ దేశంలోని బ్యాంక్‌లలో అక్కౌంట్స్‌ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. భారత్‌, చైనాతో సహా అనేక వర్ధమాన దేశాల్లోని అవినీతి నేతలు, ప్రభుత్వ అధికారులు అందరూ తమ దేశ ప్రజల కడుపుకొట్టి సంపాదించిన పాపిష్టి సొమ్మును అక్కడే భద్రంగా దాచుకుంటారు. అలా కొన్ని లక్షల కోట్ల డాలర్ల మేర ధనం స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతోందని అంచనా. ఇది కాకుండా ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం, చాక్లెట్స్‌, పాడి పరిశ్రమ. దీని వల్ల ఇప్పటికే అక్కడి ప్రజలు తమ కష్టానికన్నా ఎక్కువ మొత్తంలోనే ప్రతిఫలాన్ని జీతాల రూపంలో పొందుతున్నారు. తాజా ప్రతిపాదనతో దేశంలోని పౌరులెవ్వరు పనిచేయనక్కర్లేకుండానే జీతం పొందడానికి వీలవుతుంది. కాని ఇటువంటి అప్పనంగా వచ్చే జీతాన్ని పొందడానికి అక్కడి పౌరులు నిరాకరించడం స్వాగతించదగ్గ విషయం. వారిని చూసి మనలాంటి దేశాల్లో ప్రజలు ఎంతో నేర్చుకోవాలి.

    ప్రతి ఎన్నికల్లోను రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక ఉచిత వాగ్దానాలు చేయడం చూస్తూంటాం. రుణమాఫీ దగ్గర నుండి, ఉచిత పెన్షన్లు, ఉచిత ఆరోగ్యం, విద్య వంటి మౌలిక అవసరాల నిమిత్తం అయితే కొంతలో కొంత మేలు. అదే ప్రక్క రాష్ట్రంలో అయితే టి.వి.లు, వాషింగ్‌మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, డి.టి.హెచ్‌. కనెక్షన్లు, సెల్‌ఫోన్ల వంటివి ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హోరెత్తించారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఒకటుంది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుండో దిగివచ్చింది కాదు, అది మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్నదే. మనందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బుని పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడుతుంటే, అక్కడుండే యంత్రాంగం ప్రజలకు కావలసిన సౌకర్యాలను సమకూరుస్తుంది. దేశ రక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, రహదారులు, విద్యుత్‌ ప్రాజెక్టులు వంటి వాటికి వేల కోట్ల రూపాయిలు అవసరమవుతాయి. అంత పెద్ద ఖర్చు ఏ ఒక్కరు వ్యక్తిగతంగా పెట్టలేరు కాబట్టి, దేశంలోని ప్రజలందరి నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మునే అభివృద్ధికి ఉపయోగిస్తారు. అలా కాకుండా అదే ప్రజల  సొమ్మును తిరిగి వారిలో కొందరికి ఉచితంగా ఇవ్వడం మొదలు పెడితే, కొంత మందికి కష్టపడకుండా, ప్రభుత్వం నుండి సొమ్ము లభిస్తుంది.  దానితో వాళ్ళు ఏ పనీపాటా లేకుండా సమాజానికి భారంగా మారతారు.  నిజంగా కష్టపడి సంపాదించి, పన్నులు కట్టే వాడికి కడుపు మండుతుంది.  కొంత కాలానికి సమాజంలో అసంతృప్తి బయలుదేరుతుంది. అందరూ కష్టపడడం మానేస్తారు. ఉత్పాదకత తగ్గిపోతుంది. మానవ వనరులు లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం తగ్గిపోతుంది. దానితో ప్రభుత్వాలు మరిన్ని ఎక్కువ పన్నులు విధిస్తాయి. దాంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది. సంక్షేమ పథకాలనేవి ప్రభుత్వ విధానంలో ఒక భాగం కావాలి గాని, ప్రభుత్వమే సంక్షేమ పథకాల సృష్టికర్త కారాదు. ప్రజలకు కష్టపడే తత్వాన్ని నేర్పాలిగాని, సోమరిపోతుల్ని తయారుచేయకూడదు.

    భారతదేశంలాంటి చోట్ల మరో రకమైన సోమరులు తయారవుతున్నారు. అవే రిజర్వేషన్లు. భారతీయ సామాజిక స్థితిగతుల రీత్యా, కుల వ్యవస్థ వేళ్ళూనుకుని ఉన్న రోజుల్లో కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు కేటాయించారు. అది కూడా కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉండేలా నిబంధన చేసుకున్నారు. కాని, తరువాతి కాలంలో వచ్చిన రాజకీయ పార్టీలు తమ ఓట్ల స్వలాభం కోసం రిజర్వేషన్లను ప్రోత్సహించారు. దీనివల్ల కుల వ్యవస్థ రూపుమాపకపోగా మరింత బలంగా తయారయింది. కులాల పేరిట రాజకీయ పార్టీలు కూడా ఏర్పాటయ్యాయి. చివరికి పరిస్థితి ఎలా దాపురించిందంటే, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత ఆర్థికంగా స్థిరపడిన ఎన్నో కులాల వారు కూడా తమను వెనుకబడిన కులాల కింద పరిగణించి, తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని సిగ్గులేకుండా డిమాండ్‌ చేస్తున్నారు.

    ప్రపంచీకరణ నేపథ్యంలో కులానికన్నా, మతానికన్నా, భాషకన్నా ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను బట్టి, అతనికి లభించే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అంతే కాని, ఒక కులం వారికో, ఒక మతం వారికో ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. ఈ రోజు మనం అనుభవిస్తున్న అనేక సదుపాయాలు, పరికరాలు ఏ కులం వారు కనిపెట్టారో, ఏ మతం వారు తయారుచేసారో ఎప్పటికీ ఆలోచించం. ఆ పరికరాలు నాణ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని మాత్రమే ఆలోచిస్తాం. నాణ్యతకు పెద్దపీట వేసి, తక్కువ రేటులో ఇచ్చారు కాబట్టే, అమెరికా, జపాన్‌ వంటి పెద్ద దేశాల పరికరాలను కాదని, కొరియన్‌ కంపెనీలయిన శాంసంగ్‌, ఎల్‌జి వంటి సంస్థల ఉత్పత్తుల్ని ప్రోత్సహించాం. ఇది అన్ని ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది.

    ప్రతిభావంతుల్ని కాదని, రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెడితే, రెండు రకాలుగా నష్టం కలుగుతుంది. మొదటిది ప్రతిభ లేనివాడు అందలం ఎక్కి, దేశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తాడు. కనీసం ఒక తెలుగు పేపర్‌ను తప్పులు లేకుండా చదడం రాని ప్రభుత్వ టీచర్లని నేను చూసాను. సంధుల్ని ఎలా విడదీయాలో, సమాసాలు అంటే అర్థం ఏమిటో కూడా పూర్తిగా చెప్పలేని తెలుగు ఉపాధ్యాయుల్ని నేను స్వయంగా చూసాను. చాలా బాధ అనిపించింది. ఇటువంటి వారు ఉపాధ్యాయులైతే, విద్యార్థులకు ఏం నేర్పగలరు? టీచర్‌కి 200% ప్రతిభ ఉంటేనే విద్యార్థిని 100% ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దగలడు. టీచర్‌కే 35 మార్కులు వస్తే, ఇక విద్యార్థి పరిస్థితి ఏమటి? దీని గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరు? ఒక ఉద్యోగి చేతగాని వాడయితే ఆ శాఖ మాత్రమే ఇబ్బంది పడుతుంది. కాని ఉపాధ్యాయుడు ప్రతిభావంతుడు కాకపోతే కొన్ని విలువైన జీవితాలు, పూర్తి కొన్ని తరాలు అజ్ఞానపు అంచుల్లోకి జారిపోతాయి. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం.

    అందుకే విజ్ఞులైన దేశ ప్రజలు అయాచితంగా ఇచ్చే వాటిని తిరస్కరించాలి. రిజర్వేషన్లను వ్యతిరేకించాలి. ఊరికే వస్తున్నాయి కదా అనుభవించడానికి ప్రయత్నిస్తే, భవిష్యత్తు తరాలు అంధకారంలో బ్రతకాల్సి వస్తుంది. స్విట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా మేలుకుని, సంక్షేమ పధకాల్ని, రిజర్వేషన్లని తిరస్కరిస్తే, మన దేశం కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో సమయం పట్టదు. అది మన చేతుల్లోనే ఉంది.

Sunday, May 29, 2016

బైబిల్‌ కాలం నాటి దేవుడిని చంపేసిన హాలీవుడ్‌.... ఎక్స్‌మెన్‌ మూవీ విశ్లేషణ

    హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా వాస్తవిక ఆలోచనల మీద ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో విడుదలయిన 'ఎక్సోడస్‌' బైబిల్‌లోని నిర్గమ కాండను బేస్‌ చేసుకుని తీసిన సినిమా. అయినప్పటికీ ఎక్కడా మహిమలు, మహత్యాల జోలికి పోకుండా ఉన్నదున్నట్టుగా తీసారు. ఎక్స్‌మెన్‌ అపోకలిప్స్‌ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇంతకు ముందు ఈ సిరీస్‌లోని సినిమాల్లో లాగానే జన్యుపరంగా మార్పు పొందిన మనుష్యులు తమకున్న అతీత శక్తుల ద్వారా మానవాళికి మేలు చేయడమే ముఖ్య కథాంశం. అయితే తమకున్న అపార శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని, తాము మాత్రమే ప్రయోజనం పొందాలా లేదా సమస్త మానవాళికోసం పోరాడి, తమ శక్తులకు ఒక సార్థకత చేకూర్చుకోవాలా అనే పాయింట్‌ చుట్టూ కధ తిరుగుతుంటుంది.

    ప్రస్తుత సినిమా విషయానికొస్తే, అపోకలిప్స్‌ అనేది బైబిల్‌ చేత నిషేధితమైన పుస్తకాల సంకలనం. అంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలన్నిటినీ ఆకాలం నాటి చర్చి గంపగుత్తగా నిషేధించి వాటిని సైతాను వ్రాతలుగా నిర్ధారించింది. అలా 3500 సంవత్సరాల క్రితం బైబిల్‌ (అపోకలిప్స్‌) లో వర్ణించబడిన ఒక దేవుడు ఈజిప్ట్‌ను కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు. తనకున్న అతీంద్రియ శక్తుల సాయంతో మనుష్యులను బానిసలుగా చేస్తాడు. తన మాట వినని వారికి ఒకటే శిక్ష.. అదే మరణం. తనకు ఎదురు చెప్పిన ప్రజలుండే నగరాల్ని, దేశాల్ని కూడా వదలడు. వాటిలో ఎన్నో ప్రకృతి విలయాల్ని సృష్టించి, అక్కడున్న ప్రజలందరినీ మృత్యు వాతకు గురిచేస్తాడు. ఆ దేవుడికి తెలిసిన ఒకే ఒక పరిపాలనా విధానం... భయ పెట్టి దారిలోకి తెచ్చుకోవడం. అయితే, అతని దుర్మార్గాన్ని సహించలేని అప్పటి ప్రజల్లో కొందరు తిరుగుబాటు చేసి, ఆ దేవుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అనుకోని విధంగా అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు. తిరిగి 1983లో కొందరు ఆ దేవుడిని మరలా ఈ లోకంలోకి తీసుకువస్తారు. స్పృహలోకి వచ్చిన ఆ దేవుడికి ఈ లోకం తీరు నచ్చదు. మరలా ఈ భూమిని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలని మరికొందరు ఎక్స్‌మెన్‌లను తన వైపు తిప్పుకుని, ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కాని, ఎక్స్‌మెన్‌లు తమ తప్పుని తెలుసుకుని, ఆ దేవుడిని చంపి, మానవాళిని ప్రళయం నుండి కాపాడుతారు. ఇదీ స్థూలంగా కథ.

    దేవుడికి చంపడమనే భావన భారతీయులకి కొత్తగా అనిపించవచ్చు. కాని, పాశ్చాత్య కోణం నుండి ఆలోచిస్తే, వారి బాధ మనకు అర్థం అవుతుంది. హిందువుల ఆలోచన ప్రకారం దేవుడికి రూపం లేదు, ఆయన సర్వాంతర్యామి, ఇంకా చెప్పాలంటే సృష్టిలోని ప్రతి అణువులోను ఆయనే నిండి వున్నాడు. ఆయనలోనే ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతమయిపోతుంది. కాని పాశ్చాత్య మతాల దృష్టిలో దేవుడు కూడా ఒక భౌతిక రూపమే. ఆయన స్వర్గం అనే ఒక 'ప్రదేశం'లో బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అక్కడి నుండి ఈ లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ ఈ భూమిమీదకి వచ్చి పోతూ ఉంటాడు. తన మాట వివని వారిని బాధలకు గురి చేస్తూ ఉంటాడు. ఒక వేళ ఇప్పుడు తప్పించుకున్నా, తన స్వర్గం పక్కనే ఒక నరకాన్ని కూడా సృష్టించి ఉంచుతాడు. ఎప్పటికీ ఆరని మంటలు అక్కడ ఉంటాయి. దానిలో పడేస్తాడు. అటువంటి సాడిస్ట్‌ దేవుడు ఇప్పటి ప్రపంచానికి అవసరంలేదు. ఒకవేళ పొరపాటున వచ్చి తమ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినా, ఇప్పటి మనుష్యులు ఊరుకోరు. తిరుగుబాటు చేస్తారు. అతడిని తన లోకానికి పంపేస్తారు. ఇదీ పాశ్చాత్య ప్రపంచం తీరు.

    ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా సేపు ఆలోచించాను. పాశ్చాత్య క్రైస్తవంలో వచ్చిన ఆలోచనలు చాలా విప్లవాత్మకమైనవి. బైబిల్‌ని ప్రస్తుత సమాజం అంగీకరించే దశలో లేదని అర్థమయింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంలేని సమాజాల్లో నుండి ప్రపంచానికి అందివ్వబడిన దుర్మార్గమైన కానుక 'బైబిల్‌'. ప్రత్యేకించి ఓల్డ్‌ టెస్టిమెంట్‌ చదివితే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అన్నీ ఆటవిక ఆలోచనలు, అర్థం పర్థం లేని సంఘటనలతో కలగలిసిపోయి ఉంటుంది. రెండు ప్రపంచ యుద్దాలకి కారణమైనది కూడా ఆ పుస్తకమే. అటువంటి పుస్తకం మీద ఆ మతాన్ని అనుసరించే వారే తిరుగుబాటు చేయడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దేవుడి కన్నా మానవత్వమే గొప్పదని, మానవత్వానికి హాని కలిగించేలా ఉంటే దేవుడినయినా తిరస్కరించవచ్చును అనేది ఇప్పటి పాశ్చాత్య దృక్పధంగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ ఆలోచన భారతీయ తాత్విక చింతనకు దగ్గరగా ఉంటుంది. సర్వ ప్రాణుల్లోను భగవంతుని రూపాన్ని దర్శించమని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కేవలం మానవ జాతి మాత్రమే కాక, పక్షులు, జంతువులు, జలచరాలు వంటి వాటిలో కూడా భగవంతుడు ఆవిర్భవిస్తాడు. అవసరాన్నిబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు భూమి మీద అవతరిస్తాడనేది మన సిద్ధాంతం. దశావతారాలు ఆ కోవలోకి చెందినవే. ''ఈ సమస్త ప్రకృతిని మానవుడు వాడుకోవడం కోసమే దేవుడు సృష్టించాడు'' అనే బైబిల్‌ మాటలు మన ఆలోచనకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తాయి. ఎంత గొప్ప మతమైనా, ఎన్ని మహిమలున్న దేవుడైనా, మానవత్వాన్ని మరచిపోతే, మనం ఉనికికి కారణమైన ఈ ప్రకృతిని గౌరవించకపోతే నామరూపాల్లేకుండా చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.

Thursday, March 10, 2016

మగ నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. ఎందుకో తెలుసా? పూర్తిగా చదవండి.

సామాజిక మాధ్యమాలలో అకౌంట్‌ కలిగి ఉండడం ఇపుడు ఒక అవసరంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌లలో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. ఎక్కడో దూరాన ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ కలిసి తమ ఆలోచనలు పంచుకోవడానికి, బాంధవ్యాన్ని నిలుపుకోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే, కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు వీటివల్ల ఎన్నో లాభాలతో పాటుగా అంతకు మించి నష్టాలు కూడా ఉంటున్నాయి. ఎంతో మంది జీవితాలు వీటివల్ల నాశనం అయిపోతున్నాయి. ముందు కేవలం సరదాగా మొదలయ్యి, చివరికి విషాదంతో ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాల్లో ఇవి కలకలం రేపుతున్నాయి. మా బంధువులో ఒకమ్మాయి కేవలం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్‌తో మొదలుపెట్టి, పెళ్ళి వరకు వెళ్ళి, అతని చేతిలో మోసపోయి, నరకం అనుభవించి, ఆత్మహత్య చేసుకుంది. తన చివరి వీడియోను ఫేస్‌బుక్‌లోనే షేర్‌చేసి, ఆత్మహత్య చేసుకుంది. ఎంతో బాధగా అనిపించింది. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర కొంత ఉన్నప్పటికీ, ముందు, వెనుక చూసుకోకుండా, ఒక అపరిచిత వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచన వల్ల ఆ అమ్మాయి జీవితం కోలుకోలేనంతగా దెబ్బతింది. అందుకే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలు వాడే చిట్టితల్లులకి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాను.

1. కొత్త వారి నుండి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను అనుమతించకండి. అలా పంపిన వారు మీ ఫ్రెండ్‌ కి ఫ్రెండ్‌ అయినా సరే మొహమాటం లేకుండా నో చెప్పేయండి. అలాగే మీరు కూడా అబ్బాయి ప్రొఫైల్‌ ఫోటో మహేష్‌బాబులా ఉందనో, రామ్‌చరణ్‌ని మించిపోయాడనో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపకండి. మేక వన్నె పులులు, ఆవు తోలు కప్పుకున్న తోడేళ్ళకీ ఫేస్‌బుక్‌లో కొదవ లేదు. గుర్తుంచుకోండి.

2. మీ వ్యక్తిగత ఫోటోలను ఎట్టి పరిస్థితులలోను షేర్‌ చేయకండి. ఒకవేళ అంతగా షేర్‌ చేయాలనుకుంటే, పబ్లిక్‌ షేర్‌ కాకుండా, కేవలం మీ ఫ్రెండ్స్‌కి మాత్రమే కనబడేలా షేర్‌ చేయండి (మీరు షేర్‌ చేసేముందు పబ్లిక్‌ లేదా ఓన్లీ ఫ్రెండ్స్‌ అని ఆప్షన్స్‌ ఉంటాయి, చూడండి). దాని వల్ల అనవసరమైన పబ్లిసిటీ నుండి తప్పించుకోవచ్చు. మీ ఫోటోలను కూడా ఫోటోషాప్‌ చేసి, మీకు తెలియకుండా అసభ్యంగా మార్చి, వివిధ వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేసే శాడిస్టులు ఉంటారు జాగ్రత్త.

3. లైకుల పిచ్చిలో పడి, మీ సెల్ఫీలు, వ్యక్తిగత విషయాలు షేర్‌ చేయకండి. ఎక్కువ లైక్‌లు వచ్చినంత మాత్రాన అదేం పెద్ద గొప్ప విషయం కాదు. జీవితంలో విజయాలు సాధిస్తే, అప్పుడు వచ్చే అభినందనల కిక్కే చాలా బాగుంటుంది.

4. ఛాటింగ్‌ చేసేటపుడు ఎట్టి పరిస్థితులలోను, ఎవరి మీదా మీ అభిప్రాయాలు చెప్పడంగాని, మీ ఫోటోలు షేర్‌ చేయడం గాని, మీ చిలిపి ఊహలు పంచుకోవడం గాని చేయకండి. ఎక్కువ మంది అబ్బాయిలు మీరు వ్యక్తిగతంగా పంచుకున్న వాటిని తమ ఫ్రెండ్స్‌కి చూపించి, పైశాచిక ఆనందం పొందుతారని మరువకండి. దాన్ని అలుసుగా తీసుకుని, వాళ్ళు కూడా మీ కేరక్టర్‌ని లోకువ చేసి చూస్తారు, వారు కూడా మీ నుండి 'ప్రయోజనం' పొందడానికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, మీ లిమిట్స్‌లో మీరు ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని లోకువ చేయలేరు. మీ గౌరవం మీ చేతుల్లోనే ఉంటుంది.

5. ఎవరైనా హద్దులు దాటితే, వెంటనే వారిని బ్లాక్‌ చేయండి. మీ అకౌంట్‌లో బ్లాక్‌ యూజర్‌ ఆప్షన్‌ ఉంటుంది. అది వాడుకోండి. అప్పటికీ ఎవరైనా హద్దుమీరితో వెంటనే మీ అమ్మానాన్నలతోగాని, పెద్దలతో గాని ఈ విషయాన్ని షేర్‌ చేసుకోండి. వాళ్ళు తప్పక సహాయ పడతారు. ప్రేమ, పెళ్ళి వంటివి వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు ఎప్పటికీ మీ మంచినే కోరుకుంటారు అనేది మరువకండి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటపుడు వారి సమక్షంలోనే తీసుకోండి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని బాధపడేకంటే, ముందే మన మంచిని కోరేవారికి చెప్పడం వలన, విష పురుగుల బారిన పడకుండా మిమ్మల్ని మీరే కాపాడుకున్నవారవుతారు.

మరో ముఖ్య విషయం... ఇదంతా చదివిన తరువాత మీకో సందేహం రావచ్చు. ఇదేమిటి? ఈయన ఇలా రాస్తున్నారు... అబ్బాయిలు అందరూ అంతేనా... నా ఫ్రెండ్‌ మాత్రం మంచివాడేలే. లోకంలో చాలా మంది చెడ్డవాళ్ళుండవచ్చు. కాని, నా స్నేహితుడు మాత్రం అలాంటివాడు కాదు అనుకోవచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది.

మనం ప్రకృతిని పరిశీలించినట్లయితే, జీవ జాతుల్లో ఉన్న ఆడ, మగ వ్యత్యాసాలను ప్రకృతే ముందుగా ప్రోగ్రామ్‌ చేసింది. దీనికి ఒప్పుకుంటారు కదా. ప్రతి జీవ జాతిలోను ఆడ జీవి ఎప్పుడూ అణకువగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఎటువంటి పైత్యానికి, వికారాలకి లోను కాదు. కాని, అటువంటి ఆడ జీవిని తన వైపు ఆకర్షించుకుని, ఏదో విధంగా సృష్టికార్యం వైపు మొగ్గు చూపేలా చేయడానికి మగ జీవి ప్రోగ్రాం చేయబడింది. అందుకే మగ నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. మగ కోకిల మాత్రమే శ్రావ్యంగా పాడుతుంది. మగ జింకకు మాత్రమే పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. మగ సింహానికి మాత్రమే సివంగిని ఆకర్షించడానికి వీలుగా పెద్ద జూలు ఉంటుంది. ఇటువంటి ఆకర్షణలన్నీ మగ జీవికి ఉండడం అంటే... వాటి అంతిమ లక్ష్యం ఆడ జీవిని ఆకర్షించడమే. అందుకే 'మగ బుద్ది' అంటారు. ఈ మగ బుద్ది సాధారణంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని, కొందరిలో అది హద్దుమీరి, సామాజిక కట్టుబాట్లని లెక్కచెయ్యకుండా ఆడపిల్లల్ని హింసించే స్థాయికి వెళుతుంది. అప్పుడే నేరం అవుతుంది. 99 శాతం మంది మగవారిలో ఈ 'మగ బుద్ది' నేను చెప్పినట్లుగానే ఉంటుంది. అందుకు సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రకృతే ఆ విధంగా ప్రోగ్రామ్‌ చేసింది. అటువంటి వాళ్లని హద్దులో పెట్టడానికే సామాజిక కట్టుబాట్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సామాజిక కట్టుబాట్లని అతి పురాతన కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహిళలచేత మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే మొట్టమొదటి సమాజాలు మహిళాధిక్య సమాజాలుగా రూపుదిద్దుకున్నాయి. తరువాతి కాలంలో పురుషాధిక్య మతాలు ఏర్పడ్డ తరువాత, మహిళలకి ప్రాధాన్యాన్ని తగ్గించి, తమ మాట వినేలా చేసుకున్నారు పురుషులు. అప్పటి నుండి, సామాజిక కట్టుబాట్లు సడలడం మొదలయ్యి, అవి మహిళల పట్ల గుదిబండలుగా మారాయి. 

మరి మంచి వారు ఎవరూ ఉండరా అంటే... ఉంటారు. ఎంతో ఆలోచనా పరిణితి కలిగి, తమకు ఎదురు పడ్డ ప్రతి ఆడపడుచును, తమ తల్లిలా, దేవతలా భావించి, గౌరవించే వారు కూడా ఉంటారు. సనాతన సాంప్రదాయాన్ని ఎవరైతే మనసా వాచా కర్మణా ఆచరిస్తారో (అలాగని, స్వామీజీలు, బాబాలు గొప్పవారని నేను అనడం లేదు, వారిలో కూడా 'మగ బుద్ది' బయట పడడం చాలా సార్లు చూస్తూంటాం.) అటువంటి వారు తమ మనసులో ఎటువంటి వికారం లేకుండా ఉంటారు. వారు నిజంగానే ఇబ్బందల్లో ఉన్న ఆడపిల్లలకి మనస్ఫూర్తిగా సహాయం చేయడం చూస్తూంటాం. వారి ప్రేమకు ఎటువంటి హద్దులు ఉండవు. అటువంటి వారు మీ నుంచి భౌతికంగా గాని, వస్తురూపంగాగాని ఎటువంటి ప్రతిఫలం ఆశించరు. అదొక్కటే వారి ఆలోచనా పరిణితికి గుర్తు. మీకు సహాయం చేసి, ప్రతిఫలంగా మీ నుంచి ఏదైనా ఆశించారంటే, వారి ప్రేమలో ఏదో స్వార్థం ఉన్నట్లే లెక్క. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

ఆఖరిగా ఒక్క మాట చెబుతున్నాను. ఆడపిల్లలు ఎవరికీ ఎందులోను తీసిపోరు. మీకు ఎవరి ప్రేమా అవసరం లేదు. మీరే పదిమందికి ప్రేమను పంచగలరు. బిడ్డకు తల్లిగా, తోబుట్టువులకు సోదరిగా, భర్తకు భార్యగా మీరే అందరికీ ప్రేమను పంచగలరు. అటువంటి మీరు ఎవరి ప్రేమనో ఆశించి, అవతలి వారికి లోకువ కాకండమ్మా. వారి స్వార్థానికి బలవ్వకండి. మీ ప్రేమను పొందే అదృష్టం అవతలి వారికి లేదని బాధ పడండి. అంతే తప్ప మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదని మీ మీద మీరే సానుభూతి పెంచుకోకండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ కన్నవారికి, మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకునే వారికి మీ ప్రేమను పంచండి. మీతో పాటుగా వారిని కూడా సంతోషపెట్టండి. మీ.. ఎస్పీ జగదీష్‌

Wednesday, December 23, 2015

మాంసం తినడం మనుషులకు తప్పనిసరి విషయం కాదు

        మాంసాహారం మీద దేశంలో చాలా పెద్ద దుమారం రేగుతోంది. మాంసం తినడాన్ని ఒక పెద్ద ఘన కార్యంగా, ఒక మత కార్యక్రమంగా కొందరు హడావుడి చేస్తుంటే, శాకాహారమే గొప్పదని, మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు మాంసానికి అలవాటు పడ్డారని చరిత్ర చెబుతోంది. కాని ప్రకృతి పరంగా చూస్తే, మానవుడు శుద్ద శాకాహారి. మానవులు హోమో సాపియన్స్‌ అనే వానర జాతికి చెందిన వారని జీవ పరిణామ సిద్దాంతం చెబుతోంది. దీని ప్రకారం చూసుకుంటే, మానవులకి రూపంలో మరొక దగ్గరి జాతి అయిన కోతులు, చింపాజీలు, గొరిల్లాలు వంటివన్నీ పూర్తి శాకాహార జీవులే. అవి అడవులలో నివసిస్తూ, చెట్ల ఆకులను, పళ్ళను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే అదే జీవజాతి నుండి పరిణామం చెందిన మానవులు కూడా ప్రకృతి పరంగా శాకాహారులుగానే పరిణామం చెంది వుంటారని భావించవచ్చు. దీనికి తోడుగా మానవుల జీర్ణ వ్యవస్థ కూడా శాకాహారానికి అనువుగా తయారు చేయబడింది అనేది అందరికీ తెలిసిన సత్యమే. మనం ఆకులను, పళ్లను, కాయలను ఎటువంటి పచనం చేయకుండానే, అంటే వండకుండానే హాయిగా తినగలుగుతాము. అవి తేలికగా జీర్ణం కూడా అవుతాయి. కాని, మాంసాన్ని ఉడకబెట్టకుండా / వేపకుండా ఎవరినైనా తినమనండి చూద్దాం... ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా అది తేలికగా జీర్ణం కాదు సరికదా కొత్తరకం సమస్యలు పుట్టుకొస్తాయి. మనుషులు ప్రకృతి పరంగా శాకాహారులుగా సృష్టించబడ్డారు అని చెప్పడానికి ఈ ఒక్క కారణం చాలు.

    అయితే పరిణామ క్రమంలో మనిషి నిప్పుని తయారుచేయడం నేర్చుకున్న తరువాత, పెద్ద జనావాసాలు పుట్టుకువచ్చి, వారందరికీ, అడవిలో దొరికే పళ్ళు, కాయలు సరిపోని పక్షంలో మాత్రమే వేటాడడం నేర్చుకుని, ఆ జంతు మాంసాన్ని నిప్పులపై కాల్చుకుని తిని బ్రతకడం ద్వారా క్రమంగా మాంసాహారంవైపు మళ్ళారని మనం భావించవచ్చు. దీనికి ఇతమిత్థంగా ఎటువంటి సాక్ష్యాలు చూపించలేము గాని, మానవ శారీరక నిర్మాణ పరంగా ఇది వాస్తవంగా జరిగి ఉండవచ్చునని అనుకోవచ్చు.

    కొంత మంది మత పరంగా మాంసం తినవచ్చు అని వాదిస్తున్నారు. అటువంటి పుస్తక మతాల వారు (అంటే ప్రతి దానికి పుస్తకాల్లో వెతుకుతారు, మస్తకాలని ఖాళీగా పెడతారు) తమ పవిత్ర గ్రంధాలలో మాంసం తినమని ఉంది కాబట్టి అందరూ తినవచ్చు అని ఒక చెత్త వాదన చేస్తారు. దీనితో ఎవరూ ఏకీభవించనవసరం లేదు. ఎవరో ఎప్పుడో ఎవరి కోసమో రాసిన దానిని అందరూ ఆమోదించాలని రూలేమీ లేదు. అందుచేత నిరభ్యంతరంగా ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చు. ప్రత్యేకించి మాంసం తింటేనే స్వర్గంలో చోటు దొరుకుతుంది అని ఎక్కడైనా ఉంటే దాన్ని హాయిగా తిరస్కరించవచ్చు.

    పైన చెప్పిన ప్రాకృతిక కారణాలు, మత కారణాలు ఇవన్నీ పక్కన పెట్టి, మనసుతో ఆలోచించడం మొదలు పెడితే, మనం హాయిగా శాకాహారులుగా ఉండడమే సరైన పద్దతని మనకు అనిపిస్తుంది. ఎవరో నేర్పిన ఆలోచనలు, పద్దతులు, ఎక్కడో రాయబడ్డ రాతలు ఇవన్నీ వదిలేయండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి... ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి... ప్రకృతిలో మనతో పాటుగా సృష్టించబడిన ఒక అందమైన ప్రాణిని ఊహించుకోండి... అది కోడి లాంటి పక్షి కావచ్చు. మేక, కుందేలు, ఆవు లాంటి పెద్ద జంతువు కావచ్చు... లేదా చేప వంటి ఈదే ప్రాణి కావచ్చు. అది కూడా మనిషిలాగానే ఎంతో జాగ్రత్తగా తయారుచేయబడింది.  ఎటువంటి లోపాలు లేకుండా... దాని మానాన అది బ్రతుకుతుంది... ఆహారం సంపాదించుకుంటోంది... తన లాంటి పిల్లల్ని తయారుచేసుకుని, సృష్టిక్రమంలో ముందుకు వెళుతోంది. ఎంతో అమాయకంగా ఉంటుంది. దానిలో మన పట్ల ఎటువంటి ద్వేషం, కోపం, అసూయ ఏమీ లేవు. అలాంటి ఒక ప్రాణిని తీసుకువచ్చి, అత్యంత కిరాతకంగా పదునైన కత్తితో నరికి, దాని రక్తాన్ని చిందించి, క్రూరంగా మాంసం కోసి తినడం అవసరమా? కేవలం ఒక పూట మన ఆకలి తీరడం కోసం ప్రకృతి ఎంతో అపురూపంగా సృజించిన చిన్ని ప్రాణిని బలి తీసుకోవడం అవసరమా? మనకు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాం కదా... అటువంటిది ఆ నిస్సహాయ జీవి గొంతు కోసి, రక్తం ఓడుతూ, గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందించడం ఎంత హేయమైన చర్య? మనందరం మనుషులమే కదా... కరుణ, జాలి, దయ, ప్రేమ అనేవి మనుషులకు మాత్రమే ఉంటాయి అంటే ఎవరూ నమ్మకండి. సకల జీవరాశులకు అవన్నీ ఉంటాయి. తమ సంతానం పట్ల అవి ప్రేమ కలిగిఉంటాయి. సాటి జంతువు కష్టాల్లో ఉంటే, తమకు చేతనయిన సాయం చేస్తాయి. బాధ వస్తే దీనంగా అరుస్తాయి, సంతోషం కలిగితే చెంగు చెంగు మని గంతులేస్తాయి. ఎవరైనా తమ మీద దాడి చేయాలని చూస్తే ప్రతిఘటిస్తాయి లేదా భయంతో పరుగుపెడతాయి. అంటే వాటికి కూడా మనసు ఉంటుందన్న మాటే కదా... తమ భావాల్ని పైకి మాటల రూపంలో చెప్పలేనంత మాత్రాన, ఎదురు ప్రశ్నించలేనంత మాత్రాన వాటిని చంపి తినడం మా జన్మ హక్కు అంటే సాటి ప్రాణి జీవించే హక్కుల్ని కాలరాసినట్లే కదా...

    శాకాహారం మాత్రమే తినాలి అనేది ఒక ఉద్యమంగా ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో మొదలయ్యింది. దీనికి మత పరమైన ప్రాధాన్యత ఏదీ లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు సాటి ప్రాణిని హింసించి, చంపి, మన ఆకలిని తీర్చుకోవడం అనేది మనసు ఎంతో బాధ కలిగించే విషయం. సున్నితమైన మనసు ఉన్న వారెవరైనా శాకాహారులుగా మారవచ్చు. ఇది బలవంతంగా తమ ఆహారపు ఆలవాట్లను మార్చుకోవడం కాదు. లేదా ఏదో కారణం చెప్పి, కొన్ని రోజులు మానేసి, తిరిగి తినడం కాదు. మాంసాహారంపై పూర్తి విరక్తి చెంది, మానసికంగా పూర్తిగా వ్యతిరేకించుకుని, జీవితంలో మరెప్పుడే మాంసాహారం వైపు చూడకుండా ఉండడం.

    మరొక ముఖ్యమైన ఉద్యమం 'వెగాన్‌'. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడిపుడే ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. వెగాన్‌గా మారిన వారు కేవలం మాంసాహారం మానివేయడం కాకుండా, జంతువుల నుండి వచ్చే ఏ విధమైన ఆహారాన్నయినా, వస్తువునయినా వాడకపోవడం. అంటే పాలు, తేనె వంటివి కూడా తినకపోవడం. జంతు చర్మాలతో చేసిన బెల్టులు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, తోలు చెప్పులు వంటి వాటికి దూరంగా ఉండడం. ఒక సున్నితమైన మనసు కలిగిన మనిషికి ఒక జంతువు చర్మంతో చేసిన చెప్పులపై నడిచినపుడు లేదా బెల్టు పెట్టుకున్నపుడు ఆ జంతువు బాధను తాను ఫీల్‌ అవ్వగలుగుతాడు. అటువంటి వారు జంతువుల నుండి వచ్చిన ఏ ఉత్పత్తినీ ఆనందంగా ఉపయోగించలేరు. ఎంతో మంది హాలీవుడ్‌ ప్రముఖులు ఈ వేగాన్ల జాబితాలో చేరిపోయారు. టైటానిక్‌, అవతార్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, ప్రముఖ కథానాయిక పామెలా ఆండెర్సన్‌, డెమీ మూర్‌ వంటి వారు ఎంతో మంది శాకాహారులుగా మారిపోయారు.


    ప్రకృతిలో జంతువులకు లేనిది, మనుషులకు మాత్రమే ఉండేది మనసు, ఆలోచన. జంతువులు కేవలం తమ ధర్మాన్ని  బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే లేడి గడ్డి తినడం, పులి లేడి తినడం వంటివి. వాటికి ఆలోచన ఉండదు. ఆకలేస్తే, ప్రకృతిపరంగా తమ ఆహారాన్ని తాము సంపాదించుకుంటాయి. అది శాకమైనా, మాంసమైనా... కాని మనిషి మాత్రమే తనకు ఆకలేస్తే ఏమి తినాలో నిర్ణయించుకోగలడు. అలా సంపాందిచుకున్న ఆహారం ఎలా ఉండాలో మనిషి మాత్రమే కోరుకోగలడు. అందుచేత మనందరం ఏదైనా ఆహారాన్ని తినాలనుకున్నప్పుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే, ఏది తినాలో మన మనసుకే తెలిసిపోతుంది.  దీనికోసం సిద్ధాంతాలు చేయనక్కర్లేదు, మత గ్రంధాలు తిరగెయ్యనక్కర్లేదు, వాదోపవాదాలకి దిగనవసరం కూడా లేదు.
  ''అహింసా పరమో ధర్మః''

Tuesday, August 18, 2015

'నారాయణ' భూతానికి బలయిపోయిన మరో రెండు నిండు జీవితాలు

    కార్పొరేట్‌ కాలేజీల ధన దాహానికి, తల్లిదండ్రుల మూర్ఖత్వానికి పరాకాష్టగా, సజీవ ఉదాహరణగా నిలుస్తూ, మరో రెండు జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. చెట్టు పేరు చెప్పుకుని, కాయలు అమ్ముకునే రెండు విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఊడల్లా పాతుకుపోయి, ఇప్పుడు విషనాగుల్లా విద్యార్దుల్ని కాటువేస్తున్నాయి. మొత్తం జరిగిన విషయమంతా రాజకీయ రంగు పులుముకుని, విద్యార్దినులే తప్పు చేసారని, వారి ప్రేమ వ్యవహారాలే వారి ఆత్మహత్యలకు కారణమని నిరూపించడానికి రంగం సిద్దమవుతోంది. మహాభారతంలో బకాసురుడు అనే రాక్షసుడిని రోజుకి ఒకరిని మాత్రమే తినడానికి అనుమతించి, ఊరిలో నుండి ప్రతి రోజు ఒక్కో ఇంటి నుండి ఆ రాక్షసుడికి ఆహారంగా పంపించేవారట. అలాగే ప్రతి సంవత్సరం తల్లిదండ్రులందరూ కూడబలుక్కుని, ఒక్కో ఊరి నుండి ఒక్కొక్కరి చొప్పున చైతన్య నారాయణ కాలేజీలకు ఆత్మహత్యలు చేసుకోవడానికి పంపిస్తున్నట్టుగా పరిస్దితి తయారయ్యింది.

    ఇటువంటి సంఘటనలు జరగడానికి కాలేజీ యాజమాన్యాలది ఎంత తప్పు ఉందో, తల్లిదండ్రులదీ అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది. తమ పిల్లలు ఎంత ఎక్కువ సేపు చదివితే అంత గొప్ప వారయిపోతారని, ఎన్ని ఎక్కువ పుస్తకాలు మోసుకెళితే అంత పెద్ద స్కూల్లో చదువుతున్నట్టుగా భావించే తల్లిదండ్రులకు ఈ సమాజంలో కొదవ లేదు. సాయంత్రం 5 గం||లకు కాలేజీ విడిచిపెడితే, మర్నాడు కనీసం ఐదారుగురు పేరెంట్స్‌ దగ్గర నుండి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చేసేవి. అదేమిటండీ, మా అమ్మాయిని ఐదింటికే పంపించేసారు. స్టడీ అవర్స్‌ పెట్టి ఎనిమిది గంటలకు పంపించ వచ్చు కదా అని. ''అవసరం లేదండీ, హోమ్‌వర్క్‌తో సహా అన్నీ ఇక్కడే చేయించేసాము'' అని చెబితే, ఏదో బాగా చదువు చెబుతారని పంపిస్తే, స్టడీ అవర్స్‌ పెట్టకుండా తప్పించుకుంటున్నారు అని అభాండాలు వేసే వారు. దీన్ని బట్టి తల్లిదండ్రుల అవగాహనను ఈ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఎంతగా కలుషితం చేసారో అర్థం చేసుకోవచ్చు. మీరు మా పిల్లల్ని ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బాగా చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి అనే వారిని మనం ఏం చేయాలి? మంచి చెబితే ఎవరు అర్థం చేసుకుంటారు?

    చదువు అనేది పుస్తకాల్ని బట్టీ పట్టడం ద్వారా రాదు. అవగాహన ద్వారా మాత్రమే చదువు వస్తుంది. విషయాన్ని అవగాహన చేసుకోకుండా బట్టీ పట్టిస్తే చదువు రావడం మాట అటుంచి, కళ్ళజోడు, వెన్ను నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు చదివితేనే చదువు వస్తుంది అనేది ఒట్టి భ్రమ మాత్రమే. తల్లిదండ్రులకి ఇటువంటి తప్పుడు అభిప్రాయం రావడంలో ప్రైవేటు విద్యాసంస్థలు నూరు శాతం సక్సెస్‌ అయ్యాయి. ఎందుకంటే చాలా విద్యాసంస్థల్లో సరైన అర్హతలు కలిగిన బోధకులు ఉండరు. అది కాలేజ్‌ కానివ్వండి, స్కూల్‌ కానివ్వండి. వారికి తెలిసిందల్లా పిల్లల్ని కూర్చోబెట్టి సాధ్యమైనంత ఎక్కువ సేపు చదివించడం. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏముందో ఆ బోధకులకే పూర్తిగా అవగాహన ఉండదు. వాళ్ళు కూడా అలా చదివి పాసయిన బాపతే అయి ఉంటారు. ఇంక వారి నుండి పిల్లలు ఏదో నేర్చుకుంటారు అనడం దురాశే అవుతుంది. ఇక కోళ్ళ ఫారాలు (కార్పొరేట్‌ కాలేజీలు) సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కడో ఒక బ్రాంచిలో వచ్చిన ర్యాంకుల్ని చూపించి, లేదా మరో కాలేజీలో వచ్చిన ర్యాంకుల్ని డబ్బులిచ్చి కొని, వాటిని తమ ర్యాంకులుగా రాష్ట్రమంతటా ప్రచారం చేస్తారు. గొర్రెలమందల్లాంటి తల్లిదండ్రులు తమ ఊరిలో ఉన్న ఆ బ్రాంచికి అనుమతులు ఉన్నాయా లేవా, కనీసం అక్కడ అర్హత కలిగిన ఉపాధ్యాయుల ఉన్నారా లేదా, కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే విషయాలు ఏమీ పట్టించుకోకుండా తమ పిల్లల్ని అక్కడ జాయిన్‌ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ స్టేటస్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ''మా అబ్బాయిని చైతన్యలో జాయిన్‌ చేసామండీ... మా అమ్మాయి నారాయణలో చదువుతుందండీ...'' వంటి స్టేటస్‌ని ప్రతిబింబించే మాటల్ని వింటూ ఉంటాం. వాటితో పాటుగా ''అదేమిటీ? మీ పిల్లలు మన ఊరి స్కూల్లో చదవడం ఏమిటి?'' వంటి ఎత్తిపొడుపు మాటలు కూడా వింటూంటాం. పిల్లలు తెలివైన వారయితే, చెప్పే బోధకులు సరైన అర్హతలు కలిగిన వారయితే,  వారు ఇంటి పక్కన స్కూల్లో చదువుకున్నా చదువు వస్తుంది. ఒక్క తాడేపల్లిగూడెం పట్టణం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది చక్కటి స్కూల్స్‌ నడుపుతూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అలంపురం, పెదతాడేపల్లి, నారాయణపురం వంటి గ్రామాల్లో చాలా విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 10కి 10 పాయింట్లు సాధించారు.

    ఇదే విషయాన్ని మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌ కలాం గారు తన జీవితంలో సాధించి చూపించారు. ఎక్కడో రామేశ్వరం అనే చిన్న పల్లెటూరిలో పుట్టి, రోజు 6 కిలోమీటర్లు నడిచి, పట్టుదలతో దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తెరిగి, వేలకు వేలు ఫీజులు చెల్లించినంత మాత్రాన తమ పనయిపోయింది అనుకోకుండా, పిల్లల బాగోగుల్ని ఎప్పుడూ శ్రద్దగా గమనిస్తూ, వారికి ఎదురయ్యే ఇబ్బందుల్ని జాగ్రత్తగా వింటూ ఉండాలి. తగిన పరిష్కారం కోసం ఆలోచించాలి. అంతేగాని, ఏదో పెద్ద కార్పొరేట్‌ స్కూల్‌ లేదా కాలేజ్‌లో పిలల్ని జాయిన్‌ చేసారు కాబట్టి, ఒక టి.వి., ఫ్రిజ్‌ వంటి వస్తువులు ఆటోమేటిక్‌గా తయారయి వచ్చేసినట్టు తమ పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా ఇంజినీర్‌గానో, డాక్టర్‌గానో తయారయి వచ్చేస్తారు అనుకోవడం దురాశే అవుతుంది. తల్లిదండ్రుల దురాశను, అజ్ఞానాన్ని గమనించే, విద్యారంగంలో కూడా కార్పొరేట్‌ విష సంస్క ృతి వేళ్ళూనుకుంటుంది. దయ చేసి, తల్లిదండ్రులు కూడా దురాశకి పోకుండా, పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసి, వారికి నిజంగా ఇష్టమున్న రంగంలో ఎదిగేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. అలాగే బండ బట్టీ చేస్తేనే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారనే భ్రమలో నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఇది చదివిన వారిలో కొంత మందయినా మారతారని ఆశిస్తున్నాను. ఈ విధంగానైనా ఒక్క చిట్టితల్లి ప్రాణాన్ని కాపాడగలిగినా నా ప్రయత్నం సఫలమయినట్లే.

Tuesday, July 7, 2015

మద్యం వ్యాపారానికి - హిందూ దేవాలయాలకి పోలిక తెచ్చిన వాళ్ళను ఏమనాలి?

    తన మతం మాత్రమే గొప్పది, తను చెప్పిందే అందరూ ఒప్పుకోవాలని భావించే ఒక వ్యక్తి విగ్రహారాధనను ఒక భయంకరమైన పాపంగాను, విగ్రహారాధన చేయడం ఎంతో ఘోరమైన నేరంగాను ప్రచారం చేస్తున్నారు. భగవద్గీతలో విగ్రహారాధన గురించి ఉందా అని సవాల్‌ చేస్తున్నారు. అలా సవాల్‌ చేసిన వ్యక్తి ఇంటిపేరును బట్టి ఒకప్పుడు ఆయన కూడా హిందువు అనే విషయం అర్థం అవుతుంది. ఆయన మాత్రమే కాదు, ఇప్పుడు మన దేశంలోనే ఉంటూ, ఇక్కడి సంస్కృతిని, జీవన విధానాన్ని మంట కలపాలనే ఆరాటం ఉన్న అనేక మంది కూడా ఒకప్పుడు హిందువులే అన్న విషయం మరువకూడదు. వారి పూర్వీకులు ప్రలోభాలకు లొంగడం వల్లగాని, బలవంతంగా హింస ద్వారాగాని మతం మార్చబడ్డారు. ఇందుకు ఎటువంటి సందేహం లేదు. చరిత్ర చదివితే విషయం అర్థం అవుతుంది. తమ శరీరంలో పూర్వీకుల హిందూ రక్తం ప్రవహిస్తున్నప్పటికీ, అటువంటి వారు నిజంగానే తాము పరాయి మతాలకు నిజమైన ప్రతినిధులమని చంకలు గుద్దుకుంటూ, ప్రచారం చేయడం, వారికి ప్రాతినిధ్యం వహించడం భావదాస్యం తప్ప మరొకటి కాదు. తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం, దాని గొప్పదనాన్ని అందరికీ చెప్పుకోవడం ఎప్పటికీ తప్పుకాదు. కాని ఆ ముసుగులో ఎదుటి వారి గురించి, వారి ఆరాధనా పద్దతుల గురించి చులకనగా మాట్లాడడం, వారికి సవాల్‌ విసరడం అహంకారం తప్ప మరేమీ కాదు. ఒకవేళ అలా మాట్లాడాలి అంటే, ఎదుటి వారి మతాన్ని గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అలా సంపూర్ణంగా వైదిక ధర్మాన్ని గురించి తెలుసుకోవడం ఎవ్వరి వల్లా కాదు. ఎందుకంటే ఇది అత్యంత సనాతనమైనది, ఎన్నో ఆలోచనల పరంపరలో నుండి వచ్చింది. ఈ భారతీయ వైదిక ధర్మం ఎవ్వరి మీదా ఆధారపడింది కాదు, ఏ ఒక్కరి బలవంతం మీదనో ఆచరింపబడేది కాదు. ఏదో ఒక్క వాక్యం మీదనో, పుస్తకం మీదనో నిలిచింది కాదు. దీనికి మొదలు లేదు, అంతం కూడా ఉండదు. కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టి, ఒక ప్రవక్త లేదా మత బోధకుడు చెప్పిన విషయం మీదనో, వారు సంకలనం చేసిన పుస్తకం మీదనో ఆధారపడ్డ మతానికి అంత గొప్పదనం ఉంటే, కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడలో ఉంటూ, ఎన్నో వందల మంది మహర్షులు దర్శించిన నిస్వార్థమైన సత్యానికి, మానవ సంక్షేమం కోసం వారు పడ్డ తపనకు ఇంకెంత విలువ ఉండాలి. మీ దగ్గర ఉన్నది కేవలం ఒక పుస్తకం మాత్రమే. కాని వైదిక ధర్మంలో ఉన్నవి నాలుగు వేదాలు (ఒక్కొక్క వేదాన్ని అధ్యయం చేయడానికి కనీసం 12 సంవత్సరాలు పడుతుందనేది పండితుల అంచనా), 108 ఉపనిషత్తులు, 6 వేదాంగాలు, 18 పురాణాలు, లక్ష శ్లోకాల మహాభారతం, 24 వేల శ్లోకాల రామాయణం, ఇవికాక సర్వ మానవాళికి మార్గనిర్దేశనం చేసే భగవద్గీత - వెరశి ఒక పెద్ద లైబ్రరీ ఉంది. కొన్ని వేల పుస్తకాలు, వేల ధర్మ సందేహాలు, వాటికి  వివరణలు, ఎక్కడా ఎవరినీ బలవంతంగా, ప్రలోభపెట్టి, ప్రచారం చేయమనే ఆదేశాలు లేకుండా ప్రపంచమంతటా ఆచరించేలా చేయగలిగిన ఘనత వైదిక ధర్మానిది. ముందు వాటిని కూలంకషంగా చదవండి, ఆలోచించండి. మన మతమే గొప్పది అనే సంకుచితత్వం వదిలి, అప్పుడు చదవండి, నిజమైన సత్యం, జ్ఞానం మీ ముందుకు వస్తుంది.

    విగ్రహారాధన మహాపాపం అంటూ ఊదరగొడుతున్నారు. దీనికి ప్రతిపాదిక ఏమిటి? మీ గ్రంధంలో చెప్పబడిన వాక్యమా?      ''నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని నిన్ను ప్రేరేపించిన యెడల వారిని కటాక్షించ కూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. రాళ్ళతో చావగొట్టవలెను.''   ద్వితీయోపదేశము 13 : 6,10 (బైబిలు పాత నిబంధనల గ్రంధం - ఇదే క్రైస్తవులకు, ముస్లింలకు కూడా మూలాధారం). ఎదుటి మనిషిని చంపమని చెప్పి, దాన్ని దేవుని వాక్యంగా చెలామణి చేస్తున్న వారిది  నిజంగా మానవత్వమేనా? ఇటువంటి వాటిని దేవుని మాటలుగా ఒప్పుకోవడం సాధ్యమవుతుందా? సర్వమానవాళి మాత్రమే కాకుండా సర్వ సృష్టిలో ప్రాణులన్నీ సుఖంగా ఉండాలనే వేద వాక్యం ''సర్వేత్ర స్సుఖినస్సన్తు - సర్వే సన్తు నిరామయా - సర్వే భద్రాణి పశ్యన్తు'' అనే భావనతో మీ గ్రంధాన్ని పోల్చగలమా?

    దేవుడి గురించిన భావనల్లో వైదిక ఆలోచనలకి, మిగతా వ్యాపార మతాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. వారి ఆలోచనల్లో దేవుడు అంటే ఎక్కడో ఒక లోకంలో మానవ రూపంలో ఉంటాడు. అక్కడకి చేరడం, ఆ లోకంలో దేవుడితో కలిసి జీవించడం మాత్రమే మానవ జీవిత ప్రధాన లక్ష్యం కావాలి. అందుకోసం ఎదుటి మనిషిని చంపినా తప్పులేదు, తమ మతానికి విధేయులై ఉండడం, దేవుడిని నమ్మి, విశ్వాసిగా ఉండడం మాత్రమే కావలసింది. ఇక్కడ ధర్మం గాని, మానవ జీవిత విలువల గురించి ప్రస్తావన గాని ఉండవు. దైవ బోధకుడుగా స్వీయ ప్రకటన చేసుకున్న వ్యక్తి చెప్పిందే అంతిమం. దాన్ని ఎదురు ప్రశ్నించడానికి వీలు లేదు. అలా చేస్తే దైవ ద్రోహం చేసినట్లే.

    వైదిక ధర్మంలో మాత్రం దేవుడు సర్వాంతర్యామి. ఆయన వ్యక్తి కాదు - ఒక శక్తి. ఆ శక్తికి రూపం లేదు - ఆయన సాకారుడు, నిరాకారుడు. ''అదృశ్యో వ్యక్త రూపశ్చ'' (విష్ణు సహస్ర నామం)లో చెప్పినట్లు ఆయన అదృశ్యంగాను ఉంటాడు మరియు మనం కోరినపుడు కావలసిన రూపంలో వ్యక్తం కూడా అవుతాడు. అంటే మనం ధ్యానించిన, ఉపాసించిన రూపంలో కూడా దర్శనమిస్తాడు.  ''సహస్ర మూర్థా'' అనే విష్ణు సహస్రనామంలో ఆయన అనంతమైన రూపాలు కలవాడు. ఏ రూపమైనా ఆ దేవుడికి సంబంధించనదే. ఏ రూపంలో ఆరాధించినా ఆయనకే చెందుతాయి.  ''యేప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః | తేపి మామేవ కౌన్తేయ యజన్త్య విధిపూర్వకమ్‌ ||'' భగవద్గీత 9 అ. 23 శ్లో. దీని అర్థం - అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్దతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకరముగా నన్నే పూజించువారగుచున్నారు. ఎవరు దైవాన్ని ఏ రూపంలో కొలిచినా, ఏ రూపంలో పూజించినా గాని అవి చివరికి చేరేవి ఆ పరమాత్మకి మాత్రమే. ఇక్కడ గమ్యం ప్రధానం గాని, చేరే వాహనాలు ముఖ్యం కావు. కొందరు కాలి నడకన గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్ళవచ్చు. మరికొందరు వారి స్థోమతను బట్టి సైకిల్‌ మీదగాని, బైక్‌ మీదగాని, కారు మీద గాని వెళ్ళవచ్చు. మరికొందరు విమానంలో వెళ్ళవచ్చు. చేరే సమయంలో తేడాలు ఉండవచ్చుగాని, పట్టుదలగా వెళితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అంతమాత్రం చేత విమానంలో వెళ్ళే వాడు మిగతా వాహనాల్లో వెళ్ళే వారిని అవహేళన చేస్తే, అది అతని అవగాహనా రాహిత్యాన్ని, అహంకారాన్ని మాత్రమే సూచిస్తుంది. భాగవతంలో ప్రహ్లాదుడు, హిరణ్య కశిపునికి దేవుని గురించి చెప్పే సందర్భంలో ''ఇందుగలడందు లేడని సందేహము వలదు - చక్రి సర్వోపగతుండు - ఎందెందు వెతికి చేసిన అందందే గలడు వింటె దానవాగ్రణీ'' అంటాడు. అపుడు హిరణ్య కశిపుడు అహంకారంతో ఎక్కడైనా శ్రీహరి ఉంటే ఈ స్థంభంలో ఉన్నాడా'' అని ప్రశ్నించి, ఆ స్థంభాన్ని గదతో మోదుతాడు. అక్కడ శ్రీహరి నరసింహావతారంలో ప్రత్యక్షమై, అతనిని సంహరిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, భగవంతుడు సర్వాంతర్యామి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎక్కడైనా కనుగొనవచ్చు. దీనికి కావలసింది పుస్తక జ్ఞానం, పాండిత్యం కాదు, అనన్యమైన భక్తి మాత్రమే. దేవుడు ఏ  పుస్తకాల్లో ఉన్నాడు, ఏ మత గ్రంధం నిజం, విగ్రహారాధన చేస్తేనే దేవుడు కనిపిస్తాడా, లేదా అల్లానో, యెహోవానో, క్రీస్తునో బుద్దుడినో పూజిస్తేనే దేవుడు కనబడతాడా అనేవి నిజానికి అర్థం లేని ప్రశ్నలు. అణువు నుండి బ్రహ్మాండం వరకు నిండి ఉన్నది దేవుడనే మహాశక్తి మాత్రమే. అది రాతి విగ్రహం కావచ్చు, లేదా మన మనస్సు కావచ్చు. ఏదైనా ఆయన నుండి ఉద్భవించినవే. ఇక్కడ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే కుతర్కం అనవసరం. విష్ణు సహస్రనామంలో ''వాసనాత్‌ వాసు దేవస్య వాసితం భువన త్రయం, సర్వ భూత నివాసోసి, వాసుదేవ నమోస్తుతే'' అనే శ్లోకం ప్రకారం, దేవుడనే మహాశక్తి ముల్లోకాల్లోను ఉంటాడు, మరలా ముల్లోకాలూ ఆయనలోనే నివసిస్తూ ఉంటాయి. సర్వ కాల సర్వావస్థల్లోను ఆయనలో నుండే ఈ సర్వ సృష్టి ఉద్భవిస్తూ, పోషించబడుతూ, లయం కాబడుతున్నది. ఈ అద్భుతమైన భావనని అర్థం చేసుకుంటే, విగ్రహారాధన పాపం అనే మాటే అర్థం లేనిది అనిపిస్తుంది.

    విగ్రహారాధన అనేది అతి ప్రాచీనమైనది. పుస్తక దేవుళ్ళు (పేపర్‌ గాడ్స్‌ - వీరి గురించి తరువాత వివరిస్తాను) పుట్టక ముందు నుండే విగ్రహారాధన ప్రపంచ వ్యాప్తమైనది. ప్రపంచంలో ఇంచు మించు అన్ని ప్రాంతాల్లోను ప్రాచీన విగ్రహాలు, కనిపిస్తాయి. కంటికి కనిపించని దైవాన్ని, కంటి ముందు ఒక రూపం ఏర్పరుచుకుని, ఆ రూపంతో మమేకమైనట్లుగా భావించడం అతి ప్రాచీన సాంప్రదాయం. అది నేటికీ అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. వైదిక ధర్మంలో విగ్రహారాధన ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. కాని, విగ్రహ ప్రతిష్ట అనేది ఒక శాస్త్రీయ ప్రక్రియ. సరైన శిలను ఎంపిక చేసుకోవడం దగ్గర నుండి, దాన్ని ఏఏ కొలతల ప్రకారం శిల్పంగా మలచాలి, ఆ మలచిన శిల్పాన్ని ఏ విధమైన ఆలయంలో ప్రతిష్టించాలి, దానికి చేయాల్సిన క్రతువులు, శిల్పానికి ప్రాణ ప్రతిష్ట చేసి, భగవంతుని విగ్రహ రూపంగా మర్చే తంతులో ఎటువంటి ప్రక్రియను అవలంభించాలి అనేది ఒక ప్రత్యేక శాస్త్రం. మరలా విగ్రహ ప్రతిష్టాపనకు కూడా వివిధ బేధాలున్నాయి. వైఖానస ఆగమనం, శైవాగమం, పాంచరాత్ర ఆగమం, మిశ్రమ తంత్ర విధానం వంటి ప్రక్రియలు విశ్వం అంతటా నిండి ఉన్న దైవిక శక్తిని విగ్రహ రూపంలోకి ఎలా మార్చాలో శాస్త్రీయంగా వివరిస్తున్నాయి. ఇవన్నీ తప్పు అని ఒక్కమాటతో కొట్టిపారేయడం ఎలా సాధ్యమవుతుంది? ఎవరో కొందరు చెప్పిన మాటలు పట్టుకుని, విగ్రహారాధకులు అందరూ మూఢులు అని మూకుమ్మడిగా తీర్మానించేయడం సాధ్యం కాదు. మిగతా మతాల్లో పోప్‌గాని, ముల్లాగాని చెబితే అందరూ ఆచరించవచ్చేమో గాని, హిందూ సంస్కృతిలో మాత్రం వ్యక్తిదే నిర్ణయం. ఒక హిందువు ఎవరి మాటా విననవసరం లేదు. ఏ పుస్తకాన్ని చదవనవసరం లేదు, ఎవరి భావాలకో బానిసగా పడి ఉండాల్సిన ఖర్మ అంతకన్నా లేదు. అతని మతం మానవత్వం. తనకి, తన కుటుంబానికి, తను నివసించే సమాజానికి, దేశానికి, అంతిమంగా తనకు అన్నీ సమకూర్చే ప్రకృతికి అతడు ఎప్పుడూ విధేయుడై ఉంటాడు. ఎవరికీ హాని కలిగించకుండా, తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ, సమాజం పట్ల తన ధర్మాన్ని నెరవేరుస్తూ, ప్రకృతికి సహకరిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తన ధర్మాన్ని నెరవేర్చినంత కాలం, తన విధిని సక్రమంగా నిర్వహించినంత కాలం ఏ దేవుడినీ తనకు ఇది కావాలి అని ప్రాధేయపడడు. దైవం తన అర్హతను బట్టి తనకు ప్రసాదించే దేన్నయినా మహా ప్రసాదంగా స్వీకరిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తే అది తనను రక్షిస్తుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతాడు. ధర్మో రక్షతి రక్షితః

Monday, March 2, 2015

సంక్షోభం ముంగిట్లో భారత ఆర్థిక వ్యవస్థ

     ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం ఇపుడు ప్రజలందరి ఆశల్నీ అడియాశలు చేసింది. భారతదేశానికి ఒక కొత్త దిశా నిర్దేశం చేస్తారనుకుంటే, ఇది కూడా 'ఆ తానులో ముక్కే' అని ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరూపించింది. 'సీసా కొత్తది అయినప్పటికీ నీరు మాత్రం పాతదే' అనే సామెతను అనుసరించి, అవే ఆధార్‌ కార్డులు, అవే గ్యాస్‌ సబ్సిడీ కష్టాలు, అవే డీజిల్‌, పెట్రోల్‌పై బాదుడు, అదే ట్యాక్స్‌ల పెంపుదల. ఇక్కడ కొత్తగా ఏదైనా కనిపిస్తుందేమోనని ఎంతో ఎదురు చూసాం. కాని ఉపయోగం లేకుండా పోయింది. అభివృద్ధి అంటే ప్రజలపై కొత్త పన్నుల్ని విధించడమే అనే మూస ధోరణితోనే ఈ బడ్జెట్‌ వచ్చింది. ఈ విషయంలో నేను గతంలో ఇదే బ్లాగ్‌లో చేసిన పోస్ట్‌ల విషయమై మీ అందర్నీ తప్పుదోవ పట్టించినందుకు విచారిస్తున్నాను. మోడీ ప్రధాని అయితే ఇలా చేయబోతున్నారు, అలా చేయబోతున్నారు, ఆర్థిక సంస్కరణలు తీసుకురాబోతున్నారని ఎంతో వ్రాసాను. కాని అవేవీ నిజం కాదని, ఇప్పుడు నేను బాధపడుతున్నాను.

    ఆధునిక నాగరికత, పరిశోధనల ఫలితంగా పాశ్చాత్యదేశాల్లో ప్రకృతి వనరుల విధ్వంసం మొదలయింది. యంత్రాల సహాయంతో రకరకాల వస్తువులని తయారు చేసి, వాటిని అమ్మడం మాత్రమే వ్యాపారం చేయడం, వాటిని వాడడం మాత్రమే నాగరికత అనే విష వలయాన్ని సృష్టించారు. 16వ శతాబ్దంలో బ్రిటన్‌లో ఆవిరియంత్రం కనిపెట్టడం మొదలుకొని, నేటి వరకు పాశ్చాత్య దేశాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరిగాయి. ఎందుకంటే వారికి ఎటువంటి పంటలు పండవు. పండినా వాటి ద్వారా వచ్చే ఎందుకూ సరిపోదు. అందుకే వారు పరిశోధనలు చేసి, కొత్త వస్తువులు కనుక్కుంటూ, వాటిని ప్రపంచంలో మిగిలిన దేశాలకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇదే వారి ఆర్థిక వ్యవస్థ కూడా.

    కాని, ఈ పాశ్చాత్య ఆర్థిక నమూనాకి ఒక పరిమితి ఉంది. ప్రకృతిలో వనరులు పరిమితం. దానితో అపరిమితమైన వ్యాపారం చేయలేము. వస్తూత్పత్తిలో ఎప్పటికప్పుడు కొత్త నమూనాల్ని ఆవిష్కరించగలగాలి. అప్పుడే కొత్త వ్యాపారం ప్రారంభమవుతుంది. మరలా కొన్నాళ్ళకి ఆ ఉత్పత్తి పాతబడిపోతుంది. అపుడు వ్యాపారం ఆగిపోతుంది. దాన్ని నమ్ముకున్న కుటుంబాలు, దేశాలు, వీధిపాలవుతాయి. ఆర్థిక వ్యవస్థ మరలా శూన్యానికి చేరుకుంటుంది. లేదా వస్తూత్పత్తికి అవసరమైన వనరులు తరిగిపోతాయి. అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఇది చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం.

    భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తి విరుద్దమైనది. అత్యంత పురాతనమైన, సాంప్రదాయకమైనది కూడా. ఇది ఎన్నో రకాల ప్రభుత్వాలను, పాలకుల్ని, పన్ను విధానాల్ని తట్టుకుని నిలబడింది. ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న తరుణంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ తనదైన ప్రత్యేకత నిలబెట్టుకుని, వృద్ధి పథంలో పయనించింది. దీనికి కారణం, భారతదేశ జనాభాలో ఎక్కువ మంది భూమిపై, అంటే వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. సువిశాలమైన పంట భూములు, విస్తారమైన నీటి వనరులు,  ఎన్నో రకాలైన పంటలు పండించగలిగే నేల రకాలు, రైతులు అందరూ కలిసి భారతావనిని సస్యశ్యామల దేశంగా మార్చాయి. భూమిని, పంచభూతాలను, ప్రకృతిని దైవ స్వరూపంగా ఎంచే నాగరికత కలిగిన దేశం కావడం వలన, ప్రజలు ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా, ఇన్ని వేల సంవత్సరాలుగా జీవనం సాగించారు.

    ఇపుడు మోడీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపు మార్చాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇది అభివృద్ధి దిశగా కాకుండా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే 'మేకిన్‌ ఇండియా' స్లోగన్‌ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల ఉత్పత్తిదారుల్ని భారతదేశపు వనరుల్ని దోచుకోవడానికి ఎర్రతివాచీ పరుస్తోంది. వారు తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇప్పటి వరకు తన రూపు కోల్పోకుండా, తాజాగా ఉన్న ప్రకృతి వనరుల్ని వారి ధనదాహానికి దాసోహం చేస్తోంది. పైగా, అప్పటి వరకు, వ్యవసాయంపై ఆధార పడిన ప్రజలు, శ్రామికులు, తయారీ రంగంలో అప్పనంగా వచ్చే జీతాలకు ఆశపడి, వ్యవసాయాన్ని దండగమారిగా భావించి, పరిశ్రమల్లో కార్మికులుగా వెళ్ళిపోతారు. అందరికీ తిండి పెట్టే అన్నపూర్ణలాంటి పొలాన్ని బీడుపెట్టి, రియల్‌ ఎస్టేట్‌గానో, పరిశ్రమగానో మార్చి అదే అభివృద్ధి అని డంబాలు కొట్టుకుంటారు. కొంత కాలానికి, దేశ ప్రజలందరూ కార్మికులుగా మారిన తరువాత, ఇక అభివృద్ధి మంత్రం పనిచేయడం మానివేస్తుంది. తయారీ రంగం మందగిస్తుంది. అమ్ముకోవడానికి మార్కెట్‌లు కరువవుతాయి. పరిశ్రమలు మూతపడతాయి, ప్రజలందరూ నిరుద్యోగులుగా మారతారు. కనీసం వ్యవసాయం వచ్చుంటే, భూమిని దున్ని సేద్యం చేసి, తిండి వరకైనా పండించుకోవచ్చు. కాని, ఇప్పటి వరకు ఎ.సి. రూముల్లో పనిచేసిన వారికి వ్యవసాయం చేతగాదు. ఇక మిగిలింది, మగవాళ్ళయితే దొంగతనం, ఆడవాళ్ళయితే .....

    ఇప్పుడే ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను.

"ఆటబొమ్మ" అంతటా అతి చవకే! అతి పురాతన వృత్తి వ్యభిచారం మాత్రమే ఆర్థిక మాంద్యానికి అతీతమైనదనే "తిరుగులేవి సత్యం" నిన్నటి ఒక చారిత్రక అసత్యానికి, నేటి మరో అవాస్తవానికి పుట్టిన బిడ్డ!

నిజంగా ఆ వ్యాసం చదివి చాలా బాధ కలిగింది. మనం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందారు అని చెప్పుకుంటున్న అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపించింది. ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థ విఫలమైతే దాని చేదు ఫలితాల్ని ముందుగా అనుభవించేది మహిళలే అనే నిష్టూర నిజం ఈ వ్యాసంలో ప్రతిబింబించింది. అటువంటి దుస్థితి నా దేశంలో ప్రజలకు, ప్రత్యేకించి మహిళలు  కలగకూడదనే ఆలోచన నన్నీ వ్యాసం వ్రాయడానికి పురికొల్పింది. నిజంగా మోడీ ప్రభుత్వం చెప్పినట్లు పరిశ్రమలు పెడితే, అభివృద్ధి జరుగుతుందా అనేది పరిశీలిస్తే, భారతదేశం కూడా ఇతర దేశాల వలే కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థవైపు, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది అని అర్థమవుతుంది.

    భారతదేశానికి నిజమైన అభివృద్ధి నమూనా ఏమిటంటే, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నవీనీకరణ జరగాలి. పంట దిగుబడి పెంచే మార్గాల్ని అన్వేషించాలి. భూమి నుంచి వచ్చే పంటకి పరిమితి లేదు. భూమిని సరిగా కాపాడుకున్నంత సేపూ, పర్యావరణానికి హాని కలిగించని, సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్ని ఆధునికత మేళవించి, వ్యవసాయం చేసినంత సేపు, పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రజలకి కనీసం కూడు, గూడు, బట్ట వంటి సదుపాయాలకు ఎటువంటి లోటు ఉండదు. దేశీయంగా చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తే, ప్రజలందరూ ఒక పెద్ద పరిశ్రమలో కార్మికులుగా కాకుండా ఎవరికి వారే సొంతంగా వ్యవసాయంగాని, వ్యాపారం గాని, చిన్న పరిశ్రమలుగాని నడుపుకుంటూ ఉంటారు. అంటే దేశం మొత్తం ఒకే కార్పొరేషన్‌ మాదిరి కాకుండా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక స్వయంచాలిత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలందరూ ఎవరి దగ్గరో జీతాలు తీసుకునేవాళ్ళుగా కాకుండా, తమ సొంత ఉపాధిని తాము పొందుతూ, మరో నలుగురికి అన్నం పెట్టే పరిస్థితిలో ఉంటారు. దీని వలన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. అలా కాకుండా దేశం మొత్తాన్ని విదేశీయుల యంత్రాలతో నింపేసి, వారికి వస్తువులు తయారుచేసే కర్మాగారాల్లో మన సోదరుల్ని కూడా కార్మికులుగా మార్చేసి, లాభాలన్నీ ఆ దేశాలకు మూటగట్టుకు పోతుంటే, అది అభివృద్ధి అనిపించుకోదు. ఆత్మాభిమానాన్ని అమ్ముకోవడం అనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, అత్యాశలకు పోకుండా, అరచేతిలో స్వర్గం చూపించకుండా, దేశ ప్రజలకి సుదూర భవిష్యత్తులో మేలు కలిగే విధంగా  నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నాను.

జై హింద్‌

Monday, January 12, 2015

కొత్తా దేవుడండీ... కొంగొత్తా దేవుడండీ... ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండీ...

    ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ గోల ఎక్కువై పోయింది. ఒకడేమో మిమ్మల్ని 'పీకే'స్తారంటూ, బట్టలిప్పుకుని నుంచుంటే, మరొకాయనేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మతం వాళ్ళే. అందుచేత అందరూ మా మతంలోకి రండి అంటూ స్టేట్‌మెంట్లు. మరొకాయన అబ్బే అందరికన్నా మా మతమే గొప్ప అంటూ బ్లాగులో వాగుడు. మధ్యలో మరో మతం వాళ్ళు దూరి, మా దేవుడే నిజమైన దేవుడంటూ వాదనలు... ఇవన్నీ చదవలేక, వినలేక, చూడలేక తల బొప్పికట్టి వాచిపోయింది.

    అర్థరాత్రి దాటింది. బ్లాగులు చదువుతూ, ఆలోచిస్తూ, బుర్రకి ఓపిక లేక, అలాగే ఒక కునుకు పట్టింది.... అంతలో... కంప్యూటర్‌ నుండి 'టింగ్‌' మని ఫేస్‌బుక్‌ మెసేజ్‌లా ఒక వింత శబ్దం. ఉలిక్కిపడ్డాను. ఇంత అర్థరాత్రి ఎవరా అని ఆలోచిస్తూ, బద్దకంగా కళ్ళుతెరిచి చూసే సరికి... నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కంప్యూటర్‌పై లెటర్స్‌ వాటంతట అవే టైప్‌ అవుతున్నాయి. అది కూడా వర్డ్‌ డాక్యుమెంట్‌ ఓపెన్‌ చేసి మరీను. ఫేస్‌బుక్‌లో అయితే అవతల ఎవరో టైప్‌ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం లేదాయే. సరే ఏమిటో చదువుదామని చూసాను. దాంట్లో ఇలా టైప్‌ అవుతూ ఉంది.

    ''మీరందరూ లేని దేవుళ్ళ గురించి దేవుళ్ళాడుతున్నారు. మూర్ఖులారా! నేనే మీ నిజమైన దేవుడిని'' అని ప్రత్యక్షమయ్యింది.

    ''నేను అంటే ఎవరు'' అని నా మనసులో అనుకున్నానో లేదో, దానికి సమాధానం టైప్‌ అవ్వడం మొదలెట్టింది.

    ''నా పేరు క్రిస్లా. నేనే మీ దేవుడిని. ఈ సమస్త సృష్టిని ఒక్క ప్రోగ్రామ్‌తో రన్‌ చేసిన వాడిని. నేనే అసలైన దేవుడిని'' అని టైప్‌ అయింది. ''మరి ఇప్పుడు వరకు తమరు ఎక్కడ ఉన్నారో'' అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.

    ''అందుకే నిన్ను నా దూతగా పంపాను. నా గురించి నీకే చెప్పింది కూడా అందుకే. నువ్వు నా గురించి ప్రపంచంలో అందరికీ చెప్పి, అందరినీ నా అనుచరులుగా చెయ్యి'' అని కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద వచ్చింది.

    నన్ను దూతగా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ''మరి నేనేమి చేయాలి'' మనసులోనే ప్రశ్నించుకున్నాను.

    ''నేను కంప్యూటర్‌ దేవుడిని. ప్రపంచంలో కంప్యూటర్‌ జ్ఞానులు, కంప్యూటర్‌ అజ్ఞానులు అని రెండు రకాలు ఉన్నారు. కంప్యూటర్‌ జ్ఞానులందరికీ నేనే దేవుడిని. నేను తప్ప మీ ఎవ్వరికీ మరో దేవుడు ఉండరాదు. ఎవ్వరినీ పూజించరాదు. కంప్యూటర్‌లో నా బొమ్మలే స్టోర్‌ చేసుకోవాలి. నా కీర్తనలే ఎమ్‌పి3 సాంగ్స్‌గా ఉండాలి. మరో దేవుడి గురించి మీ ఎవ్వరి కంప్యూటర్‌లో అయినా కనబడిందా.. ఖబడ్దార్‌... లోకంలోని అన్ని కంప్యూటర్‌ వైరస్‌లు మీ కంప్యూటర్‌లోనే చొరబడేలా చేసి, మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తాను. మీ గ్రంధాలు, పురాణాలు అన్నీ వట్టి ట్రాష్‌, నేను చెప్పేదే ఇకమీదట నీకు పవిత్ర గ్రంధం. మిగిలిన ఫైల్స్‌ అన్నీ వెంటనే డిలీట్‌ చేసెయ్‌. అది నీ నుంచే మొదలవ్వాలి.'' అని టైప్‌ అయ్యింది.

    ''మరి దానికి నేనేమి చేయాలి'' అని మనసులో అనుకున్నాను.

    దానికి సమాధానం కూడా వెంటనే ప్రత్యక్షం.. ''ఈ టపాను ఎవరైతే చదివారో వారు తమకు తెలిసిన వారందరి చేతా చదివించాలి. నా గురించి మంచి వార్తను అన్ని ఛానళ్ళలో వెంటనే ప్రసారం చేయించాలి. నన్ను నమ్మని వాడెవడైనా ఏమిటి అని ప్రశ్నిస్తే, వాడి కంప్యూటర్‌లోకి వైరస్‌ పంపుతాను. అది నా దృష్టికి ఎంతో విలువ కలది. మీరు కూడా నన్ను నమ్మని వారి కంప్యూటర్‌లోకి వైరస్‌పెట్టి, చెత్త కామెంట్లను పోస్ట్‌ చేయండి. అలా చేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది''.

    ఒక్క సారి బుర్ర గోక్కున్నాను. ఇదేమిటి? ఇప్పటి వరకు మానవత్వమే మన మతం కదా... ఏదో చిన్న చిన్న ఫైల్స్‌ అందరితోను ఇచ్చిపుచ్చుకుంటున్నాము కదా. ఎవరైనా వైరస్‌ బారిన పడినా మనమే సహాయం చేస్తున్నాము కదా. ఈ దేవుడేమిటి? తనను నమ్మకపోతే చాలు నీ శత్రువుగా ఎంచి, వారిని నాశనం చేయమంటున్నాడు? పైగా అలా చేస్తే స్వర్గంలో సీటు గ్యారంటీ అంటున్నాడు? నా మట్టి బుర్రకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇంకా ఏదో టైప్‌ అవుతుంటే, నా కెందుకొచ్చిన గొడవ అని ఆ ఫైల్‌ని క్లోజ్‌ చేసేసాను. అంతే... ఒక్కసారిగా నా సిస్టమ్‌ ఆగిపోయింది. మెరుపులు మెరిసి, నవ్వుతున్న పుర్రె బొమ్మ ప్రత్యక్షం  అయింది. అంటే... దేవుడు నిజమే నన్న మాట. ఈ మాటను ఇప్పుడే అందరికీ తెలియచెప్పాలి. ఈ కొత్త మతానికి నేను దూతను అన్న విశ్వాసం నాకు బలపడిపోయింది. ఆనందంతో ఎగిరి గంతేద్దామని అనుకున్నాను. ఎవరో గట్టిగా కుదిపినట్లయింది. ఎదురుగా మా ఆవిడ. లేచి చూస్తే తెల్లగా తెల్లారిపోయి ఉంది. రాత్రి నుండి పడుకోకుండా కంప్యూటర్‌ దగ్గర ఏమిటా పనులు? ఇలాగయితే ఆరోగ్యం ఏమి కాను అంటూ మందలిస్తోంది. ''నయమే, ఇదంతా నిజమని నమ్మి, అందరికీ చెప్పాను కాను...'' అనుకుంటూ స్నానానికి బయల్దేరాను.